మార్కండేయ మహా పురాణము
29 - శ్రాద్ధ కల్పము
పుత్రా! పితృ దేవతల యొక్క ప్రీతి కొరకు భక్తీ పూర్వకముగా ఏ పదార్థములు భుజింప జేయవలెనో ఏవి వర్జింప చేయ వలెనో ఏ పదార్థములచే ప్రసన్ను లగుదురో, వాటిని గురించి చెప్పుచున్నాను వినుము. హవిశ్యాన్నముచే పితృ దేవతలకు ఒక నెల రోజుల వరకు తృప్తి కలుగును. పితామహులు మత్స్య మాంసములచే రెండు మాసములు తృప్తి చెందెదరు. లేడి మాంసముచే మూడు మాసములు, చెవుల పిల్లి మాంసముచే నాలుగు మాసములు, శకున పక్షి మాంసముచే ఐదు మాసములు తృప్తి పొందుదురు. సూకర మాంసముచే ఆరు మాసములు, “చాగల” మనగా గొర్రె మాంసముచే ఏడు మాసములు, ఐనేయ (దుప్పి) మాంసముచే ఎనిమిది మాసములు, రురు మాంసము (అనగా నల్లచారల దుప్పి మాంసము ) తొమ్మిది మాసములు, గవయ (శరభ) మాంసముచే పది మాసములు, ఔరభ్ర మాంసముచే పదకొండు మాసములు, ఆవుపాలు, పెరుగు, పరమాన్నముచే సంవత్సర కాలము తృప్తి పొందుదురు.
వార్ద్రీణస (అనగా తెల్లని వర్ణము నపుంసకము ముసలి తనము మరియు నీరు త్రాగు నపుడు కళ్ళు, చెవులను, నీళ్ళలో ముంచి త్రాగునది. ఈ లక్షణములు గల దానిని “వార్ద్రీణసము” అని అందురు. ఇది గొట్టెలలో నొక జాతి) మాంసము, లోహ, ధాన్య విశేషము, కరివేపాకు, తేనె, దౌహిత్రునిచే ఇవ్వ బడిన మాంసము, తన కులమందు బుట్టిన వారిచే ఇవ్వ బడిన మాంసము, గౌరీ సుతునిచే గయా శ్రాద్ధము, ఓ కుమారా! ఇవన్నియు అక్షయ తృప్తిని కలిగించును. ఇందులో సందేహము లేదు. రాజశ్యామాక (ఎర్రచామలు) శ్యామాకములు (చామలు), నీవారములు (ధాన్య విశేషము) ప్రశాతికలు (దూసరధాన్యములు ) పౌష్కరములు (మెట్ట తామర దుంప), వంయములు (అడవి ధాన్యములు) ఇవన్నియు పితృ తృప్తిని కలిగించును. యవలు, వ్రీహి బియ్యము, గోధుమలు, నువ్వులు, కోద్రవములు నిష్పావములు ఇవన్నియు అత్యంత తృప్తిని కలిగించును.
శ్రాద్ధ మందు మర్కటకములు (ధాన్య విశేషము), రాజ మాషములు (ఎర్ర మినుములు), అణువులు (చిరువొడ్లు), విప్రూషికలు (ధాన్య విశేషములు), మసూరములు (చిరు శనగలు), వర్జించ దగినవి. లశునము (వెల్లుల్లి), గృంజనము (లళున విశేషము), పలాండువు (ఎర్ర ఉల్లిపాయ) పిండ మూలకము (దుంప విశేషము), కరంభము (సక్తు మిశ్రమదధి) మరియు వర్ణ హీనములు, రస హీనములు నాగు వస్తువులను వర్జింప వలెను. గాంధారికము (శాక విశేషము), సొరకాయ, లవణములు, ఊషరములు, ఎర్రనివి, జిగురు గలవి, ప్రత్యక్ష లవణములు. ఉచ్చారణకు శ్రేష్ఠము కానివి, ఉత్కోచముచే ప్రాప్తమైనవి, పతితులచే సంపాదించ బడినవి, అన్యాయార్జితము, కన్యాశుల్క ద్రవ్యము, దుర్గంధము కలిగినవి, నురుగుతో కూడిన జలము, అల్ప జలము, ఇవన్నియు వర్జింప దగినవి.
మరియు గోవునకు తృప్తి కలిగించనివి, పాచి నీరు, త్రాగరాని నీరు, అభోజ్యులచే నిర్మితములైన బావి మొదలగు వాని నీరు, ఓ తండ్రీ! అటువంటి జలమును గూడ పితృ కార్యము లందు సర్వధా వర్జింప వలెను. మృగము, ఒంటె, మేక మరియు ఒక గిత్త కలిగి యున్నవి, ఎన్ని రకాల పశువులున్నవో వాటిని కూడా వదలి వేయవలెను. గేదె పాలను, సారాయి వాని ఇంటి యందున్న ఆవు పాలను, ఈనిన పిదప పది దినములు గడవనిచో అట్టి ఆవు పాలను “నా తండ్రి కొరకు ప్రసాదింపుము” అని ఈ విధముగా చెప్పి తెచ్చిన పాలను, సాదువులైన పురుషులు ఈ అన్ని పాలను శ్రాద్ధ కర్మలందు పరిత్యజించెదరు. ఏ ప్రదేశము కీటాదులతో నిండి యుండునో, అగ్నిచే కాల్చ బడినదో, మరియు దుర్గంధ పూర్ణమై ఉన్నదో, అనిష్ట ప్రదేశము నందలి మట్టి, చెడ్డ మాటలు చెప్పుట, ఇవన్నియు శ్రాద్ధ కర్మల యందు విడువ వలెను. కులహింస, కుల తిరస్కారము చేయు వానిని శ్రాద్ధము నందు వర్జింప వలెను.
నీచ కులస్థుడు, బ్రహ్మహత్య చేసిన వాడు, రోగ గ్రస్తుడు, నీచుడు, నగ్నముగా నున్నవాడు, పాతకుడు వీరు ఆయా దుష్ట స్వభావములచే శ్రాద్ధ కర్మలను నష్ట పరిచెదరు. నపుంసకుడు గాయ పడిన వాడు, కోడి, గ్రామమందలి సూకరము, కుక్క, మరియు రాక్షసుడు, వీరిని చూచుట తోడనే శ్రాద్ధము హతమై పోవు చున్నది. ఈ కారణముచే రక్షా భావముతో భూమి యందు నువ్వులను చల్లెదరు. కుమారా! ఈ విధముగా అనుష్టానము చేయుట వలన ఇరువురికి రక్షణ కలుగును. జాతా శౌచ మృతా శౌచములు గలవారు, వీరితో సంపర్కము చేయువాడు కాకి, సూకరములను స్పర్శించు వారు, ఎల్లప్పుడూ రోగ గ్రస్తులైన వారు, పతితుడు, మరియు మలినుడు (అనగా పాతకుడు) అయిన పురుషుల ద్వారా పితామహ గణాలకు పుష్టి లాభము కలుగదు. శ్రాద్ధము నందు అటువంటి పురుషులను వర్జించ వలెను. రసజ్వలా దర్శనము కూడా ఆ సమయమున వర్జించ వలెను. యజమాని చండాలాది సమస్త సురాసక్తులైన పురుషుల స్పర్శను యత్న పూర్వకముగా పరిత్యజించ వలెను.
కేశములు మరియు కీటక యుక్తమగు శునకము చూసినవి, పూతి గంధ పూర్ణమైనవి, చెడి పోయినవి, వంకాయలు, మొదలైన ద్రవ్యములు శ్రాద్ధము నందు పరిత్యజించ వలెను. వస్త్ర పవన యుక్తమైన ద్రవ్యములు కూడ విడువ వలెను. అతి శ్రద్ధగా పితరుల పేర్లు, గోత్రాదుల ననుసరించి ఏవయితే అర్చింతురో, అవియే అనేక ఆహార రూపములలో పరిణితి చెందును. ఈ కారణముచే శ్రాద్ధము నందు పితరులకు సంతోష సాధనకు పాత్రులైన వారితో భోజనము చేయించ వలెను. శ్రద్ధ గలవాడై శ్రేష్ఠము లైన సమస్త వస్తువులను విధానానుసారముగా సమర్పించ వలెను. విజ్ఞులైన పురుషులు యోగులకు భోజనము పెట్టుదురు. ఎందువలన అనగా పితృ గణాలే యోగులకు ఆధారములై యున్నారు. అందువలన యోగులను ఎల్లప్పుడూ పూజించ వలెను. సహస్ర బ్రాహ్మణులకు బదులుగా ఒక్క యోగికి అందరి కంటే ముందుగా భోజనము పెట్టుట వలన జలము నందు నౌక ఏ విధముగా యజమానిని ఉద్ధరింప చేయునో, ఆ విధముగా అతడు కూడా యజమానిని మరియు భోక్తలను అందరిని ఉద్ధరింప చేయును. బ్రహ్మవాది గణాలు ఈ ప్రదేశము పితృ గాథలను కీర్తన చేయుదురు.
పూర్వకాల మందు పితరులు మహీపతి యగు పురూరవుని యొక్క ఉద్దేశ్యముతో ఈ గాధ గానము చేయుట జరిగినది. వారు ఈవిధముగా చెప్పిరి. “మనము పుత్రులలో ఎప్పుడు అటువంటి సర్వోత్తముడైన పుత్రుని పొందెదమో”. ఎవరు యోగులు భోజనము చేయగా మిగిలిన అన్నముతో భూమి యందు మనకు పిండ సమర్పణము చేయుదురో, లేక మనకు తృప్తిగా గయా క్షేత్ర మందు ఉత్కృష్టమైన, హరి స్వరూపమైన ఖడ్గ మృగము యొక్క మాంసమును, ఆకు కూరలతో, తిలయుక్తములైన పదార్థములతో, వివిధ రకాల వస్తువులు కలిసిన పదార్థములతో పిండ ప్రధానము చేయుదురో యని అనుకోను చుందురు. వైశ్వ దేవము నందు మరియు సౌమ్య బలి యందు ఖడ్గ మృగము యొక్క మాంసము గొప్ప హవిస్సు యని చెప్పబడును. శృంగ విహీనమైన ఖడ్గ మృగము యొక్క మాంసము లభించి నపుడు ఎప్పటి వరకు సూర్యుని స్థితి ఉండునో, మేము అప్పటి వరకు దానిని భుజించెదము. అని తలచు చుందురు. త్రయోదశీ తిథి యుక్తమైన మఘా నక్షత్ర మందు విభానానుసారముగా, శ్రాద్ధ మందు, దక్షిణాయన మందు మధు ఘృత యుక్తమగు పాయసమును ప్రధానము చేయ వలెను. కుమారా! ఈ విధముగా భక్తి సహితముగా ఏకాగ్ర చిత్తముతో పూజ చేసినచో కోరికలు సంపూర్ణముగా సిద్ధించును. మరియు సమస్త పాపములు క్షయ మగును. శ్రాద్ధము నందు పితరులను తృప్తి పరచుటచే వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, గ్రహనక్షత్రాలు, తారకలు మొదలగు వారందరు ప్రసన్ను లగుదురు. శ్రాద్ధముచే పితరులకు తృప్తి కలిగించిన యెడల వారు ఆయుష్యము, ప్రజలు, ధనము, విద్య, స్వర్గము, మోక్షము, సుఖము మరియు రాజ్యమును ఇచ్చెదరు. ఓ పుత్రా! నేను నీకు శాస్త్ర విహితమైన శ్రాద్ధ విధులను వర్ణించితిని. వత్సా! ఇప్పుడు కామ్య శ్రాద్ధము యొక్క తిథులను వర్ణించెదను వినుము.
