మార్కండేయ మహా పురాణము
94 - రుచికి పితృ వర ప్రదానము
పితృ దేవతలారా! మూర్తా మూర్త స్వరూపులు. దీప్త తేజస్కులు, ధ్యానరతులు, దివ్య నేత్రములు గలిగిన మిమ్ములను నేను ఎల్లప్పుడు నమస్కరించెదను. దక్షుడు, మరీచి, ఇంద్రాదులు. ఇతరులగు వారందరి నాయకుల కోరికలు దీర్చువారు అగు పితృ దేవతలకు నమస్కరించు చున్నాను. మనువు మొదలగు వారికి, మునీంద్రులకు సూర్య చంద్రులకు కోరికలు దీర్చు వారు. మఱియు సముద్రము లందు ఉన్న వారును, అగు సమస్త పితృ దేవతలకు నమస్కరించు చున్నాను.
ఓ ముని సత్తమా! రుచి ఈ విధముగా స్తుతించ గానే పితృ గణాలు తేజస్సుచే దశ దిశలను ప్రకాశింప జేయుచు ప్రత్యక్షమైరి. అతడు నివేదించిన పుష్ప గంధాను లేపనములచే విభూషితులై తన ఎదుట యున్న వారిని విప్రవరు డగు రుచి చూచెను.
పితృ దేవతలారా! నన్ను బ్రహ్మ దేవుడు ప్రజాసృష్టికి ఆదేశించెను. ఈ కారణముచే ఇప్పుడు నేను అందమైనదియు సంతాన ప్రాప్తికి సమర్దురాలగు దివ్యమైన భార్యను పొంద వలె నని అభిలషించు చున్నాను.
నీకు ఇప్పుడే ఈ ప్రదేశము నందే అందమైన భార్య లభించును. ఆమె గర్భమున నీకు శ్రేష్టుడగు పుత్రుడు మనువుగా జన్మించును. ఓ ఋచి! మన్వంతరాధిపతి బుద్దిమంతుడగు నీ కుమారుడు నీ పేరు నను సరించియే ఖ్యాతి చెందును. అనగా మూడు లోకము లందు రౌచ్యుడను పేరుచే ప్రసిద్ది చెందును.
ఆ రౌచ్యునికి కూడా మహాబల పరాక్రమ వంతులు. మహాత్ములు పృథ్వీ పాలకులు అగు అనేక మంది పుత్రులు జన్మింతురు. ధర్మజ్ఞుడా! నీవు కూడా ప్రజాపతివై నాలుగు రకాల ప్రజలను ఉత్పన్నము చేసి. ఎప్పుదు క్షీణాధికారి వగుదువో, అప్పుడు నీకు సిద్ది లభించును. ఏ నరుడు ఈ స్తోత్రముచే భక్తి సహితుడై మమ్ములను స్తుతించునో. వాని యడం మేము సంతుష్టులమై భోగములను ఉత్తమ మగు ఆత్మ జ్ఞానమును ప్రసాదించెదము. శరీరారోగ్యము, ధనము, పుత్రా పౌత్రాదులను కోరు వారును, మరియు ఇంకను వాంఛితము లగు కోరికలు కోరువారు. ఈ స్తోత్రముతో సదా మమ్ములను స్తుతించినచో మేము నిస్సందేహముగా వారికి అభీష్టము లగు వస్తువులను ప్రసాదించెదము. ఈ కారణముచే లోకము నందు పుణ్య ఫలమును కోరువారు. ఈ స్తోత్రముచే పితృ దేవతలకు అక్షయ తృప్తిని కలిగించ వలెను.
ఈ స్తోత్ర పాఠము చేసిన కారణము చేత ఆ శ్రాద్దము మాకు తృప్తిని కలిగించును. ఏ శ్రాద్ధము నందు మా సుఖము కొఱకు ఈ స్తోత్రము పఠింప బడునో ఆ శ్రాద్ధము వలన మాకు పన్నెండు సంవత్సరముల వరకు తృప్తి లభించును. ఈ స్తోత్రము హేమంత కాలము నందు మాకు ద్వాదశ వార్షికములు తృప్తి కలిగించును. శుభమగు ఈ స్తోత్రము శీతాకాల మందు మాకు ఇరువది నాలుగు సంవత్సరముల పర్యంతము తృప్తిని ప్రసాదించును. వసంత కాల మందలి శ్రాద్దమున ఈ స్తోత్రమును పఠించుటచే పదునారు సంవత్సరముల వరకు తృప్తిని ప్రసాదించును. మఱియు గ్రీష్మ కాలము నందు కూడా ఈ స్తోత్రమును పఠించుటచే పదునారు సంవత్సరముల పర్యంతము తృప్తి కారక మగును. ఏదేని కారణముచే శ్రాద్దము వికృత మగునేని ఈ స్తోత్ర పాఠముచే అది సంపన్న మగును. ఓ రుచీ! వర్షా కాలము నందు శ్రాద్ధ సమయమున ఈ స్తోత్రమును పఠించుటచే మాకు అక్షయ తృప్తి కలుగును పురుషులు శరత్కాలము నందు ఈ స్తోత్రము పఠించి శ్రద్ధ సంబందమగు ద్రవ్యములను ప్రసాదించినచో.
పదునైదు సంవత్సరముల పర్యంతము మాకు తృప్తి కలుగును. ఏ గృహము నందు ఈ స్తోత్రము వ్రాయబడి సదా ఉంచ బడునో, ఆ గృహము నందు శ్రాద్ధ సమయమున మేము నివసించెదము. ఈ కారణమున నీవు శ్రాదము నందు భోజనము చేయుచున్న బ్రాహ్మణుల ఎదుట నిలుచుండి ఓ మహాబాగా! మా యొక్క పుష్టి కొఱకు ఈ స్తోత్రమును వినిపించుము. ఓ ముని సత్తమా! పిత్రు గణాలు ఋచితో ఈ విధముగా బలికి స్వర్గమునకు బోయిరి.
