మార్కండేయ మహా పురాణము

Table of Contents

5 - ద్రౌపదీ పంచ భర్తృకా కారణ నిరూపణమ్

బ్రాహ్మణుడా! త్వష్ట్రు ప్రజాపతి కుమారుడగు త్రిశిరుడను వాడు శీర్శాసనముతో తపస్సు చేయు చుండెను. ఇంద్రుడతని తపస్సునకు భయపడి అతనిని చంపెను. వానిని జంపుటచే బ్రహ్మ హత్య జనిత పాపముచే శచీ పతియగు ఇంద్రుడు తేజోహీను డయ్యెను. అధర్మాచరణ కారణముచే నతని తేజస్సు ధర్మదేవత యందు ప్రవేశించెను. అందు వలన ఇంద్రుడు తేజోహాని నందెను. తదనంతరము త్వష్ట్రు ప్రజాపతి తన పుత్ర మరణ వార్త విని అత్యంత క్రోధితుడై శిరస్సు నందలి యొక జటను బెరికి, యిట్లు పలికెను.

ఇప్పుడు దేవతలతో గూడ ముల్లోకముల సమస్త ప్రాణులు నా యొక్క తేజో వీర్య బలమును చూచెదరు గాక. నా కుమారుని జంపిన బ్రహ్మ ఘాతియు, దుర్భుద్ధియు నగు ఇంద్రుడు కూడ నా వీర్య బలమును జూచును గాక. ఎవడు స్వధర్మ కర్మానుష్ఠ పరుడగు నా కుమారుని జంపెనో యట్టి ఇంద్రుడు నా శక్తి ఎట్టిదో తెలిసి కొనును. ఇట్లు పలికి యతడు కోపముచే ఎర్ర బడిన నేత్రములతో తన జటను బెరికి అగ్ని యందు హోమము చేసెను. ఆ సమయమందు తక్షణమే అగ్ని వేదిక నుండి జ్వాలా మాలలు గల మహా శరీరము, గొప్ప కోరలు, కాటుక కొండతో సమానమగు రూపము గల పృత్రుడను పేరుగల నొక మహాసురుడు ఉత్పన్న మాయెను. అప్రమేయ ప్రభావుడు, మహాబల వంతుడు, ఇంద్ర శత్రువు నగు వృత్రాసురుడు త్వష్ట్రు ప్రజాపతి తేజస్సుచే బుట్టి నందున ప్రతిదినము ఇషుపాత ప్రమాణమంతగా బెరుగు చుండెను. (బాణమును ప్రయోగించిన నెంత దూరము పోవునో యంత దూరమును ఇషు పాతమని యందురు.)

తన సంహారము కొరకు వృత్రాసురుడు ఉత్పన్న మయ్యెనని తెలిసిన యింద్రుడు భయము నంది యతనితో సంధి చేయుటకు సప్త మహర్షులను బంపెను. సర్వ భూత హితరతులు ప్రసన్న మనస్కులు నగు సప్తర్షులు వృత్రాసురునికి దేవేంద్రునికి పరస్పరము ప్రతిజ్ఞలు చేయించిన పిదప సఖ్యమును చేయించిరి. దేవేంద్రుడు వృత్రాసురునితో చేసిన ప్రతిజ్ఞా నుల్లంఘించి వృత్రాసురుని జంపెను. అప్పుడు బ్రహ్మహత్యా జనిత పాపముచే నభిభూతు డగుటచే ఇంద్రుని బలము నష్ట మయ్యెను. ఆ బలాధి దేవత ఇంద్రుని శరీరము నుండి వెడలి, సర్వ వ్యాపియు నవ్యక్త రూపమునగు వాయు దేవుని యందు ప్రవేశించెను.

మరియు ఇంద్రుడు గౌతమ మహర్షి రూపము ధరించి అహల్యను జెరచెనో, యా సమయ మందు గూడ నాతని తేజో బలము నష్టమయ్యెను. ఇట్లాతని తేజస్సును అతని అంగ ప్రత్యంగముల యందున్న మనోహరమగు సమస్త లావణ్యము దురాత్ముడగు ఇంద్రుని వదలి యశ్వినీ కుమారుల యందావేశించెను. అప్పుడు దేవరాజగు దేవేంద్రుని, ధర్మదేవత యొక్క తేజస్సుచే విడువ బడినట్లు తెలిసిన దైత్యులు ఇంద్రుడు దుర్భలుడు రూప హీనుడని నిశ్చయించి, ఆతనిని జయించుట కొరకు ఉద్యమము చేసిరి.

మహామునీ! అత్యంత బలశాలురగు దైత్యులు దేవేంద్రుని జయించు నిచ్చతో బల వీర్య మదోద్ధతులగు రాజుల వంశమందు జన్మించిరి. కొంతకాలము గడచిన తరువాత భూదేవి దైత్య దానవులచే గలిగిన తన దుఃఖ కారణము వారితో చెప్ప మొదలిడెను. దేవతలారా! యే మహా బలవంతులగు రాక్షసులను మీరు పూర్వము జంపితిరో వారంద రిప్పుడు మనుష్య లోకమున రాజుల ఇండ్లలో జన్మించిరి. ఆ దైత్య గణము అసంఖ్యాకమగు నక్షౌహిణుల మించి యున్నారు. ఈ కారణముచే నేనత్యంత పీడితురాలనై భారమును మోయజాలక క్రిందకు కృంగి పోవుచున్నాను. దేవతలారా! నాకు శాంతి కలుగునట్లు చేయుడు.

మునీంద్రా! అనంతరము దేవతలు ప్రజలందరి ఉపకారమునకై, భూభార హరణార్థము తమ తమ తేజో భాగములతో స్వర్గము నుండి భూలోక మంద వతరించిరి. అప్పుడు స్వయముగా ధర్మ దేవత యా ఇంద్రుని తేజస్సును కుంతీ గర్భమందుంచెను. పిదప ఇంద్రుని తేజో ప్రభావముచే కుంతియందు మహా తేజస్సు గల యుధిష్ఠిర మహారాజు జన్మించెను. వాయు దేవుడు తన యందున్న ఇంద్రుని తేజస్సును కుంతీ గర్భమందుంచెను. ఆ తేజస్సుచే భీమసేనుడు జనన మాయెను. మరియు నీ కుంతీ గర్భము నుండి ఇంద్రుని యర్ధ తేజస్సుతో అర్జునుడు ఉత్పన్న మయ్యెను. తరువాత ఇంద్రుని రూప లావణ్య తేజస్సులు ధరించిన అశ్వినీ కుమారుల వలన మహా తేజ సంపన్నులు, కవలలైన నకుల, సహదేవు లుద్భవించిరి. ఇట్లు భగవంతుడగు ఇంద్రుని ఐదంశల భాగములతో భూలోకమంద వతరించెను.

మరియు నా యింద్రుని భార్యయగు శచీ దేవియే ద్రౌపది యను నామముతో యజ్ఞమందు హోమ గుండ మందలి అగ్ని హోత్రం నుండి పుట్టెను. ద్రౌపది ఇంద్రుని పత్నియగు శచీదేవియే గాని ఇంకెవరు గారు. ఏమనగా యోగీశ్వరులగు మహా పురుషులు తమ శరీరము ననేక భాగములుగా విభజించ గలరు. మహాభాగా! తమకు నిపుడు ద్రౌపదీ దేవి పంచ భర్తృక యగుటకు కారణ మేమిటో చెప్పితిమి. తరువాత బల రాముడు సరస్వతీ తీర మందలి  నైమిశారణ్యమున చేసిన బ్రహ్మ హత్యా విషయమును గురించి చెప్పెదము. వినుడు.