మార్కండేయ మహా పురాణము
107 - భాను మహాత్మ్యము
పిమ్మట భగవానుడగు భానుడు ప్రసన్నుడై ఆ ప్రజ లందరితో నిట్లనేను. ఓ ద్విజులారా! మీరు నా వలన ఏమి పొంద వలెనని కోరు చున్నారు, దానిని తెలుపుడు. అప్పుడు బ్రాహ్మణ క్షత్రియాది జనులు ససంభ్రమముగా ఉష్ణాంశుని సమ్ముఖముగా చూచి ప్రణామము చేసి వరదాత యగు ఆ జగదీశ్వరునితో నిట్లు పలికిరి.
ఓ మహామునీ! అప్పుడు భగవానుడు ఆ ప్రజ లందరితో “తథాస్తు” అని పలికి అంతర్ధాన మయ్యెను.
ఓ ద్విజుడా! నరేంద్రుని భార్య మానిని ఈ విషయము విని అత్యంత ఆనందమును పొందెను. హర్షాతిరేకముతో శరీరము పులకించి పోయెను. కాని రాజు మాత్రము వారితో ఏమియు పలుకక చాలా కాలము వరకు చింతించు చునే యుండెను. పిమ్మట మానిని ప్రసన్న చిత్తురాలై భర్తతో నిట్లు పలికినది, “ఓ మహీపాలా! సమృద్దమగు ఆయిష్యముతో మీరు వృద్ది నొందుదురు గాక ఓ ద్విజుడా! ఆనంద చిత్తురాలగు మానినిచే ఈ విధముగా అభినందింప బడినను రాజు వ్యాకుల చిత్తుడై ఏమీ జవాబు ఇవ్వ లేదు. అప్పుడు మానిని శిరస్సు వంచుకొని చింతా క్రాంతుడైన భర్తతో ఇట్లు పలికెను. ఓ రాజా! ఇంత ఆనందకర మగు సమయములో కూడ మీ రెందులకు సంతోషమును పొందుట లేదు?
మీరు రోగ రహితులు మరియు స్థిర యౌవనులు అయి ఉండి ఇప్పటికి నుండి పదివేల వత్సరములు జీవించి యుందురు. అయి నప్పటికీ మీ కేందులకు ప్రసన్నత కలుగుట లేదు? ఓ పృథ్వీ పతీ! ఇట్టి ఆనందకర మగు సమయము సంప్రాప్తమై నప్పటికీ ఏ కారణముచే మీరు చింతించు చున్నారు? ఆ కారణ మేమియో తెలుపుడు.
ఓ భద్రా! నాకేమి భాగ్యము కలిగినదని నీవు నన్ను అభినందించు చున్నావు? నాకు వేల కొలది దుఃఖములు అనుభవించ వలసి వచ్చినది. ఇట్టి స్థితిలో నీవు నన్ను అభినందించుట నాకు ఎట్లు సంతోషము గలుగ జేయును? నేనొక్కడను ఒంటరి వాడనై పదివేల సంవత్సరములు జీవించుదును కాని నీవు ఉండవు. కాబట్టి నీ వియోగము నాకు దుఃఖము కాదా? పుత్ర, పౌత్రులు మరియు ప్రియ బందువులు యొక్క మరణము చూచుట వలన నాకు ఆనందము కలుగునా? వీటి వలన నాకు అల్ప దుఃఖము సంభవించునా?
ఓ భద్రా! భక్తుల, భృత్య గణాలు, మిత్రులు మరణించి నప్పుడు నాకు సదా అపారమగు దుఃఖము ననుభవించ వలసి వచ్చును, ఎవరు నా కొఱకు గాలిని పీల్చక తపస్సు చేసిరో, వారికి కూడ మరణము కలుగును. కాని నేను జీవించి యుండి సుఖ భోగముల ననుభవించు చుండును. ఇది నాకు నీచము గాదా? హే వరారోహే! ఎట్టి పదివేల వత్సరములు పరమాయువు నాకు కలిగినదో, అది నాకు ఆపద గానే తటస్థించినది. నా యెడల నిది భాగ్య దాయకము కాదు. ఈ విషయముల నాలోచింపక నీవు నన్నెందుల కిట్లు హర్షింప చేయుదువు.
“ఓ మహారాజా! మీరు చెప్పినది నిజము ఇది మీకు దుఃఖ కరమగు విషయమే. ఇందు సందేహము లేదు. నేను, పౌర వర్గాల వారును మీ యెడల గల ప్రీతిచే ఇట్టి దోషమును గ్రహింప లేక పోయితిమి. ఓ నరనాథా! ఇప్పుడేమి కర్తవ్యమో దానిని విచారింపుడు. ఎందు వలన యనగా భగవానుడగు రవి ప్రసన్నుడై ఏమి పలికెనో అది అసత్యము గాదు.
పౌరులు, భృత్య గణములు ప్రసన్న మనస్కులై నాకెట్టి యుపకారము చేసిరో అట్టి వారికి నేను ఏ ప్రత్యుపకారము చేయక ఏ విధముగా భోగముల ననుభవింతును? అందు వలన నేను ఇప్పటి నుండి పర్వతము పైకి వెళ్లి దుష్కరమగు తపస్సు చేసిన పురవాసుల యొక్క హితమునకై నేనును దుష్కర మగు తపస్సును చేయుదును. దేని కొఱకు నా నిమిత్తము పురవాసులు, బంధువులు ఆరాధన జరిపిరో, అట్టి కార్యము కొఱకు నేను కూడ వారి నిమిత్తమై ఆరాధన చేయుదును. సూర్య దేవుని ఆరాధించుటకు నిరహారముతో తపస్సు చేయుదును. ఏ విధముగా ఆయన ప్రసాదము వలన స్థిర యౌవనముతో, రోగ రహిత ముగా పదివేల వత్సరములు నేను జీవించి యుందునో ఓ వరాననా! అదే విధముగా నా ప్రజ లందఱు, భృత్యులు, నీవు, పుత్రికలు, పుత్రులు, పౌత్రులు, సుహృద్గణములు కూడ జీవించ వలెను. రవి భగవానుడు ఈ విధముగా అనుగ్రహించినచో నేను ప్రసన్న చిత్తుడనై ఈ రాజ్యమునకు రాజునై సమస్త రాజ్య సుఖము ననుభవించెదను.
మఱియు ఓ మానినీ! సూర్యుడీ విధముగా అనుగ్రహించనిచో ఎప్పటి వరకు నా ప్రాణములకు నష్టము కలుగ కుండునో. అప్పటి వరకు ఈ పర్వత మందే నిరాహారముతో తపస్సు చేయుదును.”
అప్పుడా మానిని నరాదిపుని వచనములు విని “తథాస్తు” అని స్వీకరించినది మరియు భర్తతో పాటు ఆమె గూడ పర్వతమునకు బోయెను. ఓ ద్విజుడా! రాజు భార్యా సహితుడై పూర్వము చెప్పిన దేవాలయమునకు వెళ్లి భాస్కర సేవా తత్పరుడై భాను నారాధింప సాగెను. నరపతి ఏ విధముగా ఆహారము లేక దినదినము కృశించి పోవు చుండెనో, అట్లే రాణి యగు మానిని కూడ క్షీణ శరీరముతో శీత, వాత, ఆ తపములను సహించుచూ ఉగ్రమగు తపస్సు చేయ మొదలిడెను. ఓ ద్విజోత్తమా! ఈ విధముగా ఎప్పుడయితే వారు భానుని నరాధనతో, మహత్తర మగు తపస్సు చేసి ఒక సంవత్సర కాలము కన్నా నధిక సమయమును గడిపిరో, అప్పుడు దివాకరుడు ప్రసన్నుడై, సమస్త భృత్య గణములు పౌరులు మఱియు పుత్రాదుల కొఱకు అభిలషించిన వరము నిచ్చెను.
అనంతరము రాజు వరమును పొంది తన గృహమునకు తిరిగి వచ్చెను. హర్ష చిత్తుడై ధర్మముగా ప్రజా పాలన చేయుచు రాజ్యము నేల సాగెను. ధర్మాత్ముడగు ఆ రాజు అనేక యజ్ఞములను పగలు, రాత్రియును సత్పాత్రులకు దానములను మఱియు పట్టమహిషి యగు మానినితో వివిధ భోగాలనూ అనుభవించెను. ఈ విధముగా ఆయన పుత్ర, పౌత్ర. భృత్య, పౌర గణాదులచే ప్రసన్న చిత్తముతో స్థిర యౌవనుడై పదివేల వత్సరములు గడిపెను. ఆ సమయమున భృగు వంశోత్పన్ను డగు “ప్రమతి” యను పేరు గల ఋషి ఆ రాజు యొక్క చరిత్ర విని అచ్చెరు వొందిన వాడై భాను మహాత్మ్యమును ఇట్లు కీర్తించెను.
భాను దేవుని భక్తికి ఆశ్చర్యకర మగు శక్తి కలదు? దాని బలముచే రాజ్య వర్ధనుడను రాజు తనకు మఱియు తన ఆత్మీయులకు ఆయువును పెంపొందింప చేసెను. ఓ విప్రా! నీవు ఆది దేవు డగు వివస్వానుని మాహాత్మ్యము నందు ఏ విషయముల నడిగితివో, దానిని నీకు వర్ణించితిని. మానవులు భానుని ఈ ఉత్తమ మగు మహాత్మ్యము నంతయు బ్రాహ్మణుని ముఖము నుండి శ్రవణము చేసినను లేక పఠనము చేసిననూ సప్త రాత్రు లందు చేసిన పాపముల నుండి విడువ బడుదురు. ఏ మానవుడు భానుని ఈ మహాత్మ్యమును బుద్ది యందు ధరించునో, అతడు బుద్ధి మంతుల కులము నందు జన్మించి ధన వంతుడు, రోగము లేని వాడగును, మహా ప్రాజ్ఞుడు అగును. మరియు గొప్ప దక్షిణలు గల యజ్ఞములు చేయును. ఈ చరిత్రను వినిన వారు తనతో సమాన మగు త్రిసంధ్యల యందు జపించిననూ వారి పాతకము లన్నియు నశించును.
ఏ దేవ మందిరము నందు ఈ రవి యొక్క సంపూర్ణ మహాత్యము పఠింప బడునో, భగవానుడు ఆ మందిర సమీపమును విడువడు. అందు వలన హే బ్రాహ్మన్! నీవును మహాత్తర పుణ్యము యొక్క అభిలాషచే భానుని ఈ ఉత్తమ మగు గొప్ప మహాత్మ్యమును మనస్సు నందు ధరించి జపించుము. ఓ ద్విజశ్రేష్టా! ఏ పురుషుడు సువర్ణముతో చేసిన కొమ్ములను తొడిగి ఒక అతి సుందర మగు, పాలిచ్చు నటువంటి గోవును దానము చేయునో, మఱియు పురుషుడు ఇంద్రియ నిగ్రహము కలవాడై మూడు రోజులు ఈ మహాత్మ్యమును వినునో, అట్టి ఆ యిద్దరి పుణ్య ఫలము సమానమని యెరుగ వలెను.
