మార్కండేయ మహా పురాణము

Table of Contents

57 - భువనకోశ వర్ణనము

ఓ ద్విజోత్తమా! ఇప్పుడు కింపురుష మను దేశము గురించి చెప్పెదను వినుము. అక్కడ శరీర ధారులగు పురుషులు పది వేల సంవత్సరములు జీవించుదురు. అక్కడి స్త్రీ పురుషులు రోగ రహితులు, శోక రహితులు అయి ఉందురు. ఆ ప్రదేశము నందు నందన వనముతో సమానమగు గొప్పదగు ఒక ప్లక్ష ఖండము ఉన్నది. అచటి మనుష్యులు ఎల్లప్పుడు ఆ వృక్షముల యొక్క ఫల రసములు త్రాగి స్థిర యౌవనులై ఉందురు. మరియు స్త్రీలు పద్మముతో సమానమగు గంధ యుక్తులై ఉందురు. ఈ కింపురుష వర్షము తదుపరి మధ్యమున హరి వర్షమను పేరు గల వర్షమున్నది. అచట జన్మించిన పురుషులు శ్రేష్ఠమగు వెండితో సమానమగు వర్ణము గలవారై ఉందురు. ఎట్టి దేవ రూపము గల మనుషులు దేవ లోకచ్యుతులై హరి వర్షము నందు జన్మింతురు. వారు అచటి ఉత్తమమగు చరకు రసమును త్రాగు చుందురు.

ముసలితనము వారిని పీడింపదు. అందుచేత ఎవ్వరును జీర్ణము కారు. మరియు ఎంత కాలము వరకు వారు జీవించి ఉందురో అంతవరకూ ఎల్లప్పుడు యౌవనులై ఉందురు. మరియు రోగము లేనివారై ఉందురు. మేరు వర్షమను పేరు గల మధ్యమ వర్షమును ఇలావృతమని అందురు. అచట సూర్యుని తాపము ఉండదు. మనుష్యులు ముసలితనముచే క్షీణింపరు. సూర్య చంద్ర గ్రహముల మరియు నక్షత్రముల కిరణములు అక్కడ ప్రకాశమును పొందలేవు. ఎందుచేత ననగా అక్కడ సుమేరు పర్వతము యొక్క అత్యంత మగు జ్యోతి ప్రకాశించు చుండును. మేరు వర్ష మందు జన్మించిన మనుష్యులు పద్మముతో సమానముగా ప్రభాయుక్తుడై, పద్మ గంధ యుక్తుడై, పద్మ పత్రములతో సమానమగు విశాలమగు నేత్రములు గలవారై, జంబూ ఫల రసమును త్రాగువారై యుందురు. ఆ మానవుల యొక్క ఆయువు పదమూడు వేల సంవత్సరములు ఉండును. మరియు ఇలావృతమునకు మధ్య భాగమందున్న మేరు అను పర్వతము యొక్క ఆకారము శరావము మూకుడుతో సమానంగా ఉండును.

314, 315 pages missing