మార్కండేయ మహా పురాణము
106 - భాను స్తవము
హే భగవన్! మీరు భానునికి సంతానము కలుగుట, మఱియు ఆ మహాత్మ్యమును, స్వరూపమును విస్తారముగా చక్కగా వర్ణించి చెప్పితిరి. కాని ఓ ముని సత్తమా! భాస్కరుని మాహాత్మ్యము ఇంకనూ విన వలెనని కోరు చున్నాను కృప జూపి దాని నంతయు చక్కగా వర్ణించి చెప్పుడు.
ఆది దేవుడగు వివస్వానుడు పూర్వ కాలమున జనుల చేత ఆరధింప బడి ఏమేమి చేసెనో, అట్టి ఆ మాహాత్మ్య విషయము నంతయు నీకు చెప్పెదను. మహాకీర్తి గల వాడును, “దముడు” అను వాని కుమారుడును అగు “రాజ్య వర్దునుడు” అను నతడు రాజై బాగుగా పృద్వీ పాలనము చేయు చుండెను. ఓ విప్రా! ఆ మహాత్మునిచే స్వధర్మ యుక్తముగా పరిపాలన జరుగు చుండగా, అను దినము దేశము, ధనము, జనము, వృద్ది నొందు చుండెను.
మరియు అతడు రాజైన పిమ్మట ఇతర రాజ గణాలు, భూమి, పౌర జన గణాలు నిర్భయులై అత్యంత పుష్టిని, తుష్టిని గలిగి యుండిరి. దమ పుత్రుడైన ఆ రాజ్యవర్దన మహీపతి యొక్క శాసన కాలమున ఎవరికినీ వ్యాధులు ఉపసర్గలు (మారి, తెగుళ్ళు మొదలగు నవి) కానీ సర్పాది క్రూర జంతువులచే భయము కాని, వర్షాభావముచే భయము గాని కలిగెడిది కాదు. అతడు గొప్ప గొప్ప యజ్ఞములు చేసెను. ఆర్థి గణాలకు దానములు చేసెను. ధర్మమునకు విరుద్దము గాని విషయముల ననుభవించు చుండెను. ఈ విధముగా రాజ్య కార్యములను, రాజ్య పాలనము చేయుచు ఆయన ఏడు వేల సంవత్సరములు ఒక దినముతో సమానముగా గడిపెను. “విదూరథు” డను పేరు గల దక్షిణ దేశపు రాజు యొక్క కుమార్తెయు, మానవతియు నగు “మానిని” యను నామె భార్యగా నయ్యెను.
ఒక నాడు చక్కని కనుబొమలు గల మానిని రాజ పురుషుల ఎదుట రాజు యొక్క శరీరమునకు తైలము రాయుచు కన్నీరు కార్చెను. ఆ కన్నీరు రాజు యొక్క శరీరముపై బడెను. అప్పుడు రాజవర్ధనుడు మానిని అశ్రు పూరిత నేత్రములతో నుండుట చూచి దాని వృత్తాంతము నడిగెను. కాని ఆమె ఏమి ప్రత్యుత్తర మీయ లేదు. కేవలం కన్నీరు కార్చుచూ నిశ్శబ్దముగా రోదించ సాగెను. అది చూచి రాజ్య వర్ధనుడు తిరిగి మానినిని ఇట్లడిగెను. ఇది ఏమి? నీ వెందులకు దుఃఖించు చున్నావు? మనస్విని యగు మానిని భర్త ఇట్లు ప్రశ్నించుటచే కేవలము “ఏమి లేదు” అని మాత్రమే జవాబిచ్చెను. అయినను రాజు ఊర కుండక మాటి మాటికి అడుగు చుండెను.
రాజు ఆ సుమధ్యను చాలా సార్లు అడిగెను. కాని ఆమె రాజ్యవర్ధనునితో ఏమియ చెప్ప లేదు. రాజు తిరిగి మాటి మాటికి ప్రశ్నించుటతో అప్పుడు రాజునకు అతని శిరస్సు నందలి కేశముల నుండి ఒక తెల్లని కేశమును తీసి చూపెను. ఓ రాజా! దీనిని చూడుము. అంత కంటే దుఃఖ కారణము ఏముండును? ఇది నా దురదృష్టము అనెను. అది విని రాజు పెద్దగా నవ్వ సాగెను. అతడు నవ్వుచూ, నవ్వుచూ ఆచటకు వచ్చి యున్న రాజు గణాలు, పౌర గణాలు వినుచుండ భార్యతో నిట్లు పలికెను. ఓ విశాలాక్షీ! కల్యాణి! రోదింపకుము సమస్త జంతువుల యందును జన్మ, వృద్ద, పరిణామాది వికారములు కనుపించును, అందు వలన దీనికై దుఃఖించుట నిష్ప్రయోజనము.
ఓ వరాననా? నేను సంపూర్ణ వేదములను అధ్యయనము చేసితిని. వేల వేల యజ్ఞములను సంపన్నము చేసితిని బ్రాహ్మణులకు అర్ధాది దానములు, పుత్రో త్ఫథానము, నీ సాంగత్యముతో మానవులకు అతి దుర్లభములై అనుభవించుటకు యోగ్యములకు విషయములను అనుభవించితిని. చక్కగా, న్యాయ పూర్వకముగా, పృధ్వీ పాలనము, యుద్దము నందు శౌర్యము మరియు ప్రియ మిత్రులతో హాస్య, పరిహాసములు, వన విహారములు, మొదలగు అనేక కార్యములను చేసితిని. ఓ భద్రా! నేను అనుభవించని సుఖము మరేమున్నదని నీవు నా తెల్లని (నెరసిన) కేశమును చూచి భీతి చెందు చున్నావు. ఓ భద్రా! నా కేశములు తెల్ల బడినవి. శరీరము శిధిలా వస్తాను పొందినది. దీని వలన హాని ఏమియు లేదు. ఎందు చేత ననగా ఓ మానినీ! నేను ఇప్పుడు అన్ని కార్యములను నెరవేర్చి కృత క్రుతుడ నైనాను. ఓ భద్రా! నా శిరస్సు నందు పండిన కేశములకు నేను వనము నాశ్రయించి దానికి చికిత్స చేయుదును.
ఓ భద్రా! బాల్యావస్థ యందు బాల క్రీడలు, కౌమారావస్థ యందు మఱియు యౌవన మందును విద్యా భ్యాసము విషయ భోగాది కార్యములు సంపాదించి, వృద్దావస్థ యందు వనము నాశ్రయించుట ఉచితము. ఓ భద్రా! నా పూర్వీకులు నీ పూర్వీకులు ఇదే విధముగా చేయుచు వచ్చు చుండిరి. అందు వలన నీ కన్నీటికి కారణ మేమియు కనిపించుట లేదు. ఓ భద్రా! శోకమును వీడుము. నాకు ఇట్లు పండిన వెంట్రుకలు కనిపించుట భాగ్యోదయ కారణమే. అందు వలన నిష్ప్రయోజన మగు దుఃఖమును వీడుము అనెను.
ఓ మహర్షీ! పిమ్మట సమీపమున నున్న నృపులు, పౌర గణాలు, రాజ్యవర్దనునికి నమస్కరించి వినయముతో నిట్లనిరి. నరాదిపా! మీ భార్య మీ వెంట నంటి యుండును, గాన మీ భార్య దుఃఖించ వలసిన యవసరము లేని మాట నిజమే! కాని మేమే గాక భూతములు గూడ నీవు లేని కారణమున దుఃఖించ వలసిన అవసరము సంప్రాప్త మైనది.
ఓ రాజా! మీరు మాకు పరిపాలకులు. మీరు వన వాసమునకు వెళ్ళ వలెనని పలికిరి. కాని అట్లు చేయుట వలన మీచే లాలింప బడిన మా ప్రాణములు నిలువవు. మీరు వనములకు వెళ్ళినచో మేము కూడా వచ్చెదము. ఓ నాథా! మీరు వనవాసు లైనచో పృధ్వీ వాసులకు నిస్సందేహముగా శ్రౌత స్మార్తాది అశేషము లగు క్రియా కలాపములకు హాని సంభవించును. నాధా! నీవు వనమునే ఆశ్రయించినచో ధర్మమునకు విఘాతము గలుగ గలదు. సందేహము లేదు. గాన ఆ ప్రయత్నమును మాన గోరు చున్నాను. ఓ నరాధిపా! మీరు ఏడు వేల వత్సరములు భూమిని పాలించిరి. దాని వలన ఎట్టి మహా పుణ్యము కలిగెనో చూడుడు. ఓ మహారాజా! మీరు వనములకు బోయి తపస్సు చేసినను, అది ఈ పృథ్వీ పాలన యొక్క షోడశ భాగమునకును సమానము కాదు.
నేను ఏడు వేల సంవత్సరములు ఈ భూమిని పరిపాలించితిని. ఇప్పుడు నాకు వన వాసము నకు యుక్తమగు సమయము ఉపస్థిత మైనది నాకు పుత్రులు జన్మించిరి. ఇప్పుడు ఆ పుత్రుల యొక్క సంతానము చూచి యున్నాను. యముడు కొన్ని రోజుల వరకు అల్ప కాలము గూడ సహింప లేడు. (అనగా వెంటనే ఆయువు పూర్తి యగును.)
ఓ నగర వాసులారా! నా శిరస్సు నందు మీరు చూసిన తెల్లని కేశములు ఉగ్ర కర్మయు, అనార్వుడు నగు మృత్యువు యొక్క దూతగా తెలుసు కొనుడు. అందు వలన నేను పుత్రుని రాజ్యాభిషిక్తుని చేసి భోగములను పరిత్యజించి వనము నందు నివసించుచూ యముని దూతలు వచ్చు వరకు తపస్సు చేయుదును.
అని రాజు పలికి వనములకు పోవలె నని స్థిర నిశ్చయుడై జ్యోతిష్కులను కుమారుని యొక్క రాజ్యా భిషేకమునకు లగ్న దినమును అడిగెను. జ్యోతిష్క గణాలు శాస్త్ర దృష్టి గలవారై నను రాజు వచనములు విని వ్యాకుల చిత్తులైన కారణమున లగ్న దినమును చూచుటలో అసమర్దులై, గాద్గదిక స్వరమున రాజుతో నిట్ల పలికిరి. ఓ రాజా! మీ వచనములు వినుటతో మా జ్ఞాన మంతయు నష్ట మయ్యెను.
ఓ మునీ! తిరిగి క్రమానుసారము అన్యాన్య నగరములు మఱియు దేశములు ఆయా రాజధానుల నుండి అనేకానేక వృద్ద ద్విజ శ్రేష్ఠ గణములు వచ్చి, వనవాసము చేయుటకు ఇచ్చగించిన రాజుతో మస్తకము కంపించు చుండ ఇట్లు పలుక సాగిరి. ఓ రాజా! ప్రసన్నులు కండు. మమ్ముల నను గ్రహించి పాలింపుడు. ఓ భూపాలా! మీరు వనములకు వెళ్ళినచో మనుష్యు లందఱు దుఃఖితు లగుదురు. అందు వలన ఓ రాజా! దేని వలన సంపూర్ణ జగత్తంతయు దుఃఖమును పొందదో, అట్టి దానిని మీరు జేయుడు. ఓ వీరా! మేము మరి కొంత కాలము జీవించుదుము. ఆ సమయమున మీరు లేని శూన్య సింహాసనమును చూడలేము.
ఈ విధముగా బ్రాహ్మణ గణములు, పౌర సమూహములు, భూపాల బృందములు, అమాత్యులు, భృత్య గణములు, మొదలగు వారందరూ మాటి మాటికి ప్రార్ధించి నప్పటికిని, ఆయన వన వాసము చేయ వలెనను కోరికను విడువక ‘మీరు నన్ను క్షమింపుడు” అని మాత్రమే ప్రత్యుత్తర మిచ్చెను. అప్పుడు బ్రాహ్మణులు, పౌర వృద్దులు, మంత్రులు, భృత్య గణములు, కలసి తమలో తాము ”ఇప్పుడేమి చేయ వలెను?” అని విమర్శించు కొనసాగిరి. ఓ విప్రా! ధార్మిక ప్రవరుడగు రాజు యెడల అనురాగము కల వారగు ఆ బ్రాహ్మణులు మొదలగు వారు ఇట్లు నిశ్చయించు కొనిరి. “మనము చక్కగా ధ్యానము నందు నిమగ్నులమై, తపస్సు చేసి భాస్కరుని ఆరాధించి, ఆయనను మన రాజుకు ఆయువు నిమ్మని కోరుదము గాక.”
అనంతరము వారందరూ ఈ కార్యమును చేయుటకు ఏక నిశ్చయులై ఎవరింటిలో వారు అర్ఘ్రోపచారాది ఉపహారములతో భాస్కరుని పూజింప సాగిరి. కొందఱు మౌన వ్రత ధారులై మంత్రముల యొక్క జపాదుల చేతను, కొందఱు యజుర్వేదాను యాయులై, మరి కొందఱు సామవేదా మయాయులై జపాదులచే రవిని సంతోష పరచ సాగిరి. పిమ్మట కొంత మంది నదీ జలము లందు స్నానాదులు గావించి తపస్సు నాచరించుచూ పరిశ్రమ సహితులై ఆ భాస్కరు నారాధించు చుండిరి. కొందఱు అగ్నిహోత్ర తత్పరులై రాత్రి పగలును కూడ రవి సూక్తము జపమును చేయ సాగిరి. మరి కొందఱు భాస్కరుని యందే దృష్టిని నిలిపి నిలు చుండిరి. ఈ విధముగా వారు ఆయా ప్రసిద్దమగు విధుల ననుసరించి, అనేక ప్రకారములుగా నారాధించు టయందు దృఢ సంకల్ప చిత్తులై యుండిరి.
వారు ఈ విధముగా సూర్యు నారాధించుట యందు అతిశయమగు ప్రయత్నమును చూచి “సుదాముడు” అను గంధర్వుడు అచటకు వచ్చి ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణులారా! భాను నారాదించుటయే మీ అభీష్ట మయినచో, దేని వలన అతడు ప్రసన్ను డగునో, అట్టి కార్యమును చేయుడు. కామ రూప మహా పర్వతమున సిద్దులచే సేవింప బడుచున్న “గురు విశాల” మను వనము నకు వెళ్లి, అక్కడ సావధాన చిత్తులై భాను నారాధింపుడు. అట్లు చేయుటచే మీ వాంఛితము సిద్దించును. ఇట్టి కార్యములకు సిద్ద క్షేత్రమే అధిక ఫలదాయకము.
ఓ ద్విజోత్తమా! బ్రాహ్మణ గణములు గంధర్వుడు చెప్పిన వచనములు విని ఆ వనమునకు వెళ్ళిరి. మరియు నచట భాస్కర భగవానుని పవిత్ర మందిరమును చూచిరి.
అప్పుడు బ్రాహ్మణులూ మొదలగు అన్ని వర్ణముల వారును ఆ ప్రదేశము నందు నియతాహారులై ఆలసింపక ధూప, పుష్పాదులచే భాస్కర దేవుని పూజించిరి. హే బ్రహ్మన్! అనులేపన, గంధ, పుష్ప, దీప, జప, హోమ, నైవేద్యాదులచే సావధాన చిత్తులై పూజించుచూ బ్రాహ్మణ గణాలు సూర్య దేవుని స్తుతింప సాగిరి.
“దేవ, దానవ, యక్ష, గ్రహము లందు అధికుడు, తేజస్వి యగు సూర్య దేవునకి మేము శరణా గతుల మైతిమి. ఎవడు ఆకాశము నందు స్థితుడై అన్ని దిక్కులను ప్రకాశింప చేయు చున్నాడో, మఱియు ఏ దేవేశ్వరుడు తన కిరణములచే వసుధను, అంతరిక్షమును వ్యాపింప చేయు చున్నాడో, ఎవడు భాస్కరుడు, సవిత, దివాకర, పుషా, ఆర్యమ, స్వర్భాను, దీప్త దీధితి,
యోగీశ్వరుడను పేర్లుచే పిలువబడు చున్నడో, ఎవడు నాలుగు యుగముల అంతము నందు దుర్నిరీక్ష్య కాలాగ్ని స్వరూపుడై యున్నడో, ఎవడు అనంత రక్త, పీత, శ్వేత కృష్ణుడై యున్నడో, ఎవడు ఋషులు యొక్క అగ్ని హోత్ర కాల మందు యజ్ఞ దేవాదిష్టితుడై యున్నాడో, ఎవడు అక్షరుడు, పరముడు గుహ్య స్వరూపుడు అయి ఉన్నడో. అత్యుత్తమ మోక్షమునకు ద్వార భూతు డగుచు బ్రహ్మ స్వరూపుడై యున్నాడో, ఎవడు త్రాటిచే బంధింప బడిన ఛందో రూపమగు అశ్వములచే ఆకాశ గామియై యున్నాడో, ఎవడు ఉదయాస్త గమనము లందు సుమేరు పర్వతమును ప్రదక్షిముణ చేయుట యందు సదా నియుక్తుడై యుండునో మరియు, ఎవడు మిధ్య, సత్యము, పుణ్య తీర్ధములు మొదలగు వేరు వేరుగా విశ్వ స్థితి స్వరూపుడై యున్నాడో, ఎవడు అదితి గర్భము నుండి ఉదయించి నాడో అట్టి అనంత, అచింత్య, ఆది దేవుడగు ప్రభాకరుని మేము ఆశ్రయించితిమి. ఎవడు బ్రహ్మయై యున్నాడో, ఎవడు విష్ణువై యున్నాడో, మఱియు ఎవడు ప్రజాపతి, వాయువు, ఆకాశము, జలము, పృథ్వి, సముద్రము, పర్వతములు,
చంద్ర, గ్రహ, నక్షత్రములు, వనస్పతులు, వృక్షములు, ఔషదులు మొదలగునవి ఎవని రూపమో ఎవడు వ్యక్తా వ్యక్త భూత సమూహములకు ధర్మాధర్మ ప్రవర్తకుడై యుండెనో. మరియు బ్రాహ్మీ, మాహేశ్వరీ, వైష్ణవీ అను భేదము వలన ఎవని స్వరూపము త్రివిధము లుగా నున్నదో, అట్టి భాస్కరుడు మాపై ప్రసన్నుడగును గాక. అన్ని పదార్దములు అనాది యగు ఏ జగత్ప్రభువు యొక్క ఒడిలో నున్నవో, ఎవడు జగత్తు యొక్క జీవన స్వరూపుడై యున్నడో. అట్టి భాస్కర భగవానుడు మా యడల ప్రసన్నత జూపును గాక. ఎవనికి అద్వితీయ ప్రకాశ ప్రభా మండల దుర్నిరీక్ష్యుడగు దివాకరుడు మరియు సౌమ్య సుధాకరుడు అను ఈ రెండు రూపము లున్నవో అట్టి భాస్కర దేవుడు మాపై ప్రసన్నత జూపును గాక. ఎవని యొక్క ఆ ప్రసిద్దము లగు రెండు రూపములతో ఈ అగ్నీ సోమ మయమగు విశ్వము నిర్మింప బడి యున్నదో, అట్టి భాస్కరుడు మాయందు ప్రసన్నుడగును గాక.
ఓ ద్విజోత్తమా! ఈ విధముగా వారు ఎప్పుడయితే అత్యంత భక్తి సహితులై మూడు మాసముల వరకు స్తవపాఠ పూర్వకముగా పూజించిరో, అప్పుడు భాస్కర భగవానుడు సంతుష్టు డయ్యెను. మఱియు దుర్నిరీక్ష్యు డైనను ఆయన స్వయముగా మండలము నుండి వెలుపలికి వచ్చి తన ఉదయ కాలీన మండల ప్రభచే వారికి దర్శన మిచ్చెను. అప్పుడా ప్రజలు ఆతని స్పష్టమగు రూపమును చూచి పులకితులై, భక్తి నమ్ర సహితులై అనాది యగు ఆ సవితకు నమస్కరించి యిట్లనిరి. ఓ సహస్రరశ్మీ! నీకు నమస్కారము. నీవే సమస్త భూతములకు కారణుడవు. మఱియు అఖిల జగత్తునకు పతాక స్వరూపుడవు. అఖిల యజ్ఞేశ్వరా! నీవే పూజ్యుడవు. నీవే అన్ని యజ్ఞములకు స్వరూపుడవు, యోగి పురుషులకు ధ్యాన విషయుడవు. నీవు మాపై ప్రసన్నత జూపుము.”
