మార్కండేయ మహా పురాణము
36 - యోగ నిరూపణము
యోగారూఢ పురుషులకు జ్ఞాన లాభముచే అజ్ఞానము యొక్క వియోగము కలుగును. అదియే “ముక్తి” అని చెప్పబడును. మరియు ప్రకృతి గుణముల యొక్క అనైక్యమే సాక్షాత్తు బ్రహ్మైక్యమని చెప్పబడు చున్నది. మహీపతే! యోగముచే మోక్షము, జ్ఞానముచే యోగము, మమతాసక్త చిత్తముచే దుఃఖము యొక్క ఆవిర్భావ మగు చున్నది. అందు వలన మోక్షము కోరు పురుషుడు ప్రయత్నా పూర్వకముగా దుస్సంగమును పరిత్యాగము చేయ వలెను. దుస్సాంగత్యమును పరి త్యాగము చేయుట చేత మమకారము తొలగి పోవును. మమతా రాహిత్యమే సుఖమునకు కారణము. వైరాగ్యముచే సంసారము యొక్క అసారమును, అనిత్యమును, తెలుసుకొన గలుగు చున్నాడు. జ్ఞానము వలన ఎట్లు వైరాగ్యము కలుగునో వైరాగ్యము చేత కూడా జ్ఞానము కలుగును. ఎచట నివసించునో అదియే గృహము. దేని చేత జీవించునో అదియే భోజనము. దేని వలన మోక్షము లభించునో అదే జ్ఞానము. దీని కంటే భిన్న మైనది, అజ్ఞానమని చెప్ప బడును.
పార్థివా! పుణ్య పాపముల యొక్క భోగముచే కామనా విహీనుడై నిత్య క్రియలను అనుష్టానము చేసిన పిమ్మట పూర్వో పార్జిత కర్మలు క్షయము అగును. మరియు అపూర్వ కర్మల యొక్క సంచయము లేనందున శరీర బంధనము లేకుండును. రాజా! ఈ విషయము నీకు వర్ణించితిని. ఇప్పుడు యోగమును గూర్చి చెప్పెదను వినుము. ఈ యోగ లాభము చేత శాశ్వతమగు బ్రహ్మత్వమును బొందును. అన్నిటి కంటె ముందుగా ఆత్మను ఆత్మచే జయించవలెను. ఆత్మ యోగులకు కూడ తెలియ శక్యము గానిది. ఆత్మను జయించుట యందు ప్రయత్నము చేయ వలెను. ఆ ఉపాయమును చెప్పెదను వినుము. ప్రాణాయామము లచే దోషములను, ధారణచే పాపములను, ప్రత్యాహారముచే విషయములను, ధ్యానముచే అనీశ్వర గుణములను దగ్ధము చేయ వలెను.
ఏ ప్రకారముగా అగ్ని హోత్రముచే పర్వత ధాతువుల మలమును దహించుటచే నిర్దోషత్వమును పొందు చున్నవో అట్లుగానే ప్రాణాయామముచే ఇంద్రియములచే చేయ బడిన సమస్త దోషములు దగ్ధము లగును. యోగ వేత్తయగు పురుషుడు ప్రథమముగా ప్రాణాయామమును సాధన చేయవలెను. ప్రాణము మరియు అపానము ఈ రెండు వాయువుల యొక్క నిరోధమే ప్రాణాయామమని చెప్పబడు చున్నది. ప్రాణాయామము లఘువు, మధ్యమము మరియు ఉత్తరీయము అని మూడు విధములు. అలర్కా! ఈ మూడు ప్రాణాయామముల యొక్క ప్రమాణము చెప్పు చున్నాను వినుము. లఘు ప్రాణాయామము ద్వాదశ మాత్రా కాలము. మధ్యమము దీనికి ద్విగుణము. (అనగా ఇరువది నాలుగు మాత్రలు) ఉత్తరీయము (ఉత్తమ ప్రాణాయామము) మధ్యమము కంటె త్రిగుణ మాత్రా యుక్తమని చెప్పబడు చున్నది. నిమేషము మరియు ఉన్మేషము ఈ రెంటి యొక్క సమయమును మాత్రా కాల మందురు. ఈ ప్రకారము పన్నెండు మాత్రల కాలమైనచో లఘు ప్రాణాయామము అగు చున్నది.
ప్రథమ ప్రాణాయామము వలన స్వేదము (చెమట), రెండవ దానిచే కంపము, మూడవ ప్రాణాయామముచే యదా క్రమముగా విషాదాది దోషములను జయించ వలసి యున్నది. సింహము, వ్యాఘ్రము, గజము, క్రమ శిక్షణచే సౌమ్యత్వమును ఎట్లు పొందు చున్నవో ఈ ప్రకారము గానే ప్రాణములు ప్రాణాయామము వలన యోగులకు వశములగు చున్నవి. మావటివాడు వశము చేసుకొనిన మదపు టేనుగును తన ఇచ్చాను సారముగా ఎట్లు నడిపించునో అట్లుగానే యోగి జనులు కూడా ప్రాణములను వశము చేసుకొనిన పిమ్మట తమ ఇచ్చాను సారముగా కార్యములను చేసుకొన గలుగు చున్నారు. క్రమ శిక్షణ కలిగిన సింహము మానవులను చంపక మృగములను చంపునో అట్లే ప్రాణ వాయువు యొక్క సాధనచే పాపములను నశింప చేసి శరీరమును నష్ట పరచకుండును. ఇందువలననే యోగులు సదా ప్రాణాయామ పరాయణులై యుందురు. ఆ ప్రాణాయామమునకు ముక్తి ఫలము నిచ్చునట్టి అవస్థా చతుష్టయము కలదు. ఇప్పుడు చెప్పెదను వినుము.
ప్రాణాయామము, ధ్వస్తి, ప్రాప్తి, సంవిత్ మరియు ప్రసాదము అని నాలుగు విధములుగా ఉన్నది. ఇప్పుడు క్రమానుసారముగా వీని స్వరూపములను వర్ణించెదను వినుము. ఏ అవస్థ యందు మంచి చెడుల సమస్త క్రియల యొక్క ఫలము క్షయ మగునో మరియు చిత్తము యొక్క మాలిన్యము తొలగి పోవునో దానిని “ధ్వస్తి” అని అందురు. యోగ పురుషులు నగువారు ఏ పరిస్థితిలో లోభ, మోహాత్మకమగు ఐహికము మరియు ముష్మికములైన సమస్త కోరికలను నిరంతరము స్వయముగా నిరోధించు చున్నారో, ఆ అవస్థను “ప్రాప్తి” అని అందురు. యోగి జనులు ఏ స్థితి యందు జ్ఞాన సంపత్తి వశముచే చంద్ర, సూర్య, గ్రహ, నక్షత్రములతో సమానమగు జ్ఞాన సంపత్తిని పొందుదురో, మరియు అతీత, అనాగత అంతర్ధాన దూరాస్థములగు సర్వ విషయములను తెలుసుకోన గలుగు చున్నారో ఆ స్థితిని “సంవిత్” అని అందురు.
ఎట్టి స్థితిలో యోగి యొక్క చిత్తము పంచ వాయువులు, ఇంద్రియములు, ఇంద్రియముల యొక్క విషయ సమూహములు శుద్ధి లాభము కలిగిన వగునో ఆ స్థితిని “ప్రసాదము” అని పలుకుదురు. మహీపాలా! ఇప్పుడు ప్రాణాయామ లక్షణము మరియు యోగారంభ మందు ఏ విధముగా ఆసనము విహితమో చెప్పెదను వినుము. పద్మాసనము, అర్థాసనము, స్వస్తికాసనము ఈ మొదలగు ఆసనములను అవలంభించి హృదయ మందు ప్రణవ మంత్రమును జపించుచు యోగమును అనుష్టించ వలెను. శుద్ధ భావముతో సమమయిన ఆసన మందు కూర్చొని రెండు పాదములను ముడుచు కొని నోటిని మూసుకొని, రెండు తొడలను బాగుగా అగ్ర భాగ మందు ఉండునటుల జేసి నిశ్చల మనస్సుతో ఈ విధముగా ఉండవలెను. ఆ సమయ మందు హస్తములతో లింగమును, అండ కోశమును స్పృశించ కూడదు. శిరస్సు కొంచెము పైకి ఎత్త వలెను. మరియు దంతములచే దంతములను తాక రాదు.
స పశ్య న్నాసికాగ్రం స్వం దిశశ్చా నవలోకయన్
రజసా తమసో వృత్తిం సత్త్వేన రజస స్తథా
సంచాద్య నిర్మలే సత్త్వే స్థితో యుంజీత యోగవిత్
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః ప్రాణాదీ న్మన ఏవ చ
నిగృహ్య సమవాయేన ప్రత్యాహార ముపక్రమేత్
యస్తు ప్రత్యాహరే త్కామా న్సర్వాఙ్గానీప కచ్చపః
సదాత్మరతి రేకస్థః పశ్యత్యాత్మాన మాత్మని
స బాహ్యాభ్య న్తరం శౌచం నిష్పాద్యా కంఠనాభితః
పూరయిత్వా బుధో దేహం ప్రత్యాహార ముపక్రమేత్
ప్రాణాయామా దశ ద్వౌ చ ధారణా సాభిదీయతే
మరియు తన దృష్టి నాసిక యొక్క అగ్ర భాగము నందే ఉంచ వలెను. ఎటు వైపును చూడరాదు. ఈ అవస్థ యందు యోగ పురుషుడు రజో గుణముచే తామస వృత్తిని నాశనము చేసి కేవలము నిర్మల తత్వ మందు స్థితి గల యోగాభ్యాస మందు నియుక్తుడు కావలెను. ఇంద్రియ విషయముల నుండి మరియు మనస్సు, ప్రాణాదికములను నిగ్రహించి, తాబేలు ఏ ప్రకారముగా తన సమస్త అవయవములను ముడుచు కొనునో, ఆ విధముగా ప్రత్యాహార మందు ప్రవృత్తుడు కావలెను. ఈ విధముగా కామ సమూహమును ప్రత్యాహార పూర్వకముగా కేవలము ఆత్మ యందే ఎల్లప్పుడు ఆసక్తుడై ఉండుట చేత ఆత్మ ద్వారా ఆత్మ యొక్క దర్శనము ప్రాప్తించును. విచక్షుణుడైన యోగి కంఠము నుండి నాభి దేశ పర్యంతము బాహ్య అభ్యంతరిక శుద్ధి విధాన పూర్వకముగా దేహమును పరిపూర్ణము చేసి ప్రత్యాహార సాధనము చేయ వలెను. ప్రాణాయామము పది విధములుగా నున్నది. ధారణ రెండు విధములుగా చెప్పబడు చున్నది.
తత్త్వ దర్శులగు యోగి జనులు యోగాభ్యాస మందు రెండు విధములుగ “ధారణ” ను నిర్దేశించిరి. నియతాత్ముడు యోగ సాధనము చేయుట వలన, యోగి యొక్క సమస్త దోషములు నశించు చున్నవి. సమస్త ప్రాకృత గుణములను వేరుగా పర బ్రహ్మ దర్శన లాభము కలుగు చున్నది. ఈ ప్రకారముగా ఆకాశాది పరమాణువులు మరియు విశుద్ధ ఆత్మ యొక్క సాక్షాత్కారము కలుగు చున్నది. ఇట్లు యోగి ఆహార నియమముతో ప్రాణాయామ మందు ఆసక్తి గల వాడైనచో మెల్ల మెల్లగా యోగ భూమిని జయించిన వాడై తన గృహముతో సమానముగా దాని యందు ఆరూఢు డగును. ఇట్లు భూమిని జయించినచో దాని ద్వారా కామాది దోషములు వ్యాధి సమూహము మరియు మోహ వృద్ధులు లభించును. అందు వలననే జయించని భూమిని ఆరోహించ రాదు. దేని ద్వారా పంచ ప్రాణములు నిగ్రహింప బడుచున్నవో దానిని ప్రాణాయామమని చెప్పుదురు.
దేని ద్వారా మనోధారణ కలుగు చున్నదో దానిని “ధారణ” అని చెప్పుదురు. మరియు నియతాత్ముడగు పురుషుడు ఏ అవస్థ యందు ఇంద్రియ సమూహమును శబ్దాది విషయముల నుండి ప్రత్యాహరణము చేయు చున్నాడో దానిని “ప్రత్యాహారము” అని చెప్పుదురు. యోగ సిద్ధులైన పురుషులు ఈ విషయములో ఏ ఉపాయము నిరూపించిరో, ఆ ఉపాయము వలన యోగి యొక్క శరీర మందు వ్యాధులు మొదలగునవి ఆక్రమించవు. జలమును కోరువాడు ఏ ప్రకారము యంత్రాదుల వలన నెమ్మదిగా జల పానము చేయునో యోగ పురుషుడు కూడా అట్లే శ్రమ లేకుండ వాయు పానము చేయ వలెను. మొదట నాభి యందు తరువాత హృదయ మందు మరల వక్షస్థల మందు, తిరిగి కంఠ మందు క్రమముగా నాసాగ్ర మందు, లోచన మందు భూమధ్య మందు మూర్ధ ప్రదేశ మందు చివరకు ఆ పర బ్రహ్మ యందు మనోధారణ చేయ వలెను. (అనగా ఆత్మ దర్శనము చేయ వలెను).
ధారణ పది విధాలుగా చెప్పబడు చున్నది. ఈ పది విధాల ధారణా సిద్ధి వలన బ్రహ్మ సారూప్య లాభము కలుగును. ఓ రాజేంద్రా! యోగ పురుషులు సిద్ధి లాభము కొరకు అధిక భాషణము, బాధతో కూడుకొన్న అలసట మరియు చిత్త చాంచల్యమును దూరము చేసుకొని ప్రయత్నా పూర్వకముగా యోగాభ్యాసమందు ప్రవృత్తు లవ వలెను. అతి శీతలము, అతి గ్రీష్మముల యందు మరియు అతి వేగముగా వీచు పవన మందు, ధ్యాన తత్పరుడై యోగాభ్యాసము చేయరాదు. సశబ్ద స్థానము నందు, అగ్ని మరియు జల సమీపము నందు ప్రాచీన గోశాల యందు, నాలుగు దారుల కూడలి యందు, ఎండిన ఆకులతో నిండిన ప్రదేశ మందు, నదీ తీర మందు, సర్పాదులతో నుండు ప్రదేశ మందు, నూతి ఒడ్డునందు, చైత్య వృక్ష మందు, మరియు పుట్టల సమూహముతో నుండు గుట్టల యందు, తత్త్వ విదుడైన పురుషుడు యోగాభ్యాసము చేయ కూడదు. సాత్త్విక భావము చక్కగా సిద్ధించని యెడల అనగా ఏ ప్రదేశము నందు సాత్త్విక మగు వస్తువులు లభింపవో ఆ దేశ కాలములను పరిత్యజించ వలెను.
మరియు యోగ మందు చెడు విషయములను చూచుట మంచిది కాదు. అందు వలన దానిని వర్ణింప వలెను. ఏ పురుషుడు మూర్ఖత్వమునకు వశుడై ఈ అన్ని స్థానములను చక్కగా విచారణ చేయక యోగాభ్యాసమును మూర్ఖముగా చేయునో, అతడి యందు అనేక దోషములు ఉత్పన్నమై అతని పనుల యందు విఘ్నములను కలుగ జేయును. అవి చెప్పెద వినుము. ఆ యోగికి చెవిటి తనము, జడత్త్వము మూగ తనము, స్మృతి లోపము, అంధత్వము మరియు తక్షణ జ్వరము కలుగును. ప్రమాదవశమున ఈ అన్ని దోషములు ఆవిర్భవించిన యెడల వాటి యొక్క శాంతి కొరకు ఏ విధముగా చికిత్స చేయవలయునో అది కూడా వినుము. బాగుగా వేడి చేసిన యవాగును స్నిగ్ధము చేసి భక్షణ పూర్వకము ఉదరము నందు ధారణ చేయ వలయును. వాతము, గుల్మము, మరియు అజీర్ణము మరియు ఉదర రోగములు శాంతించుటకు యవాగును తప్పక తినవలెను. దీనిని భక్షించుట వలన వాయువు మరియు వాయు గ్రంథి రోగములు కూడా నశించును. (యవాగు అనగా గంజి)
మరియు కంపనము కలుగు నపుడు మనస్సు నందు గొప్ప భారము అను పర్వతమును దరించ వలెను. అనగా మనస్సు చంచలమగు నప్పుడు ప్రళయ కాలమందు స్థిరముగా నుండు మహా శిఖరమును ధరించ వలెను. వాక్కు యొక్క శక్తి విలుప్తమై నప్పుడు వాక్కును దరించ వలెను. మరియు శ్రవణ శక్తి నష్టమై నపుడు, తృష్ణార్తుడగు పురుషుడు ఏ విధముగా రసనేంద్రియ లాభము కలుగుటకు ప్రయత్నించునో ఆ విధముగానే శ్రవణేంద్రియములను ధారణా చేయుచు నుండ వలెను. ఈ విధముగా ఏ ఏ దేహము నందు వ్యాధులు కలుగునో ఆయా దేహము లందు తగిన ఉపకరణములు చేయ వలెను. ఉష్ణ మందు శీతలమును గ్రహించ వలెను. మరియు శీతల మందు ఉష్ణము సహాయకారిగా ఉండ వలెను. శిర మందు సూక్ష్మ కీలకమును స్థాపనా పూర్వకముగా కాష్ఠముచే ఆ కీలక కాష్ఠమును తట్టినచో, స్మృతిలేని రోగికి వెంటనే స్మృతి యొక్క శక్తి కలుగును. లేక స్మృతి శక్తి విలుప్తమై నప్పుడు ఆకాశము, భూమి, వాయువు మరియు అగ్నిని ధరింప వలెను. అమానుష సత్త్వము వలన జనితమైన విఘ్న సమూహములకు చికిత్సలు ఈ విధముగా నిర్దిష్టమై యున్నవి. యోగుల హృదయ మందు అమానుష సత్త్వము కలిగినప్పుడు అతడు వాయువు మరియు అగ్ని యొక్క ధారణ చేయుట వలన దానిని దగ్ధము చేయును. ఓ రాజా! ఈ విధముగా సర్వాంతః కరణముతో శరీరము యొక్క రక్షణ చేయుట యోగి అయిన పురుషునకు ఉచితమై యున్నది.
ఎందువలన అనగా శరీరమే ధర్మ, అర్థ, కామ, మోక్షములను ఈ నాలుగు వర్గముల సాధనకు మూలము. ప్రవృత్తి స్వరూపము యొక్క వర్ణన, విస్మయము ఈ రెండు కారణముల వలననే యోగి యొక్క విజ్ఞానము నష్టమై పోవు చున్నది. అందుచేత ప్రవృత్తిని గుప్త రూపమున ఉంచ వలెను. అచంచలము, ఆరోగ్యము, అనిష్ఠురము, దేహము నందు సుగంధ ప్రసారము, మూత్రము మరియు పురీషము యొక్క అల్పము, కాంతి ప్రసాదము, మరియు మధుర స్వరము ఇవి అన్నియు యోగ ప్రవృత్తి యొక్క ప్రథమ చిహ్నములు. ఏ అవస్థ యందు మానవుడు అనురాగము చెంది పరోక్ష మందు అనగా వెనుక గుణములను తలచునో మరియు ఏ జీవికి భయ ప్రాప్తి కలుగదో, ఆ సమయము సిద్ధి యొక్క ఉత్తమ లక్షణమని తెలుసుకొన వలెను. అత్యధిక మగు ఉష్ణ, శీతల మందు ఎవరికి బాధ కలుగదో మరియు ఇతరుల వలన ఎవరికి భయము కలుగదో అతనికి సిద్ధి లాభము కలుగునని తెలిసి కొనుము.
