మార్కండేయ మహా పురాణము
1 - వపు శాప కథనము .
నర శ్రేష్టులగు నర నారాయణులను, సరస్వతీ దేవిని మరియు వేద వ్యాస మహా మునిని, నమస్కారము జేసి, యనంతరము “జయ” (జ = 8,య = 1) యను అక్షర సంఖ్యచే వాచ్యములగు పదునెనిమిది పురాణములను ప్రవచనము జేయ వలెను.
మార్కండేయ మహా మునికి నమస్కరించి జైమిని మహర్షి వ్యాస భారత మందలి సందేహముల గురించి ప్రశ్నించుట. ఒకానొక సమయమున వేద వ్యాస మహర్షి యొక్క శిష్యుడు, మహాతేజస్వి యగు జైమిని మహా ముని, సర్వదా తపస్సు యందు పారాయణమందే ఆసక్తుడగు మార్కండేయ మహా మునిని ఇట్లు ప్రశ్నించెను.
హే భగవాన్! మహాత్ముడగు వేద వ్యాస మహర్షి గ్రంథమును రచించెను. ఆ గ్రంథము నందు అనేక శాస్త్ర రహస్యములతో పూర్ణమై దోషరహితమై యోప్పారుచున్నది. ఆ మహా భారతము విశుద్ధ శబ్ధములచే, పరిపూర్ణములగు ఛందస్సుల చేతను, అలంకారముల చేతను గూడుకొని యున్నది. మరియు శ్రవణ సుఖ దాయకములగు మృదు మధుర శబ్దోప శోభితము పూర్వ పక్షములగు వాక్యములకు శాస్త్రీయములగు సిద్ధాంత వాక్యములచే పరినిష్ఠా సమన్వితమునై అలరారు చున్నది. దేవతలలో విష్ణుమూర్తి శ్రేష్ఠుడు. మానవులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. సర్వ భూషణములలో చూడామణి శ్రేష్టమైనది. సర్వ శాస్త్రములలో మహా భారతము శ్రేష్ఠము.
ఆయుధములలో వజ్రాయుధము, సర్వేంద్రియములలో మనస్సు ఎట్లు శ్రేష్టములో, సమస్త శాస్త్రములలో మహాభారతమట్లు సర్వోత్తముగా నున్నది. ఈ మహా భారతము నందు ధర్మ, అర్థ, కామ, మోక్షములు పరస్పర సంబంధములు గలవి గాను, మరియు ప్రత్యేకము గాను విశేష విషయములతో వర్ణింప బడినవి. ఇందు వలననే ఈ గ్రంథము ధర్మ శాస్త్ర, అర్థ శాస్త్ర, కామ శాస్త్ర, మోక్ష శాస్త్ర గ్రంథములలో ప్రధాన సాధనమగు శాస్త్ర గ్రంథముగాను, అత్యుత్తమ మైనదిగాను చెప్పబడినది. మహాభాగా! మహా బుద్దియగు వేదవ్యాస మహర్షిచే నాలుగాశ్రమముల ఆచారములు, వాటి స్థితులు, సాధనములు సంపూర్ణముగా విశేషముగా వర్ణింప బడినవి.
గురువర్యా! ఉదార స్వభావుడగు వేదవ్యాస మహర్షి ఈ మహా భారతమను మహా శాస్త్రమును మహా విస్తృతముగా రచించిననూ, ఏ స్థలము లందునూ పరస్పర విరోధ వాక్యములు లేవు. వ్యాస వాక్యములను జల ప్రవాహము వేదరూప పర్వతము నుండి బయలు వెడలి కుతర్క రూప వృక్షములను సమూలముగా పెకలించి వైచుచు ప్రవహించి భారత భూమిని దోష రహితముగా చేసినది.
కృష్ణాద్వైపాయన ప్రణీతము పంచమ వేద స్వరూపమునగు నీ మహా భారతమను మహాసరస్సు మధుర శబ్దములను, మహా హంసలు, మరియు మహా వ్యాఖ్యానములను, కమలములను కలిగి శోభాయ మానమై విస్తారమగు కథలు అను మహా జలముచే పరిపూర్ణమై యున్నది. హే భగవాన్! వేదార్థోపబృంహకము, (శృత్యర్థముల విపులీకరించు నదియు) నానా గూడార్థములు గలదియునగు మహా భారత నామకమగు మహాశాస్త్ర మందలి నిగూడము లైయున్న శాస్త్ర తత్వములను తెలిసికొను నిమిత్తమై నేను తమ వద్దకు వచ్చితిని. ప్రపంచము యొక్క సృష్టి స్తితి లయలను జేయు జనార్ధనుడు, వాసుదేవ పర బ్రహ్మము, నిర్గుణుడై యుండియు ఏ కారణమున సగుణుడై మనుష్యత్వము బొందెను? కృష్ణ యను పేరు గలదియు, ద్రుపద పుత్రియునగు ద్రౌపది పాండుపుత్రు లైదు గురికి ఒకేయొక పట్టమహిషి ఎట్లయ్యెను? ఈ విషయములో నాకు చాలా సందేహముగా నున్నది. హలాయుధుడు, మహాబలుడగు బలదేవుడు తీర్థ యాత్రలు జేయుచున్న సమయమున బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తము నెందు వలన జేసెను? మరియు పాండవ సహాయము గలవారు, మహారథులు, మహాత్ములునగు ద్రౌపదీ పుత్రులు దిక్కులేని వారై, అనాధులై,అవివాహితులై, చచ్చుటకు కారణమేమై యుండును? ఇవన్నియు తమరు నాకు సవిస్తరముగా తెలుప ప్రార్థించు చున్నాను. తమరు జ్ఞానము లేని వారికి జ్ఞానము గలుగ జేయు వారై యుందురు కదా!
యోగశాస్త్రోక్తా (నిద్రా, తంద్రా, భయ, క్రోధ, మోహ, మద, ఉన్మాద, ప్రమాద, విస్మయ, సందేహ, లోభ, అసూయ, మాత్సర్య, కపటతా, మిథ్యా, నాస్తికతా, ఆగమా దర్శిత, ఆశిక్షా - ఇవి యోగ శాస్త్ర మందు చెప్ప బడిన అష్టాదశ (18) దోషములు), అష్టాదశ దోష రహితుడు, మహా మునియునగు మార్కండేయుడు జైమిని మహర్షి యొక్క ఈ మాటలను విని చెప్పుటకు నుపక్రమించెను. మార్కండేయు డిట్లనియెను. ముని సత్తమ! నాకు సంద్యా వందనాది క్రియా కలాపమునకు సమయమైనది. నీవడిగిన యీ ప్రశ్నలకు సవిస్తరముగా సమాధానము జెప్పుటకీ కాలము ప్రశస్తముగా లేదు. జైమినీ! నీకు గలిగిన సందేహములు ఏవైతే గలవో, వాటిని పక్షులు చెప్పగలవు. నీకు సంశయములు లేకుండా జేయగలవు. పింగాక్షుడు, విభోదుడు, సుపుత్రుడు, సుముఖుడు అను నామములు గల ఈ నలుగురు ద్రోణ మహర్షి యను ఒక ముని శ్రేష్టుని కుమారులు. వారెల్ల వేళలా శాస్త్ర చింతనము జేయు చుందురు. శాస్త్ర తత్వములను బాగుగా ఎరిగిన వారు. పక్షి జన్మ నందిన ఈ నలుగురు వింధ్య పర్వత కందర మధ్య మందున్నారు. వారికి వేద శాస్త్రార్థములలో విశేష జ్ఞానము గలదు. వారి నుపాసించి, నీ సందేహముల నడుగుము. జ్ఞాన నిష్టుడగు మార్కండేయు డిట్లు పలికిన పలుకులను విని, ఋషి శ్రేష్టుడగు జైమిని విస్మయోత్పుల్ల లోచనుడై ఆశ్చర్యముతో నిట్లనియె.
జైమిని:
బ్రహ్మణ్యుడా! మనుష్యుడు మాటలాడు విధమున పక్షులు బలుకునను నీ కథనము అత్యంత మద్భుతముగా నున్నది. ఇంతేగాక ఆ పక్షు లత్యంత విజ్ఞానము గలవగుట అంత కంటే ఆశ్చర్యమును గలుగ జేయు చున్నది. తిర్యగ్యోని యందు జన్మించినచో వాటికి జ్ఞానమెట్లు గలిగెను? ద్రోణ కుమారులగు వారిని పక్షులని చెప్పు చున్నారేమి? గుణవంతులు, మహాత్ములునగు వారికి ధర్మ జ్ఞాన మెట్లు గలిగినది? ఇట్టి పుత్ర చతుష్టయము యొక్క తండ్రిగా ప్రసిద్ధుడైన యా ద్రోణమహర్షి ఎవరు?
జైమినీ! పూర్వము నందన వనమున నారదుడు, దేవేంద్రుడు, అప్సరస స్త్రీలు సమావేశమైన సమయము నందు జరిగిన వృత్తాంతమును జెప్పెదను. సావదానుడవై వినుము. ఒకసారి నందన వనమున నారదుడు అప్సర స్త్రీల మధ్య యుండి యప్సర స్త్రీ ముఖాసక్త లోచనుడై యున్న దేవరాజగు ఇంద్రుని చూచెను. శచీ భర్తయగు దేవేంద్రుడు మహర్షి శ్రేష్టుడగు నారదుని చూసినంతనే తన ఆసనము నుండి దిగ్గున లేచెను. అత్యంతాదరముతో తన ఆసన మిచ్చెను. ఇంద్రుడు లేచి తన ఆసనమిచ్చి గౌరవించుట చూసిన యా దేవాంగనలు గూడ వందనములు చేసిరి. మరియు వినయ విధేయతలు గలవారై తలలు వంచుకొని నిలిచి యుండిరి.
ఆ స్త్రీలచే నిట్లభ్యర్చితుడైన యనంతరము శత క్రతువులు చేసిన ఇంద్రుడు గూడ గూర్చొనిన పిమ్మట, నారదుడప్పుడు యధా యోగ్యముగా పరస్పరము మనోహరములగు సంభాషణా విశేషములతో కాలక్షేపము జరిపెను. ఇట్లన్యోన్య సంభాషణలు జరిగెను. అనంతరము ప్రసంగా మధ్యమమున ఇంద్రుడు నారదునితో నిట్లనియె.
నారదా! ఈ అప్సరసలలో తమకు నచ్చిన దానిని నృత్యము చేయ వలసినదిగా ఆజ్ఞను యిమ్ము. రంభ, కర్కశ, ఊర్వశి, తిలోత్తమ, ఘ్రుతాచి, మేనక వీరిలో తమ అభీష్టము ననుసరించి యాజ్ఞ యివ్వ గోరెదను. ద్విజ శ్రేష్టుడగు నారదుడు దేవేంద్రుని యీ మాట విని కొంచ మాలోచించి వినయా వనతులై నిల్చోని యున్న యా స్త్రీలను జూచి ఇట్లనెను. అచ్చరలారా! మీలో రూపౌదార్య గుణములచే నదికులమని తలచినవారు నా ముందట నృత్యము జేయుదురు గాక. గుణరూప విహీనురాలికి నాట్య సిద్ది లేదు. హావ, భావ, కటాక్ష, విక్షేపాది యుక్త నృత్యమే నృత్య మనిపించు కొనును. అట్లు లేని నృత్యము వ్యర్థము. (ఆడంబరము).
ఇట్లు నారదుడను చున్న సమయముననే వారు రూప గుణాదులలో నేనెక్కువ నీవు కాదని పరస్పరము వాదించు కొన సాగిరి. భగవానుడగు దేవేంద్రుడు వారిట్లు వాదించు కొనుట గాంచి, మీరు నారదుని యడుగుడు. నారదుడు మీలో రూప గుణాధికు లెవరో యామెను జెప్పును. జైమినీ! అప్పుడా యచ్చరలు దేవేంద్రుని అనుమతిని నారదుని యడిగిరి. అట్లడిగిన వారిని జూచి యేమనెనో జెప్పెద వినుము. దేవాంగనలారా! ఒక పర్వతము నందు దుర్వాస మహర్షి తపస్సు జేయు చున్నాడు. ఆయన నెవరు మోహింప జేయ గలరో, ఆమె గుణాదికురాలిగా నిర్ణయము. ఆ నారదుని యా మాటలు విని యా స్త్రీ లందరూ వణక సాగిరి.ఈ కార్యము అశక్యమని జెప్పుకొను చుండిరి. అప్పుడు వారలలో యనేక మహర్షుల తపోభంగము జేసిన గర్వముతో, ‘వపువు’ అను నామె నేను దుర్వాసుడున్న చోటికి వెళ్లి యాతని తపోభంగము జేయుదుననియే. నేనిప్పుడే కామబాణ ప్రహారముచే మనస్సనే పగ్గమును చేదించి, ఇంద్రియములనే గుఱ్ఱములను యధేచ్చగా విహరించు నట్లు జేసెదను. దేహరూప రథమునకు, బుద్ధియను సారథిని లేకుండ జేసెదను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనైనా ఇప్పుడు నేను నిస్సందేహముగా కామబాణ పీడితుల జేసెదను. ఇట్లు పలికి యనంతరమా వపువు ముని తపః ప్రభావముచే శ్వాపదాశ్రమము గల హిమాలయమునకు బోయెను.
అప్సర శ్రేష్టురాలగు వపువు దుర్వాసుని ఆశ్రమమునకు క్రోశేడు దూరము నుండి పుంస్కోకిల మాదుర్యముతో పాడ సాగెను. మునివరుడగు దుర్వాసుడు ఆ గానము విని విస్మయము జెందెను. కోకిల కంఠము, మనోహర ముఖ సౌందర్యము గలదియునగు ఆమె ఉన్న చోటికి బోయెను. ముని సర్వాంగ సుందరియగు నామెను గాంచి, తన తపో భంగమునకు వచ్చినదిగా తెలిసికొని పట్టరాని కోపము గలవా డయ్యెను. అనంతరము ఆ మహా తపస్వియగు దుర్వాసుడామెతో నిట్లనియె: ఓసీ ఖేచరీ! మదోన్మత్తురాలా! దుఃఖార్జితమగు నా యీతపస్సును విఘ్నము జేయుటకు నాకు కష్టము కలిగించుటకు వచ్చితివి. దుష్టబుద్ది గలదానా! మత్ క్రోధ కలుషీక్రుతురాలవై పదునారు సంవత్సర పర్యంతము గరుత్మంతుని వంశములో జన్మ బొందెదవు గాక. అథమాప్సరా! నీ నిజ రూపము వదిలి పక్షి రూప దారిణివై నల్వురు పుత్రులను బడసెదవు గాక. నీవు పుత్ర ప్రేమను పొందకనే బాణముచే కొట్టబడి పవిత్రురాలవై తిరిగి స్వర్గమునకు పోయెదవుగాక. మారు మాటాడక పొమ్ము. ఇట్లు బ్రాహ్మణ శ్రేష్టుడగు దుర్వాస మహర్షి క్రోధముచే ఎర్రబడిన నేత్రములతో చలించు చున్న (చంచలములు) (మనోరమ్యములు) కర కంకణములు ధరించి యున్న వపువును గూర్చి సహించ రాని ఇట్టి శాపమును వినిపించి భూలోకమును వదిలి, తరళ తర తరంగ విలసితము, ప్రథిత గుణ గనౌఘమునగు ఆకాశ గంగా తీరమునకు బోయెను.
