1 - గరుడ పురాణము - ఆచార కాండము
198 - 199 - త్రిపుర భైరవి, జ్వాలాముఖి దేవ్యాదుల పూజావిధి
త్రిపుర లేదా త్రిపురాభైరవిని యథావిధి ఓం హ్రీం ఆగచ్ఛదేవి అనే మంత్రముతో ఆవాహన చేసి ఐం హ్రీం హ్రీం అనే మంత్రమునుచ్చరిస్తూ లేఖను గీసి ఓంప్రీం క్లోదిని భం నమః అనే మంత్రాన్ని జపిస్తూ దేవికి ప్రణామం చెయ్యాలి. తరువాత మహాప్రేతాసనంపై శక్తులతో సహా కొలువు తీరిన త్రిపురాభైరవీ దేవిని విధ్యుక్తంగా పూజించాలి.
ఐం హ్రీం త్రిపురాయై నమః
అనే మంత్రాన్నుచ్చరిస్తూ దేవి యొక్క పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ణ్వాది ముఖాలకు నమస్కారం చెయ్యాలి.
ఓం హ్రీం పాశాయనమః క్రీం అంకుశాయనమః, ఐం కపాలాయ నమః ఇత్యాది మంత్రాలతో ఆమె ఆయుధాలకు నమస్కారం చేయాలి. త్రిపురభైరవి పూజలో భాగంగా ఎనమండుగురు భైరవులనూ వారితో బాటుగా మాతృకలనూ కూడా పూజించాలి.
అసితాంగ, గురు, చండ, క్రోధ, ఉన్మత్త, కపాలి, భీషణ, సంహారులను ఎన మండుగురూ భైరవులు కాగా బ్రహ్మాణి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, అపరాజిత (దుర్గ)లను వారలు ఎనమండుగురూ మాతృకలు.
భైరవులనూ మాతృకలనూ ఒకరిద్దరిని ఒకే మంత్రంలో ఒక్కొక్క దిక్కు వైపు ఆవాహన చేయాలి.
ఓం కామరూపాయ అసితాంగాయ భైరవాయనమో బ్రహ్మాణ్యే అనే మంత్రంతో తూర్పుదిక్కులో అసితాంగ భైరవునీ బ్రహ్మాజీ దేవినీ అవాహన పూర్వకంగా పూజించాలి.
అలాగే ఓం స్కందాయనమః రురు భైరవాయనమః, మాహేశ్వర్యై నమః అను మంత్రాల ద్వారా స్కంద, రురు భైరవ, మాహేశ్వరీలను దక్షిణంలోనూ ఓం చండాయనమః, కౌమార్యైనమః అనే మంత్రాలతో చండభైరవునీ, కౌమారీ దేవినీ పడమటి దిక్కులోనూ
ఓం ఉల్కాయనమః ఓం క్రోధాయనమః, ఓం వైష్ణవ్యై నమః అనే మంత్రాలతో ఉల్క క్రోధ, వైష్ణవీలను ఉత్తర దిక్కులోనూ..
ఓం అఘోరాయనమః ఓం ఉన్మత్త భైరవాయనమః, ఓం వారాహ్యైనమః అనే మంత్రాలతోర అఘోర, ఉన్మత్త, వారాహీంను ఆగ్నేయంలోనూ......
ఓం సారాయ కపాలినే భైరవాయ నమః, ఓం మాహేంద్ర్యై నమః అనే మంత్రాలతో సమస్త సంసారానికీ సారభూతుడైన కపాలీ భైరవునీ మాహేంద్రీ మాతనూ నైరృత్య దిశలోనూ...
ఓం జాలంధరాయనమః, ఓం భీషణాయ భైరవాయనమః, ఓం చాముండాయై నమః అనే మంత్రాలతో జాలంధర, భీషణభైరవ, చాముండలను వాయవ్యం లోనూ.......
ఓం వటుకాయనమః, ఓం సంహారాయనమః, ఓం చండికాయై నమః అనే మంత్రాలతో వటుక, సంహార, చండికలను ఈశాన్యంలోనూ ఆవాహన చేసి పూజించాలి *
(*అష్టమాతృకలలో అపరాజిత (దుర్గ) పేరు కనిపిస్తోంది. మంత్రాలలో మాత్రం ఆపేరుతో కాకుండా ఆ దేవిని చండికానామ జపంతో ఆవాహన చేయాలని తెలుస్తున్నది.)
తదనంతరం సాధకుడు రతీదేవిని, ప్రీతీదేవినీ, కామదేవునీ, ఆయన పంచ బాణాలనూ పూజించాలి. ఈ విధంగా మొక్కవోని దీక్షతో ఎల్లవేళలా ధ్యానం, పూజ జప, హోమాలను చేసిన సాధకునికి దేవి పలుకుతుంది. నిత్యక్లిన్న, త్రిపుర భైరవి, జ్వాలాముఖి అను దేవీ రూపాలు సమస్తవ్యాధి వినాశకాలు.
జ్వాలాముఖీ దేవిని ఇలా పూజించాలి. ముందుగా పద్మ మండలాన్ని వెలయించి దాని బాహ్య దళాల్లో క్రమంగా నిత్య, అరుణ, మదనాతుర, మహామోహ, ప్రకృతి, మహేంద్రాణి, కలనాకర్షిణీ, భారతి, బ్రహ్మాజీ, మాహేశ్, కౌమారీ, వైష్ణవీ, వారాహి, మాహేంద్రీ, చాముండ, అపరాజిత, విజయ, అజిత, మోహిని, త్వరిత, స్తంభినీ, జృంభిణీ, కలికాదేవీలను పూజించాలి. తరువాత పద్మమధ్యంలో జ్వాలాముఖిని యథావిధిగా పూజించడం ద్వారా అన్ని విషాలనూ, సర్వదోషాలనూ దూరంగా పారద్రోలవచ్చు.
చాముండీ యంత్రం ద్వారా ప్రశ్నకర్తకు శుభాశుభ పరిజ్ఞానం కలుగుతుంది. ఈ పూజలను స్వయంగా భైరవుడే ఉపదేశించాడు.
