1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

27 - విషదూరక మంత్రం

ఋషులారా!

 ఇప్పుడు మీకు సర్పాది విషజంతువుల వల్ల కలిగే కష్టాలను తొలగించే మంత్రాన్నుపదేశిస్తాను వినండి.

‘ఓం కణిచికీణి కక్వాణీ చర్వాణీ

భూతహరిణి ఫణి విషిణి విరథ

నారాయణి ఉమే దహదహ హస్తే

చండేరౌద్రే మాహేశ్వరి మహాముఖి

జ్వాలాముఖి శంకుకర్ణి శుకముండే

శత్రుం హనహన సర్వనాశిని స్వేదయ

సర్వాంగశోణితం తన్నిరీక్షసి మనసాదేవి

సమ్మోహయ సమ్మోహయ రుద్రస్య

హృదయే జాతా రుద్రస్య హృదయే స్థితా ।

రుద్రో రౌద్రేణ రూపేణ త్వం దేవి రక్ష రక్ష

మాం హ్రూం మాం హ్రూం ఫ ఫ ఫ ఠఠ

స్కందమేఖలా బాలగ్రహ శత్రు విషహారీ

ఓం శాలే మాలే హర హర విషోంకార

రహి విషవేగే హాంహం శవరిహుం

శవరి ఆ కౌలవేగేశే సర్వే వించమేఘమాలే

సర్వనాగాది విషహరణం।’

ఈ మంత్రాన్ని ప్రయోగిస్తున్నపుడు దీని భావాన్నే మనసు నిండా అమ్మ స్వరూపంతో సహా నిలుపుకుంటూ వుండాలి. దీని భావం ఇది :

‘అమ్మా ఉమాదేవీ! నీవు రుద్రుని హృదయం నుండి పుట్టి అక్కడే నివసించగలిగిన పరాశక్తివి. నీది రౌద్రరూపము. నీ ముఖం జ్వాల వలె జాజ్వల్యమానం. నీ కటికి వున్న ఘంటికారవం దుష్టశక్తుల పాలిటి శరాఘాతం. అందుకే దానిని క్షుద్ర ఘంటిక అంటారు. నీవు భూతప్రియమైనా విషసర్పాలకే విషరూపిణివి. విరథనారాయణిగా, శుకముండగా పిలువబడే నీవు దుష్టశక్తుల పాలిటి విశాల, భయంకరముఖివి; ప్రచండ స్వభావురాలివి. నీ చెవి కుండల శంకువుల కాంతులే వాటిని నయన విహీనులను గావిస్తాయి. చేతి నుండి జ్వలన శక్తిని పుట్టించి మా శత్రువులను కాల్చివేయి. కాల్చివేయి. విషనాశినివైన ఓ దేవీ! ఈ నరుని (లేదా నారి)లో వ్యాపించిన విషప్రభావాన్ని నశింపజేయి. ఆ విష జంతువును సమ్మోహితంగా గావించు, సమ్మోహితం గావించు. దేవీ మమ్ము రక్షించు, రక్షించు’ అనుకుంటూ మంత్రాన్ని మరల చదివి దేవిని మరల ప్రార్థించి హ్రూం మాం హ్రూం ఫఫఫఠఠ అనే బీజాక్షరాలను పలుకుతుండాలి. తరువాత హంహాం శవరిహుం అని కూడా ఉచ్చరిస్తూ రోగి శరీరాన్ని స్పృజించాలి. ఇలా రోగికి స్పృహవచ్చేదాకా మంత్ర పఠన, భావచింతన, బీజాక్షరోచ్చాటన, శవర్యుచ్చారణ చేస్తుండాలి.