1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

16, 17 -  విష్ణుధ్యానం - సూర్యార్చన

“శంఖ చక్రగదాధారీ! భగవాన్ శ్రీహరీ! మేమంతా దేవదేవేశ్వరుడు, శుద్ధ రూపుడు, పరమాత్మయగు విష్ణుదేవులు మీరేనన్న జ్ఞానాన్ని పొందియున్నాము. విష్ణు సహస్రనామాలను వీని పరమానంద భరితులమైనాము. విష్ణు ధ్యానవర్ణనను విని ధన్యులము కాగోరుచున్నాము అన్నాడు కాలకంఠుడు.

చెప్పసాగాడు ఖగవాహనుడు.

“జ్ఞానరూపుడు, అనంతుడు సర్వవ్యాపి, అజన్ముడు, అవ్యయుడునగు హరియే సర్వ దుఃఖాలనూ హరిస్తాడు. ఆయన అవినాశి, సర్వత్రగామి, నిత్యుడు, అద్వితీయ బ్రహ్మ సంపూర్ణ సంసారానికి మూలకారణం, సమస్త చరాచర జగత్పాలకుడైన పరమేశ్వరుడు ఆయనే సంపూర్ణ జగత్తుకు ఆధారం అయనే అయినా, స్వయంగా నిరాధారుడు.

పరమాత్మ ప్రాపంచిక ఆసక్తులకు అతీతుడు, నిర్ముక్తుడు. ముక్తయోగులకు ధ్యేయమైనవాడు. మీరడిగిన ధ్యాన వర్ణనను సూర్యపూజతో మొదలుపెడతాను. ఒకప్పుడిది భృగుమహర్షికి బోధింపబడింది.

ఓం ఖఖోల్కాయ నమః - ఇది

సూర్య భగవానుని మూలమంత్రం. సాధకునికి భోగాన్నీ మోక్షాన్నీ ప్రసాదించే మంత్రమిది. సూర్యదేవుని ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసం చేసి ఆయనను పూజించాలి.

ఓం ఖఖోల్కాయ త్రిదశాయ నమః ।

ఓం విచిఠఠ శిరసే నమః ।

ఓంజ్ఞానినేఠఠ శిఖాయై నమః ।

ఓం సహస్రరశ్మయేఠఠ కవచాయ నమః ।

ఓం సర్వతేజోధిఽపతయే ఠఠ అస్త్రాయ నమః ।

ఓం జ్వల జ్వల ప్రజ్వలప్రజ్వల ఠఠ నమః ।

            సాధకుని యొక్క సర్వపాపాలనూ నశింపజేసే ఈ సూర్యమంత్రాలను అగ్నిప్రాకార మంత్రాలని కూడా అంటారు.

సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికీ సూర్యగాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చును. ఆ మంత్రాలను జపించిన తరువాత సూర్య మరియు గాయత్రి మంత్రాలను సకలీకరణం చేయాలి.

ఓం ఆదిత్యాయ విద్మహే,

విశ్వభావాయ ధీమహి,

తన్నః సూర్యః ప్రచోదయాత్ ॥

తరువాత సాధకుడు దిక్కుల్లో మూలల్లో వాటి అధిపతుల నూహించుకొని వారికి ఈ మంత్రాలను చదువుతూ నమస్కరించాలి.

ఓం ధర్మాత్మనే నమః, తూర్పు

ఓం యమాయ నమః, దక్షిణం

ఓం దండనాయకాయ నమః, పశ్చిమం

ఓం దైవతాయ నమః, ఉత్తరం

ఓం శ్యామపింగలాయ నమః, ఈశాన్యం

ఓం దీక్షితాయ నమః, అగ్ని కోణం

ఓం వజ్రపాణయే నమః, నైరృత్యం

ఓం భూర్భువః స్వః నమః, వాయుకోణం

మహేశా!  ఆ తరువాత సాధకుడు చంద్రాదిగ్రహాలను కూడా తూర్పు దిక్కుతో మొదలుపెట్టి క్రమంగా ఈశాన్యం దాకా తిరుగుతూ ఈ క్రింది మంత్రాలు చదువుతూ నమస్కారహీతంగా పూజించాలి.

ఓం చంద్రాయ నక్షత్రాధిపతయే నమః ।

ఓం అంగారకాయ క్షితిసుతాయ నమః ।

ఓం బుధాయ సోమ సుతాయ నమః ।

ఓం వాగీశ్వరాయ సర్వవిద్యాధిపతయే నమః ।

ఓం శుక్రాయ మహర్షయే భృగుసుతాయ నమః ।

ఓం శనైశ్చరాయ సూర్యాత్మ జాయ నమః ।

ఓం రాహవే నమః ।

ఓం కేతవే నమః ।

 అనంతరం ఈ క్రింది మంత్రాలతో సూర్యదేవుని పూజించి అర్ఘ్యాది ప్రదానానికై ఆవాహన చేయాలి.

ఓం అనూరుకాయ నమః ।

ఓం ప్రమథనాథాయ నమః ।

ఓం బుధాయ నమః ।

ఓం భగవన్నపరిమిత మయూఖమాలిన్ సకల జగత్పతే సప్తాశ్వవాహన చతుర్భుజ పరమసిద్ది ప్రద విస్పులింగ పింగలతత్ ఏహ్యేహి ఇదమర్ఘ్యం మమ శిరసిగతం గృహ్ణ గృహ్ణ గృహ్ణ తేజోగ్రరూపం అనగ్న జ్వలజ్వల ఠఠ నమః”

ఆవాహన తరువాత

ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్ర కిరణాయ గచ్ఛసుఖం పునరాగమనాయ

 అనే మంత్రాలతో విసర్జనం చేయాలి.

హరి ఇంకా ఇలా చెప్పాడు, “రుద్ర దేవా! సూర్య పూజన విధానాన్ని ఒకప్పుడు కుబేరునికి చెప్పాను. ఇపుడు మీకు వినిపిస్తున్నాను.

సూర్యుని పూజించడానికి ముందు సాధకుడు ఏకాగ్రచిత్తుడై ఒక పవిత్ర స్థానంలో కర్ణికాయుక్తమైన అష్టదళ కమలాన్ని నిర్మించాలి. అప్పుడు సూర్యదేవుని ఆవాహనం చేయాలి. తరువాత భూమిపై నిర్మితమైన కమలదళాల మధ్యలో ఖఖోల్కభగవానుడైన సూర్యయంత్రాన్ని ఆయన పరికరాలతో సహా స్థాపించి స్నానం చేయించాలి.

ఆ తరువాత ఆగ్నేయంలో సాధకుని ఇష్టదైన హృదయాన్ని స్థాపించాలి. ఈశాన్యంలో శిరస్సునీ, నైరృత్యంలో శిఖనీ విన్యాసం చెయ్యాలి (అంటే పెట్టాలి). మరల ఏకాగ్రచిత్తంతో తూర్పు వైపు ధర్మాన్నీ, వాయవ్యంలో నేత్రాలనూ, పశ్చిమ దిశలో తన ఇష్టదైవం యొక్క అస్త్రాలనూ వుంచాలి.

 మరల ఈశాన్యంలో చంద్రునీ, తూర్పున మంగళునీ, ఆగ్నేయంలో బుధునీ, దక్షిణ దిశలో బృహస్పతినీ, నైరృతిలో శుక్రునీ, పడమటి దెసలో శనినీ, వ్యాయవ్యంలో కేతువునీ ఉత్తర దిక్కులో రాహువునీ స్థాపించి పూజించాలి.

ద్వాదశాదిత్యులను అనగా భగ, సూర్య, అర్యమ, మిత్ర, వరుణ, సవిత, ధాతా, వివస్వాన్, త్వష్ట, పూష, ఇంద్ర, విష్ణు - అను సూర్యుని పన్నెండు రూపాలనూ రెండవ వరుసలో పెట్టి పూజించాలి.

తరువాత పూర్వాది దిశలలో నున్న ఇంద్రాదులను అర్చించి, జయ, విజయ, జయంతి, అపరాజిత అను శక్తులనూ వాసుకీ, శేషాదినాగులనూ కూడా పూజించాలి. ఇది సూర్య పూజావిధానం.”