1 - గరుడ పురాణము - ఆచార కాండము
12- పూజానుక్రమ - నిరూపణం
రుద్రదేవా! ఏ పూజకైనా ఒక క్రమ విధానముంటుంది. దానిని వివరిస్తాను వినండి. సాధకుడు ముందుగా ఓం నమః మంత్రంతో పరమాత్మను స్మరించాలి. తరువాత యం రం వం లమ్ అనే బీజాక్షరాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకొని భగవానుడు చతుర్భుజుడునైన విష్ణువుని తనలోనే ఊహించుకోవాలి.
తరువాత కరన్యాస, దేహన్యాసాలను చేసుకొని ఈ క్రింది మంత్రాల ద్వారా హృదయంలోనే యోగపీఠాన్ని పూజించాలి.
ముందుగా నొక కమలాన్ని స్థాపించి అందులోని భాగాలలో దేవతల నూహించుకొని ఈ మంత్రాలను పఠించాలి.
ఓం అనంతాయ నమః । ఓం వహ్ని మండలాయ నమః ।
ఓం ధర్మాయ నమః । ఓం విమలాయై నమః ।
ఓం జ్ఞానాయ నమః । ఓం ఉత్కర్షిణ్యై నమః ।
ఓం వైరాగ్యాయ నమః । ఓం జ్ఞానాయై నమః ।
ఓం ఐశ్వర్యాయ నమః । ఓం క్రియాయై నమః ।
ఓం అధర్మాయ నమః । ఓం యోగాయై నమః ।
ఓం అజ్ఞానాయ నమః । ఓం ప్రహ్వ్యై నమః ।
ఓం అవైరాగ్యాయ నమః । ఓం సత్యాయై నమః ।
ఓం అనైశ్వర్యాయ నమః । ఓం ఈశానాయై నమః ।
ఓం పద్మాయ నమః । ఓం సర్వతోముఖ్యై నమః ।
ఓం ఆదిత్య మండలాయ నమః । ఓ సాంగోపాంగాయ హరేరాసనాయ నమః ।
ఓం చంద్ర మండలాయ నమః ।
తరువాత సాధకుడు కర్ణిక మధ్యలో అం వాసుదేవాయ నమః అంటూ వాసు దేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్రాలతో హృదయాది న్యాసం చేయాలి.
ఆం హృదయాయ నమః ।
ఈం శిరసే నమః ।
ఊం శిఖాయై నమః ।
ఐం కవచాయ నమః ।
ఔం నేత్రత్రయాయ నమః ।
అః ఫట్ అస్త్రాయ నమః ।
తరువాత ఈ క్రింది మంత్రాలతో సంకర్షణాది వ్యూహదేవులకు నమస్కారం చేయాలి.
ఆం సంకర్షణాయ నమః ।
అం ప్రద్యుమ్నాయ నమః ।
అః అనిరుద్దాయనమః ।
ఓం అః నారాయణాయ నమః ।
ఓం తత్సద్ బ్రహ్మణే నమః
ఓం హుం విష్ణవే నమః ।
క్రైం నరసింహాయ నమః ।
భూర్వరాహాయ నమః ।
పిమ్మట స్వామి వారి పరివారాన్నీ ఆయుధాలనూ ఇలా కొలుచుకోవాలి.
కం టం జం శం వైనతేయాయ నమః ।
జం ఖం వం సుదర్శనాయ నమః ।
ఖం చం ఫం షం గదాయై నమః ।
వం లం మం క్షం పాంచజన్యాయ నమః ।
ఘం భం భం హం శ్రీయై నమః ।
గం డం వం శం పుష్యై నమః ।
ధం వం వనమాలాయై నమః ।
దం శం శ్రీ వత్సాయ నమః ।
ఛం డం యం కౌస్తుభాయ నమః ।
శం శారంగాయ నమః ।
ఇం ఇషుధిభ్యాం నమః ।
చం చర్మణే నమః ।
ఖం ఖడ్గాయ నమః ।
అనంతరం ఈ క్రింది బీజాక్షర సహిత మంత్రాలతో ఇంద్రాది దిక్పాలకులకు నమస్కారం చేయాలి. ప్రతి మంత్రానికీ ముందు ‘ఓం’ కారాన్ని ఉచ్చరించాలి.
లం ఇంద్రాయ సురాధిపతయే నమః ।
రం అగ్నయే తేజ్యోధిపతయే నమః ।
యమాయ ధర్మాధిపతయే నమః ।
క్షం నైరృతాయ రక్షో ధిపతయే నమః ।
వం వరుణాయ జలాధిపతయే నమః ।
యోం వాయవే ప్రాణాధిపతయే నమః ।
ధాం ధనదాయ ధనాధిపతయే నమః ।
హాం ఈశానాయ విద్యాధిపతయే నమః ।
తరువాత దిక్పాలుర క్రమంలోనే వారి ఆయుధాలను కూడా ఈ క్రింది పద్ధతిలో జపించాలి.
ఓం వజ్రాయనమః । ఓం శక్యై నమః ।
ఓం దండాయ నమః । ఓం ఖడ్గాయ నమః ।
ఓం పాశాయ నమః । ఓం ధ్వజాయ నమః ।
ఓం గదాయై నమః । ఓం త్రిశూలాయ నమః ।
పిమ్మట అనంతునికీ, బ్రహ్మ దేవునికీ ఈ మంత్రాలతో ప్రణామం చేయాలి.
ఓం లం అనంతాయ పాతాళాధిపతయే నమః ।
ఓం ఖం బ్రహ్మణే సర్వలోకాధిపతయే నమః ।
అనంతరం సాధకుడు వాసుదేవ భగవానునికి నమస్కరించడానికి ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రయోగించాలి. దానితో బాటే పన్నెండక్షరాల బీజయుక్త శబ్దాలనూ, దశాక్షర మంత్రంలోని పదక్షరాల) ఓజయుక్త శబ్దాలనూ జపించాలి. ఇలా :
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ।
ఓం ఓం నమః । ఓం నం నమః ।ఓం మాం నమః ।
ఓం ఓం భం నమః । ఓం గం నమః । ఓం వం నమః ।
ఓం తే నమః । ఓం వం నమః । ఓం సుం నమః ।
ఓం దేం నమః ।ఓం వాం నమః । ఓం యం నమః ।
ఓం ఓం నమః ।ఓం నం నమః । ఓం మోం నమః ।
ఓం నాం నమః । ఓం రాం నమః । ఓం యం నమః ।
ఓం ణాం నమః । ఓం యం నమః ।
ద్వాదశాక్షర మంత్రం - ఓం నమోభగవతే వాసుదేవాయ
దశాక్షర మంత్రం - ఓం నమో నారాయణాయ నమః
అష్టాక్షర మంత్రం - ఓం పురుషోత్తమాయ నమః ।
ఈ మూడు మంత్రాలను వీలైనంతగా జపించి ఈ క్రింది మంత్రంతో పుండరీకాక్ష భగవానునికి నమస్కారం చేయాలి.
నమస్తే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన ।
సుబ్రహ్మణ్య నమస్తేఽస్తు మహాపురుష పూర్వజ ॥
ఈ విధంగా విష్ణుదేవుని స్తుతించి అప్పుడు హవనం చేయాలి. తరువాత మహా పురుష వీర్యానామక మంత్రాన్ని పద్ధతి ప్రకారం నూటయేనీమిది మార్లు జపించాలి. తదనంతరం జితంతేనతో మొదలగు మహాపురుష విద్యాస్తోత్రాన్ని జప, అర్ఘ్యముల తరువాత పఠించి నారాయణునికి పలుమార్లు ప్రణామం చేయాలి.
తరువాత అగ్నిదేవుని స్థాపించి పూజించి హవనం చేయాలి. విష్ణు దేవునికీ, అచ్యుతాది ఆంగిక దేవతలకీ బీజాక్షర యుక్త మంత్రాలతో ఆహుతులివ్వాలి. మనస్సులోనే సాంగోపాంగంగా బ్రహ్మదేవునీ ఇతర దేవతలను పూజించుకొని వారందరినీ మండలంలో స్థాపించాలి. అప్పుడు వాసుదేవ మంత్రంతో నూట యెనిమిది ఆహుతులివ్వాలి. తరువాత సంకర్షణాది ఆరుగురు అంగదేవతలకు మూడేసి ఆహుతులనూ, దిక్పాలకుల కొక్కొక్క ఆహుతినీ ప్రదానం చేయాలి. హవనం పూర్తయినాక ఏకాగ్ర చిత్తంతో పూర్ణాహుతి నివ్వాలి.
తరువాత మన మనోవాక్కాయ కర్మలకు అతీతుడైన పరమాత్మతో సాధకుడు ఆత్మను లీనం చేస్తున్నట్లుగా భావించుకొని దేవతలందరికీ ఈ మంత్రం ద్వారా వీడ్కోలు చెప్పాలి.
గచ్ఛ గచ్ఛ పరంస్థానం యత్రదేవో నిరంజనః ।
గచ్ఛంతు దేవతాః సర్వాః స్వస్థానస్థితహేతవే ॥
దేవతలారా! సుదర్శన, శ్రీహరి, అచ్యుత, త్రివిక్రమ, చతుర్భుజ, వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, పురుష - ఈ దేవ సమూహాన్నే నవవ్యూహమంటారు. పరమాత్మను కలుపుకుంటే దశాత్మకమవుతుంది. అలాకాకుండా అనిరుద్ధునీ, అనంతునీ కలుపుకుంటే ఇదే ఏకాదశ వ్యూహమవుతుంది. నవవ్యూహానికీ పరమతత్త్వాన్నీ, అనిరుద్ధునీ, అనంతునీ కలుపుకుంటే అది ద్వాదశాత్మక వ్యూహంగా చెప్పబడుతుంది.
చక్రాంకిత మంత్రాలను చదివి వాటిని అనగా చక్రరూపాలను ఈ విధంగా బీజాక్షరాలతో పూజించాలి.
ఓం చక్రాయ స్వాహా । ఓం విచక్రాయ స్వాహా ।
ఓం సుచక్రాయ స్వాహా । ఓం మహాచక్రాయ స్వాహా ।
ఓం అసురాంత కృత్ హుం ఫట్ । ఓం హుం సహస్రార హుం ఫట్ ।
గృహాన్ని సంరక్షించే పై మంత్రాలతో చేసే పూజకు ‘ద్వారకా చక్రపూజ’ అని పేరు. ఇది సర్వమంగళదాయిని”.
