1 - గరుడ పురాణము - ఆచార కాండము
133 - 135 - కొన్ని నవమి వ్రతాలు - ఋష్యేకాదశి
చైత్రమాసంలో పునర్వసు నక్షత్రయుక్త శుద్ధ అష్టమిని అశోకాష్టమి అంటారు. ఈ రోజు ఎనిమిది అశోకమంజరి మొగ్గలను కషాయం తీసి త్రాగాలి. అలా త్రాగుతున్నపుడీ శ్లోకం ద్వారా శివప్రియమైన ఆ దేవతను ప్రతి శోక విముక్తికై ప్రార్ధించాలి.
త్వామ శోక హరాభీష్ట మధుమాస సముద్భవ ।
పిబామి శోక సంతప్తా మామశోకం సదాకురు ॥
మంత్రయుక్తమైనదేదైనా గొప్పగా పనిచేస్తుంది.
మహానవమి : ఆశ్వయుజ శుద్ధంలో ఉత్తరాషాఢ నక్షత్రమూ, అష్టమీ కలిసిన నవమిని మహానవమి అంటారు. ఈ తిథిలో చేయు స్నానదానాదులకు అక్షయ ఫలాలుం టాయి. కేవల నవమి వున్నా (ఆశ్వయుజ శుద్ధంలో) దుర్గాపూజ చేయాలి. భగవంతు డైన శివుడే ఇతర దేవతలతో బాటు ఈ వ్రతాన్ని చేశాడు. ఇది అత్యంత, అత్యధిక, పుణ్యప్రదమైన మహావ్రతము. శత్రువులపై విజయాన్ని కోరుకునే రాజు నుండీ జీవన సమరంలో, ఆకలిపోరాటంలో గెలుపు కావాలనే సామాన్యుడి దాకా ఈ వ్రతాన్ని చేస్తారు; చెయ్యాలి. జప - హోమాల తరువాత కుమారీలకు భోజనం పెట్టాలి. ఈ వ్రతంలో దేవీ పూజనాది కృత్యాలలో ప్రయుక్తం కావలసిన మూల మంత్రం ఇది.
ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహా
ఈ వ్రతాన్ని చేయువారు ముందుగా అష్టమినాడే కట్టెలతో దేవికి తొమ్మిదిగాని ఒకటిగాని మండపాలను నిర్మించాలి. అందులో దేవి యొక్క బంగారు లేదా వెండి మూర్తిని స్థాపించాలి. దేవి మూర్తిని పుస్తకం, శూలం, ఖడ్గం లేదా పట్టు వస్త్రంలతో పూజించాలి. వాటిని చుట్టూ వుంచాలి. అమె యొక్క పదునెనిమిది చేతులలోనూ ఎడమవైపున్న వాటిలో కపాలం, వేటకొడవలి, గంట, అద్దం, విల్లు, ధ్వజం, డమరుకం, పాశం వుండాలి. ఒక చేయి చూపుడు వేలు మనవైపు కాకుండా పైకీ చూపుతూ వుండాలి. కుడివైపున్న హస్తాలలో శక్తీ, ముద్గరం, శూలం, వజ్రాయుధం, కత్తి, అంకుశం, బాణం, చక్రం, శలాకాయుధం అమర్చబడాలి. ఇతర దేవీ విగ్రహాలకు పదహారు చేతులే వుంటాయి. డమరుకం వుండదు.
మహానవమి నాడు ఉగ్ర చండాదేనికీ ప్రాధాన్యమొక్కువ. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, అతి చండిక లను ఎనమండుగురు దేవీమతల్లుల మధ్య అగ్ని ప్రభలతో వెలిగిపోతూ నిలచి వుంటుంది. ఉగ్రచండాదేవి మిగతా దేవీ మణుల వర్ణాలు క్రమంగా గోచన, అరుణ, కృష్ణ, నీల, ధూమ్ర, శుక్ల, పీత, పాండురములు కాగా ఉగ్రచండాదేవి నాలుకలు చాస్తున్న అగ్నిజ్వాలల రంగులో వుంటుంది. అమె సింహంపై స్థితమై వుండగా నామె కెదురుగా కత్తి పట్టుకొని మహిషాసురుడుంటాడు. దేవి తన యొక్క ఒక చేతిలో వాని జుట్టు పట్టుకుని వుంటుంది. ఇదీ అమ్మ ఆకారం.
ఈ భగవతి చండీని మూల మంత్రంతో జపించేవానికే బాధలూ వుండవు. పైగా పండితుడు కూడా కాగలడు. ఎందుకంటే అది విద్యామంత్రం కూడ. దేవి విగ్రహంలోని ఖడ్గం త్రిశూలం పది హేనేసి అంగుళాలుండాలి. గర్భగుడి (లేదా మండపం) నాలుగు కోణాల్లో నైరృత్యాదిగా ఆ మహాదేవి యొక్క ఉగ్రశకులైన * పూతన, పాపరాక్షసి, చరకి, విదారికల ప్రతిమలను పెట్టి వారిని కూడా పూజించాలి.
(*ఈ పూతన శ్రీ కృష్ణావతారంలో కనిపించే ఫూతన కాదు. ఈమె ద్వాపర యుగానికి ముందే వున్న మహాశక్తి.)
రాజులు శత్రు సంహారాన్ని గాని ఇతర విజయాలను గాని సంకల్పించి నపుడు మహానిష్ఠగా ఈ మహానవమీ పూజలను చేస్తుంటారు. వారు దీనితోబాటు చేయవలసిన విశేషపూజనమొకటున్నది. అదేమనగా బ్రహ్మాజీ, మహేశీ, కౌమారీ, వైష్ణవీ, వారాహ్యాది మాతృకలకు పాలతో స్నానాదులను చేయించి మహాదేవికీ రథయాత్రను జరిపించుట. వాగీ కోరికలన్నీ ఫలిస్తాయి.
ఆశ్వయుజ శుద్ధనవమి నాడు ఏకభుక్తముండి దేవినీ, బ్రాహ్మణునీ పూజించి ఒక లక్ష బీజమంత్ర జపాన్ని చేయాలి. దీనిని వీరనవమి వ్రతమంటారు. చైత్ర శుద్ధనవమినాడు దమనక పుష్పాలతో దేవిని పూజిస్తే అయురారోగ్యైశ్వర్యములతో బాటు శత్రుంజయత్వం కూడా సిద్ధిస్తుంది. దీనిని దమనక నవమివ్రత మంటారు.
ఈ మాసంలోనే శుద్ధ దశమి నాడు ఏకభుక్త వ్రతాన్ని ప్రారంభించిఅలాఒక యేడాది పాటు చేసి చివర పదిగోవులను దానమిచ్చి దిక్పాలకులకు బంగారుఒడ్డాణమును నివేదించు కున్నవారికి బ్రహ్మాండాధిపత్యమే సిద్ధిస్తుంది. ఈ వ్రతానికి దిగ్గశమివ్రత మని పేరు.
ఈ ఏకాదశినాడూ, చైత్ర ఏకాదశినాడూ ఋషులను పూజించే వ్రతాలున్నవి. అవే ఋష్యైకాదశి వ్రతాలు. దమనక పుష్పాలతోనూ, వాటితోనే కట్టబడిన దండలతోనూ మరీచి, అత్రి, అంగిర, పులస్త్య, పులహ, క్రతు, ప్రచేత, వసిష్ఠ, భృగు, నారద మహరులను భక్తి మీరగా పూజిస్తే ‘ఇక్కడ’ అన్ని భోగాలతో బాటు జ్ఞానం కూడా కలిగి దేహాంతంలో ‘అక్కడ’ ఋషిలోక నివాస ప్రాప్తి వుంటుంది.
