విష్ణు మహా పురాణము

2 - కలియుగ ధర్మసూక్ష్మ ప్రశంస

ఈ కలియుగ విశేష ప్రసంగములో మహాజ్ఞాని వ్యాసుడు పలికిన పలుకులు వినుము. మునులు తొల్లి యేకాల మందు అల్ప ధర్మమేని మహాఫల మిచ్చును. దేనిచే జీవులకు మహా సుఖము కల్గునన దాన మునులకు పూజ్యగోష్టి జరిగి వారు వేదవ్యాసుని ప్రశ్నింపగా గంగా జలముల నున్న యాయనను సగము స్నానము చేసినవాని నడిగిరి. స్నానము పూర్తియగు దాక తీరమందు చెట్ల క్రింద నిరీక్షించుచు కూర్చుండిరి. నా కుమారుడు వ్యాసుడు నీట మునిగి లేచి శూద్రుడు సాధువు అనుమాట వారు వినుచుండ నా మీద నతడు నీట మునుగక శూద్రా! బాగుబాగు ధన్యుడ వైనావని నీతి నుండి లేచి పలికెను. అవ్వల మరియొక సారి మునిగి లేచి యమ్మహా ముని స్త్రీలు ధన్యులు బాగుబాగు వారికంటే మరి ధన్యత లెవ్వరున్నారనియే? ఆ మీద యథావిధి స్నానము చేసి యనుష్టానము చేసికొన్న నా కొడుకును మునులు వందనములు చేసి యాసనము పై కూర్చున్న తరువాత మీరెందులకు వచ్చినారని సాత్యవతేయుడు వారిని ప్రశ్నించెను?

మాకు గల్గిన సందేహము నడుగ వచ్చితిమి. అది యట్లుండగనిమ్ము. మరియొకటి అడిగెదము తెల్పుము. కలి బాగు, శూద్రుడు బాగు, స్త్రీ బాగుబాగు. వారు ధన్యులని మరిమరి పల్కినావది యెల్ల గుహ్యము కాదేని వివరముగ వినగోరెద మదియానతిమ్ము. ఆ మీద మా హృదయ మందున్న మారాక ప్రయోజనము నడిగెదము. అన వ్యాస భగవానుడు నవ్వి మునివరులారా! వినుండు. బాగుబాగు అని నేనన్నదాని యభిప్రాయమిది

త్రేతా యుగమందు పదేండ్లు చేసిన పుణ్యము కలిలో నొక్కయేడొనరించిన జాలును. ద్వాపర మందు ఒక్క నెల రోజులు సేసిన పుణ్యము కలిలో ఒక్క అహోరాత్రము ఆచరించిన జాలును. జపతపో బ్రహ్మచర్యాదుల ఫలమిట్లు ఫలించును. అందుచే కలి బాగు అంటిని. కృత యుగమున ధ్యానము చేసి త్రేతా యుగమున యజించి ద్వాపరమున నర్చించి యే ఫలము వడయునో యది కలి యందు విష్ణువును సంకీర్తనము సేసి పడయును. ఈ కలిలో పురుషుడు అల్పశ్రమ చేతనే ధర్మోత్కర్షను బొందును. అందుచేత నేను కలియుగ విషయమున సంతుష్టిం జెందెద. బ్రాహ్మణులు వృథా కథలు, వృథా భోజనము, వృథా యజ్ఞాచరణము సేసి పతితులగుదురు. కావున వారు మంచి నియమములు నిష్ఠ గలవారుగా నుండ వలయును.

ఆయనుష్ఠానము అన్ని వస్తువుల యందు సరిగా జేయని యెడల దోషము సంక్రమించును. తినదగినది త్రావదగినది ఈ కలిలో వీరికి స్వేచ్చాను సారము చేయబడును. అన్ని పనుల యందు వారికి పరాధీనత తప్పదు. కావున నట్టివారు ఎన్నో క్లేశములు పడి యుత్తమ లోకములం గెలుతురు. బ్రాహ్మణ సేవ చేతనే శూద్రుడు పాక యజ్ఞాధికారము వడసి పుణ్య లోకముల సాధించును. కావున శూద్రుడు ధన్యుడన్నాను. స్వధర్మమునకు విరోధము గల్గకుండ మానవులు సంపాదించిన ధనమును సత్పాత్రములకీ వలెను. యథావిధి యజింప వలెను. అట్టి ధన సంపాదనములో క్లేశము. దానిని రక్షించుకొనుటలో మహా క్లేశము. అట్లే దాని వినియోగములో గూడ ఇంకెంతో తెలియ వచ్చును. అట్లనేక క్లేశములు పడి ప్రజాపత్యాది నిజ లోకములను మానవులు జయింతురు. పతి సేవ చేసి త్రికరణ శుద్ధిగ భర్తహితము కోరి అతిక్లేశపడి పురుషుడు సంపాదించు లోకము లెల్ల సులభముగ అతనితో స్త్రీ పొందును. అందుచే స్త్రీ బాగుబాగు! అని మూడవ వచనము పల్కితిని. ఇందులకై వచ్చిన వారు కావున మీకిది తెల్పితిని. ఇంకేమి కోరెద రడుగుడు తెల్పెదను.

అని వ్యాసుడు ఋషులు ఇంకను నడుగ వలసిన ప్రశ్నములకు బ్రత్యుత్తర మిందులోనే నీవు తెల్పితి వనిరి. అంతట కృష్ణ ద్వైపాయనుడు నవ్వి, ఆశ్చర్యముచే విప్పారిన నవయవములు గల వారినిం గని ఈ మీ ప్రశ్నము దివ్యదృష్టితో నేను గ్రహించితిని. అందుచేతనే ప్రసంగ మాత్రమున బాగుబాగు అంటిని. కలిలో స్వర్గ మాత్ర ప్రయత్నము చేతనే ధర్మము సిద్ధించును. తమ సద్గుణములను జలములచే నెల్ల పాపములను బ్రక్షాళనము చేసికొన్న మానవుల కిది కలిలోనే సాధ్యము. శూద్రులు గూడ ద్విజ శుశ్రూషాపరులై స్త్రీ పతి శుశ్రూష చేసి ధన్యులగుదురు కావున నేనీ ముగ్గురును నత్యంత ధన్యులని తలంతును. కృతాది యుగము లందు ధర్మ సంపాదన మందు ద్విజాదులకు చాల శ్రమ యున్నది. మీరడుగ కుండనే మీ యభిప్రాయము గ్రహించి నేనిది తెల్పితిని. మఱియేమి సేయుమందురు? అనిన వారు వ్యాసుని బూజించి కొనియాడిరి. వ్యాస వచనము లందు నిశ్చయము గొని వచ్చిన దారిని మునులు చనిరి. నీకీ రహస్యమును దెల్పితిని. అత్యంత దుష్టుడైన కలికిగల గుణమిదొక్కటే. కృష్ణ కీర్తన మాత్రమున నరుడు బంధముక్తుడై పరమందును. నీవడిగిన జగమ్ముల ఉపసంహార వృత్తాంతమును అవాంతర ప్రాకృతిక ప్రళయమున గూర్చి యీపై నీకు దెల్పెదను.