విష్ణు మహా పురాణము

32 - ఉషా పరిణయ ప్రసంగము

మైత్రేయ! రుక్మిణి సంతానము ప్రద్యుమ్నుడు మొదలుగా నెఱింగించితిని. సత్యభామ భౌమ భౌమేరికాదులం గాంచెను. దీప్తిమంతుడు తామ్రపక్షుడు మున్నగు వారు రోహిణీ కుమారులు. జాంబవతికి సాంబుడు మొదలగు వీరులు హరి వలన గల్గిరి. నాగ్నజితి కుమారులు భద్రవిందాదులు శూరులు. హరికి శైబ్యయందు సంగ్రామజిత్తు మొదలయిన వారు గల్గిరి. మాద్రికి వృకాదులు లక్ష్మణకు గాత్రవంతుడు మున్నగువారు పుట్టిరి. కాలింది తనయులు శ్రుతుడు మున్నగు వారు మరియుం గల భార్యలందు హరికి ఎనుబదివేల నూరుగురు కుమారులు గల్గిరి. వారిలో ప్రద్యుమ్నుడందఱకుం బెద్ద, అతని కనిరుద్దుడు అతనికి వజ్రుడుం గలిగె. అనిరుద్దుడు యుద్దమున నేరికింగట్టు వడనివాడు. అతడు బాణాసురుని కూతురగు ఉషను బెండ్లాడెను. అప్పుడే హరి హరులకు బెద్ద ఘోర యుద్దము జరిగెను. చక్రి యందు బాణుని వేయి చేతులను ఖండించెను.

హరిహర సమారా వృత్తాంతము విస్తరముగ నానతిమ్ము

బాణుని కూతురు ఉషాదేవి శంభునితో పార్వతి క్రీడించుట గని యట్టి విలాసముపై తాను నుబలాట పడెను. అన్ని చిత్తములం గ్రహింప గలది కావున

చాలుచాలు, పెద్ద పరితాప పడకుము. నీవును నీ మగనితో రమింతు వనెను.

అంతట నుష ఇప్పుడు? నా మగడెవ్వ డగును? అని ప్రశ్నించెను. పార్వతి వైశాఖ శుక్ల ద్వాదశినాడు నిన్ను కలలో నెవడు గలియునో అతడు నీమగడగు ననియె. అన్నట్లుగ నుషకు స్వప్నమందారేయి యోకానొకడు దన్ను బొందినట్లు కల వచ్చెను. ఆమెయు నాతని యెడ ననురక్త యయ్యెను. ఆపై మేల్కొని యా కనిన వానింగానక సిగ్గు విడిచి ఏడి? యేడి? ఎటు వోయెనని నెచ్చెలి నడిగెను. బాణుని మంత్రి కుంభాండుడు. ఆతని కుమార్తె చిత్రలేఖ. ఆమె ఉషాదేవి చెలి.

సఖీ! నీవన్న యా పురుషు డెవ్వడే యనెను. ఉష సిగ్గున జెప్పకున్న నామెం బలురీతుల బ్రతిమాలి నమ్మిక గూర్చి యడిగినంత నామె స్వప్నమందొక సుందరుడు దన్ను గలియుట నెఱింగించెను. మఱియు నా రమణునిం బొందు నుపాయ మొనరింపు మనియె.

అంతట చిత్రలేఖ ఇది తెలియుట యేమి చాల కష్టము. తెలిసిన నతని పొందుట యంతకంటెను నశక్యము అయిన నాకు గూర్చు దానవు గావున కొంచె ముపకారము సేయుదును. ఏడెనిమిది నాళ్లోపిక పట్టుము. అని యంతపురము లోనికి కేగి యయ్యుపాయము నొనరించెను. ఒక వస్త్రము నందు సురలు దైత్యులు గంధర్వులు మనుష్యులు ప్రదానులగు సుందరులు కొందరిని జిత్రించి చూపించెను. వారందరి చిత్రములం ద్రోసిరాజని యుష మనుష్యులలో నందును వృష్ణ్యంధక కుటుంబముల లోని యువక సుందరులపై సుందరి చూపు వెట్టెను. బలరామ కృష్ణ మూర్తులం జూచి యువరాణి సిగ్గున నిశ్చేష్ట యట్లయ్యెను. ప్రద్యుమునిం దర్శించిన తఱి లజ్జకొని వేఱొక వంకకు జూపు మరల్చెను. ఆ మీద ప్రద్యుమ్న తనయుం గాంతునిం గనినంత మాత్రనత్యంత విలాస చకితమైన చూపున నా లజ్జనెటు నెత్తెనో కాని ఆతడే యీతడని యన్నదే తడవుగ నా చిత్రలేఖ యోగశక్తి గలది బాణకుమారి నుశం గని యిట్లనియె

ఈతడు కృష్ణుని పౌత్రుడు. గౌరీదేవి నీకు భర్తగా బ్రసాదించిన వాడు. అనిరుద్దుడను పేరందిన వాడు. అందగాడు. యీతని నీవు భర్తగా బడయుదు వేని సర్వముం బడసి నట్లే. కృష్ణ పాలన మందున్నది ద్వారకా పురమది మున్ను దుష్ప్రవేశము. అయిన ప్రయత్నించి నెచ్చెలీ నీ భర్తం గొనితెత్తును. ఈ రహస్య మెవ్వరికిం జెప్పవలదు. చిటికలో గొని వచ్చెద. నా యెడబాటించుక సైరింపు మని యుషను నెమ్మది పరచి చిత్రలేఖ ద్వారవతి కేగెను.