గోవిందునిట్లు తలంచుచునయ్యాదవుడు వచ్చి శిరసువంచి అక్రూరుడను నేనని స్వామి చరణములను నమక్షరించెను. అతడును ధ్వజ వజ్ర పద్మరేఖంకితమయిన హస్తముచే దాకి దగ్గర కాకర్షించుకొని ప్రీతితో గాఢముగ గౌగాలించు కొనెను. అతని వందనము లందుకొని బలరామ కృష్ణు లానందించుచు నతనింజేకొని తమ మందిరముం జొచ్చిరి. అయ్యెడ నక్రూరుడు వారితో లోనికేగి వారికి నమస్కరించి వారితో సగౌరవముగ విందారగించి వారికి దాను వచ్చిన పని నిట్లు దెలిపెను. దుష్ట దానవుడు కంసుడు వాసుదేవుని దేవకీ దేవిని బెదరించుట వాడుగ్రసేనునితో దూర్వృత్తితోనుండుట యతనిని విడిచి వేయుట మొదలగున దెల్లం దెలుప భగవంతుడు విని యదెల్ల నేనెఱుంగుదును. మహాభాగా! యిందేనేమి సేయవలయును నది సేసెదను. ఇది యింకొక రీతిగ నివాలోచింపకుము. కంసుడు నాచే విహతుడైనట్లే యెరుంగుము. నేనును, బలరాముడును నీతోగూడ రేపు మధురకు వెళ్ళుదము. గోపా వృద్దులును నుపాయనము లెన్నో కొని వెళ్ళుదురు. ఓ వీరాగ్రేసరా! ఈ రేయిక్కడ గడుపుము. మనసున జింతింపకుము. మూడు రాత్రులలోగా నేను సపరివారుని గంసుని సంహరింతును అనెను.
గోపకుల కెళ్ళి ప్రయాణమని యాదేశించి యక్రూరుడు కృష్ణుడు బలరాముడును నందగోపునింట నిదురించిరి. అవ్వల వేకువ వెలుగు వచ్చినంత కృష్ణ బలరాములు అక్రూరునితో మథురకేగ సన్నద్దులైరి. గోపీజన మదిచూచి కంటనీరు గ్రుక్కికొని కరకంకణములు జార కృశించి కుమిలి నిట్టూర్పులు వుచ్చుచు నొండొరు లిట్లనుకొనిరి. 'గోవిందుడు మథురా నగరమున కేగి యిక గోకులమున కేల తిరిగివచ్చును?’ ఇక నాగరిక సుందరుల మధురములగు పలుకు దేనియాల వీనుల గ్రోలగలడు. నెఱజాణలు మథురాపురీ విలాసినుల శృంగార వాక్యపానము లందు రుచిమరగిన వీనిచిత్తము మఱల నీమన పల్లెటూరి ముద్దియలవై పేటలు మఱలును? సర్వ గోకులమునకు సారమైన హరిని హరించి కొనిపోవు నాపాడు దైవము దయమాలి గోపా సుందరుల యెడ అపకారము చేసినాడు. నర్మగర్భమున నల్లన నవ్వుచుం బలుకు పలుకులు ఆ యొయ్యారము కులుకు నడకలు ఆ నగర కాంతల వాల్చూపులను మఱగి యీ బేల యీ పల్లెటూరి పిల్లడే యుక్తిచే మీపజ్జకు వచ్చును? అక్రూరుండట, కాదీతడు క్రూరుండు. నిర్దయుడు. వీనిచే బెలుపడి యిడుగో! ఇదే యీతడు రథమెక్కి మథురకుం జనుచున్నాడు. ఈ నృశంసుడు (ఘాతకుడు) ఈ జనము వీనిపై నెక్కడలేని మొహముం గొని యున్నదని యెఱుగడా? మన కన్నుల పండువును హరి నీతడొండెడ గొంపోవు చున్నాడు. ఇతడో పరమ నిర్దయుడు. గోవిందుడు బలరామునితో రథమెక్కి వేల్లుచున్నాడు. వీని నాపుటకు త్వరపడుడు! పెద్దల సన్నిధిలో చెప్పుట మనకు తగదందురా? విరహాగ్ని దగ్ధులమైన మనలను పెద్దలు మాత్రమేమి సేయగలరు? అదిగాక నందగోపుడు మున్నగా నిదేవీరు పయనమగు చున్నారు. ఒక్కడును గోవిందుని మరలింప పూనుకొనడే! ఈ రేయి మథురా నగర భామినులకు సుప్రభాతము. వారి చూపుం దుమ్మెదల పంక్తు లచ్యుతుని నెమ్మోము దామరలం ద్రావనున్నవి. స్వామి యిట నుండి మథురకుం జనుచుండ నేవ్వరిచే గాని నివారింప బడక వారితో పోవుచు వారిని గాంచుచు నేమ్మేను పులకరించు వారు ధన్యలు. స్వామి ప్రత్యంగ సౌకుమార్య సౌందర్యముం దిలకించు మథురాపురీ పౌర నయనముల కిప్పుడు మహోత్సవము గానున్నది. కనుదమ్ములు విచ్చి గాంతులు విస్తరింప నెవ్వరి యడ్డు లేకుండ నీ గోపా సుందరుల దర్శింప నా భాగ్యవతు లేమి మంచి కలలు గన్నారో కదా! గోపీజనమున కీపెన్నిధిం జూపించి చూపోపమింగాబోలు కరుణమాలి యవ్విది యిప్పుడు కన్నులు పెరికినాడు (విరహము చేత మఱియొక వస్తువును చూచు నిచ్ఛలేక పోవుతచేత కళ్ళు లేనట్లే). శైథిలయము నందుచున్న హరియొక్క ప్రేమతో బాటు మా ముంజేతి ముఱుగులును వెంటనే వాడులగు చున్నవి (హరి విరహముచే కృశించితిమి). అక్రూరుడు నిజముగా క్రూర హృదయుడు. గుర్రములను దొందఱగ దోలుచున్నాడు. ఇట్లు బాధపడు నబలల యెడ నెవ్వనికి జాలి కలుగదు? ఇదిగో కృష్ణ రథము. ధూళి యెత్తుగ రేగినం చూడుడు. అదికూడా కనబడుట లేదు. హరి దూర మరిగి నాడు. అని ఇట్లు హార్దాముగ గోపీజనము నిరీక్షింప హరి బలరామునితో వ్రేపల్లియ ప్రాంతమును వదలెను.
జనమునం బోవు గుఱ్ఱములం బూన్చిన రథముతో పోవుచు మధ్యాహ్న సమయమున నమ్మువ్వురు యమునా తీరముం జేరిరి. అప్పుడు కృష్ణునితో నక్రూరుడు మీరిద్దిరు నిటనుండుడు. నే కాళిందిందోగి మాధ్యాహ్నికానుష్ఠానము గావింతును. అన వారు సరియన నతడు స్నానము సేసి యాచమించి యయ్యమునా జలముల పరబ్రహ్మమును ధ్యానించెను. వేయి పూల మాలలతో వికసించిన తామరపూ రేకులంబోలు కన్నులతో వాసుకిరంభుడు మొదలయిన మహాసర్ప వారముచే స్తుతింప బడుచు ఘుమఘుమలు నించు వనమాల గైసేసి నీలాంబరమును దాల్చి చక్కని శిరో భూషణముతో సొంపగు కుండలములతో నానీటం భాసించు బలభద్రుం దర్శించెను. అతని యొడిలో మేఘశ్యాముడై ఎఱుపాఱు కన్నులు నాల్గు బాహువులు చక్రాద్యాయుధములు గైసేసి యున్న తమూర్తియై పీతాంబరములు దాల్చి రంగురంగుల పూలమాలలు గైసేసి యింద్ర ధనుస్సున మెరుపులా మాలలన్వింత గొలుపు మేఘమట్లు శ్రీవత్సవక్షుండును చక్కగా మెఱయు మకరకుండలములం ధరించి తెల్ల దామర పువ్వును సిగం గైసేసి యున్న వాడునునగు శ్రీకృష్ణ పరమాత్మను పుణ్యశీలురు సనందనాది మునులు సిద్దయోగులు నీతనిలిచి ముక్కుకొనం జూపులు నిలిపి ధ్యానించు చుండ దర్శించెను. వారిద్దరు బలరామ కృష్ణులని గుర్తించి విస్మయమంది యక్రూరుడు రథము నుండి వీరితకెట్లు వచ్చిరని యాలోచించెను. అది యడుగవలె ననుకొన్న యాతని వాక్కును హరి స్తంభింప జేసెను. అంతట నీరు వెడలి యాతడు రథము దరికేతెంబెను. అతడయ్యిద్దర నా రథము నందు మునుపటి యట్ల మనుష్య రూపులై యున్నవారిం జూచెను. నీట మునిగి యక్కడను ముందతియట్ల కంచెను. గంధర్వులు మునులు సిద్దులు మునులు సిద్దులు నాగులు నందు ఇద్దఱను గొనియాడు చుండిరి. అంతట నాదానపతి కలరూప దెలిసి సర్వ విజ్ఞానమయు నీశ్వరు నచ్యుతుని స్తుతించెను.
సన్మాత్ర రూపియు అచింత్య మహిముడును సర్వవ్యాపియు కారణ దశయందేక రూపియు కార్యదశ యందనేక రూపియునైన పరమాత్మకు నమస్కారము నమస్కారము. సర్వరూపుడు హవిర్మూర్తి ప్రకృతి కతీతుడు. విజ్ఞానమునకు పర్యవసాన భూతుడు పంచాభూతములకు ఆత్మయైనవాడు అవ్యక్తరూపుడు ఏకాదశేంద్రియ రూపుడు ఆత్మయు (జీవుడు) పరమాత్మయు (నిరుపాధికుడు) నుగా నీవొక్కడవే యైదు విధములై యున్నావు. ఓ సర్వ! సర్వాత్మక! క్షరక్షరమయా! బ్రహ్మ విష్ణు శివులను పేర వివిధ కల్పనల బేర్కొన బడువాడవు. అనిర్వచనీయ స్వరూపభూత! అనిర్వచనీయ ప్రయోజన! అనిర్వచనీయాభిధాన! పరమేశ్వర! నిన్ను మ్రొక్కెద. నామజాత్యాది కల్పన యెచటలేదో, అట్టి పరబ్రహ్మము నిత్యము అవికారియునైన వస్తువు నీవు. వివిధ కల్పనారహితముగ సర్వార్థావగతి కలుగదు కావున నీవు కృష్ణ అచ్యుతానన్త విష్ణువులను సంజ్ఞలచే బేర్కొన బడుదువు. బ్రహ్మాది దేవతలు పంచ భూతములు దిక్పాలురునై శక్తి భేదములచే జగత్తుం బ్రోతువు. సూర్య కిరణ రూపుడవై నీవు విశ్వమును సృజింతువు. ఈ ప్రపంచము నీ గుణ వికారము. సత్ అను అక్షరమును నీకు వాచకమునైన రూపమునకు సదసదాత్మకునను ప్రణతు డనయ్యెద. ‘ఓం నమో వాసుదేవాయ’ ఇత్యాది శ్లోకము మంత్రం రూపము వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నా నిరుద్దములనెడి శ్రీమహావిష్ణువు వ్యూహ చతుష్టయమును ఈ మంత్రమున పేర్కొన బడినవి. దాన నక్రూరుడా హరికి నమస్కరించెను.
Summary of chapter 18 of the Vishnu Mahā Purāṇa is as follows:
Akrūra arrives at Gokula and meets Kṛṣṇa and Balarāma. On the journey to Mathurā, when they stop at the Yamunā for bathing, Akrūra submerges in the water and receives a divine vision: he sees Balarāma and Kṛṣṇa in their supreme four-armed divine forms, luminous and attended by nāgas and siddhas, in the cosmic ocean beneath the river — a revelation of their true transcendent nature.