విష్ణు మహా పురాణము

21 - భవిష్య రాజ వంశము

ఈ మీద భవిష్య రాజులను వర్ణింతును. ఇపుడు ప్రభువుగా నున్న పరీక్షిత్తునకు జనమేజయ, శ్రుతసేన, ఉగ్రసేన, భీమసేనులు నల్గురు కుమారులు గల్గుదురు. జనమేజయునికి శాతానీకుడు గల్గును. యీతడు యాజ్ఞవల్క్యుని కడ నధ్యయనము సేసి కృపాచార్యుల వలన అస్త్రోపదేశము వడసి విషయభోగ విరక్తుడయి శౌనకుని యుపదేశముచే ఆత్మజ్ఞాన సంపన్నుడై పరమ నిర్వాణమును (మోక్షమును) బొందును. శతానీకునికి అశ్వమేధదత్తు డుదయించును. అతనికి అధిసీమ కృష్ణుడు అతనికి నిచక్నుడు కల్గును. అతడు హస్తినాపురమును గంగముంచి వేయగా కౌశాంబి పట్టణ మందు వసించును. ఆటనుంచి ఉష్ణుడు చిత్రరథుడు శుచిరథుడు వృష్టిమంతుడు సుషేణుడు సునీథుడు నృపచక్షువు మఖిబలుడు పారిప్లవుడు సునయుడు మేధావి రిపుంజయుడు అర్ముడు తిగ్ముడు బహద్రథుడు వసుదాసుడు శాతానీకుడు (2వ శతానీకుడు) ఉదయనుడు విహీనరుడు దండపాణి నిమిత్తుడు క్షేమకుడును వరుసగా దండ్రి కొడుకు లగుదురు. ఇచట నొక శ్లోకము గలడు (భావమిది). “బ్రహ్మక్షత్రమునకు మూలమయిన దేవర్షులు మెచ్చిన వంశము క్షేమకుని పొంది కలియుగ మందు సంస్థానమును (సమాప్తి) బొందును.