విష్ణు మహా పురాణము

5 - కృష్ణుడు మధురా నగర మేగుట

వసుదేవుడు బంధముక్తుడై నందుని బండి దరికేగి నాకు బుత్రుడు గల్గినాడని మిగుల నానందించుచున్న నందునిం జూచెను. మఱియు నతనింగని బాగు! బాగు! నీకు ముసలి తనమున దనయుండు గల్గినాడు నీ భాగ్యమని సాదరముగ నందునిం బలుకరించెను. ఱేనికిం బన్నుగట్టినారు గదా మీరిటకు వచ్చినపని యైనది. ధనరాసులతో మీరిట క్షణమాగ వలదు. ఆగవలసిన పని మాత్ర మేమున్నది మీ వ్రేపల్లె కిప్పుడచ నుండు. నాకును రోహిణికి బుట్టిన కొడుకచ్చట నున్నాడు. మీ బిడ్డనట్ల వానిం గాపాడుము. అని పలుక నందాది గోపకులు పన్నులు సెల్లెంచి తమ సామాగ్రిం బండ్ల కేక్కించికొని యట నుండి తరలిరి.

గోకులమందు వారు సుఖమున్న తఱి బాలఘాతిని పూతన యటకేగి రాత్రి నిదురించు చున్న బాలకృష్ణు నెత్తుకొని పాలిచ్చెను. అది ఎవ్వని కెవ్వనికి జన్నుగడుపు వాని వాని శరీరము క్షణములో బడి పోవు చుండును. కాని కృష్ణుడు మాత్రము దాని ఱొమ్మును గట్టిగ బట్టి కుడిచికొని కినుకగొని పాలతో బాటు దాని ప్రాణములం ద్రావి వైచెను. ఆ రక్కసి మిక్కిలిగ నార్చి ప్రేవులు దెగి ప్రాణ వాయువులు పోయి చట్టన నేలం గూలేను. దాని యఱపు విని జడుపుగొని వ్రజవాసులు మెలుకువ గొని యా పూతన యొడిలోని కృష్ణుని నచ్చట పడియున్న యా రాక్షసినిం జూచిరి. యశోదయుం గృష్ణుని గని యెత్తికొని మిక్కిలి జడిసి బిడ్డ జడుపుగొని నాడని ఆదోక తలచుట్టు త్రిప్పుట దిగదుడుపు మొదలగునవి గావించి బాలదోష నివారణ మొనరించెను. నంద గోపుడును నావుపేడం గొని నడినెత్తిపై నీ క్రింది మంత్రములు జపించుచు రక్ష పెట్టెను.

అశేష భూతకారణుడు హరి నిన్ను రక్షించు గాక! ఎవని బొడ్డునం బొడమిన తామర పూవునం జగమెల్ల బొడమినదో, ఎవ్వని కోరచే ధరింప బడి ధరణియీ జగముం ధరించు చున్నదో అవ్వరాహమూర్తి ధరుడు దేవుడు కేశవుడు నిన్ను రక్షించు గాక! గోటి కొనలచే వైరుల వక్షములం జీల్చిన యమ్మేటి నృసింహమూర్తి జనార్దనుండెల్ల యెడల నిన్ను రక్షించుగాక! క్షణములో పొట్టివడుగురూపైబెడిదపుటడిదములం గొని ముల్లోకములను మూడడగుల నాక్రమించిన యవ్వామనుండు నిన్నీవేళ రక్షించు గాక! గోవిందుడు నీ శిరస్సును గాపాడు గాక! కేశవుడు నీ కంఠమును రక్షించుగాక! కడుపుతోటి నీ గుహ్యమును విష్ణువు, జనార్దనుడడుగులం పిక్కలను బ్రోచుగాక! అవ్వాహతైశ్వర్యుడు అవ్యయుడు నగు నారాయణుడు ముఖమును చేతులను మోచేతులను మనస్సును ఎల్ల యింద్రియములను గాపాడుగాక! శార్ఙ్గ చక్రగదా పాణి యొక్క శంఖ భంభాంకారములచే ప్రేతకూష్మాండాదులగు రాక్షసులు నీ కహితులు నిహతులాయి నశింతురు గాక! వైకుంఠడు దిక్కు లందు మధుసూదనుడు విదిక్కు లందు (మూలలందును). ఆకసము నందు హృషీకేశుడు, భూమి యందు ధరణీధరుడు రక్షించుగాక! ఈ విధముగ నందగోపుడు పిల్లవానికి శాంతికర్మను చేసి బండిక్రింద చిన్న మంచము మీద పరుండ బెట్టెను. గోపాలురందరు చనిపోయిన పూతన యొక్క పెద్ద శరీరమును చూచి గొప్ప భయమును, ఆశ్చర్యమును పొందిరి.