ఓ బ్రాహ్మణుడా! ప్రహ్లాదుడిట్లు విష్ణువును తనకంటె భిన్నుడు కానివానిగా భావించుచు నుత్కృష్టమైన తన్మయత్వమును పొంది తనను అచ్యుతునిగా తలంచెను. తనను మరచెను. ఇతరము నెఱుంగ డయ్యెను, అవ్యయుడు అనంతుడునగు పరమాత్మ నేనేయని తలంచెను. అట్టి విష్ణుతాదాత్మ్య భావనా యోగము వలన క్రమముగా పాపపంకమింక శుద్దాంతః కరణము నందు జ్ఞానమయుడగు నచ్యుతుడు నిలచెను. రాక్షసుడగు ప్రహ్లాదుడు యోగ ప్రభావమున విష్ణుమయుడై చలింపగా నాగబంధము లన్నియు తెగిపోయెను, భ్రమించు చున్న జలచరమ సంకులమై తరంగములతో గూడిన సముద్రము క్షోభిల్లెను. పర్వతారణ్యములతో గూడిన భూమి కంపించెను. రాక్షసులచే తనపై నుంచబడిన పర్వత సంఘాతము నెల్ల లేవనెత్తి బుద్దిమంతుడగు ప్రహ్లాదుడు పైకి వచ్చి అకాశాదులతో గూడిన జగత్తును చూచి, తాను ప్రహ్లాదుడనని మనసు నందు స్మరించెను. బుద్దిశాలియగు నాతడు త్రికరణముల నియమించుకొని యేకాగ్రచిత్తుడై యనాదియగు పురుషోత్తముని తొట్రుపాటు లేకుండ స్తుతించెను.
పరమార్ధ జ్ఞానరూపా! స్థూల సూక్ష్మరూపా! క్షరాక్షర రూపా! వ్యక్తావ్యక్త రూపా! సకల నిష్కల (సావయవ నిరవయవ) రూపా! నిర్లేపరూపా! సగుణ నిర్గుణ రూపా! సంస్థ గుణాధారా! మూర్తామూర్త రూపా! వ్యక్తావ్యక్తస్వ రూపా! కరాల సౌమ్యస్వ రూపా! విద్యాఽవిధ్యా రూపా! సదసద్రూప! కారణభూతా! సదాసద్భావాభిజ్ఞా! నిత్యానిత్య ప్రపంచ రూపా! ప్రపంచాతీతా! జ్ఞానులచే నాశ్రయించ బడినవాడా! కారణ రూపమున నేక రూపా! కార్య రూపమున ననేక రూపా! వాసుదేవా! ఆదికారణ భూతుడా! నమస్కారము. స్థూల రూపమున ప్రకటమైన వాడును, సూక్ష్మరూపమున అప్రకాశుడును సర్వ భూతరూపుడు సర్వ భూతాతీతుడు విశ్వహేతు భూతుడు జీవుల కర్మానుసారము సృష్టికి కర్తయు అంతియే కాని నిజమునకు విశ్వహేతువు కాని వాడును నగు పురుషోత్తమునకు నమస్కారము.”
ఇట్లు స్తుతించు చుండగా పీతాంబర ధారియై శ్రీహరి సాక్షాత్కరించెను. వెంటనే ప్రహ్లాదుడు చూచి తత్తరపాటుతో లేచి
“నమోస్తు విష్ణవే” యని యడుగడుగు ననుచు స్వామీ! శరణాగతార్తిహరా! అనుగ్రహింపుము! కటాక్షము నెరపి నన్ను పవిత్రుని చేయుమని పలుకగా
నాయందు స్థిరమగు భక్తిని చేయుచున్న నీకు ప్రసన్నుడ నైతిని. అభీష్టమును కోరుకొను మనెను.
“అచ్యుతా నేనే జన్మ మెత్తినను నీయందనపాయిని యగు భక్తి యుండు గాక! వివేకహీనులకు విషయము లందెట్టి గాఢ ప్రీతీ యుండునో ఆ ప్రీతీ నీయందు నిన్ను స్మరించు చుండు నాకు కలుగు గాక!” అని పలుకగా
నాయందు నీకు భక్తి గలదు గదా! ఇంకను నండును. నీకభీష్టమైన వరము కోరుకొను మనెను.
నేను నిన్ను స్తుతింప బూనగా నా తండ్రికి నీపై ద్వేషము కలిగెను. దాని వలన నాతనికి కల్గిన పాపము నశించు గాక! శస్త్రములు అగ్ని సర్పములు విషాన్నము సముద్రము పర్వతములు మున్నగు వానితో నన్ను అనేక విధముల మా తండ్రి బాధించెను. అందువలన కలిగిన పాపము నశించు గాక! నీ అనుగ్రహముచే నా పాప విముక్తి యగుగాక!
నా అనుగ్రహముచే అన్నియు జరుగును. మరియొక వరము కోరుకొను మనెను.
నీయందు చలించని భక్తి ఎల్లప్పుడు కలుగు గాక! ధర్మార్ధ కామములతో నేమి ప్రయోజనము? సంస్థ జగన్మూల కారణుడగు శ్రీహరి యందు స్థిరమగు భక్తి గల వానికి ముక్తి కరతలామలకమే అన
నీ చిత్త మచంచలమై నా యందున్నట్లే నా యనుగ్రహముచే నీవు మోక్షము నంద గలవు.
ఇట్లు పలికి మైత్రేయా! ఆతడు చూచు చుండగనే భగవానుడు అంతర్హితు డాయెను. ప్రహ్లాదుడు తండ్రికడకేగి పాదములకు మ్రొక్కగా తండ్రి వాని శిరము మూర్కొని కౌగిలించి వత్సా! బ్రతికి యుంటివా అని బాష్పార్ద్ర లోచనుడై పశ్చాత్తప్తుడై ప్రేమకల వాడయ్యెను. ధర్మవేత్తయగు ప్రహ్లాదుడు గురు జనకుల ఇట్లు సేవచేసెను.
నృసింహ రూపియైన విష్ణు భగవానుడు నుపాధిపోగా ప్రహ్లాదుడు అనుభవముచే కర్మశుద్ది కలిగించు రాజ్యలక్ష్మి నొంది పుత్రపౌత్ర ద్వైశ్వర్యము పొంది క్షీణింప ప్రారబ్దకర్మ పుణ్య పాప రహితుడై భగవ ద్ధ్యానము వలన ముక్తినొందెను. మైత్రేయా! ఏ ప్రహ్లాదుని గురించి నన్ను నీవడిగితివో ఆ రాక్షసుడగు ప్రహ్లాదుడిట్టి మహామతి. ఇట్టి మహానుభావుని చరితము విన్నవాని పాపములు వెంటనే నశింప గలవు. నిరంతర కృతపాపము కూడ నేతచ్చరిత్ర పఠనము నను శ్రవణమునను నశించును. సందేహము లేదు. పూర్ణిమ అమావాస్య అష్టమి ద్వాదశి తితులందు పఠించిన యెడల గోదాన ఫలము కలుగును. శ్రీహరి సర్వాపద లందు ప్రహ్లాదుని రక్షించినట్లే తచ్చరిత శ్రవణ మొనరించిన వానిని కూడా సదా రక్షించును.
Summary of chapter 20 of the Vishnu Mahā Purāṇa is as follows:
Viṣṇu, manifested as Nṛsiṃha before Prahlāda, asks him to name his boon. Prahlāda asks only for undeviating bhakti and, ultimately, liberation (mokṣa). Viṣṇu grants him paramapada — the supreme state of liberation. Prahlāda composes a magnificent stotra praising Viṣṇu as the ātman of all, the witness beyond all guṇas, the pure caitanya that illumines everything.