విష్ణు మహా పురాణము

20 - జహ్నువు నుండి పరీక్షిత్తు వరకు వంశము

జహ్నువునకు సురథుడు జనించె. అతని నుంచి విదూరధుడు సార్వభౌముడు జయత్సేనుడు అరాధితుడుఅయుతాయువు అక్రోధనుడు దేవాతిథి ఋక్షుడునను వారు తండ్రి కొడుకులు. ఋక్షునికి భీమసేనుడు అతనికి దేవాపిశంతను బాహ్లికులను ముగ్గురు గల్గిరి. దేవాపి బాల్యమంద యావింజొచ్చె. శంతనుడు మహీపతి యయ్యె. అతనిం గూర్చిన శ్లోకమిది పృథివీ యందు కీర్తింప బడుచున్నది. భావము: ఏయే ముసలి వానిని చేతులందాకు నాతడు యౌవనముం బడయును. పరమ శాంతిని బొందును. ఆ పనిచే నాతడు శంతనుడయ్యె.

ఆ శంతనుని రాష్ట్రమందు పండ్రెండేండ్లు పర్జన్యుడు వర్షింపడయ్యె. దాన నశేషరాష్టము నశింప నున్నం జూచి యీ రాజు బ్రాహ్మణులను గని మన రాష్ట్రమున వర్షమును దేవుడెందులకు వర్షించ లేదు? నా యాపరాధమే మని యడిగెను. బ్రాహ్మణు లిట్లనిరి. మీ అన్న యోక్క భూమి ఇది దీనిని నీవనుభవించు చున్నాడు. అందుచే పరివేత్త వాయినావు. (అన్నకు పెండ్లి కాకుండ పెండ్లి చేసికొన్న తమ్ముడు పరివేత్త) అనవిని ఇందు నేనేమి సేయ వలయునని యడిగెను. వారనిరి. దేవాపిపతనాది దోషములకు లోనుగానంత వరకు నీ రాజ్య మాతనిదే. కావున నీ రాజ్యముతో నీకు బనిలేదు. ఇది యాతనికిమ్మని నంతట నాతని మంత్రిముఖ్యుడు అశ్మరావియను వాడక్కడ నరణ్యమందు వేదవాదములకు విరోధముగా వాధించు తపస్యులను ప్రయోగించెను. వారును మిక్కిలి ఋజుబుద్దియైన రాజ తనయుని బుద్దిని వేదవాదములకు విరోధ మార్గమునం బోవునట్లు మార్చిరి. శంతను మహారాజు మాత్రము ద్విజుల మాటలం బట్టి పరితాప దుఃఖము గల్గి యా విప్రులను ముందిడికొని యన్నగారికి రాజ్యదానము సేయ నరణ్యమునా కేగెను. ఆ యాశ్రమము చేరిన వారై వచ్చియున్న రాజ కుమారుడగు దేవాపిని స్తుతించిరి. ఆ బ్రాహ్మణులు వేదవాదాను సారులయిన మాటలు రాజ్యము నగ్రజుచే కర్తవ్యమను నర్థము గలవి పల్కిరి. ఈ దేవాపియ వేదవాద విరోధ యోక్తి దూశితముగ బెక్కురీతుల వారితో పలికెను. అంతట నా బ్రాహ్మణులు శంతనునితో రారమ్ము. ఓ రాజా! అతి నిర్భంధము చాలు చాలు. అనావృష్టి దోషము శమించినది. అనాది కాలముగా చెప్పబడిన వేదవచన దూషణోచ్చారణముచే నీతడు పతితుడైనాడు. అన్నగారిట్లు పతితుడయి నందున నీకు పరివేత్తృత్వ దోషము గలుగదన శంతనుడు తన పురమేగు దెంచి రాజ్యముం గావించెను. వేదవాద విరోధ వచనోచ్చారణముచే భ్రష్టుడైన జ్యేష్ఠ భ్రాత దేవాపి యుండగనే తమ్ముడు శంతనుడు రాజ్య స్వీకారము సేసెను. అంతట సర్వసస్యములు పండుటకు పర్జన్య భగవానుడు వర్షించెను.

బాల్హికునికి సోమదత్తుడు. అతనికి భూరి భూరిశ్రవుడు శల్యుడునను ముగ్గురు గల్గిరి. శంతనునికి దేవనది జాహ్నవి యందుదారకీర్తి అశేష శాస్త్రార్థవేత్త భీష్ముడు పుత్రు డుదయించెను. శంతనుని సత్యవతి యందు చిత్రాంగద విచిత్రవీర్యు లిద్దరు గల్గిరి. చిత్రాంగదుడు బాల్యమందే చిత్రాంగదుడను గంధర్వుని చేత యుద్దము నందు గూలెను. విచిత్రవీర్యుడు కాశీరాజు తనయలను అంబ అంబాలిక యను వారిని బెండ్లాడెను. వారి యువభోగాతి ఖేదముచే క్షయవ్యాధికి గురియై మరణించెను. నా పుత్రుడు కృష్ణద్వైపాయనుడు తల్లి మాట జవదాట రాదను సత్యవతీ నియోగముచే విచిత్రవీర్యుని క్షేత్రమందు (భోగస్త్రీ యందు) విదురునిం గనెను.

ధృతరాష్ట్రుడు గాంధారి యందు దుర్యోధన దుశ్శాసన ముఖ్యుల నూర్గురు కొడుకు లంగాంచె. పాండు వరణ్య మందు వేటాడుచు ఋషి శాపముచే సంతానముంగను సామర్థ్యముం గోల్పోయెను. వాని భార్య కుంతీ యందు ధర్మ వాయు శక్రువులచే యుధిష్టిర భీమసేన అర్జునులును మాద్రియందు అశ్వనీ దేవతలచే నకుల సహదేవులును జనించిరి. పాండవులకు ద్రౌపది యందైదుగురు పుత్రులు (ఉప పాండవులు) గల్గిరి. యుధిష్ఠిరుని వలన ప్రతివింధ్యుడు, భీమసేనుని వలన శ్రుతసేనుడు, శ్రుతకీర్తి అర్జునుని వలన శతానీకుడు నకులుని వలన, సహదేవుని వలన శ్రుతకర్మయుం గల్గిరి. పాండవుల కింకను పుత్రులు గలరు. యుధిష్టిరునికి యౌధేయియందు దేవకుడు గల్గెను. భీముని వలన హిడింబ ఘతోత్కచునిం గాంచె. వాని వలన కాశియను నామె సర్వగుడను కుమారునిం గనెను. సహదేవుని వలన విజయ సుహోత్రుడను పుత్రుని గాంచె. నకులుడు రేణుమతి యందు నిరమిత్రుంగాంచెను. అర్జునునకు ఉలూపియను నాగకన్య యందు ఇరావంతుడను కొడుకుదయించె. మణిపురపతి కూతురు నందు అర్జునుడు పుత్రికా ధర్మముతో, అనగా సోదరులు లేని కన్యను నీకిచ్చి చున్నాను. ఈమె యందు కలిగిన పుత్రుడు నాకు పుత్రుడు కాగలడను కన్యాదానకాల నిబంధనతో పెండ్లాడి బభ్రువాహనునిం గాంచె. అతనికి సుభద్ర యందు అభిమన్యు డుదయించె. అతడర్భకు డయినప్పుడు అతి బలపరాక్రమ శాలియై సర్వ శత్రుంజయ శాలియై యొప్పెను. అభిమన్యునకు ఉత్తర యందు పరీక్షిత్తు జనించె. కురురాజు లందఱు క్షయింప అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే గర్భమందు భస్మీకృతుడయ్యు, సకల సురాసుర వందిత చరణారవిందుడగు భగవంతుని యాత్మ సంకల్పముచే నకారణ మానుష రూప దారియు నైన శ్రీహరి యొక్క ప్రభావము వలన పునరుజ్జీవితుడై పరీక్షిత్తు ఉదయించెను. ఈ మహానుభావుడే యిప్పుడీ భూమండలము ధర్మముచే అనగా ఉత్తరోత్తరాభివృద్దియగు నఖండ సంపద కలుగు నట్లు పాలించు చున్నాడు.