విష్ణు మహా పురాణము

11 - గృహస్థాచారప్రశంసా యజ్ఞాః

మహామునీ! గృహస్థుడు ఏ సదాచారము నాచారించుట వలన నిహపర లోకముల నుండి చ్యుతుడు కాడో, అట్టి గృహస్తు సదాచారమును వినగోరు చున్నాను.

ఓ రాజా! సదాచార స్వరూపమును వినుము. సదాచార వంతుడు ఇహ పర లోకముల జయించును. సజ్జనులు పాప రహితులు సత్పదమునకు సాధువని యర్థము. వారి యాచరణమే సదాచార మనబడును. సప్తర్షులు మనువులు, సదాచారకర్తలు వక్తులునై యున్నారు.

ఓ భూపతీ! బుద్ది మంతుడైన వాడు బ్రాహ్మ (సూర్యోదయమునకు వెనుక మూడవ) మూహర్తమందు లేచి, మెలుకువతో కామమును దృష్టాదృష్ట పాప వినాశము కొఱకై చింతింప వలెను. ధర్మమునకు బాధను కల్గించు నర్థ కామములను ఉత్తరత్ర సుఖమును చేకూర్చునదియు లోక దూషితమైనట్టిది యునగు ధర్మమును కూడ విడిచిపెట్ట వలయును. పిమ్మట లేచి కాలకృత్య మగు మూత్రోత్సర్జనము చేయ వలయును. గ్రామమునకు నైఋతి దిక్కు నందు గాని లేక ఇంటికి బాణప్రక్షేప దూరమనకు మించిన చోట మూత్ర పురీషములు విడువ వలెను. ఇంటి ముంగిట పాద ప్రక్షాళన గాని, ఉమియుట మొదలగునవి గాని చేయరాదు. విగ్నుడైన వాడు తన నీడకు చెట్టు నీడకు గోవు, సూర్యుడు, అగ్ని, వాయువు, గురువు, బ్రాహ్మణుడు వీనికిని అభిముఖుడై మూత్ర పురీషములు విడువ రాదు. దున్నిన చోట సస్య మధ్యము యందు ఆవుల మందలోను జన సముదాయమున మార్గమందు నది మున్నగు తీర్థము లందు నీటి యందు నీటి తీరమందు శ్మశాన మందు మూత్ర పురీషములు విడువ రాదు. ప్రాజ్ఞుడు సంకటము లెన్నడు పగలు సంధ్యలందు నుత్తరాభి ముఖుడుగను రాత్రి దక్షినాభి ముఖుడుగను మూత్ర పురీషములను విడువ వలెను. నేలపై గడ్డి పఱచి వస్త్రముతో తలను చుట్టి విడువ వలెను. అచట చిరకాల ముండరాదు, మాట్లాడ రాదు. పుట్టమట్టి ఎలుక కన్నాపు మట్టి నీటిలోని మట్టి శౌచము చేసికొనగా మిగిలిన మట్టి మూత్రాది లేప సంగతమైన మట్టిని ఇంటినుండి శౌచము కొఱకై తీసికొని రాకూడదు. అణువుల తోను, జీవములతోను కూడి యున్నదియు నాగలితో దున్నబడినది యగు మట్టిని శౌచమునకు ఉపయోగించరాదు. శౌచము చేసికొనుటకు మట్టిని మూత్రావయవ మందొక పర్యాయము పురీషోత్సర్జ నావయమ మందు మూడు మారులు ఎడమ చేతి యందు పదిమారులు రెండు చేతులందు నేడేసి మారులు వాడవలెను. స్వచ్చమును వాసన గాని నుఱుగు గాని లేనిదియు బుడగలు లేనిదియునగు నీటితో నాచమనము చేసి మరల సావదానుడై మట్టి రాచుకొన వలెను. ఇట్లు పాదశౌచము చేసికొని పాదములు కడుగుకొని త్రిరాచమనము చేసి రెండు పర్యాయములు పరిమార్జనముస్ చేసికొని తలలో నున్న ఇంద్రియము లను తలను బాహువులను నాభిని హృదయమును నానీటితో స్పృశింప వలెను.

పిమ్మట ఆచనము చేసి కేశాలంకరణము అద్దము చూహు కొనుట అంజనము కాటుక మంగళ వస్తువులు దూర్వాదులను గ్రహించుట చేయవలెను. పిమ్మట స్వవర్ణ ధర్మముతో జీవిత నిమిత్తమై ధనార్జన చేయ వలెను. ఓ రాజా! శ్రద్ధతో గూడిన వాడై యాగముల నాచరించ వలెను. సోమ సంస్థలు ఏడు. హవిస్సంస్థలు ఏడు. పాక సంస్థలు ఏడు. ఈ యాగము లన్నియు ధనాయత్తము లగుట వలన ధనార్జనకై ప్రయత్నింప వలెను. నిత్య కర్మానుష్టానార్తమై నదుల నాదములు తటాకములు మనుష్య నిర్మితములు కాని దేవఖాత జలములందు సెలయేళ్ల యందు స్నానమాచరించ వలెను. కూపముల యందు తడిన జలముతో తత్తీర భూమి యందు అది శాక్యముగా నప్పుడు ఇంటియందు స్నానము చేయ వలయును.

పరిశుద్ద వస్త్రము ధరించి సావధాన చిత్తుడై దేవర్షి పితృ తర్పణమును దేవ - ఋషి పితృ తీర్థముల (కరాగ్ర కనిష్టకా మూల తర్జనీ మూలముల)లో చేయవలెను. వీరికి తృప్తికై ముమ్మారు (అనగా భూః భువః సువః దేవాన్ రుశీన్ పితౄణ్ తర్పయామి) అని విడువ వలెను. ప్రజాపతికి ఒక్క పర్యాయము విడువ వలెను. పితామహులకు ప్రపితామహులకు మాతామహునకు వారి తండ్రికి వారి తండ్రికి పితృ తీర్థము (తర్జనీ మూలము)తో నివ్వవలెను. కామ్యముల చెప్పెద విను. తల్లికి ఆమె తల్లికి ఆమె తల్లికి గురుపత్నికి గురువునకు మేనమామ మున్నగు వారికి అప్తమిత్రునకు భూ నాథునకు నివ్వవలెను.

ఈ దేవాది తర్పణోదకమును భూతోపకారము కొఱకు తన యిచ్చ ననుసరించి యెచటనైన యుంచుచు నీ వాక్యముల జపించ వలెను. దేవతలు, అసురులు, యక్షులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచులు, గుహ్యులు, సిద్దులు, కూష్మాండ గణములు, చెట్లు, పక్షులు, జల చరములు, భూ నిలయములు, వాయ్వాధార జంతువులు అన్నియు నేనిచ్చుచున్న ఈ తర్పణోదకములతో శీఘ్రముగ తృప్తి నొందుగాక! సమస్త నరకము లందు యాతనా శరీరము లందున్న వారికి తృప్తికై నాచే నీ జలమివ్వ బడుచున్నది. బంధువులు అబాందవులు గాని అన్య జన్మ బంధువులు గాని నా వలన జలము నపేక్షించు వారందరూ తృప్తి పొందుదురు గాక! ఈ నాచే నీయబడిన తిలోదకము ఎచట నున్నను ఆకలి దప్పికలచే బాధితులైన వారికి తృప్తిని కలిగించు గాక!

రాజా! కామ్యోదక ప్రదానమును చెప్పితిని. దీనినిచ్చుటచే నరుడు సకల ప్రపంచమును సంతోష పెట్టిన వాడగును. మఱియు ప్రపంచ ప్రీతనముచే కలుగు పుణ్యమును పొంద గలడు. శ్రద్ధతో కామ్యోదకమును సమర్పించి ఆచమించి సూర్యునకు ఈ క్రింది మంత్రముతో జలాంజలిని సమర్పింప వలయును. వేదములతో ప్రకాశించు వాడును సర్వవ్యాపక మగు తేజస్సు గలవాడును జగజ్జనకుడును పరిశుద్దుడును ప్రేరకుడును కర్మ సాక్షియును సూర్యుని కొఱకు సమస్కారములు.

పిమ్మట ఇంటి యందు నభిమత దేవతలను జలాభిషేక పుష్ప ధూప నివేదనాదులతో నర్చించ వలెను. బ్రహ్మాది పంచాహుతులతో నపూర్వాగ్ని హోత్ర హోమము (వైశ్వ దేవము)ను చేయ వలెను. ప్రజాపతిని గృహమునకు కాశ్యపునకు అనుమతి దేవతలకు ఆహుతుల నివ్వవలెను. మిగిలిన దానితో ఔపసనాగ్ని వద్ద ఉదపాత్ర యందు భూపర్జనస్య దేవతల నుద్దేశ్యించి బలి వేయవలెను. ద్వారము నందు ధాతకు విధాతకు గృహమధ్య మందు బ్రహ్మకు బలి వేయవలెను. దిగ్దేవతలను వినుము.

శేషాన్నముతో తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ నింద్రునకు, యమునకు, వరుణునకు, చంద్రునకు ఈశాన్యమున ధన్వంతరికి బలి వేయవలెను. వాయవ్య దిక్కున వాయువునకు బలి వేయవలెను. అట్లే దిక్కులన్నిటి యందు నిరంతరమూ బ్రహ్మకు అంతరిక్షమునకు, సూర్యునకు, విశ్వదేవులకు, సమస్త భూతములకు, విశ్వపతికి పితరులకు యక్షులకు బలి ప్రక్షేపము చేయవలెను. (ఈ క్రమము పారస్కర గృహ్య సూత్రమున చూడనగును).

అన్నాంతరమును తీసికొని పరిశుద్దమగు భూమి యందు విద్వాంసుడు సావధాన చిత్తుడై సమస్త భూతములకు బలి ప్రక్షేపము చేయ వలెను. ఆ సమయమున నీ క్రింది శ్లోకమును చెప్పా వలెను. వాని తాత్పర్యమిది. అన్నమపేక్షించు చున్న దేవతలు మనుష్యులు పశువులు, పక్షులు, సిద్ద యక్షోరగ దైత్య సంఘములు ప్రేతలు, పిశాచములు, వృక్షములు వీని కొరకూ నాచే నీ యన్నము ఇవ్వబడు చున్నది. చీమలు, కీటకములు, మిడుతలు మున్నగు వానికి కర్మ సూత్రా బద్దములై యాకలి గొన్నవానికి నన్నిటికిని నన్నమీయ బడినది. దీనిచే నవి తృప్తి నొంది నాచే భూమిపై నుంచ బడిన ఈ అన్నము వలన నా జీవము లన్నియు తృప్తి చెంది యానందించు గాక! సమస్త భూతములు అన్నము నేనును విష్ణువు కంటే వేరు గాము. అందువలన నేను భూత సముదాయ శరీర భూతమయిన అన్నమును వాని తృప్తికై యిచ్చు చున్నాను. దేవమనుష్య పశు పక్షి సిద్ద యక్ష ఉరగ దైత్య ప్రేత పిశాచ వృక్ష పిపీలికా కీట శాల్బాది పదునాలుగు గణముల కొఱకు తృప్తి కలిగించుటకై నాచే నివ్వబడిన ఈ అన్నముచే నవి సంతోషించు గాక! అని చెప్పుచు అందఱికిని ఆశ్రయ భూతుడైన గృహస్తు శ్రద్ధతో సమస్త భూతోపకారము కొఱకై అన్న ప్రదానము చేయ వలయును.

కుక్కలు చండాలురు పక్షులు పతితులు పుత్ర రహితులునగు నగు మానవుల కొఱకై భూమి మీద అన్నము వేయ వలెను. పిమ్మట ఇంటి ముంగిట నతిథి కొఱకై గోదోహన కాల మాత్రము (1/4 గడియ లేక 6 నిమిషములు) గాని అంతకు మించిగాని నిరీక్షించ వలెను. అచటకు దయచేసిన యతిథిని స్వాగతము పలుకుట ఆసన ప్రదానము పాదములు కడుగుట మున్నగు వానితో కలిగించు వలెను. ఇతర స్థలము నుండి వచ్చిన ఏకగ్రామ వాసికాని అతిథిని కులము గాని పేరుగాని తానేరుంగకయే చక్కగ పూజించ వలెను. దరిద్రుడు తనతో సంబంధము లేనివాడును నితర దేశము నుండి దయ చేసిన వాడును, నాకలి గొన్న వాడు నగు అతిథిని విడిచి భుజించిన గృహస్థు పతితు డగును.

గృహస్థు అభాగ్యత (భోజన సమయాగతు)డైన యతిథిని అధ్యయనమును గోత్రమును అవాంతర శాఖాను కులమును నడుగకయే బ్రహ్మబుద్ది చేయవలెను. రాజా! పితృ యజ్ఞార్థమై మఱియొక బ్రాహ్మణుని ఆదేశీయుడై కులాచారముల నెరింగి యున్న వానిని పంచ యజ్ఞముల నాచరించు వానిని భుజింప జేయ వలెను ఉచ్చిష్టము కాని అన్నము తీసి “మనుష్యే భ్యోహన్తా” అను మంత్రముచే వేరు చేయబడి యున్న యన్నమును శ్రోత్రియ బ్రాహ్మణునకు సమర్పించ వలెను. యతులకు బ్రహ్మచారులకు ముమ్మారు భిక్షాన్నాము నీయ వలెను. సంపద గల బుధుడు వారు వద్దను వరుకు పెట్ట వచ్చును. వెనుక చెప్పిన అతిథులు యతులు బ్రహ్మచారులు శ్రోత్రియుడు నను నాలుగు వర్గముల వారిని పూజించిన వాడు పాప నిర్ముక్తుడగును.

ఎవని యింటి నుండి అతిథి భగ్నాశుడై వెళ్ళునో యతడు పాపము నా యజమాని కొసంగి వాని పుణ్యమును తీసికొని వెళ్ళును. ఓ రాజా! దాత ప్రజాపతి ఇంద్రుడు అగ్ని వసు గణము, సూర్యుడు, వీరతిథిలో ప్రవేశించి యన్నము తిను చుందురు. కావున నతిథి పూజ విషయమై నరుడు ప్రయత్నించ వలెను. అతిథి లేకుండా భుజించు వాడు కేవలము పాపమునే భుజించు చున్నాడు.

పిమ్మట గృహస్థు వివాహితయై తన యింట నున్న స్వవాసినిని దుఃఖిథ యైన దానిని గర్భవతిని వృద్దులకు పిల్లలకు ముందుగ వైశ్వదేవ సంస్కృతమైన యన్నమును భుజింప జేసి చివరకు తాను తిన వలెను. పైవారు భుజింపకయే గృహస్థు భుజించిన పాపమునే భుజించు చున్నాడు. అతడు మృతుడై నరకమును చేరి శ్లేష్మమును భుజించును. స్నానము చేయక భుజించు వాడు మలమును, జపము చేయక భుజించు వాడు చీము, రక్తమును భుజించును మలమును, హోమము చేయక భుజించు వాడు క్రిములను నతితులకు పెట్టక తినువాడు విషమును తినును.

ఓ రాజేంద్రా! గృహస్థు ఎట్లు భుజింప వలెనో, భుజించు చున్న వానికి పాప సంబంధమెట్లు కలుగదో, ఈ లోకము నందు చక్కని ఆరోగ్యము బలవృద్దియు ఎట్లు కలుగునో, శత్రుపక్షుము విషయమై అభిచరించు వానికి అనిష్టశాన్తి ఎట్ల కలుగునో చెప్పెద వినుము. గృహస్థు స్నాము చేసి యథావిధిగ దేవ ఋషి పితృ తర్పణములు చేసి సావధానముగ ప్రశస్తమగు రత్నమును చేత ధరించి భుజింప వలెను. శుద్ధ వస్త్ర ధారియై జపము, హోమము చేసి అతిథులకు బ్రాహ్మణులకు, గురువులకు, నాశ్రితులకు చేత ధరించి ప్రశస్తములగు పుష్పమాలలు ధరించి భుజింప వలెను. పరిశుద్ద ముఖము గలవాడై, సంతుష్టుడై నన్నమిడి పవిత్రగంధము ధరించి ప్రశస్తములగు పుష్పమాలలు ధరించి భుజింప వలెను. పరిశుద్ద ముఖము గలవాడై, సంతుషుడు భుజింప వలెను. ఏకవస్త్రము ధరించి గాని, తడికాళ్ళు తడిచేతులు కలవాడై కాని, విదిక్కులకభి ముఖుడై గాని భుజింప రాదు.

మనుజుడు ఇతర దృష్టి లేనివాడై తూర్పు, ఉత్తర దిశాభిముఖుడై ప్రశస్తమైనది హితకరమైనది గాయత్రీ మంత్రోదక ప్రోక్షితమైనదియు నగు దానిని తిన వలెను. నీచులు తీసికొని వచ్చినదియు, వైశ్వదేవాదులచే సంస్కరింప బడనిదియు పనికి రాదు. శాస్త్రము ననుసరించు శిష్టులకు ఆకలిగొన్న వారికి పెట్టి తాను తినవలెను. కోపాదులు లేనివాడు భోజనమునకు ప్రశస్తములని చెప్పబడియు నగు పవిత్రములు ప్రేపపాత్రాల యందు భుజించ వలెను. రాజా! పేప బెత్తముల పాత్రలందు యోగ్య ప్రదేశము నందు, సంధ్యాది సమయమందు, జన సమ్మర్ధ ప్రదేశమందు భుజింప రాదు. ముందుగా అన్నమును అగ్ని యందు హోమము చేసి, మంత్రములతో నభిమంత్రింప బడినదియు, ప్రశస్థమైనదియు పర్యుషితము (బహుకాల ముంచ బడినది) కానిదియగు అన్నము తినవలెను. ఫలములు, దుంపలు, వెళ్ళు, ఎండిన కొమ్మలు మొదలగునవి అపక్వ లేహ్యములు, మోదకాది భక్ష్యములు మున్నగు వానికి పర్యుషి తత్వము లేదు. సారము తీసివేసిన యాహారముల నెప్పుడు భుజింప రాదు. రాజా! వివేక వంతుడెపుడును సగము తినిన దానిని మఱల తినరాదు. తేనె, నీరు, పెరుగు, నెయ్యి, పిండి వీనికి మాత్రము పై దోషము లేదు. తదేక చిత్తుడై ముందుగ మధుర రసమును, మధ్యలో నుప్పని, పుల్లని పదార్థములను, పిమ్మట కారము, చేదునగు వస్తువులను తినవలెను. మనుజుడు ముందుగ ద్రవ పదార్ధమును, మధ్యము యందు కఠిన పదార్ధమును తిరిగి చివర ద్రవ పదార్ధమును తిని వాడు బలారోగ్యములను వీడడు.

వాఙ్నియమముతో నన్నమును నిందింప కుండ నిత్యము ననిషిద్దమైన యన్నమును తినవలెను. ప్రాణా పాన వ్యానో దాన సమాన వాయువుల సంతృప్తి కై కఠిన మౌనముతో నైదు గ్రాసముల (ఆహుతుల)ను పుచ్చుకొన వలెను. ప్రాఙ్ముఖుడుగ గాని యుత్తరాభి ముఖుడుగ గాని కూర్చుండి యాచమనము చేసి భోజనము చేసి, కాళ్ళు చేతులు చక్కగ కడుగు కొని యథావిధిగా మఱల నాచమనము చేయ వలెను. స్వస్థము ప్రశస్తమునగు మనసు కలవాడై యాసనము నందు కూర్చుండి యభీష్ట దేవతా స్మరణము చేయ వలెను. వైశ్వానరాగ్ని వాయు ప్రేరితమై, యాకాశముచే నొసంగ బడిన యవకాశము గల అన్నమును జీర్ణింప జేసి యా యన్న రసముచే నాయొక్క పార్థివ ధాతువు (శరీరము)ను సంతృప్తి నొందించు గాక! దాని వలన నాకు సుఖము చేకూరు గాక! అని పంచ భూతానుగ్రహమును కోర వలెను. తినిన యన్నము పరిపక్వమై నాకు సంబంధించిన పృథివీ జలాగ్ని వాయువులకు బలము కలిగించు గాక! దాని వలన నభ్యన్తరము లేని సుఖము కలుగు గాక!

నాచే తినబడిన యన్నము నా పంచ ప్రానములకు పుష్టికరమైన నాకు బీరుపోని సుఖము చేకూర్చును గాక! అగస్త్యుడు, అగ్నిదేవుడు, బడబాగ్నియు నాచే తినబడిన యన్నమును నిశ్శేషముగ జీర్ణింప జేయుదురు గాక! దాని పరిణామము వలన నా శరీరము నందు రోగము లేకుండా సుఖము కలుగు గాక! సమస్త ప్రాణుల దేహములే దేహముగా గల వాడును భగవంతుడు నగు విష్ణువొక్కడే, కావున నాచే తినబడిన యీ యన్నమంతయు సత్యరూపుడగు ఆ విష్ణువుచే భుజింప బడినది నాకు నారోగ్యము నిచ్చునదిగ పరిణమించు గాక! తినువాడు, తినబడు నన్నము, తత్పరిణామమున్ను ఆ విష్ణువే యై యున్నాడు. అట్టి సత్య స్వరూపుడగు విష్ణుదేవుని చేతనే తినబడిన నాయన్నము చక్కగా జీర్ణించు గాక! అని యుచ్చారించుచు చేతితో నుదరమును నిమురుకొనుచు నలసత లేని వాడై శ్రమను కలిగించని పనులను చేయ వలయును.

సజ్జనుల మార్గమునకు విరుద్దము కాని సచ్చాస్త్రాదుల వినోదముతో పగటిని గడిపి, పిమ్మట సావధాన చిత్తుడై సంద్యోపస్థానము చేయవలెను. రాజా! చక్కగా నాచమనము చేసిన వాడై సాయంకాల సంధ్యను సూర్యునితో కూడి నదిగను, ప్రాతస్సంధ్యను నక్షత్ర యుతముగను న్యాయము ననుసరించి యనుష్టింప వలెను. సూతకా శౌచాముగాని, శావా శౌచము గాని, ఉన్మాదము గాని, రోగము గాని, ప్రాణ భయాదులను గాని వదలి మిగిలిన సర్వకాలము లందు సంధ్యోపస్థానము తప్పక చేయవలెను. ఆ తురస్థితిలో తప్ప ఇతర సమయ మందు సూర్యోదయ కాలమున నిద్రించు వాడును ప్రాయశ్చిత్తార్హు డగును. కావున సూర్యోదయమునకు మున్నె లేచి ప్రాతస్సంధ్యను, నిదురించని వాడై సాయం సంధ్యను నుపాసించ వలెను. పూర్వ సంధ్యను పశ్చిమ సంధ్యను నుపాసించిన వారు అంధతామిస్ర నరకము నందుదురు.

ఓ రాజా! సాయంకాలము నందు కూడ వైశ్వదేవార్థమై తిరిగి పాకమును చేసి భార్యతో గూడ బలి ప్రక్షేపము నాచరించ వలెను. అందును చండాలాదులకై అన్న ప్రక్షేపనమును చేయవలెను. ఆ సమయమున వచ్చిన యతితిని బుధుడు తన శక్తి ననుసరించి పూజింప వలెను. పాద ప్రక్షాళనము ఆసన కల్పనము నుప్రభావము, స్వాగత వచనములతో నాదరించి అన్నదానము శాయనోప కల్పములతో పూజింప వలెను. పగటి యందు నతిథి విముఖుడై వెళ్ళుట వలన వచ్చు పాపము కంటె నెనిమిది రెట్లు పాపము, సూర్యాస్తమ యానంతరము వచ్చిన యథితి విముఖుడై వెళ్ళుట వలన వచ్చును. కావున రాజేంద్రా! సూర్యోఢు డగు (రాత్రి వచ్చిన) అతిథిని స్వశక్తితో పూజింప వలెను. అతడు పూజితుడైన సర్వ దేవతలు పూజింప బడినట్లే. నరుడు తన శక్తి ననుసరించి యన్న శాక జలాదుల నొసంగి కాని లేక పాన్పు తృనాది ప్రస్తారము చోటు నిచ్చిగాని సంతోష పెట్ట వలయును. గృహస్థు పాదాది శౌచము చేసికొని భోజన మాచరించి మంచమును గాను, బద్దలుకాని అనిషిద్ద ద్రుమ నిర్మిత మయిన బల్లము గాని చేర వలెను. విశాలము కానిది, బ్రద్దలైనది విషమ మయినది, మాలిన మయినది, జంతుమయ మయినది, పరువ బడినది యగు శయ్య పనికి రాదు. రాజా! పరుండునపు డెప్పుడును తూర్పు తలంపి గాని, దక్షిణ తలంపి గాని ప్రశస్తము. ఇతర మయినది రోగ ప్రదము.

ఓ రాజా! స్వభార్య యందు ఋతుకాలము నందు సంగమము ప్రశస్తమని అష్టమాధ్యాయమున చెప్పా బడినది. ఇంకా విశేషములు చెప్పుచున్నాను. పున్నామ నక్షత్రము లందు అనగా అశ్వినీ, కృత్తికా, రోహిణీ, పునర్వసు, పుష్యమీ, హస్త అనురాధా, శ్రవణ, పూర్వాభాద్ర, ఉత్తరభాద్రా కాలము లందు నుత్తరోత్తర శుభములైన సమ సంఖ్యా రాత్రులందు ప్రశస్తము. అననుకూల మయినది, బాధితురాలు, రజస్వల, ఇష్టము లేనిది, కుపితురాలు, గర్భవతి, అనుకూల భావము లేనిది, ఇతరుని యందు కోరిక గలది, కామము లేనిది, ఇతరుని భార్య, ఆకలిచే కృశించినది, అతి భోజనము చేసినదియు నగు స్త్రీ గాని ఈ గుణములతో కూడియున్న తాను గాని సంగామమునకు పనికి రారు. స్నానము చేసిన వాడై మాలా గంధముల ధరించిన వాడై ప్రీతుడై అతి తృప్తుడుగాని వాడై ఆకలి గొనని వాడై సంగామేచ్చ గలవాడై అనురాగ వంతుడై పురుషుడు సంగమము చేయ వలెను. చతుర్దశి అష్టమి అమావాస్య పూర్ణిమ రవి సంక్రమణము అనునవి పర్వములు. ఈ పర్వము లందు తైలమును స్త్రీని మాంసమును అనుభవించు వాడు చనిపోయి మూత్ర పురీషము లాహారములుగా గల నరకమును చేరును. కావున పండితులు సమస్త పర్వకాలము లందు నియమవంతులై సచ్చాస్త్రము వేదము యాగము ధ్యానము జపము నందు ఆసక్తి గలవారై యుండ వలయును. ఇతర (గవాది) యోనియందు గాని, అయోని యందుగాని రసాయనాదికము సేవించి గాని దేవతలు ద్విజులు గురువుల యొక్క ఆశ్రమము నందుగాని సంగమము చేయరాదు. గుడి మొదలగు చోట్ల ఇంటి ముంగిట తీర్తము లందు గోశాల యందు నాలుగు వీధులు కలిసిన చోట శ్మశాన వనము నందు జలము లందు పైన చెప్పబడిన సమస్త సంస్థ పర్వములందు సంధ్యా సమయము లందు గాని మూత్ర పురీషములచే పీడితయైన స్త్రీని గాని మనస్సుతో గుడ సంగమించ రాదు. పర్వకాల సంగమము నిద్యము. దివా మిథునము పాపప్రదము. జలాశయ సంగమము రోగ ప్రదమగుటచే నప్రశస్తము. పరస్త్రీలను మనసు లోనైనను సంగమించ రాదు. సంగమించిన వారికి నేముకల సంబంధము లేని కృమి కీటకాది జన్మ వచ్చును. ఈ లోకమున ఆయువు క్షీణించును. మరణించిన తరువాత నరకము వచ్చును. పరస్త్రీ సంగమేచ్చ ఇహ లోక పరలోకము లందు రెంటియందును భయప్రదము. అది తలంచి స్వభార్య యందు ఋతు (4 నుండి 16 రోజుల వరకు) కాలమందు తెలిసిన వాడు సంగమించ వలెను. వెనుక చెప్పిన దోషములచే శూన్యులై సంగమేచ్చ గలవారు ఋతుకాలము కాని సమయము నందును ప్రవర్తింప వచ్చును.