విష్ణు మహా పురాణము

15 - దక్షుని తల్లి మారిష పాణి గ్రహణము

ప్రచేతసులు తపస్సు చేయుచుండ రక్షించు వారు లేక చెట్లు తెగ పెరిగి భూమి నావరించినవి. దాన ప్రజా క్షయ మయ్యెను. వాయువు వీవ శక్యము గాదయ్యె. చెట్లతో నాకసమెల్ల నిండెను. పదివేలేండ్లు ప్రజలు కదలి మెదల లేరైరి. వారిం జూచి ప్రచేతసులు కుపితులై ముఖముల నుండి వాయువును అగ్నిని సృష్టించిరి. వాయువు ఆ వృక్షములను మొదలంట గూల్చి ఎండించెను. అగ్ని వానిం దహించెను. అందుచే వృక్ష క్షయ మయ్యెను. చెట్లు కొద్దిగా మిగులుట చూచి రాజగు సోముడు ప్రజాపతుల దగ్గిరగా వచ్చి యిట్లనియె. ఓ రాజులారా! కోపమును నియమింపుడు. నా మాట వినుడు. చెట్లతో గూడ మీకు సంధానము (సంధి) నేను చేసెదను. ఈ చెట్లకు బుట్టిన సుందరి సుందరీ రత్నము. భవిష్యత్తు నెరింగి నేనీమెను నా కిరణములచే బెంచితిని. ఈమె ‘మారిష’ యను పేరిది. ఓ మహానుభావులారా! మీకీమె భార్యయగు గాక! మీ వంశాభివృద్ధి సేయును గాక! ఈమ మీ తేజస్సు సగము కలిసి యీమె యదు దక్షుడను ప్రజాపతి జ్ఞాని పుట్ట గలడు. మన యుభయుల తేజస్సుతో గూడి యతడగ్ని సమాన తేజస్వియై ప్రజలను సంవర్ధింప గలడు.

మున్ను కండువను ముని యుండెను. వేదవిదు లందగ్రేసరుడు చక్కని గోమతీ తీరమందా ముని తపము గావించెను. అతనిని క్షోభింప చేయ నింద్రుడు ప్రమ్లోచయను నప్సరసను బ్రయోగించెను. ఆశుచిస్మిత (అచ్చపు జిరనవ్వు గలది) యాతనిం గలసెను. ఆమెతో గలసి యాతడు నూరెండ్లు మించి మందర గిరి కందరమున విషయరతుడై యుండెను. ఆమె యాతనింగని మహానుభావ! దివంబున కేనేగ గోరెదను. ప్రసాద సుముఖుడవై ఓ బ్రాహ్మణ! నాకనుజ్ఞ యీదగుదు వనియె. అతడు విని యామె యందు మనసుగొని ఓ కళ్యాణి! కొలది నాళ్ళుండు మనియె. ఇట్లున్న తర్వాత నూరేండ్లు పైని జరిగినది. అతనితో నాతన్వి విషయము లనుభవించెను. అనుజ్ఞ దయ సేయుము. స్వర్గమునకు వెళ్ళెదనన నతడు వెండియు కొన్నాళ్ళు నిలువ మనియె. ఆమీద నూరేండ్లు పైగా గడువ నా చంద్రానన యల్లన నవ్వుచు ఓ బ్రాహ్మణ! దివమ్మున కేగెదనని వలపుమీర బలికెను. అది విని యమ్ముని యా విశాల నయనను జేతంకొని క్షణ ముండుము చిరకాల మైనది నిజమే. వెల్లుదువు గాని యనియె. ఆయన శాపమున కడలి యా పడతి కొంచే మించుమించుగా రెండు వందలేండ్లు కలిసి యుండెను.

దేవేంద్ర! రాజధానికి వెళ్ళెదనని యామె యడుగనడుగ నాతండుండు ముండు మనుచుండెను. ఆ యప్సరః కాంత శాపమునకు భయపడి దాక్షిణ్యముచే (ముగమోలుముచే) దక్షిణ గావున సరళ స్వభావంగాన (నేర్పరితనం గాన) ప్రణయ భంగమయి నప్పుడు కలుగు బాధ నెఱింగినది గావున యమ్మునిని విడిచి పోదయ్యెను. రాత్రిందివము లామేతో విహరించు చుండ మన్మథావిష్ట చేతస్కుడగు నతనికి వలపెప్పటి కప్పుడు క్రొంగ్రొత్తగా జొచ్చెను. ఒకతఱి తొందరగొని యమ్ముని పర్ణశాల వెడలి పోవుచుండెను. ఆయపస్సరయీ యేగుట యెక్కడికని యడిగెను. ప్రొద్దుగ్రుంకు చున్నది సంధ్యవార్చి కొందును. లేదేని గర్మలోప మగును.

అన విని, యా సురతి యల్లన నవ్వి ధర్మజ్ఞ! నీకిప్పుడా ప్రొద్దు గ్రుంకినది? ఓ విప్ర! అనేకేండ్లు నీకిట్లు ప్రొద్దు గ్రుంకినది. ఈ గడచిన దెవ్వరికి వింత గల్గింపదు? చెప్పుమన కండువు

కళ్యాణి! నీవీయుదయమే యీ నదీ తీరమునకు వచ్చితివి. నాకు గన పడితివి. నా యాశ్రమముం జొచ్చితివి. ఇదిగో సంధ్యాకాల మయినది. పగలు గడచినది. ఎందులకే పరియాచకము! నాకు నీ మంచి యభిప్రాయము చెప్పుము.

బ్రాహ్మణుడ! వేకువనే నేను వచ్చిన దానను. ఇది నిజమే అబద్దము గాదు. ఆ విధముగా గడచినా కాలము నూర్లకొలది సంవత్సరముల గడచినవి.

అన నావిప్రుడు సంభ్రమించి, యా విశాలక్షిని గని ఓ యబల! (భయ స్వభావ) నీతో నేను విహరించిన కాలమెంత?

తొమ్మిది వందల యేడు సంవత్సరముల ఆరు మాసముల మూడు రోజులైన దనెను.

ఇది నిజమా! పరిహాసమా చెప్పుము. నీతో నేనిచట నున్నది యొక్క దిన మనుకొను చున్నాను.

అబద్ద మోట్లాడుదును. అందును నీ దగ్గరనా? విశేషించి దారి ఏమాత్రము తప్పని తమరడుగు చుండగా నేనా యాసత్యము పల్కుట!

ఆమె పలుకు విని నిజ మనుకొని ఛీ! ఛీ! నేనెంత నింద్యుడనని తనను దానిందించు కొని, తపస్సులు నష్టము లయ్యె, బ్రహ్మవిదుల ధనము బ్రహ్మ(బ్రూణము) దెబ్బతిన్నది, నావివేక మెవ్వడో గాజేసెను. నన్ను మొహింపచేయ ఒక యాడుది ఎవ్వని చేతనో సృష్టింప బడ్డది. ఆత్మను జయించి (మనస్సును నిగ్రహించి) షడూర్ములకు నతీతమైన బ్రహ్మ వస్తువు నెఱుంగ వలసిన వాడను (షడూర్ములు= ఆకలి దప్పిక మోహము ముదిమి చావు) నా మతి దేన హరింప బడెనో యట్టి కామగ్రహము ఛీ చీయని నిందింప దగినది. వేద వేద్యమైన బ్రహ్మ వస్తువు నందింపగ హేతువునైన నా వ్రతము లన్నియు నరక గ్రామమునకు దారియైన సంగముచే నపహృతము లైనవి. అని యిట్లు ధర్మజ్ఞుడా ముని తనకు దానిందించుకొని యెదురు గూర్చున్న యాయప్సరసం గని యిట్లనియె. ఓ పాపురాల! పో నీ యిచ్చ వచ్చినట్లు పొమ్ము. నీ హావభావ విలాసముల నాకు క్షోభ గలుగజేసి దేవేంద్రున కేమేమి పని చేయ వచ్చితివో యంత సేసితివి.

కోప తీవ్రమైన యగ్నిచే నిన్ను నేను భస్మము సేయను. మైత్రి యనునది సత్పురుషునకు సప్త పదము (ఏడడుగులు కలిసి వేయుట లేక ఏడు మాటలు మాట్లాడుట వలన నేర్పడునది) నీతో నేనుంటిని. అదిగాక నీ తప్పేమీ? నీ యెడల కోప పడుచున్నాను. ఇది నాదే తప్పిదము. ఇంద్రియ నిగ్రహము లేని వాడను నేను. శక్రుని ప్రియముగోరి నా తపస్సు నశింప జేయబడినది. ఛీ ఛీ మహా మొహపేటిక, సర్వాసహ్యవయిన నీకు నిందయగు గాక!

అని యా విప్రర్షి యా రమణి నిట్లు పలుకునంత యామె యోడలెల్ల జెమట జాలువార మిగుల వణికి పోయెను. అట్లు వడంకుచు మెయిదగ జెమట గ్రమ్మ నిలిచిన దానింగని కినుకుతో నమ్ముని పోపోమ్మనెను.

ఆమె యట్లు బెదరింప బడి యయ్యాశ్రమము వెడలి ఆకాశ గమనమున నేగుచు చెట్లకెంజిగురున నొడలు దుడిచి కొనుచు చెట్టు నుండి చెట్టున కడుగు విడుచుచు బోయెను. ఆ ఋషిచే నామే యందేర్పడిన గర్భము (శిశువు) మెనూ గగుర్పొడువ చెమట రూపున నామే యోడలి నుండి బయలి వెడలెను. ఆ గర్భమును వృక్షములు చేబట్టినవి. వాయువేక మొనర్చెను. నాచే కిరణములచే నాప్యాయితమై యది వృద్ది నందెను. ఆ వృక్షాగ్ర గర్భ మందుండి మారిష యను నొక రమణి యుదయించెను. ఆమెను వృక్షములు మీకు గన్యగ నిచ్చును కావున శమింపుడు అని సోముడనెను.

ఈ విధముగా కండువు సంతాన మయిన యా కన్య వృక్షముల నుండి వెడలినది నాకునిది కూతురు. వాయువునకును, ప్రమ్లోచకును. ఆ కుండు మహర్షి యట్లు తపస్సు క్షీణింప నడరి యందున్న పురుషోత్తమ మను విష్ణువు నాలయమున కేగి ఏకాగ్ర మతియై యూర్ధ్వబాహువై మహాయోగియై బ్రహ్మపారమును నీ స్తోత్రమును జపించుచు విష్ణు నారాధానము గావించెను. అన విని

 విష్ణుపారమను పరమోత్తమ స్తవము విన కుతూహల పడుచున్నా మన సోముండిట్లా నతినిచ్చె.

ఈ బ్రహ్మపారస్తవము జపించుచు కండుముని హరి నర్చించి పరమ సిద్ది నందెను. ఈ స్తవము నిత్యము పఠించు వినునాతడు కామ దోషముల నుండి విడివడి యభీష్టము నందును.

అంతట నా సోముని మాట ననుసరించి ప్రచేతసులు కోప ముపసంహరించి ధర్మ విదినామేను వృక్షముల నుండి గైకొనిరి. ఆమె యందు పదిమంది ప్రచేతసులకును బ్రజాపతి దక్షుడు మహానుభావుడు జనించెను. మున్నాయనయే బ్రహ్మ కుదయించి యుండెను. ఆ దక్షుడు సృష్టింబెంప గుమారులం గనెను. వారు కొందఱు శ్రేష్ఠులు కొందఱు తక్కువ వారు. ద్విపాదులు చతుష్పాదులు బ్రహ్మ నిదేశమును బాటించి వారింగని మనస్సుచే నేబది మందిని స్త్రీలనుం గనెను. అందు బదిమంది ధర్మునకు పదముగ్గురు కాశ్యపునికి కాల గమనమునకు చంద్రున కిరువది ఏడుగుర నొసంగెను. వారి యందు దేవతలు దైత్యులు నాగులు ఖగములు(పక్షులు) గంధర్వులు అప్సరసలు దానవాదులు జనించిరి. ఆ మీద నుండి ప్రజలు మైథున సంభవులైరి. ఆ ముందటి వారికి సంకల్పము దర్శనము స్పర్శ మాత్రమున సంతానము గల్గెడిది. ఆ కాలమున వారు మిగుల తపస్సులు తపో విశేష సిద్దులునై యుండిరి. కావున నట్లు జరిగినది.

కుడి బొటన వ్రేలినుండి దక్షుడు పుట్టెనని మున్ను విన్నాను. ఓ మహాముని! అతడు మఱి ప్రాచేతసుల కెట్లు జనించెను? ఈ సందియము నా హృదయ మందున్నది వారింపుము. సోమునికి దౌహిత్రుడైన వాడతడు మామ గారెట్లయ్యె?

ఓ మునిసత్తమ! భూతముల యందు పుట్టుట గిట్టుట అనునది నిత్యము. మునులు మఱి దివ్య దృష్టిగల మహానుభావులు గూడ యిందు బొర బడుదురు. ఈ దక్షాదులు యుగ యుగమున గలుగు చుందురు. మఱి పోవు చుందురు. జ్ఞాని యందు మొహమొందడు. ఓ విప్రోత్తమ! మునుపు వీరుకి పెద్ద చిన్న భేదము లేదు. తపస్సు, ప్రభావమే యీ పెద్దరిక మునకు చిన్నరికమునకు గారణ మయి యుండెడిది.

దేవ దానవ గాంధర్వ నాగ రక్షస్సుల యుత్పత్తిని విస్తరముగ నిపుడానతిమ్మన

బ్రహ్మ దక్షునిం గని ప్రజలను సృజింపు మన నాతడెట్లు సృజించెనో వినుము. మనసు చేతనే భూతముల నాతడు తొల్త సృజించెను. వారు దేవర్షి గాంధర్వ సుర పన్నగులు. దాన ప్రజావృద్ది కాదయ్యెను ఆమీద నా ప్రజాపతి యాలోచించి మైథున ధర్మముచే ప్రజా సృష్టింబెంప నెంచి వీరణ ప్రజాపతి కూతురు నసిక్ని యనునామెం గ్రహించెను. ఆమె మహా తపస్విని. లోక ధారిణియును. ఆమె యండత దైడువేల మందిని మంచి బలశాలురైన గుమారులం గనెను.

సంతాన వృద్దింగావింప నున్న వారింగని నారదుడిచ్చక ములాడి యా దేవర్షి, ఓ హర్యశ్వులార! మహా వీరులార! మీరు సంతానాభి వృద్ది చేయనున్నారు. మీ ప్రయత్నము దెలిసినది. మీరిది వినుడు. మీరందరు బాలిశులు(స్థాబ్దులు, శిశువులు) ఈ భూమి యడుగు మీరేమో యెఱుగరు. మీరు పిల్లల నెట్లుగందురు? మీరీ భూమి యొక్క క్రిందు మీదులు దీని యంతును అప్రతిహత గతినెఱింగి చూచి రండు. అన వారామాట విని నలుదేసల కుంబోయిరి. సముద్ర గాములయిన నదులట్లు వారింత వరకు తిరిగి రానేలేదు. అట్లా హర్యశ్వులు పోవ ప్రాచేతసుడు మఱియు వైరిణి యందు వేయి మందిని సృజించెను. బలాశులను పేరివారు వారు సృష్టింబెంప బూనినంత నారదుని ప్రేరణచే నొండొరులు “మహా ముని యీయన నిజ మాడెను. మనమన్నల దారినే పొడగును. సంశయము లేదు. భూమి యొక్క ప్రమాణ మెరింగి ప్రజలను సృజింతము అని వారు నదే దారిని నలుదెసల కుంబోయిరి. సముద్ర గాములయిన నదులట్లు తిరిగి రానేలేదు. అప్పటి నుండి అన్నను వెదక బోయిన తమ్ముడు నశించును. ఇందు విమర్శింప బనిలేదను న్యాయ మేర్పడెను.

దక్షుడు వారుంబోయిరని తెలిసి కోపముం గొని నారదుని శపించెను. మైత్రేయ! ఆ మీద ప్రజాపతి సృష్టిం గోరి వైరిణి యందు అరువది మంది కన్యలం గనెనని మేము విందుము. అందు పది మందిని ధర్మునకు, కాశ్యపునకు బదముగ్గురును, నిరవది యేడుగురను సోమునికి, అరిష్టనేమికి నల్గురన, ఇద్దరిని బహు పుత్రునికి, ఇద్దరి నంగిరసునకు, నిద్దరిని భ్రుశాశ్వునకు నిచ్చెను. వారి పేరులివి. అరుంధతి, వసువు, జామిలంఘ, భానువు, మరుద్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్యవిశ్వ వీరు పది మంది ధర్ముని భార్యలు. వారి సంతానము విశ్వదేవులు విశ్వకు, సాధనకు సాద్యులు, మరుద్వతికి మరుద్వంతులు, వసువునకు వసువులు, ముహూర్తకు ముహూర్తులు, భానునకు భానువులు, లంఘకు ఘోషుడు, జామికి నాగవీథి, అరుంధతికి పృథివీ విషయమైన సర్వము, సంకల్పకు సంకల్పుడు నుదయించిరి. జ్యోతిః, ప్రభృతులు అనేక వసు ప్రాణులు వసువు లెనమండుగురు. వారి వంశ విస్తర మెరిగించెద. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధర్ముడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అను వారు వసువులు.

ఆపుని కొడుకులు స్తబ్ధుడు శ్రముడు శ్రాన్తుడు దుని యనువారు. ధ్రువుని కొడుకు కాల భగవానుడు. ఆయన లోక ప్రకాలనుడు. లోకము యొక్క లెక్కగట్టు వాడన్న మాట. సోముని కొడుకు వర్చుడు. వాని కొడుకు వర్చస్వి. ధర్ముని కొడుకు ద్రవిణుడు హుతహవ్య వరుడును. మనోహర యొక్క కొడుకు శిశిరుడు ప్రాణుడు రమణుడు ననువారు. అనిలుని భార్య శివ, కొడుకు పురోజవుడు, అతని వెనుక శాఖుడు విశాఖుడు నైగామేషుడు ననువారు పుట్టిరి. కృత్తికల బిడ్డ కార్తికేయుడు. ప్రత్యూషుని కొడుకు దేవలుడను ఋషి. దేవలుని కొడుకు లిద్దరు. వారు క్షమావంతులు (ఓరిమి గలవారు), మనీషులును (బుద్ది మంతులు). బృహస్పతి చెల్లెలు బ్రహ్మచారిణి యోగ సిద్దురాలు దేని యందు ఆసక్తి లేక (విరక్తయై) ఎల్ల జగమ్ముల గ్రుమ్మరు చుండెను. ఆమె వసువలలో నెనిమిదవ వాడగు ప్రభాసుని భార్య. ఆమె యందు విశ్వకర్మయను ప్రజాపతి శిల్ప సహస్రకర్త దేవతల వడ్రంగి సర్వ భూషణములు చేయువాడు శిల్ప శిరోమణి. దేవతల విమానముల నిర్మించిన వాడాతడు. ఆయన శిల్పమును అనుసరించి శిల్పులై మనుష్యులు జీవనము సేయుచున్నారు.

అజైకపాత్తు అగిర్భుధ్నుడు. త్వష్ట విశ్వరూపుడు హరుడు బహురూపుడు త్ర్యంబకుడు వృషాకపి శంభువు కపర్ది దైవతుడు మృగవ్యాధుడు శర్వుడు కపాలి యనువారు. వీరేకాదశ రుద్రులు త్రిభువనేశ్వరులు కాశ్యపునికి భార్య యందు నూరుగరు రుద్ర సంతతి గల్గిరి. అదితి దితి దనువు అరిశా సురస కష సురభి వినత తామ్ర క్రోధవశ ఖలా కద్రువు ముని అనువారు కాశ్యపుని భార్యలు. చాక్షుష మన్వంతరము రాగా వీరరొండొరులు మనువునకు సంబంధింప బడిరి. దేవతలారా అదితిని జొచ్చి చాక్షుష మన్వంతరములో సంతతిగా పుట్టుదము. దాన మనకు శేయస్సు కల్గునని పిలిచికొని మరీచి కొడుకగు కాశ్యపుని వలన దక్ష కన్య యగు నదితి యందు దేవతలు పుట్టిరి. అందు విష్ణువు ఇంద్రుడు మఱల జన్మించిరి. అర్యముడు దాత త్వష్టపూష.

వివస్వంతుడు సవిత మిత్రుడు వరుణుడు అంశువు భగుడు అతి తేజుడు ననువారు వారే ద్వాదశాదిత్యులు. చాక్షుష మన్వంతరమున తుశితులను దేవతలు వైవస్వత మన్వంతరమున ద్వాదశాదిత్యు లయిరి. సోముని భార్య లిరువది ఏడుగురు సువ్రతలు. వారికి తేజో వంతమయిన సంతానము గల్గినది. అరిష్టనేమి పత్నులు సంతానము పదునార్గురు. బహుపుత్రుడు జ్ఞాని ఆయన కొడుకులు విద్య్త్తులను వారు నల్గురు. ప్రత్యంగిరుని కొడుకులు బ్రహ్మర్షి పూజితులు ఋక్కులు దేవర్షియగు భృశాశ్వుని కొడుకులు దేవ ప్రహారణులు. వీరు వేయి యుగముల తర్వాత మరల జనింతురు. ముప్పది మూడు దేవ గణముల వారు వారు స్వచ్చందజులు. వారి సంతానమును నిరోధమును చెప్పెద సూర్యుని కుదయాస్తమయము లట్లు దేవతలును యుగయుగము లందు బుట్టు చుందురు. కాశ్యపుని వలన దితికిద్దరు కొడుకులు పుట్టిరని విందుము. వారు హిరణ్య కశిపుడు. హిరణ్యాక్షుడును.

సింహిక యను కూతురు పుట్టినది. ఆమె విప్రచిత్తికి భార్య. హిరణ్యకశిపుని కొడుకులు అనుహ్లాదుడు హ్లాదుడు ప్రహ్లాదుడు సంహ్లాదుడు ననువారు నల్గురు. దైత్యవంశ వర్ధనులు. అందరిలో మహానుభావుడు సుదర్శనుడు జితేంద్రియుడు ప్రహ్లాదుడు విష్ణువు నందు పరమ భక్తి గలవాడు. వాసుదేవు డాతని హృదయము నందున్నందున దైత్యేంద్రుడు దీపితమైన అగ్ని సర్వాంగము లందు రగుల్కొల్ప బడియు నాతని దహింపదయ్యె. ఏ మహానుభావుడి పాశముల బంధించి మహార్ణవ మందు దండ్రి త్రోయగా నందాతడు కదలినంత భూమండల మెల్ల గదలి పోయినది. వివిధాయుధ విహతుడైన నాతని శరీరము కందదయ్యె. అచ్యుతు నందు బుద్ది నిలిచిన యాతనిని విష జ్వాలలు జిమ్ము మహాసర్పము లేమియు సేయ లేవయ్యె. కొండల నుండి దొర్లించిన విష్ణు స్మరణ దంశితుడై (విష్ణు స్మరణమను కవచము గోన్నవాడై దంశనము = కవచము) ప్రాణములు వాయడయ్యె, మీది నుండి భూమికి హిరణ్యకశిపుడు విసరిగొట్టగా గ్రిందబడు నాతనినవని యెత్తుకొని రక్షించినది మధుసూదను డాతని చిత్తమందు న్నందున దైత్యేంద్రుడు ప్రయోగించిన సర్వశోషంకుడైన వాయు వాతనిని శోశింప జేయడయ్యె (ఎండింప లేడయ్యె). పైగా తానే శోషించి పోయెను. ఎవని రోమ్ముదాకి రాక్షస రాజు ప్రేరణమున ప్రయోగించిన దిగ్గజములు దంతభంగము నందెనో, దైత్యరాజ పురోహితులు పుట్టించిన క్రుత్యయను శక్తి యెవ్వని తుదముట్టింప లేనిదయ్యెనో అట్టి గోవిందైక చిత్తుడు ప్రహ్లాదుడు మహాభక్తుడు. శంబరాది మయా సహస్రము విష్ణు చక్రముచే నట వ్యర్ధమయ్యెను. హిరణ్యకశిపుని వంటివాడు పెట్టిన మితిమీరిన హాలాహాల విషమును మాత్సర్య మేమియుం గొనక యా భక్త శిరోమణి జీర్ణ మొనరించు కొనెను. తన యందు నఖిల భూతము లందు సమాహి తత్వంబున బరుగు మైత్రగుణ సంపన్నుడు సంపన్నుడు ధర్మాత్ముడు సత్యషౌచాది గుణ రత్నాకరు డేల్లప్పుడు అశేష సాధువులకు సమానమై ప్రహ్లాదుడు భాసించెను.