యోగ్యుడగు ధ్రువుని వలన శంభువను నామే శిష్టి భవ్యుడు నను పుత్రులం గనెను. శిష్టి వలన సుచ్చాయ, రిపుడు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు నను నైదుగురు కొడుకులం గనెను. రిపుని వలన చాక్షుషి యనునామె సర్వ తేజస్సంపన్నుడైన చాక్షుషునిం గనెను. చాక్షుషుడు వీరణ ప్రజాపతి కూతురగు పుష్కరిణి యందు మనువుం గనెను. వైరాజ ప్రజాపతి కుమార్తె యగు నడ్వల యందు మనువునకు బదిమంది తనయులు గల్గిరి. కురువు, పరువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవంతుడు, శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు ననువారు తొమ్మిది మంది. పదియవ యతడు అభిమన్యుడు. అందరు మహాబల సంపన్నులు. ఆగ్నేయ కురువు వలన మంచి ప్రతిభావంతుల నార్వురు కొడుకులం గనెను. వారు అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, శిభి అను వారార్గురు. అన్గుని వలన సునీథ వేనుని గనెను. ఋషులు సంతతి కొఱకాతని కుడి హస్తము వధించిరి. అందు పృథువు మహాతేజస్వి యుదయించెను. అతని చేత ప్రజాహితమునకై భూదేవి గోవుగానై పిదుక బడినది.
మైత్రేయుడా కథ నానతిమ్మన శ్రీపరాశరుం డిట్లనియె.
మృత్యువు పెద్ద కూతురు సునీధ యంగుని కీయబడినది. అతడు మాతామహుని దోషముచే (తాత పోలిక గొని) స్వభావము చేతనే దుష్టుడయి పుట్టెను. పరమర్షులు వానిని రాజ్యమందు బట్టాభిషేకించిరి. అతడు వెంటనే పృథివెల్ల నిట్లు చాటింపించెను. యజ్ఞములు సేయరాదు. ఎవ్వరికి నెవ్వ రీయరాదు. అగ్ని హోత్రములు సేయ రాదు. యజ్ఞ భోక్త మరియొక డెవ్వడు. నేనే యజ్ఞపతిని. ప్రభువును. అంతట పరమర్షు లేతెంచి తొలుత మహీపతి గదా యని పూజించి, సామ మధురముగ నిట్లు పలికిరి.
రాజా! రాజ్యము దేవోపభోగమునకు ప్రజా హితమునకును నుద్దేశింప బడెను. యజ్ఞము నందు యజ్ఞేశ్వరుడు మాచే ప్రీణితుడై నీకెల్ల కోరికల నీయ గలడు. ఏ రాష్ట్రమందు యజ్ఞ మందు యజ్ఞాపతి పూజింప బడునో యా రాజుల కభీప్సితార్థముల నాయన ఇచ్చును. అన వేనుం డిట్లనియె.
నాకంటే గొప్ప వాడు నాకంటే నారాధింప వలసిన వాడు మరి ఎవ్వడున్నాడు? మీకు యజ్ఞేశ్వరుడీ హరి యెవ్వడు? బ్రహ్మ జనార్ధనుడు శంభువు ఇంద్రుడు వాయువు యముడు రవి అగ్ని వరుణుడు ధాత పూషభూమి చంద్రుడు మరి శాపానుగ్రహ కారులయిన యితర దేవతలు రాజ శరీర మందున్న వారు. నృపతి సర్వ దేవమయుడు. ఇది తెలిసి, నేనోసంగిన యాజ్ఞ నందరుం జేయ వలయును. దానము సేయరాదు, హోమము సేయరాదు, యజ్ఞములు సేయ గూడదు. స్త్రీలకు భర్త యొక్క సేవ పరమ ధర్మమయినట్లు, ఓ విప్రులార మీకు నా యాజ్ఞా పాలనము ధర్మమూ.
ఓ మహానుభావ! అనుజ్ఞ ఇమ్ము. ధర్మము సంక్షయ మందరాదు. ఈ సకల జగత్తు దేవతల కిచ్చు హవిర్భాగముల యొక్క పరిణామమే కాని వేరు గాదు.
అని పరమర్షులు విన్నవించినను వినక మరిమరి తెలియ జెప్పినను ననుజ్ఞ యివ్వకున్నంత నమ్మహర్షులెల్ల కుపితులై వీనిం జంపుదము జంపుదమని యొండొరులను కొనిరి. యజ్ఞ పురుషుని విష్ణుని ఆదిమధ్యాంతములు లేని వానినెవ్వడు దూషించునో యా దురాచారుడు భూపతిగ నుండదగడు. అని మంత్ర పవిత్రములయిన కుశలచే భగవన్నిందచే నీవరకే చచ్చినవానిం జంపిరి. అంతట నమ్మునులంతట రేగిన రేణువును (ధూళిని) జూచిరి. దరినున్న వారి నిదియేమి యని యడిగిరి. రాష్టములో జనులు దొంగలై పరదార ధనముల హరించు చున్నారని లోకులు తెల్పిరి.
మిక్కిలి వేగముగా విజృంభించిన యా దొంగల వలన రేగిన దూళి యిదియన విని, మునులాలోచించి అపుత్రకుడైన యా వేనుని తోడను మథించిరి. వాని యూరువు నుండి కాలిన యినప ప్రతిమం బోలిన యొక్క మరుగుజ్జు పుట్టె. నేనేమి చేయవలెనని తొందర పాటున యమ్మునుల నడిగెను. వారు నీషీద (కూర్చుండ) మనిరి. దాన వాడు నిషాదుడను పేరొందెను. (బోయ జాతి వాడయ్యేనన్న మాట) వాని సంతానము వింధ్య శైల వాసులయిరి. వాండ్రందరు పాప కర్మ పరులు. ఆ వేనుని పాపము వాని ద్వార తొలగి పోయినది. అవ్వాల నాతని కుడిచేయి మథించిరి. అందుండి పృథువు అగ్నివలె దేదీప్యమాన మూర్తియై యుదయించెను. ఆ వెంటనే ఆజగవమను విల్లు దివ్య భాణము కవచము నింగి నుండి పడినవి. అతడు జనించిన తఱి సర్వ భూతము లానందభరితము లైనవి. అట్టి యుత్తమ పుత్రా లాభముచే వేనుడు స్వర్గమున కేగెను. పున్నామ నరకము నుండి త్రాయతి (కాపాడు వాడు), పుత్రుడు అన్న పేరు పృథునికి సార్థకమయ్యె. అతనికి సముద్రములు, నదులు, రత్నములం జేకొని తన యుదకములచే నభిషేకింప పచ్చినవి. బ్రహ్మయు వేల్పులతో అంగిరసులతో దయ చేసెను. స్థావర జంగమును జీవ కోట్లన్నియు వచ్చి వైన్యు నభిషేకించినవి.
ఆయన కుడి చేతిలో చక్రరేఖ చూచి బ్రహ్మ యీతడు విష్ణ్వంశ సంభూతుడని సంతోషించెను. ఏ చక్రవర్తి హస్తమందు విష్ణుచక్ర రేక యుండునో ఆతడవ్యాహత పరాక్రముడై దేవతలకు గూడ ఆజయ్యు డగును. మంత్ర కోవిదులైన విప్రులు పృథుని గొప్ప రాజ రాజ్యాధికారమందు యథావిధిగా నభిషేకించిరి. తండ్రిచే నిడుమలు వడిన ప్రజలాతనిచే ననురాగముతో ననురంజితులైరి. దాననతనికి ‘రాజు’ అను శబ్దము సార్థకముగ నేర్పడినది. (రంజనాత్ రాజా) సముద్ర గాములయిన నీరతనిచే స్తంభింప జేయ బడినది. పర్వతములు దారి యిచ్చినవి. అతని ధ్వజమునకు, పతాకమున కెందును భంగము లేకుండెను. ఇరుకైన యడవులలో కూడా యతని జెండా దించవలసిన పని లేడయ్యెను. దున్నకయే భూమి పండెను. సంకల్ప మాత్రమున నన్నములు సిద్ధము లయ్యెను. గోవులు సర్వ కామములను జేసినవి. పట్టుపట్టునను తేనెలు గురిసినవి. అతడు పుట్టగానే బ్రహ్మ దేవతాక యజ్ఞమందు సూత్యాహస్సు నందు సూతి యందు మహాబుద్ధిశాలి సూతుడు పుట్టెను. అందే ప్రాజ్ఞుడు మాగధుడును జనించెను. మునులా యిద్దరను సూత, మాగధులని పేర్కొనిరి. మీరు పృథు చక్రవర్తిని (అతని కీర్తిని) గానము సేయుడు. ఇది మీకు విధి నిహితమైన పని కాగలదనిరి. వారు చేతులు జోడించి మునులతో నిపుడే ఆవిర్భవించిన యీ చక్రవర్తి చేసిన పనులు చరిత్రాయు మాకు దెలియవు గదా, ఇతని గుణములు మాకు దెలియవు. ఇతని కీర్తి ప్రసిద్ధము గాదు. దేనిని గురించి స్తోత్రము సేయవలెనో యానతిండన ఋషు లిట్లనిరి.
ఈ చక్రవర్తి మహాబలుడయి యీ పైనేమి పనులు సేయగలడో చేయబోవునో ఆ పనులనే కీర్తింపుడనిరి.
వారు చేసిన స్తుతుల విని యారేడు పరమానంద మందెను. సుగుణ సంపదచే మానవుడు శ్లాఘుడగును. కావున నా లక్షణములు శ్లాఘ్యములు గావలయును. అందుచే నీ వందిమాగధులు సేసిన గుణ వర్ణనము ననుసరించి యా పనులే నేను స్థిర చిత్తముతో చేసెదను. వీరు చేయ గూడదని వర్ణించిన పనులను మానెదను అని నిశ్చయించు కొనెను. ఆ బుద్ధి మంతుని జరుపబోవు నుత్తమ కార్యములను సుస్వర లయాను రంజనముగ వారు గానము సేసిరి. సత్య వచనుడు, దాన శీలుడు, సత్య సంధుడు, హ్రీమంతుడు (హ్రీ యనగా మనము సేయు పనిని పెద్దలు మహానుభావులు మెచ్చు కొందురో లేదో యెక్కడ పొరపాటు జరిగిపోవునో యను బెదురు, ఒంచాడింపు అం జాతీయమైన తెలుగు), మిత్రభావుడు, క్షమావంతుడు, పరాక్రమవంతుడు, దుష్ట శాసకుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దయాళువు, ప్రియబాషి, మాన్యులను గౌరవించు వాడు, యజ్వ (యజ్ఞములను సేయువాడు), బ్రహ్మణ్యుడు (బ్రహ్మ జ్ఞాని, సాధువుల యెడ వాత్సల్యము గలవాడు), శత్రువునెడ మిత్రునెడ వ్యవహారము లందు సముడు. ఇట్లా సూతమాగధులు పాడిన గుణములను హృదయ మందిడుకొనెను. అట్టి పనులే చేసెను. ఇట్లాతాడు పృథివిం బాలించుచు భూరిదక్షిణములైన యజ్ఞములను పెక్కులు సేసెను. అంతమున్న రాజకమైన కాలమున (వేనుని వాలమున) సర్వౌషదులు నష్టములై నందున నాకలి కల్లాడి ప్రజలా భూనాథుని దరికేగిరి. అతడు రాకకు కారణ మడిగినంత ఓ నృప శిరోమణీ! ఇంతకూ మున్న రాజ్యమందు ధరిత్రి యందలి యౌశథులన్నియు నశించినవి. దాన ప్రజలు నశించు చున్నారు. విదాతచే (బ్రహ్మ) మాకు నీవు జీవన విధాతయగు ప్రజా పాలకుడుగా జూప బడినావు. ఆకలి నలమటించు మాకు జీవనౌషధులను దయ సేయుము. నావిని పృథు చక్రవర్తి ఆజగవమను దివ్య ధనువు దివ్య బానములను గొని కినుక గొని, వసుంధర పైకి బరుగిడెను. ఆ దేవి జడిసి పోయి గొవి సత్వరమ బ్రహ్మాదుల లోకములకు బారి పోయెను. ఎటనెట నా దేవి సనె నటనట తనముందా భూతధాత్రి ఆయుధ మెత్తియున్న ఆ వైన్యుని దర్శించెను. అవ్వల నవ్వసుధ పృథు పరాక్రముడైన పృథు చక్రవర్తిం గని, గడగడ వడుకుచు రక్షణకై తహతహ లాడుచు నిట్లనియె.
అక్కట! నను దుదముట్టింప వలయునని యత్నించు చున్నావు. నరేంద్రా! స్త్రీ వధ యందు పాపమును గమనింపవ! యన
ఓ దుష్టకారిణీ! ఒక్కని గడతెరచిన పెక్కు మందికి క్షేమము గల్గు నపుడమ్రుక్కడిం దుద ముట్టించుట పుణ్యము.
ప్రజోపకారమునకు నీవు నన్ను హత మొనర్తువేని నీ ప్రజల కాధార మేముండ గలదు? అనెను.
నా యాజ్ఞకు బెడమొగమైన నిన్ను జంపి మా యోగ బలముచే నీప్రజలను నేను భరింతును. అన వసుంధర యా ఱేనికి బ్రణతయై మేను వడంక పరమ భయమంది సర్వ ప్రారంభములు (పనులు) ఉపాయము వలన నెరవేరును. అందువలన నీకొక యుపాయమే నెరింగించెద. నిష్టమేని యట్లు సేయుము. నాచే జీర్ణములైన మహౌషదుల నన్నిటి క్షీర రూప పరిణామము నొందించి యేనిచ్చెద. కావున ప్రజల హితమునకో ధార్మిక సార్వభౌమ! నాకొక దూడ నోసంగుము. దానియందేను వత్సలనై పాలు చేపెడను. అంతియ కాదు, లోగడ నేగుడు దిగుడైన నన్ను సమస్థితిం బొనరింపుము. వనౌషదులకు బీజమైన పాలను నేనంతట భావింతును. (భావనా మాత్రమున నవి స్రవించు నన్నమాట).
అది విని పృథువవనిం గల పర్వతములను ధనుష్కోటిచే బెల్లగించి మీది కెత్తెను. దాననవి పెరిగినవి. పూర్వ సృష్టి యందు భూతలము మిత్తపల్లముల నెగుడు, దిగుడై యుండి పురగ్రామ విభాగము లేకుండెను. అప్పుడు పంటలు లేవు. గో రక్షణ లేదు. వ్యవసాయము లేదు. వర్తకము లేదు. ఇదంతయు నీ వైన్యుని దగ్గర నుండియే యైనది. ఎటనెట భూమి చదునయ్యే నటనట బ్రజలు నివసింప నీ రాజు గోరెను. అపుడు ప్రజలకు గందమూల ఫలాదు లాహార మయ్యె. అదికూడ కష్టమై యోషాదులు క్షీణింప నీ పృథువు స్వాయంభువ మనువును దూడగా సంకల్పించి (ఏర్పరిచి) తన చేతితో నా పృథివీపతి పృథివిం సర్వ సస్యముల విత్తనముల బిదికెను. ఆనాడతడట్లు కల్పించిన యన్నము చేతనే నాడు నీ నాడును బ్రజలు జీవించు చున్నారు. ఆ ప్రభువు ప్రాణ ప్రదాత. భూమికి తండ్రియు నయ్యె. అందుచే నఖిల ధారిణి యైన యీ ధారుణి పృథివి యను పేరోందె. (పృథువు యొక్క కూతురు, స్త్రీ సంతానము పృథువి యన్న మాట)
అవ్వల దేవతలు మునులు దైత్యులు రక్షస్సులు పర్వతములు గంధర్వులు నాగులు పితరులు మరి యెల్లరకు నా యా పాత్రలం జేకొని యాయా వర్గమున కనువైన పాలు దూడలు పితుకు వారు వారివారికి మూలమైనది. ఆ యీ ధాత్రి సర్వ జగమ్మునకు ధాత్రి ధారణి పోషిణియై పృథ్వీ విష్ణుపాద తలము నందు జనించినది. ఆ పృథువిట్టి ప్రభావము గలవాడు. వేనుని పుత్రుడు. వీర్యవంతుడునై యవతరించెను. జన రంజనము సేసి తొంటి రాజైనాడు. వేనుని కొడుకగు పృథువు యొక్క యీ జన్మ వృత్తమును గీర్తించిన నరునికి తొల్లి చేసిన పాపమే కొంచెమేని ఫలింపదు. ఇది చదివిన విన్న దుస్స్వప్న దోషోప శమనము. ఈ పృథు చక్రవర్తి జన్మ వృత్తాంతము ప్రభావమును నిరంతర శుభకారకము.
Summary of chapter 13 of the Vishnu Mahā Purāṇa is as follows:
Aṅga, a descendant of the Svāyambhuva line, performs yajña to obtain a son but receives only an adharmic son: Vena. Vena grows up denying the authority of the Vedas and forbidding all yajña and worship, declaring himself the supreme deity. The ṛṣis warn him repeatedly; when he refuses to reform, they kill him with kuśa grass charged with mantric power. With the royal lineage broken and the earth degenerating, the ṛṣis churn Vena's dead right arm; from it emerges Pṛthu — blazing with divine splendor, bow and armor in hand, already fully formed as a sovereign and warrior. Pṛthu is recognized as a partial manifestation of Viṣṇu.