విష్ణు మహా పురాణము

16 - ఋభు నిదాఘ సంవాదము

వేయేండ్లయిన తరువాత ఋభువు నిదాఘునికి జ్ఞాన మనుగ్రహింప నా నగరమున కేగెను. నగరము వెలుపల నమ్ముని. రాజు మహాజన పరివారముతో పుర ప్రవేశము చేయు చుండగా దూరమందు జన సమ్మర్ధము లేకుండ నిలువ బడిన వానిని ఆకలిచే దడియారిన కంఠముతో సమిధలు దర్భలు పట్టుకొని వచ్చుచున్న నిదాఘుని చూచి సమీపించి, మ్రొక్కి నీవేకాంత మందెందులకున్నావని యడిగెను. అంత వారి కిట్లుత్తర ప్రత్యుత్తరములు జరిగిని.

రాజా! జన సమ్మర్థముతో నీ మహారాజు చక్కని పురముం బ్రవేశింప దలచి యున్నాడు. అందువలన నిట నిల్చితిని.

నీవు తెలిసిన వాడవని తోచు చున్నది. ఇక్కడ రాజెవడు? మఱి యితర జనులెవ్వరు?

పర్వత శిఖతము వలె ఉన్నతముగ నున్న గజేంద్రము నెక్కిన వాడు నరేంద్రుడు, ఇతరులు పరిజనులు.

ఈ ఏనుగు రాజును నీచే నాకొకమారే జూప బడినారు తమచే నిద్దరును వేరు వేరుగా జూప బడలేదు. కావున నో మహానుభావా! ఇక్కడ గజమేది? రాజెవాడు? ఈ యొండొరులకు విశేషమేమి సెలవిమ్ము.

ఆ క్రిందుగా నున్నది ఏనుగు. దీని మీదనున్న వాడు రాజు. ఒకటి మోసేది ఒకడు మోయ బడువాడు. ఈ వాహ్యవాహక సంబంధ మెవ్వడెఱుంగడు?

నేనెట్లు తెలిసి కొందునో యట్లు చెప్పుము. అధశ్శబ్ధముచే చెప్ప బడునదేది? ఊర్ద్వశబ్ధ వాచ్యమేది? అని పలుకగా నిదాఘ ముని పైకి ఎక్కి యిట్లనియె. రాజువలె నేను పైన, ఏనుగువలె నీవు క్రింద నున్నావు, బ్రాహ్మణుడా! నీకు దృష్టాంతము చూప బడినది. తెలిసికొనుము.

బ్రాహ్మణోత్తమా! నీవు రాజు వలెను నేను గజము వలెనున్నచో నీవేవ్వడవు? నేనెవ్వడను? అని ఋభువు పలుకగా నిదాఘు డాతని పాదముల కొఱగి యిట్లనెను. మీరు నా గురువులగు ఋభు మహర్షులు. నిశ్చయము, మఱి యితరుల మనస్సు మీ మనస్సు వలె అద్వైత సంస్కారముచే సంస్కరింప బడి యుండదు. కావున నిన్ను మా గురువుగ తలంచెదను.

నిదాఘా! ఋభువను నేను పూర్వము నీవు చేసిన సేవ యందాదరము నుండి గురు స్నేహము వలన నీకు అద్వైతోపదేశము చేయుటకై వచ్చితిని. మహామతీ! సంగ్రహముగా నీకు నుపదేశించితిని. పరమార్ధ సారమే అద్వైతము, దేవాది భేద రహితమైన జ్ఞానమే అద్వైతము. అని నిదాఘుం గూర్చి జ్ఞాని ఋభుడు గురువై పలికి చనెను. నిదాఘుడు నా యుపదేశముచే నద్వైత నిష్ఠుడయ్యెను. అన్ని భూతములను దనకంటె నభిన్నముగ దర్శించెను. ఆ విధముగ బ్రహ్మపరుడై ముక్తిం బొందెను. ఆ విధముగ నో ధర్మజ్ఞా! నీవు నిన్ను సర్వగతమై యున్న యాత్మనుగా దెలిసి శత్రువు బంధువునెడ సముడవు గమ్ము. ఒకే ఆకాశము తెలుపు నలుపు మొదలగు భేదముతో భిన్నముగ గనిపించు నట్లు భ్రాంతి దృష్టులచే నాత్మ యొక్కటి యుండియు వేఱు పెట్టబడును. ఇదంతయు సర్వాత్మకుడైన యచ్యుతుడే. అంతకంటే మఱి లేదు. అతడే నేను నీవు ఈ యంతయు (దృశ్యము) నాత్మ స్వరూపము. భేద మోహమును వీడుము.

అని భరతునిచే తెలుప బడి యా రాజశ్రేష్టుడు పరమార్థ దృష్టి వడసి భేదమును విడచెను. మఱియు నాతడు జాతి స్మృతి (పూర్వజన్మ జ్ఞానము) నొంది యా జన్మములోనే యపవర్గమును (సాయుజ్య ముక్తిని) బొందెను. ఈ భరత నృపుల సారభూతమైన చరిత్ర నెవ్వడు చెప్ప నెవ్వడు భక్తితో విను నాతడు శుద్ధ చిత్తుడై ఆత్మ మోహము నందడు. ముక్తికధికారియు నగును.