విష్ణు మహా పురాణము

16 - ప్రహ్లాద చరిత్ర

ఓ పరాశర మునీ! నీచే స్వాయంభువ మనువంశ జాతులగు నుత్తానపాదాది మహాత్ముల వంశము చెప్ప బడినది. సనాతనుడగు విష్ణువే జగత్కారణము. ప్రహ్లాదుని నగ్ని దహింపలేదు. అస్త్రములు బాధింప లేదు. సముద్రమున నతడు త్రోయ బడగా పాశములచే బంధింప బడగా భూమి క్షోభించి చలించెను. పర్వతములచే కప్పు బడినను నాతడు మృతి చెంద లేదు. విష్ణు భక్తుడు దీప్త తేజస్కుడునగు నాతని ప్రతాపము నీచే చెప్ప బడినను మరల విన వలయును. ఓ మునీ! దైత్యులచే ధర్మ పరుడగు నీ ప్రహ్లాదు డెందులకు నస్త్రములచే బాధింప బడెను? సముద్రమున త్రోయ బడెను? పర్వతములచే గొట్ట బడెను? పాములచే కరిపింప బడెను? పర్వత శిఖరముల నుండి యగ్ని జ్వాలలలో త్రోయింప బడెను? దిగ్గజముల దంతములచే కుమ్మింప బడెను? సంశోషకమగు వాయువు ప్రయోగింప జేయ బడెను? దైత్య గురువులు కృత్యయను శక్తి ప్రయోగించిరి? ఐంద్రజాలికులు మాయా సహస్రముల కురిపించిరి? వంట వారిచే హాలాహల మహా విషమును పెట్టించిరి?

ఈ ప్రయత్నము లన్నియు వమ్మాయెను. ఎందుల కిట్లు చేయించిరో ఆ వివరముల విన గోరెదను. విష్ణువునం దనన్య మనసు గలిగి ధర్మ తత్పరుడైన వాని నెవరు బాధించ గలరు? ఇట్టి యోగ్యుని యందేల దైత్యులిట్లు ప్రవర్తించిరి? ఇట్టి యోగ్యుల యెడ శత్రువులు కూడ నిట్లు ప్రవర్తిల్లరు. స్వపక్షులు ప్రవర్తిల్లుదురా? దైత్య రాజు చరితమును విస్తరముగ చెప్పుడు. పూర్తిగ విన వలతుము