ఓ మైత్రేయా! ఆమాయామోహుకు బయలుదేరి వెళ్ళి నర్మదా నదీ తీరము నాశ్రయించి, తప మాచరించుట యందాసక్తితో నున్న మహా రాక్షసులను చూచెను. పిమ్మట మాయామోహుడు దిగంబరుడు, ముండిత శిరస్కుడు నెమలి పింఛముల దాల్చిన వాడునై రాక్షసులతో మృదువుగా నిట్లనెను.
దైత్యపతులారా! మీరీ తపస్సును ఇహికము కొఱకు చేయుచున్నారా! పారలౌకికమునకా! చెప్పెండి.
బుద్దిమంతుడా! పర లోకము కొఱకు మాచే తపము చేయబడు చున్నది. నీకిందు కావలసిన దేది?
మీరు మోక్షమునే కోరుదురేని నా మాటల నాచరింపుడు. ఈ నే చెప్పు ధర్మమునకు తగుదురు. ఇది తెరువ బడిన ముక్తిద్వారము. ఈ ధర్మము మోక్షమునకు తగినది. ఇంత కంటె శ్రేష్టమైనది లేదు. ఈ ధర్మము నందే యుండి మీరు స్వర్గమును గాని, మోక్షమును గాని పొందుదురు.
ఈ విధములగు ననేకము లగు యుక్తి ప్రదర్శన చర్చలచే (అనగా శుష్కతర్క వాదములచే) మాయామోహుని చే నా రాక్షసులు వేద మార్గము నుండి మరలింప బడిరి. ఇది ధర్మము కొఱకు. ఇది అధర్మము కొఱకు. ఇది యోగ్యము ఇది అయోగ్యము. ఇది మోక్షము కొఱకు. ఇది ముక్తి నివ్వదు. ఇది పరమార్థము. ఇది పరమార్థము కాదు. ఇది కర్తవ్యము. ఇది కర్తవ్యము కాదు. ఇది ఇట్లు కాదు. ఇది ఇట్లే. దిగంబరుల కిది ధర్మము. బహు వస్త్రుల కిది ధర్మము. అనునాసప్త విధములగు ననిశ్చిత వాదము అనేక పర్యాయములు చెప్పుచున్న మాయామోహునిచే రాక్షసు లందఱు ధర్మములను విడుచునట్లు చేయ బడిరి. “పైన చెప్పిన ఏడు విధములగు వాదములు అర్హత ప్రోక్తములు, ఈ మాయామోహుడు అర్హతుడై యిట్లు చెప్పెను. ఈ ధర్మము నాశ్రరించిన వారు అర్హతులని ప్రసిద్దులైరి. వారి వలన బోధింప బడి మఱి కొందఱు, వారి వలన మఱి కొందఱు. ప్రేరితులై త్రయీ ధర్మ త్యాగము చేసిరి. ఇట్లు కొద్ది రోజులలోనే చాలా వఱకు రాక్షసుల చేత త్రయి (వేద త్రయము) విడువ బడెను. అది అర్హత మతము. తిరిగి యెఱ్ఱని వస్త్రములు ధరించి యింద్రియ నిగ్రహము గల మోయామోహుడు ఇతర రాక్షసుల చేరి మృదువుగను అల్పముగను మధుర వచనములతో నిట్లనెను. (బౌద్ద మతము) రాక్షసులారా! మీకోరిక స్వర్గము కావలె ననియా! మొక్షము కొఱకైనచో పశువులను చంపుట మున్నగు దుష్ట ధర్మముల మానుడు. ఈ సమస్తము విజ్ఞాన మయమని తెలిసి కొనుడు. నామాట తెలిసి కొనుడు. విద్వాంసులచే నిట్లే చెప్పా బడినది. (అవి యోగాచార్యు లాత్మఖ్యాతి పక్షమున చెప్పుదురు.) జగత్తంతయు ఆధార శూన్యము. (అధిష్టాన శూన్యమున భ్రాంతి జ్ఞాన సిద్దమని శూన్యఖ్యాతి పక్షమున మాధ్యముకులు) రాగాది దోషములు సంసారమున భ్రమింప జేయుచున్నవి. మీరు తెలిసికొనండి తెలిసి కొనండి తప్పక తెలిసి కొనండి. అని చెప్పుచు నా మాయామోహుడు రాక్షసులను నిజ ధర్మము విడిచి పెట్టునట్లు చేసెను. నానా విధములుగ చెప్పుట యుక్తులను చూపుట నా మాయామోహుడు రాక్షసులను నిజ ధర్మమును వదలిరి. వారు మఱికొందఱికి వారు మఱి కొందఱికి చెప్పిరీ. మైత్రేయా! ఇట్లు శృతి స్మృతి బోధిత ధర్మమును వారు త్యజించి మహా మోహకారి యగు మాయామోహు డింకను నితరులను లోకాయతికాది (చార్వాక) వేద బాహ్య మతముల బోధించి ధర్మ విముఖుల జేయుటయే గాక వేద నిందకులుగా జేసెను. అల్ప కాలముననే మయామోహునిచే నా రాక్షసు లందఱు వైదిక ధర్మవార్తాయే లేకుండుటయే గాక వేదములను నిందించు వారు కొందఱు బ్రాహ్మణులను నిందించు వారు కొందఱునై యిట్లు వాదముల జేయసాగిరి. హింస కూడదని వేదము చెప్పుచుండ యాగపశ్వాది హింస ధర్మ జనక మనుట యుక్తి సహము కాదు. అగ్నిచే దగ్ధములైన హవిస్సులు ఫల జనకము లనుట పసిపిల్లల మాటగ నున్నది. అనేక యజ్ఞముల చేసి యింద్రత్వమును పొందిన ఇంద్రుడు, మనచే హోమము చేయబడిన శంయాది సమిధలను భుజించునని అంత కంటె కోమలము లైన పత్రాదులను భక్షించు మేక మొదలగు పశువులే శ్రేష్టమైనవి. యజ్ఞమున వధింప బడిన పశువునకు స్వర్గ లోకము లభించునేని యాగకర్త తన తండ్రి నెందులకు చంపడు? ఒకడు భుజించిన యన్నముచే మఱి యోకనికి తృప్తియగు నని శ్రాద్ధాదులు పెట్టెదరేని బాటసారులు తమతో కూడ పాథేయముగ నన్నడులను గొంపోవుట కేవలము శ్రమకే గదా! కావున కేవలమివి ప్రాకృత జనుల నమ్మకము లని నా మాటల వలన తెలిసి కొని యీ యజ్ఞములు మున్నగు విషయములలో నౌదాసిన్యము వహించుటయే మీకు శ్రేయస్కరము. అపౌరుషేయములగుటచే వేదములు ఆప్తవాక్యములై ప్రమాణము లందురా! అదియు సరికాదు. ఆప్త వాక్యములు ఆకాశము నుండి తమంతట తాము భూమిపై పడునా? కావు నాచేతను మీవంటి వారి చేతను గూడ యుక్తి యుక్తమైన మాటయే గ్రహింప నగును.
మాయామోహునిచే నిట్లే బహు విధములుగ రాక్షసులు వేదము లందు రుచి లేని వారుగ చేయబడిన వారై యధర్మ మార్గానుయాయులు కాగా, దేవతలు గొప్ప ప్రయత్నము చేసి వారితో యుద్దమునకు సన్నద్దులైరి. ఆ యుద్దము నందు సన్మార్గ విరోధులగు రాక్షసులు హతులైరి. ఆ రాక్షసుల కిదివరలో స్వధర్మ కవచమే రక్షకముగ నుండెను ఇపుడది నష్ట మగుటచే దైత్యులు అసమర్థులైరి. మైత్రేయా! ఆ మార్గగాము లందరు వేద కవచమును వీడుటచే (నగ్నులు వస్త్ర హీనులు) నానా విధమైన వారుగాను వేద నిందకులు గను దేవతలచే జేయబడిరి. బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థు పరివ్రాట్ (సన్యాసి) అని నాలుగే ఆశ్రమములు. అయిదవది లేదు. గృహస్థు వేషమును విడచిన మాత్రమున వానప్రస్థు గాని పరివ్రాట్ గాని కానేరడు. అతడు నగ్నుడు పాపకారి. శక్తుడైన వాడు ఒక్క రోజు నిత్యకర్మల లోపముచే పతితు డగును. అట్టి వాడు ఆపదలో లేనియప్పుడు గొప్ప ప్రాయశ్చిత్తముచే శుద్దు డగును. ఒక పక్షము (15రోజులు) నిత్యకర్మలు లేనివాడును ఒక సంవత్సరము నిత్యకర్మల విడచిన వాడును కనపడెనేని సత్పురుషుడు సూర్యుని చూడ వలెను. బుద్దిమంతుడా! వానిని స్పృశించిన యెడల సచేల (కట్టు వస్త్రముతో) స్నానము వలన శుద్ధి కలుగును. ఈ చెప్పిన శుద్ధి సజ్జనునికి గాని పాపాత్మునకు గాదు. పాపాత్ముడవగా, నెవ్వని యింట దేవా పితృభూత యజ్ఞము లుండవో వాని యింట నుండి దేవా పితృ భూతములు వెడలి పోవును. ఆ యజమాని కంటె పాపాత్ముడు లేడు. అట్టివానితో సంవత్సర కాలము సంభాషణము ప్రశ్నించుట కలసి యుండుట చేయునాతడు వానితో తుల్యు డగును. (దేవా పితృ భూత అతిథులను పూజించక భుజించిన వాడు పాపమునే తినుచున్నాడు. వానికి నిష్కృతి (ప్రాయశ్చితము) లేదు.) బ్రహ్మాణాది వర్ణముల వారు స్వధర్మమును వదలి హీనకర్మల లోనున్న వారు నగ్ను లన బడుదురు. నాలుగు వర్ణములకు సాంకర్యమున్న చోట సజ్జనులకునికి పతన హేతువే యగును. పంచ మహాయజ్ఞముల (ఋషి, దేవ, పితృ, భూత, అతిథి) నాచారించని వానితో మాట్లాడుటచే మనుజుల్లు నరకమున కేగుదురు. కావున వేదత్రయ ధర్మ త్యాగాముచే భ్రష్టులైన నగ్నులతో సంభాషణ స్పర్శనాదులను ప్రాజ్ఞుడు సదా విడువ వలెను. ఇట్టి వారిచే చూడ బడినదై శ్రద్దావంతులు పెట్టు శ్రాద్దము దేవా పితృ పితామహాదులను సంతోష పెట్ట జాలదు.
భూలోకమున శతధన్వుడను నొకరాజుండెను. అతని భార్య శైబ్య యను నామే మిక్కిలి ధర్మాసక్తి గలదియు పతివ్రత మహా ప్రభావోపేత సత్యము, శౌచము, దయలతో కూదినదియు వినయాది సకల సల్లక్షణ సంపన్నురాలు. ఆ ప్రభువామేతో గూడ నేకాగ్రతతో దేవా దేవుడగు జనార్ధనుని భక్తితో జప హోమార్చనాదుల తోను, ఉపవాసముల తోను తదేక చిత్తుడై యనుదినము బారాధించు చుండెను. ఒక రోజున భార్యా భర్త లిరువురు కార్తిక పున్నమి నాడు గంగలో స్నానమాడి యుపవసించిన వారై యెదురుగ వచ్చుచున్న యొక పాషండుని (నాస్తికుని) జూచిరి. చాపాచార్యు డగు నా మహారాజు కాతడు స్నేహితుడగుటచే నాదరముతో సంభాషించెను. ఆ పతివ్రత మాత్రము ముపవసించిన దగుటచే మౌనముతో నుండి యాతడు కంట బడగనే సూర్యుడిని చూచెను. ఆ దంపతు లింటికి వచ్చి యథావిధిగా విష్ణు పూజాదికము ననతయు చేసిరి. చాలా కాలమునకా రాజు మరణించెను. రాణి ఆయనతో అనుగమించెను. ఆ రాజు ఉపవసించి పాషండునితో సల్లాపము చేయుట యను నపచారముచే నొక కుక్కగా పుట్టెను. ఆమె పూర్వ జన్మ స్మృతి గలదై కాశీరాజునకు యోగ్యమైన కుమారిగ పుట్టెను. సర్వ విజ్ఞానముతో సమస్త లక్షణములతో నామే నొప్పారు చుండెను. ఒక వరునకు నీయబోయిన తండ్రిని నివారించి యా పిల్ల దివ్య దృష్టితో తన పతిని కుక్కగా నున్నట్లు తెలిసి కొని విదిశా పట్టణమున కేగి యా స్థితిలో నున్న భర్తను చూచెను. మహానుభావుడగు నాధుని కుక్కగా నున్న వానిని చూడగానే మ్రుష్టమైన యాహారము నిచ్చెను. ఆ ఆహారమును తినుచు నా కుక్క తన జాతి కుచితము లగు ప్రీతి చేష్టల చేయుచుండగా చూచి యామె సిగ్గుచెంది కుయోనిలో బుట్టిన తన భర్తకు నమస్కరించి యిట్లు పలికెను. మహారాజా! నాకు ప్రీతి కరుడవగు నీవు చేసిన మొగమాటము వలన నిట్లు నీచ జంతువుగా జన్మించితివి. స్మరించు చుంటివా! తీర్థ స్నానానంతర మొక నాస్తికునితో సంభాషణము చేయుటచే నీకీ స్థితి వచ్చినది. నీకు జ్ఞాపకము లేదా?
ఆమెచే నా రాజు పూర్వ జన్మ యందు చేసిన దోషమును స్మరింప జేయబడిన వాడై మిక్కిలి నిర్వేదపడి యా పట్టణమును దాటి గిరి తటము నుండి క్రిందను పడి నక్కగా పుట్టగా నామె దివ్య దృష్టిచే తెలుసుకొని నక్కగ పుట్టిన తన భర్తను దర్శించుటకై కోలాహల పర్వత ప్రాంతమున కేగి పూర్వ జన్మమున పాషండాలాపమున నీకు కల్గిన నీచ జన్మ వృత్తాంతమును నీకు గుర్తు చేసిన దానిని స్మరించు చుంటివా? అని అడిగెను. నిజము నెరింగి నక్కగ నున్న యా రాజు అడవి యందు నిరాహారుడై చనిపోయి తోడేలుగా జన్మించెను. మరల నామె (శైబ్య) యచటి కేగి రాజా! నీవు కుక్కవు గావు, నక్కవు గావు, తోడేలు గావు, శతధన్వ మహారాజువు. అని స్మరింప జేయగానే యాతడు గ్రద్ద రూపము దాల్చెను. మరల నామె స్మరింప జేయగా కాకిగా పుట్టెను. ఆ పతివ్రత తన దివ్య దృష్టితో తెలుసుకొని వెళ్లి ఇట్లనెను. ఓ రాజేంద్రా! సమస్త రాజులు నీకు వశమై బలులు (కప్పములు - పన్నులు) ఇచ్చు చుండగా కైకొనెడి మహారాజు విపుడు బలులను తిని బ్రతికెడి కాకి (బలిభుక్కు) వైతివి. అని భోధించెను. ఇట్లే కొంగగా జన్మించి యామెచే బోధితుడాయెను. పిదప నెమలి జన్మ నొందెను. ఆమెయు నతని ననుగమించి యా నెమలికి వలసిన భోజ్య పదార్థము నంద జేయుచు జనక చక్రవర్తి చేయుచున్న యశ్వమేద యాగమునకు వెళ్లి అవభృథము (దీక్షాంత స్నానము) నందా నెమలిని స్నానము చేయించి తానూ కూడ స్నానము చేసి యా రాజునకు పూర్వ జన్మ క్రమమును స్మరింప జేయగా నాతడు తన కళేబరము త్యజించి జనక చక్రవర్తి పుత్రుడై పుట్టెను.
పిదప కాశీరాజ పుత్రికయగు నా పతివ్రత యగు శైబ్య తన తండ్రిని తనకు వివాహార్థమై ప్రేరేపించగా నా రాజు స్వయంవర మేర్పాటు చేసెను. అందుల కేతెంచిన తన భర్తను గమనించి యామె యాతనిని మఱల వరించెను. ఆ రాజపుత్రు డామేతో చిరకాలము భోగముల నన్నుభవించి తన తండ్రి గతించిన తరువాత విదేహ దేశ రాజ్యమును పరిపాలించెను. అనేక యజ్ఞములను చేసెను. యాచకులకు దానముల ననేకుముల నిచ్చెను. పుత్రులను పడసెను. శత్రువుల నోడించెను. న్యాయముగా భూమిని పరిపాలించి భోగముల ననుభవించి ప్రియములైన తన ప్రాణములను క్షత్రధర్మము ననుసరించు యుద్దము నందు విడిచి పెట్టెను. చితి యందున్న తన భర్తను వెనుకటి జన్మమందు వలె సంతోషముతో ననుగమించెను. ఆ రాజపుత్రు డామెతో గూడ నింద్ర లోకముల నతిక్రమించి యున్న యక్షయ లోకములను వెంటనే పొందెను. ఇట్లా దంపతుల వెనుకటి పరిశుద్దిని పొంది తమ పుణ్య ఫలముగా అక్షయ లోకమును గూడ పొందిరి. నీకిపుడు పాషండుని సంభాషణము వలన వచ్చిన దోషము అశ్వమేధ యాగపు నవభృథస్నాన మహిమయు చెప్ప బడినవి. కావున పాషండుల తోను, పాపాత్ముల తోను సంభాషించుట స్పృశించుట పనికిరాదు. యజ్ఞాది కర్మలలో దీక్షితుడైన వానికి అసలు కూడదు. ఒక మాస కాలము నిత్య కర్మము విడిచిన వానిని చూచినా యెడల బుద్దిమంతుడు సూర్య సందర్శనము చేయ వలెను. బ్రాహ్మణుడా! పూర్తిగ వేదములను వదలి పాషండాన్నమును తినుచు వేద మతమునకు విరోధులుగ నుండు మహాపాపులతో సంభాషణము సంబంధము సహస్తితియు మహాపాప హేతువులని చెప్ప నక్కర్లేదు. కావున వారితో నవి పనికిరావు. పాషండులు = నాస్తికులు, వికర్మస్థాన్ = వికర్మల నాచరించు వారిని బిడాల వ్రతులు ఎదుట ప్రియమును చెప్పి పరోక్షమున మిక్కిలి అపకారము చేయువారు (పిల్లివంటి వారు) శఠులు = వ్యక్తముగా అపరాధము చేయువారు, హైతుకులు = హేతువాదము చేయువారు అనగా అన్ని కర్మలను హేతువులతో సందేహించు వారు బకవృత్తులు = అధోద్రుష్టులై స్వార్థముల సాధించుటలో నిమగ్నులై దుర్మార్గులై అవినయముతో నుండువారు వీరిని మాటతో నైన గౌరవింప రాదు.
మహాపాపులగు పాషండుల దురాచారము గలవారు, వీరితో సంపర్కము పూర్తిగా విడువ వలెను. కనపడినందు వలననే శ్రాద్దమును పాడుచేయు వారు నగ్నులని నీకిది వరకు చెప్పితిని. వీరితో సంభాషణము చేసిన యెడల ఒక రోజు చేసిన పుణ్యము నశించును. పాషండులు కూడ పాపాత్ములు. వీరితో సంభాషణము చేయుట వలన నా దినము చేసిన పుణ్యము నశించును. వ్యర్థముగా జడలను ధరించిన వారు = అనగా అధర్వ వేదమున చెప్పిన శ్రౌత, పాశుపత వ్రతము లకంగముగ చెప్ప బడినవి కాకుండ వ్యర్థముగ జడలను ధరించిన వారు శిఖ లేకుండ ముండనమును చేయించు కొనిన వారు, మోఘాశులు = దేవతాతిథి పిత్రాదుల పూజ కుపయోగింపని యన్నము తినువారు, అఖిల (బాహ్యాభ్యంతర) శౌచము లేనివారు, తర్పణము చేయుట పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుట మున్నగునవి లేని వారును వీరితో సంబాషణ చేసినను నరకప్రాప్తి కలుగును.
Summary of chapter 18 of the Vishnu Mahā Purāṇa is as follows:
Viṣṇu, pleased by the devas' stotra, creates Māyāmoha — a being born directly from his own body — and sends him to delude the rākṣasas who, despite being veda-drohin, were protected by the armor of their acquired tapas. Māyāmoha adopts the form of a digambara ascetic (the Jaina form) and teaches seven types of irrefutable-sounding arguments against the Vedic path; when a large group is converted, he adopts red robes and teaches the Buddhist doctrine of vijñāna and ahiṃsā; progressively, through multiple forms including the Cārvāka/Lokāyata, he turns all the rākṣasas into veda-niṃdakas. Stripped of their Vedic armor, they are slain by the devas. The chapter ends with the narrative of Śatadhavān and Śaibya — a king whose accidental conversation with a pāṣaṇḍa condemned him to seven successive animal births while his pativratā queen Śaibya, maintaining maunam, retained pūrvajanma-smṛti across her next birth and guided her husband through each birth until he was purified and reborn as Janaka's son.