విష్ణు మహా పురాణము

7 - సోమవంశము - గంగా చరిత్రము - కౌశిక వంశము

ఆ పురూరవునకు ఆయువు అమావసువు విశ్వావసువు శ్రుతాయువు శతాయువు అయుతాయువునను నాఱుగురు పుత్రులు గల్గిరి. అమావసువునకు భీముడను కొడుకు గల్గెను. భీమునికి కాంచనుడు అతనికి సుహోత్రుడు అతనికి జహ్నువుం బుట్టిరి. ఈ జహ్నువు యజ్ఞ వాటమును గంగ ముంచెత్త కోపముచే గన్నెఱ్ఱ చేసి భగవంతుని యజ్ఞ పురుషుని బరమ సమాధి చేత ఆత్మారోపణము సేసికొని గంగనెల్ల ద్రావి వైచెను. అప్పుడు దేవర్షు లీయనను బ్రసన్నుం గావించిరి. గంగ నీయనకు గుమార్తె గావించిరి. జహ్నువునకు సుమంతుడు పుత్రు డుదయించెను, అతనికి అజకుడు అతనికి బలాకాశ్వుడు వానికి కుశుడు గల్గిరి. అతనికి కుశాంబ కుశనాభ అదోర్తరసజ వసువులను నల్గురు తనయులు గల్గిరి. అందు కుశాంబుడింద్ర తుల్యుడు సుతుడు కావలెనని తపస్సు చేసెను. వాని ఉగ్రతపము గని నాసమానుడింకొకడు గలుగ కుండుగాక యని యింద్రుడు తనకు దానతనికి పుత్రుండయ్యెను. అతడే గాధి కౌశికు డనబడెను. గాధికి సత్యవతి జనించెను. ఆమెను భృగు వంశీయుడు ఋచికుడు వరించెను. గాధి మిగుల రోష స్వభావుడై వృద్దుడై యున్న బ్రాహ్మణునికి పిల్ల నీయ నిష్టపడక చెవులు నలుపు మేనికాంతి చంద్ర సదృశము వాయు వేగమును గల వేయి గుఱ్ఱములను గన్యాశుల్క మడిగెను. ఆ ఋషియు వరుణుని యొద్దనుండి ఆశ్వతీర్థము నందు పుట్టిన యా లక్షణములు గల అశ్వ సహస్రము తెచ్చి యిచ్చెను. అందుచే ఋచికుడు సత్యవతిని పెండ్లాడెను. ఋచికు డామెకు సంతానము కొఱకొక చరువును కల్పించెను. ఆమె బ్రతిమలినంత ఆమె తల్లికి క్షత్రియ వరుడు పుత్రుడు పుట్టుట కింకొక చరువును సాధించెను. ఈ చరువు నీకు ఈ యింకొక చరువును మీయమ్మ లెస్సగ నుపయోగింప దగినది అని తెల్పి వనముకేగెను. ఉపయోగించు సమయమున సత్యవతితో తల్లి పుత్రి! తన కొడుకు మిగుల గుణవంతుడు గావలెనని యందరుం గోరుదురు. అంతియకాని తన భార్య సోదరులు మొదలగు వారి గుణముల యెడ నంద యాదరము గొనరు. అందుచే నీవు నీ చరువును నాకిచ్చి నా చరువును నీవు ఉపయోగించు కొన దగుదువు. నా కొడుకు సకల భూ మండల మేలవలెను. బ్రాహ్మణుని బలవీర్య సంపద యెంతపాటి? అన సత్యవతి తన చరువుం దల్లికిచ్చెను. వనమేగిన ఋషివచ్చి సత్యవతి వంక చూచెను. ఇట్లనెను గూడ! ఓసీ! అతి పాపురాల నీవీ పాడుపని సేసితివేమి? నీ శరీర మతిరౌద్రముగ కన్పించు చున్నది. మీతల్లి కిచ్చిన చరువును నీవుపయోగించితివి నిక్కము. ఇది తగని పనినేనా చరువునందు సకలైశ్వర్య బల సంపద నుంచితిని. నీ చరువు నందు శాంతి జ్ఞానము ఓరిమి మొదలయిన యఖిల బ్రాహ్మణ గుణ సంపదన నుంచితిని. దానిని విపరీతము సేసితివి గావున నీకతి రౌద్రాస్త్ర ధారణ పాలనా నిష్టుడగు క్షత్రియాచారుడు పుత్రుడు గల్గును. ఆమెకు శమదమాది సంపన్నుడు బ్రహ్మ తేజస్వి బ్రాహ్మణు డాచార్యుడు దయించును. అన విని యామె యాతని పాదముల బట్టుకొనెను. ప్రణతయై మఱియు నిట్లనెను. స్వామీ! నేను దెలియక యిటు సేసితిని. దయ సూపుము. నా కొడుకిట్టి వాడు కాకుండుత! పౌత్రుడిట్టి వాడైన గానిమ్మన ముని యట్లేనగు ననియె. అవ్వాల నామె జమదగ్నిం గనెను. ఆమె తల్లి విశ్వామిత్రుం గన్నది. సత్యవతి కౌశికి యను నది యయ్యె. జమదగ్ని ఇక్ష్వాకు వంశ్యుడగు రేణువను రాజు కూతురును రేణుకను వివాహమాడెను. ఆమె యందశేష క్షత్ర సంహారకుడగు భగవంతుని పరశురాముని సకల లోక గురువగు నారాయణు నంశమున గనెను. విశ్వామిత్రు కొడుకు భార్గవుడే శునశ్షేపుడను పేరివాడు. దేవతలచే నీయ బడినాడు. అందుచే దేవరాతుడన బేరొందెను. ఆ తర్వాత మధుచ్ఛందుడు ధనుంజయుడు కృతదేవుడు అష్టకుడు కచ్ఛపుడు హరియను వారు విశ్వామిత్రునికి పుత్రులు గలిగిరి. వారి కనేకములు కౌశిక గోత్రములు ఇతర ఋషులందు వివాహము చేసికొన దగినది గల్గినవి.