విష్ణు మహా పురాణము

16 - కేశివధ

కేశియను రాక్షసుడు ఉదగ్రబలుడు అశ్వరూపుడు కంసుని దూత ప్రేరేప కృష్ణుని జంప గోరి బృందావనమున కేతెంచెను. భూతలమును గిట్ట లందాడించుచు జూలు విదలింపున మబ్బుల నదలించుచు ఒక్క దాటున జంద్ర సూర్య మార్గ మాక్రమించి గోపకుల పైకి దూకేను. దాని సకిలింపు విని గోపీ గోపక బృందము బెదరి గోవిందుని శరణోందెను. త్రాహి త్రాహి రక్షింపుమను వారి యార్తరవము విని గోవిందుండు సజల జలద గర్జా గంభీరముగ జడియ వలదు. గోపజాతిం బుట్టిన మీరడవి తల్లడిల్లుటచే వీర వీర్యమునకు లోపము. వట్టి సకిలింపుల నాటోపము సూపుచునీ గంతులు వేయు నీ దుష్టుడత్యల్ప సారునిచే తుచ్చునిచే నేమయ్యె. రారా! ఓరి దుష్టుడ! నేను కృష్ణుడను. పినాకపాణి (రుద్రుడు) పూషుని యొక్క వలె నీ నోతగల యాన్ని పండ్లను రాల గొట్టెదను. అని నొవ్వనాడి హరి కేశి కెదురు నడచెను. వాడును నోర్దెఱచి యీతనిపైకి దూకేను. జనార్దనుండు తన విశాల బాహువును దాని నోటంబెట్టి లోనికిం దూర్చెను. దాన వాని పండ్లూడి తెల్లని మబ్బు తునుకలట్ల లేదా అభ్రకపుం బలుకట్లు వానిపై రాలిపోయినవి. కేశి దేహమందు ప్రవేశించిన కృష్ణబాహువు రోగము అంకురించి నప్పటి నుండి యుపేక్షితమై ముంచుకొని వచ్చినట్లు పెరిగి నంతట పెదవులు పగిలి నురుగులతో వాడు రక్తముం గ్రక్కుకుని కనుల యిరవుదప్పి కనుగ్రుడ్లు విప్పార మూత్ర పూరీషముల విడిచి పాదములచే నేలం గొట్టెను. ముచ్చెమటలు పోసి యలసి వడిదరిగి పూనికసెడి విడబార మహారౌద్రుడగు నయ్యసుర పిడుగడచిన ట్లట్టిరు తునకలై కూలెను. రెండు పాదములు పృష్ఠము తోకయు ఒక్కచెవి యొక కన్ను యొక ముక్కుగనై యా కేశి రక్కసుని శకలములు రెండై భాసించెను.

కేశిని జంపి హరి సంబరపడు సంగడీండ్రతో హాయిగ నొడలించుక యేని నొవ్వక స్వస్థుడై యక్కడనే యుండెను. అవ్వల గోపికలు గోపకులును కేశి మడియుట కక్క జంపడుచు అనురాగ మనోరమమ్ముగ పుండరీక నయననుం బొగడిరి. అటుపై నారద భగవానుడు మబ్బుల చాటున నుండి ఆనంద నిర్భర చిత్తుడై బాగుబాగు జగన్నాథ! లీలా మాత్రమున నీ రక్కసుదమరుల నెంతేని యిడుమలం గుడిపించి కట్టిడి వీడు నీచే నీల్గె. నేను మిగుల కలహోత్సుకుడను. నరహరుల కైన నిప్పోర భూత పూర్వముం జూడ స్వర్గము నుండి యిటు వచ్చితిని. ఈ అవతార మందు నీ సేయు లీలలం గని నా మనసాశ్చర్య మందె. దాననే నెంతేని సంతోష పడితిని. ఈ గుఱ్ఱమునకు శక్రుండును దేవతలునుం జడిసి పోదురు. ఇది సకలించినను జూలు విదలించినను నింగి వంక జూచినను వేల్పులకు గుండె దిగులగు చుండును. కేశియను పేరి వాని వీనిందునుముటచే నీవు లోకమందు కేశవుడను పేరం ప్రఖ్యాతి నందెదవు. నీకు మంగళ మగుగాక! వెళ్ళుచున్నాను. కంసునితోడి పోరున నెల్లుండి మఱల నిన్ను గలిసి కొందును. ఉగ్రసేను తనయుడు కంసుడు పరివారముతో గూల్పబడిన తరువాత నీవు పృథివీ భారముం దింప గలవు. అందనేక తీరుల రాజుల కగు యుద్దములను నీకావించిన వానిని నేను జూడ వలయును. అట్టి నేనిపుడు వెళ్ళుచున్నాను. నీచే గొప్ప దేవకార్యము చక్క పఱుప బడినది. అదంతయు నీకే విదితము. నీకు శుభమగు గాక! ఇదిగో నేనేగు చున్నాను. అని నారదుడేగి నంతట కృష్ణుడు గోపకులను ఆలింగనాదులచే గారవింప బడి గోపికల కన్నుల కమృతపాన స్థానమై కృష్ణుడు గోకులముం జొచ్చెను. లేదా కృష్ణావతారముచే గోపికల కన్నుల కమృతపాన స్థానమైనది గోకుల మనియు నన వచ్చును.