మహామతివగు నీవు భారత రాజుల యొక్కయు దేవా దానవ గాంధర్వ యక్షోరగాదుల యొక్కయు అద్భుతములగు చరిత్రలను స్థావర జంగామాదుల సృష్ట్వాదులను మృదు మధురముగ మన శ్శ్రవణా నందకరముగా జెప్పితివి. ఆహా! ఇప్పుడు భూమండల స్వరూపము విన గుతూహలులమై యున్నాము. భువన కోశ సంస్థాన మవదానమున విననున్న మాకది యాదరముతో నానతిమ్మని మునులడిగిరి.
మైత్రేయ! ఇది నూరేండ్లు సెప్పినం దీరదు, సంక్షేపించి తెల్పెద వినుండు. జంబూ + ప్లక్ష + శాల్మల + కుశ + క్రౌంచ + శాఖ + పుష్కరములు అనునవి సప్త ద్వీపములు. ఇవి లవణ = ఉప్పు, ఇక్షు = చెరకు రసము, సురా = కల్లు, సర్పి = నెయ్యి, దధి = పెరుగు, దుగ్ధ = పాలు, జల = నీరునుం గల ఏడు సముద్రములచే జుట్టుకొన బడినది. వీని నడుమ జంబూ ద్వీపమున్నది. దానికి నడుమ "మేరువు" అను బంగారు కొండ యున్నది. అది ఎనుబది నాలుగు యోజనముల ఎత్తు, పదునారు వేల యోజనముల లోతు, ముప్పది రెండు వేల యోజనముల వైశాల్యము గల యుపరి భాగము కలిగి యున్నది. మూలము పదునారువేల యోజనముల విస్తారమై యున్నది. భూమియను పద్మమున కది నడిమికర్ణిక (దుద్దు) వలె నున్నది. హిమవంతము - హేమకూటము, నిషధము ననునవి దానికి దక్షిణమునను, నీలము, శ్వేతము, శృంగి యనునవి యుత్తరమునను వర్ష పర్వతము లున్నవి. అవి లక్ష యోజన ప్రామాణములు, తక్కినవి తొంబది వేల యోజనముల ప్రమాణము గలవి. రెండు వేల యోజనముల ఎత్తు, అన్ని యోజనముల వెడల్పు గలవి. భారత, కింపురుష, హరి వర్షములు మేరువునకు దక్షిణమున నున్నవి. రమ్యకము ఉత్తర మందున్నది. అది కనకమయము. ఉత్తర కురు భూములక్కడనే యున్నవి. ఈ వర్షము లోక్కొక్కటి భారత వర్షము వలె తొమ్మిది వేల యోజనముల వైశాల్యము గలవి.
మేరువు నలు దిశల నిలావృతము తొమ్మిది వేల యోజనుల వైశాల్యము గలది. ఇందు నాల్గు పర్వతములు మేరువునకు విష్కంభములట్లున్నవి. విష్కంభములు = పదివేల యోజనముల పొడవు గలవి. తూర్పున మందర పర్వతము, దక్షిణమున గంధమాదనము, పడమట విపులము, ఉత్తరమున సుపార్శ్వము ననునవి గలవు. వీని యందు క్రమముగ కదంబము (కడిమి) జంబువు (నేరేడు) పిప్పలము (రావి) వటము (మఱ్ఱి) యను చెట్లు పదునొకండు వందల యోజనముల విరివి గల వృక్షములు “గిరి కేతువులు” (పర్వతాగ్ర పతాకము లట్టివి) గలవు. జంబూ వృక్ష సమృద్ధిం బట్టి జంబూ ద్వీపమ్ము నాబరిగె. ఆ నేరేడు పండ్లు మహాగజ ప్రమాణమున రాలు చుండును. అవి ప్రిదిలి కారినరస మేరైపారి జంబూ నది యనంబరుగు. ఆ జంబూ రసము ద్రావిన వారు కష్టము దుర్వాసన ముదిమి ఇంద్రియక్షయము నెరుంగరు. ఆ జంబూ నది యొడ్డునం గల మన్నా రసముచే దడిసి సుఖ వాయువున నారి జంబూ నదమను బంగార మేర్పడును. అది సిద్ధ భూషణము అనగా సిద్ధులు ధరించున దన్నమాట. మేరువునకు తూర్పు దెస భద్రాశ్వము, పడమట కేతుమూల మను రెండు వర్షము లున్నవి. వానికి నడుమ ఇలావృతము, తూర్పున చైత్ర రథము, దక్షిణమున గంధమాదనము, పడమట వైభ్రాజము ఉత్తరమున నందన వనము నున్నవి. అరుణోదము, మహాభద్రము, అసితోదము, మానసము అను సరస్సులు నాల్గు దేవ భోగ్యములు.
సితామ్భతము, కుముద్వంతము, కురారీ, మాల్యవంతము, వైకంకము ననునవి మేరువు యొక్క కేసర పర్వతములు. త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషధము మొదలైనవి దక్షిణ దిశ మేరువు యొక్క కేసర పర్వతములు. తశిఖివాసము, వైదూర్యము, కపిలము, గంధమాదనము, జారుథి మొదలైనవి మేరు పశ్చిమ కేసర గిరులు. అవి మేరువు నంటి జఠరాది స్థానము లందున్నవి. శంఖ కూటము, ఋషభము, హంసము, నాగము, కాలాంజనము మొదలగునవి వురూత్తర దిశ కేసర శైలములు. మేరువు మీద బ్రహ్మ యొక్క నగరము పదునాలుగు వేల యోజనముల వైశాల్యము గలది. అందెనిమిది మూలలందు అష్ట దిక్పాలుర పురములు గలవు. విఘ్న పదము నుండి వెడలి చంద్ర మండలమున ప్రవహించుచు నాకాశ గంగ బ్రహ్మపురి నలువైపుల పడు చున్నది. అట్టుపడి నాల్గు దెసల నాల్గు పాయలైనది. అవి సీత, అలకనంద, చక్షువు, భద్ర. సీత పూర్వ శైలము నుండి మరియొక శైలమున కంతరిక్ష సంచారము సేయును అవ్వాల భద్రాశ్వ వర్ష పర్వతము మీదుగా సముద్రుం బొందును. అలక నంద దక్షిణ దిశగా భారత వర్షముం జేరి యేడు భాగములయి సముద్రము జోచ్చును. చక్షువు పడమటి గిరులన్నియు దాటి పడమటం గల కేతుమాల వర్షముం జొచ్చి సముద్రముం గలియును. భద్ర ఉత్తర గిరులం దాటి యుత్తర కురు భూములం బ్రవహించి ఉత్తర సముద్రముం జేరును.
నీల పర్వతము నుండి నిషధ పర్వతము నంతటి పొడవున మాల్యవంతము, గంధమాదనమును గలవు. వాని నడిమి భాగమున తామర పువ్వులోని దుద్దువలె మేరువున్నది. మర్యాదా పర్వతమునకు ఆవల లోకాలోకమను పర్వతమునకు భారతములు, కేతుమూలములు, భద్రాశ్వములు, కురు భూములును రేకులట్లున్నవి. జఠరము, దేవకూటము అనునవి రెండు మర్యాదా పర్వతములు. అవి దక్షిణోత్తరము లందు నీల పర్వతము నుండి నిషధ పర్వతము దాక వ్యాపించి యున్నవి. గంధమాదన , కైలాస పర్వతములు తూర్పు పడమర లందు నేనుబది యోజనముల పొడవు గలవై నీల పర్వతము నుండి నిషధ పర్వతము వరకు వ్యాపించి సముద్రములో జొచ్చి యున్నవి. నిషధము పారియాత్రము అనునవి రెండును మర్యాదా పర్వతములు. దక్షిణోత్తరము లందు నీల పర్వతము నుండి నిషధ పర్వతము వరకు దైర్ఘ్యము గలవై మేరు పర్వతమునకు పశ్చిమ భాగము నందు యథా పూర్వముగా నున్నవి. త్రిశృంగము జారుధియు నుత్తర దిశ వర్ష పర్వతములు తూర్పు పడమరగా వ్యాపించి యవి సముద్ర మధ్యమున నున్నవి. మర్యాదా గిరుల జెప్పితిని. వీనిలో రెండు రెండు పర్వతములు మేరు పర్వతమునకు జఠర (గర్భ) భాగములుగా నలు దెసల నున్నవి. మేరువు నలు దెసలంగల కేసర పర్వతములు చెప్ప బడినవి. అవి చల్లని ఆద్యంత ప్రదేశములు వనంబులు గలవు. లక్ష్మి, విష్ణువు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు మొదలగు దేవతల ఆలయ శ్రేష్టములు నర కిన్నరులచే సేవితములై యొప్పును. రమ్యములైన ఆ పర్వత ద్రోణు (లోయ) లందు రేయింబవళ్ళు గాంధర్వ, యక్ష, రాక్షస, చైత్య, దానవులు గ్రీడించు చుందురు. ఇవి భౌమ స్వర్గములు. అనగా భూమి మీద నున్న స్వర్గ భూములు. ధర్మ నిష్టులకు నివాసములు ఇందెన్ని జన్మముల కైనను బాపాత్ములు చేర జాలరు.
Summary of chapter 2 of the Vishnu Mahā Purāṇa is as follows:
The description of the seven dvīpas opens with Meru — the golden axial mountain at the center of Jambūdvīpa. Its dimensions: 84,000 yojanas tall, 32,000 yojanas wide at the summit, 16,000 yojanas wide at the base. The six varṣa-parvatas divide Jambūdvīpa into nine varṣas. The four pillar-mountains at Meru's cardinal directions — Mandara (east), Gandhamādana (south), Vipula (west), Supārśva (north) — each bear a great tree as their banner. The Jambū tree on Mandara yields giant fruits whose fallen juice becomes the golden Jāmbūnada river. Brahmā's city of 14,000 yojanas stands atop Meru, and four great rivers flow outward from it: Sītā (east), Alakanandā (south), Cakṣu (west), Bhadrā (north).