విష్ణు మహా పురాణము

11- యదువంశ చరిత్రము

ఈ మీద యయాతి పెద్దకొడుకు యదువు యొక్క వంశము నేను దెల్పెద. ఇందు అశేశాలోక వాసుడు మనుష్యసిద్ద గంధర్వ యక్షరాక్షస గుహ్య కింపురుషాప్సరోరగవిహగ దైత్యదానవాదిత్య రుద్ర వస్వశ్విమరు ద్దేవర్షుల చేత మోక్షార్థుల చేత నాయా ఫలలబ్దికై యెప్పుడు స్తుతింప బడుచు అపరిచ్చిన్న మహాత్మ్యము యొక్క యంశముతో భగవంతుడనాది నిధనుడు విష్ణువు అవతరించెను. కృష్ణాఖ్యమగు పరబ్రహ్మ మెందు నరాకృతిని అవతరించెనో ఆ యదువు యొక్క వంశమును విని నాతడు సర్వపాప విముక్తు డగును.

యదువు కుమారుల సహస్రాజిత్తు క్రోష్టువు నలుడు నహుషుడు ననువారు నల్గురు. సహస్ర జిత్తు కొడుకు శతజిత్తు అతనికి హైహయ హేహయ వేణుహయులు అను ముగ్గురు పుత్రులు. హైహయుని కొడుకు ధర్ముడు. వానివాడు ధర్మనేత్రుడు వానికి కుంతి వానికి సహజిత్తు వానికి మహిష్మంతుడు గలిగిరి. మహిష్మంతుని నిర్మాణమే మాహహ్మతీ నగరము. వానికి భద్రశ్రేణ్యుడు వానికి దుర్దముడు వానికి ధనకుడు వానికి క్రుతవీర్యుడు కృతాగ్ని కృతధర్ముడు కృతౌజుడు నను నల్గురు గల్గిరి. కృతవీర్యునికి అర్జునుడు (కార్త వీర్యార్జునుడు) గల్గెను. ఇతడు సప్త ద్వీపాధిపతి వేయి బాహువులు గల వాడయ్యెను. ఈయన భగవదంశ సంభూతుడు అత్రి వంశీయుడు నైన దత్తాత్రేయు సేవించి బాహుసహస్రము అధర్మసేవా నివారకము స్వధర్మ సేవిత్వము రణమందు పృథ్వీజయము ధర్మ పరిపాలనము శత్రువుల వలన నపరాజయము జగత్ప్రఖ్యాతడైన పురుషుని వలన మృత్యువు నను నీ తాను కోరిన వరములను వడసెను. అతనిచే నశేషద్వీపవతి వసుమతి చక్కగా భావింప బడెను. ఇతడు పదివేల యజ్ఞములు చేసెను. పార్థివులు యజ్ఞములచే దానములచే తపస్సులచే వినయముచే శ్రుతముచే (వినికిడిచే) పాండిత్యముచే నిజముగా కార్తవీర్యుని దారిం జనలేరు. అని యితడుప శ్లోకింప బడెను.

అతని రాజ్యమందు ద్రవ్యనష్ట మనునది (దొంగతనము) లేనేలేదు. ఇట్లు ఎనుబది యైదువేల సహస్రముల వ్యాహతమైన యారోగ్యము బలము పరాక్రమముం బొంది రాజ్యము చేసెను.

మాహిష్మతీ నగరమందు దిగ్విజయమునకై బయలు దేరి వచ్చి నర్మదా జలములం దిగి జలక్రీడలాడి పానమదముచే వ్యాకులుడై యున్న యా కార్తవీర్యునిచే అశేష దేవదైత్య గంధర్వాధీశుల జయించి నందున బుట్టిన మదమున గల్గిన గర్వాతిశయము నందిన రావణుడును పశువటు బంధింప బడి తనన నగర మందేకాంతమున నుంచ బడెను. ఈ మహాత్ముడు ఎనుబది యైదువేల యేండ్ల చివర భగవన్నారాయణాంశమైన పరశురామునిచే నుపసంహరింప బడెను. అతని నూర్గురు పుత్రులలో నైదుగురు ప్రధానులు శూర శూరసేన వృషసేన మధు జయధ్వజులను పేరివారు. జయధ్వజునికి తాళజంఘుడు, అతనికి తాళజంఘులను నూర్గురు కొడుకులు గల్గిరి. వీరిలో జ్యేష్టుడు వీతిహోత్రుడు మఱి యొకడు భరతుడు, భరతునికి వృషుడు అతనికి మధురుదు అతనికి నూర్గురు కొడుకులు గల్గిరి. ఈ వంశ మందు వలన వృష్టివంశము అను ప్రసిద్ది బొందెను. మధువను నాతడు మధువంశమను పేరునకు గారణ మయ్యెను. యదువు పేరలక్షింప బడుచు యాదవులు నయిరి.