రాసభాసురుడు పరివారముతో గూలిన తరువాత నాతాళవనము గోపీ గోపాలురకు ప్రశాంత రమణీయ మయ్యెను. వాసుదేవ సుతులట్లు ధేనుకుం గూల్చి యానందముతో భాంఢీరవటమునకు వచ్చిరి. పాటలు పాడుచు చెట్లలో నొకరి నొకరు వెదకి కొనుచు నల్లంత దూరముసని కదుపులం గాయుచు వానిని పేరుపేరునా పిలుచుచు వనమాలా భూషితులై యా మహానుభావులు దూడ పలుపులను మూపున వేసికొని చిఱుగొమ్ముల గులుకు గిత్తలట్లు శోభించిరి. బంగారుజర్రీ గాటుకపొడి చిందిన వలువలం దాల్చి యింద్ర ధనుస్సు తోడ దీపించు తెల్లని నల్లన్ని మేఘములట్లు భాసించిరి. అఖిల లోకనాథులకు నాథులైన మహానుభావు లవని నవతరించి లోక ప్రసిద్దములైన చెడుగడి మొదలయిన పెక్కు బాలక్రీడల వినోదించు చుండిరి. మఱియు గుస్తీలు సాముగారిడీలు, ఉండేలు బ్రద్దలు, గోటీ బిళ్ళలు, వడిసెం రాళ్ళు విసరుట మొదలగు బాలక్రీడల నమ్మహా బలశాలురు తోడి బాలురతో గ్రీడింప జొచ్చిరి.
వారిం పట్టుకొననెంచి యయ్యిద్దరు నాడుకొనుచున్న తఱి ప్రలంబాసురుడు గోపా వేషము వేసికొని అమానుషుడు (రక్కసుడు) గోపాలుర నడమ నిశ్శంకముగా వచ్చి చేరెను. అయిద్దరన్నదమ్ముల నేమరియుండు సమయము గనిపెట్టుచు కృష్ణుని, బలరాముని సహింపరాని వారని గ్రహించి తుదముట్టింప నుబలాట పడెను. “హరిణాక్రీడనము” (లేళ్ళవలె గంతులు వేయుచు వెళ్ళుచున్న యిద్దరిలో ముందు వెళ్ళినవాడు జేత) అను పేర యోకానొక బాలక్రీడకుం జొచ్చి గోపాలు రెల్లరు నిద్దరిద్దరు జంటలుగా నయ్యాటం దలపడిరి. శ్రీదామునితో గోవిందుడు ప్రలంబునితో బలరాముడుం మఱియుం గల గోపాలురతో గోపాలురు నెగురుట కారంభించిరి. కృష్ణుడు శ్రీదాముని హలిబ్రలంబుని నోడించిరి. కృష్ణ పక్షీయులగు గోపకులన్యులం గోపాలుర నోడించిరి. ఒకరి నొకరు మోసికొని భాండీరవటమున కేగి తిఱిగి యటనుండి యిటకోడిన వారోడని వారిని మోచికొని రావలయునని పందెము సరచుకొనిరి. ప్రలంబాసురుడు సంకర్షుణుని మూపున కేక్కించుకొని తటాలున నెగిరి యా క్షణమే చంద్రుని తోడి మబ్బువలె నాకసమునకు బోయెను. ఆ దానవుడు బలరాముని బరువు మోయలేక యొడలు పెంచనారంభించి వర్షా కాలమున మేఘమట్లు విజృంభించెను. హలి వానిని దావాగ్ని ఎఱయైన పర్వత మట్లున్న వానిని పూలమాలలు గుత్తుక వ్రేలాడ నెత్తిపై కిరీటమూని యున్న వానిని రౌద్రరూపుని బండి చక్రమట్లున్న మిడిగ్రుడ్ల వానిని యడుగుమోప భూమి కంపించు చున్న వానిని జడుపు గిడుపులేని యా రక్కసునిచే రోహిణీ తనయుడు మోచుకొని పోబడి యంతట కృష్ణుని కిట్లనియె.
కృష్ణ కృష్ణా! పెద్ద పర్వత మట్లున్న వీడెవ్వడు ఒకానొక మయా గోపాలకుడగు దైత్యుడు నన్ను మోచికొని పోవుచున్నాడు. ఓ మధుసూదనా! ఇప్పుడే నేమి సేయ వలయునది సెప్పుము. ఈ క్రూరుడు తురతుర బోవుచున్నాడు.
అన విని గోవిందుడు నగవున బెదవులదర బలరాముని బలవీర్య ప్రమాణ మెఱిగిన ప్రొడ గావున నతనితో నిట్లనియె
ఓ సర్వాత్మక! గుహ్యాతి గుహ్యముల కన్నిటికిన గుహ్యుడవు కేవల నిర్గుణ పరబ్రహ్మ వయిన నీ మానవాకార విడంబన మేల స్పష్టముగా నవలంబించెదవు. అశేష జగద్బీజ కారణము కారణము కంటె ముందు ముందు బుట్టిన వాడవు జగమే కార్ణవమైనపుడు ఏకైకాత్మకమై శేషించిన నీ స్వరూపము స్మరింపుము. నేను నీవును భూభారావతరణమునకే మర్త్య లోకమునకు వచ్చినామని నీ వెఱుంగవా?
గగనము నీ శిరస్సు. మేఘములు నీ కేశములు. భూమి పాదములు ముఖము అనంతాగ్ని మనస్సు చంద్రుడు నిట్టూర్పు వాయువు నీ నాల్గు బాహువులు నాల్గు దిశలు. సహస్ర ముఖుడవు. భగవంతుడవు. మహాత్ముడవు. సహస్ర పాద సహస్రహస్త శరీర భేదము గలవాడవు. అనేక పద్మోద్భవులకు (బ్రాహ్మలకు) ఆద్య కారణము. అని మునులు నిన్ను వేయి విధాల వర్ణింతురు. నీ దివ్య రూపము నొరుడెఱుంగడు నీ ఆయా యవతారముల రూపమును దేవత లర్చింతురు. తుదకీ విశ్వము నీ యందే లయమందును. ఇది నీ వెఱుంగవా? నీచే ధరింప బడిన యీ ధరణి చరాచర ప్రపంచమును ధరించును. ఓ అనంతమూర్తీ (శేషుని స్వరూప మన్నమాట) నిమేషాది కృతయుగాది భేదమందిన కాలము నీ స్వరూపము. అదే యీ జగమును భక్షించుచు బడబాగ్నిచే దినబడిన నీరు చక్కని మంచు రూపమొంది హిమగిరి యందు భానుమంతుని భాను (కిరణ) స్పర్శముచే నదే నీరగును. ఇట్లే సంహార మందు (ప్రళయ కాలమున) నీచే అత్తం (తిన బడిన) యీ ఎల్ల జగత్తు నీ యంద ధీనమై యుండి (ఘనీభావమున) సృష్టి సేయనుద్యమించు నీయొక్క రూపమే కల్పానుసారముగ జగద్భావము పొందును. నీవు నేనును గలసి ఈ జగత్తున కేకైక కారణమై యున్నాను. జగత్తు కొఱకై భిన్నరూపులై యున్నాము. ఓ విశ్వాత్మా! అమేయాత్మా నిన్ను నీవు స్మరింపుము. ఈ దానవు సంహరింపుము. మానుష్య రూపముతోనే బంధువులకు హిత మాచరింతము.
అని యిట్లు కృష్ణుడు జ్ఞప్తిసేయ బలశాలి బలుడు ప్రలంబునిం బట్టి పీడించెను. కోపముచే కన్నులేఱ్ఱవడ వాని నడినెత్తిం గ్రుద్డెను. ఆ దెబ్బతో కనుగ్రుడ్లు వెలికివచ్చి మెదడు బయలువడి నోట రక్తము గ్రక్కికొనుచు నవనీతలము నంబడి యా దైత్యుడు చనిపోయెను. అద్భుతలీల నిట్లు బలరామునిచే ప్రలంబుడు గూలుట గని గోపకులు ప్రహృష్టులై సాదుసాదు (బాగు బాగని) అని బలభద్రుం గొనియాడిరి. అట్లు గోపకులచే స్తుతింపబడి బలరామ మూర్తి శ్రీకృష్ణమూర్తితో గోకులమునకు విచ్చేసెను.
Summary of chapter 9 of the Vishnu Mahā Purāṇa is as follows:
Pralambasura, a powerful asura, disguises himself as a gopāla boy and joins the games in Bṛndāvana. During a carrying-game, he carries Balarāma into the sky, revealing his true enormous form. Balarāma kills him with a single blow of his fist. Kṛṣṇa then reminds the astounded gopas of Balarāma's true cosmic identity as the aṃśa of Ādiśeṣa.