విష్ణు మహా పురాణము

8 - విష్ణ్వారాధన ఫలప్రశంసా చతుర్వర్ణాశ్రమ ధర్మ నిరూపణమ్

భగవానుడవగు ఓ పరాశర మహామునీ! సంసారమును తరింప గోరువారు భగవానుడును ప్రకాశ మనస్వరూపుడును లోకనాధుడు నగు శ్రీమహా విష్ణుని ఆరాధించ వలసిన ప్రకారమును గోవింద ఆరాధనపరులగు నరులకు లభించు ఫలమును వినగోరు చున్నాను.

నీవు నన్ను అడిగిన ప్రశ్నమునే మహాత్ముడగు సగరుడు అడుగగా ఔర్య మహాముని చెప్పిన విషయమును నేను నీకు చెప్పెదను. వినుమా, ఓ ముని శ్రేష్టుడవగు మైత్రేయా! భృగు వంశజుడగు ఔర్య మహామునికి సగరుడు నమస్కరించి విష్ణు నారాధించు విధానమునకు సంబంధించియును ఆ ఆరాధనము వలన నరులకు కలుగు ఫలమును గురించియు ప్రశ్నించెను. దానికి సమాధానమును ఔర్యుడు సగరునకు చెప్పిన దానినే నీకు యంతయు చెప్పెదను. వినుము.

విష్ణు నారాదించుట వలన భూలోకమున పొంద దగిన కోరికలను స్వరమును స్వర్గ వాసులకును నమకసరింప దగిన ఉత్తమ పదమును అన్నిటి కంటె ఉత్తమ మగు మోక్ష ఫలమును కూడ మానవులు పొందుదురు. అచ్యుతుని ఆరాధించు వారే యే ఫలమును నెంతెంత కోరుడురో అది అంతయు అధికమైనదే కాని అల్పమైనదే కాని పొందుదురు.

ఓ సగర మహారాజా! ఆ విష్ణుని ఎట్లు ఆరాధింప వలెను? అని నీవు అడిగిన ప్రశ్నమునకు సమాధాన మంతయు చెప్పెదను. నా వలన అది తెలియుము. పరమ పురుషుడగు శ్రీమహా విష్ణువును మానవుడు తన వర్ణాశ్రమాచారము లను పాటించుచునే ఆరాధింప వలయును. వానిని విడిచి ఆరాధించుట అతనికి ప్రీతీ కలిగించదు. ఓ రాజా! యజ్ఞములలో దేవతలను ఆరాధించుటచే విష్ణువును ఆరాధించు వాడగును. చిత్తశుద్దికై మంత్ర జపములను చేయుటచే విష్ణుని జపించు వాడగును. ఇతర ప్రాణులను హింసించుటచే విష్ణుని హింసించినా వాడగును. హరి సర్వ భూతాత్ముడగుటయే యిందులకు హేతువు. అందువలన పురుషుడు సదాచారము కలిగి తన తన వర్ణమునకు విహిత మయిన కర్మములను ఆచరించుచు విష్ణుని ఆరాధించ వలెను. బ్రాహ్మణుడు కాని, క్షత్రియుడు కాని, వైశ్యుడు కాని, శూద్రుడు కాని ఓ రాజా! తన వర్ణ ధర్మము నందు శ్రద్ధ కలిగి దానిని ఆచరించుచునే విష్ణుని ఆరాధింప వలెను కాని మరొక విధముగా కాదు. పరనింద, కొండెములు చెప్పుట, అసత్యము, ఇతరుల మనస్సునకు నొప్పి కలిగించు మాటలు, పరస్త్రీల యందు, పరధనము నందు ప్రాణి హింసల యందు ఆసక్తి లేక ఇతర ప్రాణులను కొట్టక చంపక ఇతరులకు కీడు కోరక ఉండువారు చేయు ఆరధనచే కేశవుడు తృప్తి నొందును. దేవతలను, విప్రులను, గురువులను సేవించుట కెప్పుడు పూనిక కలిగి తనకు తన కుమారులకు వలెనె సర్వ భూతములకు హితము కోరుచు రాగము ద్వేషము మొదలగు దోషములచే మనస్సు అపవిత్రము కాని మనస్సు కలిగి వర్ణాశ్రమ అనుసారముగ శాస్త్రములచే విధింప బడిన ధర్మములను అనుష్టించు మానవులు చేయు ఆరాధనలకు శ్రీమహావిష్ణువు సంతృప్తి నొందును.

ఓ మునిశ్రేష్టుడా! అట్లయినచో నేను విష్ణుని ఆరాధనా చేయు వారికి ఆవశ్యముగా జెందదగినవి కావున వర్ణాశ్రమ ధర్మములను గూర్చి నేను వినగోరు చున్నాను. దెల్పుము.

ఓ రాజా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారు ఆచరించ వలసిన ధర్మములను చెప్పెదను. ఏకాగ్ర బుద్దితో వినుము. బ్రాహ్మణులు దానము యగ్నములచే దేవతలను ఆరాధించ వలెను. వేదాధ్యయనము జీవన యాత్రకై యితరులచే యజ్ఞము చేయించుట వేదములను అధ్యయనము చేయుట ఇతరుల నుండి పవిత్ర ద్రవ్యములను శాస్త్ర న్యాయానుసారముగా ప్రతి గ్రహించట చేయ వలయును. త్రికాల స్నానము చేసి అగ్ని హోత్రియై యుండ వలెను. సర్వ ప్రాణులకును హితమునే కాని వేనికి ఆహితము చేయరాదు. సమస్త భూతముల యందు మైత్రీభావము విప్రులకు ముఖ్యధానము. రాతి యందును రత్నమందును పరాధానము లందును సమబుద్దితో నుండవలెను. ఋతు కాలమున మాత్రమే భార్యతో సంగమింప వలెను. క్షత్రియులు సంకల్ప పూర్వకముగా బ్రాహ్మణులకు దానము, యజ్ఞములచే దేవతారాధానము వేదా ధ్యయనము చేయ వలెను. ఆయుధ విద్యచే జీవనము, ప్రజల రక్షించుట, రాజ్య పాలనము నాతనికి శ్రేష్టమగు జీవన విధానము. యజ్ఞాది కర్మ ఫలముల అంశము రాజునకు చెందును. కాన క్షత్రియులు రాజ్య పాలనము చేసిననే కృతార్థు లగుదురు. దుష్టుల దండించి శిష్టుల రక్షించి వర్ణ ధర్మ వ్యవస్థను లోకమున నిలుపు రాజు తాను కోరుకొనిన ఉత్తమ లోకముల పొంద గలుగును. ఓ రాజా! లోక పితా మహుడగు బ్రహ్మ వైశ్యులకు పశు పాలనము, వాణిజ్యము కృషి జీవన వృత్తిగా విధించెను. అతడును అధ్యయనము, యజ్ఞము, దానము, నిత్య నైమిత్తికము లగు కర్మములు ఆచరించ వలయును. శూద్రులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల నాశ్రయించి వారి వలన పోషణము జరుపు కొనుట. లేదా వర్తకముచే కాని వడ్రంగము మొదలగు శిల్ప వృత్తులచే కాని జీవించుట విధింప బదియున్నది. దానము చేయుట, పాక యజ్ఞ విధానము దేవతలను ఆరాధించుట పిత్రుకర్మలు మొదలైన నైమిత్తికములు నాచారించుట శూద్రులకు విహితము.

ఓ సగర మహారాజా భృత్యులు మొదలగు వారి పోషించుటకై ఇతరుల నుండి దానము ప్రతిగ్రహించుట స్వభార్యను ఋతు కాలమున కలియుట సమస్త భూతములపై దయ, ఓర్పు, అహంకారము లేకుండుట, సత్యము, శుచిత్వము ఎక్కువ శ్రమ చేయకుండుట, శుభ మాచరించుట, ఇతరులకు ప్రీతిగా మాటలాడుట, మిత్రభావము, కోరికలు తగ్గి యుండుట, దైన్యము లేకుండుట, అసూయ లేకుండుట సర్వ వర్ణములకు అన్ని ఆశ్రమములకు సాధారణ ధర్మములు. బ్రాహ్మణాది వర్ణముల వారికి ఆపత్కాలమున తగిన గుణములను ధర్మములను చెప్పెదను వినుము ఆపత్కాలమున అనగా ధర్మముచే జీవనము జరుగానిచో బ్రాహ్మణుడు క్షత్రియుల వైశ్యుల వృత్తుల నవలంభించ వచ్చును. అట్లే క్షత్రియుడు వైశ్య వృత్తిని వైశ్య వృత్తిని గ్రహింప వచ్చును. కాని వీరు ఉభయులు కూడ శూద్ర వృత్తి నవలంబింప రాదు. సామర్థ్యమున్నంత వరకు ఉచిత ధర్మము నవలంబింప వలెనే కాని కర్మ సంకరము ఒకరికి విహిత కర్మముల నింకొక డాచరించుట తగదు.

ఓ సగర మహారాజా! నీకు నేను ఇట్లు వర్ణ ధర్మముల చెప్పితిని. ఇక ఆశ్రమ ధర్మములను చెప్పెదను వినుము.