సర్గ, వంశ, మన్వంతర, వంశాను చరితములను విస్తారముగ వివరించుము. కల్పాంత మందు జరుగు ప్రాకృత ప్రళయము నందలి యుప సంహారమును గురించి వినగోరేదనన
మానవుల మాసము పితరుల కొకరోజు. మనవాబ్ధము దేవతల కొక దినము. రెండు వేల చతుర్యుగములు (మహా యుగములు) బ్రహ్మకు ఒక రోజు. కృత, త్రేతా, ద్వాపర, కలి యుగములు చతుర్యుగము. పండ్రెండు వేల దివ్య వర్షములు దేవతల కొక్క మహాయుగము. ఈ నాల్గు యుగములలో మొదటి కృత యుగము చివరి కలి యుగము తప్ప మిగిలిన అన్ని యుగములు నొకే స్వరూపము గలవి. బ్రహ్మ మొదటి కృతయుగ మందు సృష్టి కావించును. చివరి కలియుగము నందు ఉపసంహరించును.
నాల్గు పాదముల ధర్మము నశించు కలి స్వరూప మానతిమ్మన
ఋగ్యజుస్సామ వేదోక్త ధర్మ ప్రవృత్తికి హేతువైన కలియుగ మందు వర్ణాశ్రమాచారములు సాగవు. వివాహములు ధర్మ సిద్దములు గావు. గురుశిష్య వ్యవస్థ యుండదు. దాంపత్య క్రమ ముండదు. అగ్ని హోత్రములు దేవతోపాసన క్రమము నుండదు.
కలిలో ఏ కులము వాడైన బలవంతుడే సర్వేశ్వరుడు. అన్ని వర్ణములలో కన్యను బెండ్లాడుటకు వాడే యోగ్యుడు. ఏదో తనంత దాను మంచి దనుకొన్న పని చేసిన వాడు దీక్షితుడు. తన బుద్ది ననుసరించి చేసిన పని ప్రాయశ్చిత్తము. ఎవడేమి చెప్పిన నదియె శాస్త్రము. సర్వము దేవతయే. అందరికిని అంతయు నాశ్రమమే. ఆయాస పడుట యుపవాసము. డబ్బిచ్చుట తపస్సు. అభిరుచిని బట్టి చేసిన యనుష్ఠానములే ధర్మము. అత్యల్ప ధనవంతుడు కలిలో ధనవంతుడయి పొగరెక్కును. స్త్రీలకు కేశమాత్రము చేతనే సౌందర్యము. సువర్ణమణి రత్న వస్త్రాది సంపత్తి లోపించి కేవలము జుట్టునే వివిధములుగా దిద్దుకొని యదే యందమని స్త్రీలు మురియుదురు. డబ్బులేని మగనికి స్త్రీలు విడాకులిత్తురు. స్త్రీలకు విత్తవంతుడే భర్త యగును.
డబ్బు సమృద్దిగా నిచ్చువాడు ప్రభువు. అంతియకాని యుత్తమ వంశ జన్మము ప్రభుత్వ హేతువు గాదు. ఇల్లు కట్టుకొన్న వాడు ధనవంతుడుగా లెక్కింప బడును. ధనవంతుడు తెలివైన వారిలో లెక్క. ధనములకు పరమావధి తనకు దాను గుడుచుట. స్త్రీలు చిలిపి చిలిపి కోర్కలకు పై మెఱుగులకు వశమై వ్యభిచారిణు లగుదురు. పురుషు లన్యాయార్జిత విత్తముల కుబలాట పడుదురు. ఎంత ప్రార్థించి ప్రాకు లాడినను స్నేహితుడు స్వార్థమునే చూచికొనును. పరుల ధనములకై జిల్లిగవ్వ కొఱకై వేడుక పడుదురు. బ్రాహ్మణుల యెడ సర్వ మానవ సమాన భావమేకాని విశిష్టగౌరవ ముండదు. ఆవుల యందు పాలిచ్చుటకు సంబంధించిన గౌరవమే కాని మఱి మించి యుండదు. ప్రజలు అనావృష్టికి జడిసి పోవుదురు. ఆకలికి గుములుదురు. ఆకసము వంక జూచెదరు. తాపసలట్లు కందమూల ఫలములను దిందురు. వర్షములు గురియక దుఃఖించి తమకు దాము చత్తురు. దుర్భిక్షము క్లేశములు గుడుతురు. సుఖ సంతోషములు దెబ్బ తినును. స్నానము అగ్ని దేవతాతిథి పూజనము లేని భోజనము సేయుదురు. జనులు దురాశాపరులు హ్రస్వదేహులు మఱుగుజ్జులు ఎవడెవడు దుర్బలుడో వాడు వాడు కలిలో సేవకుడు. తిండిపోతులు బహు సంతానము అల్ప భాగ్యములు గలవారు నగుదురు. స్త్రీలు రెండు చేతులతో తల బరికి కొంచు పెద్దల యందు భర్తలయు నాజ్ఞలందు అనాదరలై దిక్కరింతురు. బెదిరింతురు. తమ బ్రతుకు దాము జూచుకోనుచు నీచలై దేహ సంస్కార శూన్యలై అనృతములు పరుషములు పలుకు చుందురు. శీలము చెడి ఎప్పుడు దుశ్శీలురను వలుతురు. కులవతులు గూడ పురుషుల యెడ నసత్ప్రవర్తనము సేయుదురు.
బ్రహ్మచర్య వ్రత రహితముగ వటువులు వేదములం జదువుదురు. గృహస్థులగ్ని హోత్రములు సేయరు తప్పని సరిగ చేయవలసిన దానములు గూడ చేయరు. గ్రామ్యాహార పరిగ్రహములు సేసి పాడు తిండి తినుచు పాడు దానములు పట్టుచు గృహస్థులు వానప్రస్థు లగుదురు. సన్యాసులు హితుడని ఆహితుడని భావ వికారములకు లోనై పోవుదురు. రాజులు రక్షకులు గారు. పన్నుల నెపమున సర్వ భక్షకులు దొంగలు నగుదురు. ప్రజల ధనము దొంగిలింతురు. గుఱ్ఱాలు ఏనుగులు రథాలు గలవాడే రాజగును. వైశ్యులు కృషి వాణిజ్యము మొదలయిన స్వధర్మములు విడిచి వడ్రంగము మొదలయినవి చేసి శూద్రుల వృత్తిచే బ్రతుకుదురు. అధములు శూద్రులు సంన్యాస చిహ్నములు కాషాయములు దాల్చి భిక్షావ్రతము సేయుదురు. గౌరవ సత్కారములు వడయుచు పాషండ వృత్తి నాశ్రయింతురు. దుర్భిక్షము పన్నులు మొదలయిన పీడలచే నుపద్రవములకు గురియై జనులు దుఃఖితులై గోధుమలు యవధాన్యము పండు దేశములకు వలస పోవుదురు. వేదమార్గ మడుగంటి జనము పాషండ మయముగా నధర్మము పెరిగి లోకము లల్పాయష్కము లగును. రాజ దోషము చేతను నరులు శాస్త్ర విహితము గాని ఘోర తపస్సులు చేయుట చేతను బాల మరణములు గల్గును. అయిదు ఆఱు ఏడేండ్ల యీడుగల యాడు పిల్లలు పిల్లలంగందురు. పండ్రెండేండ్ల వారికి జుట్టు నరయును. ఇరువదేండ్ల మించి యెవ్వడుం బ్రతుకడు. అల్పబుద్దులు వ్యర్థమైన సంన్యాసాది చిహ్నధారులు దుష్టమతులు నగుటచే మానవు లత్యల్ప కాలముననే కాలవశు లగుదురు.
వివేకు లెప్పుడు ధర్మహాని కనబడునో యప్పుడప్పుడు కలి పెరుగుచు నట్లు గమనింప వలయును. ఎప్పుడెప్పుడు పాషండులు పెరుగుదురో యప్పుడప్పుడు కలి పెంపును మహాత్ములు గుర్తింప వలెను. సత్పరుషులకు వేద మార్గాను సారులకు హాని కల్గి నప్పుడెల్ల కలి పెరుగుదల నూహింప వలెను. ధర్మపరులు, యువకులు చెడిపోవు నపుడెల్ల కలి ప్రాదాన్యమును పండితులు ఉహింప వలెను. ఎప్పుడెప్పుడు యజ్ఞేశ్వరుడైన పురుషోత్తముని ప్రాజ్ఞులు యజింప రప్పుడప్పుడు కలి విజృంభణము భావింప నగును. వేదవాదముల యెడ ప్రీతిలేక పాషండుల యెడ నది కల్గు నప్పుడు కలి వృద్దిని విచక్షణు లూహింప వలెను. కలిలో పాషండ నిహతులై జనులు విష్ణుని సర్వ స్రష్టను సర్వ జగత్పతి నారాధింపరు. వేదము లెందులకు? ద్విజు లెందులకు దేవత లెందులకు నీట తెగ కడుగు నాచార మెందులకు పాషండు భావోపహతులై ప్రజలు వాగుదురు. కలిలో మేఘ మల్పముగ గురియును. పంట దిగుబడి స్వల్పము. ఆ పంట కూడ అల్పసారము. కలిలో జనపనారతో చేసిన వస్త్రములు శమీ మాత్రము వృక్షములు. శూద్ర ప్రాయములు వర్ణములు నగును. ధాన్యము లణుప్రాయములు. పాలు ఆజ్య ప్రాయములు. (వట్టి జిడ్డు మాత్రము గలవై రుచి చవి యుండదు) వట్టి వెల్ల మాత్రము గంధము.
అత్త గార్లు, మామ గార్లు మాత్రమే నరులకు గురువులు. బావ మరదులు భార్యలే మిత్రులు. తండ్రి యెవనికి ఎవనికి దల్లి? ఇదంతయు కర్మాను సారమగునది యని యత్త మామల వెంటబడిన నరులు తల్లిదండ్రుల విడుతురు. మాటిమాటికి వాఙ్మనః కాయములచే మఱిమఱి నరు లల్పబుద్దులై పాపములు సేయుదురు. సత్యము లేదు. శౌచము లేదు. అట్టి నరులకు గాలి కాలములో సర్వము దుఃఖమునకు గారణమగును. స్వాధ్యాయ వషట్కారములు వినిపించవు. స్వాహా స్వదా కారములు శూన్యములై కలిలో స్వల్ప యత్నముచే నేర్పడు పుణ్య స్కంధము కృత యుగమున తపస్సు చేసి సంపాదించినంత గొప్పది యగును.
Summary of chapter 1 of the Vishnu Mahā Purāṇa is as follows:
Maitreya asks Parāśara for a full description of the current age. This chapter provides the most extensive account in the Purāṇa of the characteristics of Kali Yuga. The collapse of varṇāśrama, the breakdown of marriage and the guru-śiṣya system, the absence of agni-hotra and deva-upāsanā, and the spread of pāṣaṇḍa (heretical) doctrines are all described. Social signs include the domination of wealth over lineage and the corruption of rulers. Physical signs include extreme drought, crop failure, diminished life-spans, dwarfed bodies, and early death. The signs by which wise people can detect the increasing influence of Kali are enumerated: when pāṣaṇḍas increase, when the Veda-path declines, when Viṣṇu is not worshipped as the creator, and when the voices for orthodoxy grow weak.