బార్హద్రథులలో చివరి వాడు రిపుంజయుడను వాని మంత్రి మునికుడు రాజుం జంపి తన కొడుకగు ప్రద్యోతనుని పట్టాభిషేకము సేయును. వాని నుండి తండ్రి కొడుకులగు బలాక విశాఖయూప జనక నందివర్ధన నంది ప్రభృతులు ఎనిమిది వందల నలుబది మూడుమంది ప్రద్యోతులు భూపతులగుదురు. అక్కడ నుండి తండ్రి కొడుకులగు కాకవర్ణ, శిశునాభుడు, క్షేమధర్మ, క్షతౌజులు, విధిసార, అజాతశత్రు, అర్భక, ఉదయనందివర్ధన మహానందులు శైశునాథులు మూడు వందల యరువది రెండేండ్లు పాలింతురు.
మహానందికి శూద్రస్త్రీ యందు అతిలుబ్దుడు అతి బలుడునగు మహాపద్మనందు డనువాడు అపర పరశురాముడట్లు అఖిల క్షత్రాంతము సేయును. అటునుండి శూద్రరాజులు వత్తురు. ఆ మహాపద్ముడు అనుల్లంఘ్య శాసనుడై యేకచ్చత్రముగ నీ పృథివి ననుభవించును. వానికెనమండ్రు కొడుకులు సుమాలి మొదలయిన వారు. అతని తర్వాత భూపతులగుదురు. వారీభూమిని నూరేండ్లనుభవింతురు. అవ్వల నిందు నవనందులను కౌటిల్యుడను బ్రాహ్మణు డుద్దిరించును. వారయి పోయిన తర్వాత మౌర్యులు పాలిన్తురు. కౌతిల్యుడే బుట్టియున్న చంద్రగుప్తుని రాజ్యమందు పట్టాభిషేకము సేయును. అతనికి బిందుసారుడు కల్గును. అతని నుండి అశోకవర్దనుడు సుయశుడు దశరథుడు సంయుతుడు శాలిశూకుడు సోమశర్మ శతధన్వుడు బృహద్రథుడు ననువారు పదిమంది తండ్రి కొడుకులు మౌర్యులు రాజులగుదురు. నూట ముప్పది యేడేండ్లు పాలింతురు. వీరి తర్వాత పదిమంది శుంగరాజు లేలుదురు.
సేనాధిపతి యగు పుష్యమిత్రుడు రాజుం జంపి రాజగును. వాని కొడుకు అగ్నిమిత్రుడు సుజ్యేష్టుడు వసుమిత్రుడు ఉదంకుడు పులిందకుడు ఘోషవసువు వజ్రమిత్రుడు భాగవతుడు దేవభూతి అను నీ శుంగరాజులు నూటపండ్రేండ్లేలుదురు. ఆ మీద కణ్వులనీ భూమిచేరును. శుంగరాజగు దేవభూతి వ్యసన లోలుడైనంత నాతని మంత్రి కణ్వుడు వశుదేవుడను వాడు వానింజంపి తాను భూపతి యగును. వాని కొడుకు భూమిత్రుడు వాని
కొడుకు నారాయణుడు వాని కొడుకు సుశర్మ. ఈ నల్గురు కాణ్వులు నలుబది యైదేండ్లు పాలింతురు. సుశర్మ యను కాణ్వుని వాని నౌకరు బలిపుచ్ఛకుడను వాడు భూమి ననుభవించును. వీడాంద్రుడు. వాని తమ్ముడావల కృష్ణుడను వాడు పృథివీపతి యగును. వాని నుండి శాన్తకర్ణిపూర్ణోత్సంగుడు శాతకర్ణి లంబోదరుడు పిలకుడు మేఘస్వాతి పటువంతుడు అరిష్ట కర్ముడు హాలాహలుడు పలలకుడు పులిందసేనుడు సుందరుడు శాతకర్ణి శివస్వాతి గోమతిపుత్రుడు వాని కొడుకు అలిమంతుడు శాంతకర్ణి శివశ్రీ శివస్కందుడు యజ్ఞశ్రీ ద్విజుజ్ఞుడు చంద్రశ్రీ సులోమాపియను తండ్రి కొడుకులు ముప్పది మంది నాలుగు వందల యేబది యారేండ్లు మించి భూమి ననుభవింతురు. ఆంధ్రభృత్యులు ఏడుగురా భీరాదులు గర్దభులు పదిమంది రాజులగుదురు. ఆ మీద షోడశ రాజులు (16గురు) రాజు లగుదురు.
అటుపై యవను లెనమండుగురు పదునల్గురు తురుష్కులు పద ముగ్గురు ముండులు మేనులు పదనొకండుగురు భూపతులు భూమిని పదివందల తొంబదియేండ్ల నుభవింతురు. పిమ్మట మేనులు పదునొకండుగురు రాజులు మూడు వందల సంవత్సరములు భూమి ననుభవింతురు. వారు తొలగింప బడిన తర్వాత కైంకిలులును యవనులు పట్టాభిషేకము పొందనివారు భూపతు లగుదురు. వారి సంతతి వింధ్యశక్తి పురంజయుడు రామచంద్రుడు ధర్మవర్మ వంగుడు నందనుడు సునంది వాని తమ్ముడు నందియశుడు శుక్రుమి ప్రవీరుడు ననువారు నూటయారెండ్లు భూపతు లగుదురు. అటుపై వారి కొడుకులు పదుముగ్గురు. బాహ్లికులు ముగ్గురు వారి తర్వాత పుష్యమిత్ర పటుమిత్రులు పదముగ్గురు ఏకలులు ఏడుగు రాంధ్రులు పాలింతురు. కోసల యందు తొమ్మండుగురు రాజులగుదురు. నైషధులును వారే. మాగధయందు విశ్వస్ఫాటికుడను వాడు వర్ణములను మార్చును. కైవర్త పటుపులింద బ్రాహ్మణులను రాజ్యము నందు నిల్పును.
క్షత్రజాతి నంతను లేపివేసి నవనాగులు పద్మావతి యను పురమందు గయా నుండి గంగా ప్రయాగ ప్రాంతము నంటిన భూమిని మాగధు లనుభవింతురు. కోసలాంధ్ర పుండ్రాతామ్రలిప్తసమతట పురమును దేవరక్షితుడు పాలించును. కళింగమాహిష మహేంద్ర భౌమము లను గుహు లనుభవింతురు. నైషధ నైమిషకకాలకోశకములను జనపదములను మణిధాన్యక వంశ్యు లనుభవింతురు. త్రైరాజ్యముషికములను జనపదములను కనకుడు భుజించును. సౌరాష్ట్ర అవంతి (ఉజ్జయిని) శూద్ర అభీరములను నర్మదా మరుభూములందలి దేశములను వ్రాత్యద్విజులు అభీరశూద్రాదు లనుభవింతురు. సిందుతట దావికోర్వీ చంద్రభాగా కాశ్మీర దేశములను వ్రాత్యమ్లేచ్చ శూద్రాదులను వీరందరు సమకాలికులు గానే భూపతు లగుదురు.
అనుగ్రహము కొంచెము కోపముహెచ్చు సర్వకాల మందు అబద్దము అధర్మము లందు రుచి గలవారు స్త్రీబాల గోవధ పరధ నాపహరణము లందు రుచి గలవారు అల్పసారము గలవారు తమో గుణప్రాయములు పుట్టిగిట్టుట మాత్రమైన అల్ప జీవితము అల్పాయుర్దాయము గల్గి పెద్దకోరిక అల్పధర్మము గల్గి లుబ్దలయి వీరుందురు. వారితో గలసిపోయి జనపదములు యదేశీలమునకు వర్తించుచు రాజాశ్రయము చేతనే శుష్మిణః (= బలవంతులై) మ్లేచ్చాచారులై విపర్యయ ప్రవర్తనులై ప్రజలను నాశనము చేయుదురు.
తతశ్చానుదినమాల్పల్పహ్రాసవ్యవచ్చేదాద్దర్మార్థయోర్జగాతస్సం క్షయోభవిష్యతి॥
తతశ్చార్థ ఏవాభిజనహేతుః॥
బలమేవాశేషధర్మహేతుః॥
అభిరుచిరేవదామ్పత్యసంబన్దహేతు॥
స్త్రీత్వమేవోపభోగహేతుః॥
అనృతమేవవ్యవహారజయహేతుః॥
ఉన్నతామ్బుతైవ పృథివీహేతుః॥
బ్రహ్మసూత్రమేవవిప్రత్వహేతుః॥
రత్నాధాతుతై వశ్లాఘ్యతాహేతుః॥
లిఙ్గధారణమేవాశ్రమహేతుః॥
అన్యాయ ఏవవృత్తిహేతుః॥
దౌర్బల్యమేవావృత్తిహేతుః॥
అభయప్రగల్భోచ్చారణమేవపాణ్డిత్య హేతుః॥
అనాఢ్యతైవ సాధుత్వహేతుః॥
స్నానమేవ ప్రసాధనహేతుః॥
దానమేవధర్మహేతుః॥
స్వీకరణమేవవివాహహేతుః॥
సద్వేషధార్యేవపాత్రామ్॥
దూరాయతనోదకమేవతీర్థహేతుః॥
కపటవేషధారణమేవమహత్త్వహేతుః॥
ఇత్యేవమానేకదోషోత్తరెతుభూమణ్డలేసర్వవర్ణేష్వే వయోయో బలవాన్ సస భూపతిర్భవిష్యతి॥
ఏవంచా తిలుబ్ధకరాజాసహాశ్శైలానామన్తరద్రోణీః ప్రజాస్సంశ్రమిష్యన్తి॥
మధుశాకమూలఫలపత్రపుష్పాద్యాహారాశ్చభవిష్యన్తి॥
తరువల్కలపర్ణచీరప్రావరణాశ్చాతి బహుప్రజాశ్శీతవాతాతపవర్షసహాశ్చ భవిష్యన్తి॥
నచకశ్చిత్త్రయోవిశంతివర్షాణి జీవిష్యతి, అనవరతంచాత్ర కలియుగే క్షయ మాయా త్యఖిల ఏవైషజనః॥
అందువలన ననుదినము కొంచెను కొంచెముగా తఱిగి పోయి ధర్మార్థ పురుషార్థములు క్షయించుటచే జగత్తు నశించును. అటుపై ధనమే అభిజన (కుల) కారణము (ధనమున్న వాడే ఉత్తమ కులీనుడన్నమాట) అభిరుచియే దాంపత్య కారణము. స్త్రీత్వమే భోగ కారణము. అనృతమే వ్యవహార జయహేతువు ఎత్తున ఉదక సమృద్దియే పృథివీ (స్వీకార) హేతువు. జందెమే విప్రత్వ హేతువు. రత్నములు సువర్ణాది ధాతువు లుండుటయే శ్లాఘ్యడగుటకు కారణము అన్యాయమే జీవన కారణము. దౌర్బల్యమే అవృత్తి కారణము భయము లేకుండ
ప్రగల్భముగ (బల్లగుద్ది) పలుకుటయే పాండిత్య కారణము. బీదరికమే (దైన్యమే) సాధుత్వ హేతువు. స్నానమే ప్రసాదన హేతువు (స్నానమే సర్వానుష్టానం) దానమే ధర్మ హేతువు. స్వీకరణమే వివాహ హేతువు. సద్వేష దారియే పాత్రము (దానపాత్ర మన్నమాట). దూరముగా నున్న యుదకమే తీర్థ హేతువు. కపట వేషదారణమే మహత్త్వమునకు హేతువునై యిట్లనేక దోషములు భూమండలమున బెచ్చు పెరిగి ఆయా వర్ణము లందెవ్వడు బలవంతుడో వాడే భూపతి యగును. ఇట్లతి లుబ్దమైన పాలకులను సహింప లేక ప్రజలు కొండగుట్టలు లోయలం బట్టిపోయి యట తలదాచు కొందురు. కల్లు ఆకుకూరలు దుంపలు పండ్లు ఆకులు పువ్వులుం దిందురు. చెట్లపట్టాలు ఆకులు గట్టు కొందురు. పిపుల్లందెగ కందురు. శీతవాతాతప వర్షముల కోర్చుకొని బ్రతుకుదురు. ఇరువది మూడేండ్లు ఎవ్వడుం బ్రతకడు. ఈ సకల జనము నీ కలి యుగమున తఱిగిపోవును.
కలియుగం శ్రౌతస్మార్త ధర్మము మహోపద్రవము పొంది క్షీణమైపోగా జగత్కర్త జరాచర గురువు ఆది మధ్యంత రహితుడు బ్రహ్మ మయుడునగు భగవంతుడు వాసుదేవుని యంశము శంబాల గ్రామమునందు ముఖ్యుడైన బ్రాహ్మణుడగు విష్ణుయశుని యింట అష్టగుణ సమృద్దితో కల్కిరూపియై యీ జగమం దవతరించి సకల మ్లేచ్చులను దస్యులను (దొంగలను) దుష్టచిత్తుల నెల్లరనపరిమేయ శక్తి మహిమలు గలవాడై నశింప జేయును. సర్వమును స్వధర్మమందు నిలుపును. అశేష కలియుగము తుదను రాత్రితుద మేల్కొన్న వారికి వలె నా మనుష్యులకే స్వచ్చ స్ఫటిక దళమువలె పరిశుద్దమైన బుద్దులు కల్గును. వినము లట్లున్న వారికి పరిణతు లయిన వారికి గూడ (వయస్సు చెల్లిన వారికిని) తత్కాలమందు సంఘటితమైన సంతానము గల్గును. ఆ సంతతి కృతయుగాను సారులే యగును. ధార్మికమగు కృత యుగమునకు వారు బీజము లగుదురన్న మాట.
ఈ విషయంలో నిట్లు చెప్పబడినది. చంద్రసూర్యులు బృహస్పతి పుష్యమి నక్షత్రము లేక రాశి యందున్న తఱి కృతయు గారంభమగును. గడచిన యిప్పుడున్న రాగల యాయా వంశము లందలి రాజులం జెప్పితిమి. పరీక్షిత్తు జన్మించినది మొదలు నందరాజుల యభిషేకము దాక గల ఈ కాలము ఒక వేయియేబది సంవత్సరములు.
సప్తర్షులు పరీక్షిత్తు కాలములో మఖానక్షత్ర మందుండిరి. అప్పటికి కలియుగము పండ్రెండు వందల సంవత్సరముల ముందారంభమైనది. వాసుదేవ కులము నందవతరించిన విష్ణువు యొక్క యంశమైన కృష్ణ భగవానుడు స్వర్గమలంకరించిన సమయమందే కలి యీ లోకమునకు వచ్చినాడు. అంతదాక పృథివిని కలి క్రమ్ముకొన సమర్థుడు గాడయ్యె. సనాతన వాసుదేవాంశము దివమ్మున కేగగా యుధిష్ఠిరుడు విపరీత నిమిత్తముల (దుశ్శకునములు}
చూచి కృష్ణుడు వెళ్ళిన తరువాత పరీక్షిత్తునకు బట్టబిషేకము గావించెను. సప్తర్షులు పూర్వాషాఢా నక్షత్రమునకు వచ్చినపుడు నంద రాజ్యారంభము నుండి కలి వృద్దినందును. ఏ రోజున కృష్ణుడు వైకుంఠము నధిరోహించె నా రోజుననే కలి యుగము వచ్చినది. ఆ సంఖ్య వినుము. కలి పండ్రెండు వందల దివ్య సంవత్సరములు పూర్తిగ జరిగిన తరువాత కృతయుగము రాగలదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు మహాత్ము లనేకులు యుగ యుగమందును వేలకొలది గడచినారు. వారివారి పేరులు వారి లెక్క మిక్కిలి ఎక్కువగుట చేతను యాయా కులమందు పునరుక్తిగా వచ్చుట చేతను నాకు సామ్యము చేతను నేనవన్నియుం జెప్పనైతిని. దేవాపి పౌరవ వంశ నృపతి. పురువు ఇక్ష్వాకు వంశజుడు మహాయోగ బలసంపన్నులై కలాపగ్రమ మందున్న వారై కృత యుగమందు ఇక్కడకు వచ్చి (భారత భూమికి) క్షత్రవంశ ప్రవర్తకులు గాగలరు. మనువు యొక్క వంశమునకు బీజభూతులు వారు. ఈ క్రమరీతిని మను పుత్రులచే నివ్వసుంధర కృతత్రేతా ద్వాపర యుగములు మూడింట నుప భుక్తమగును. దేవాపి పురువు లిప్పుడున్నట్లే కలిలో వారు గొందరు బీజ స్వరూపులై యుందురు. ఈ రాజవంశ చరిత్ర నీకు సంక్షేపముగ దేల్పితిని. దీనిని వందేండ్ల కైనను సమగ్రముగ దెలుప శక్యము గాదు.
ఈ భూమండల మందును తుచ్చమైన శరీరము నందును ఈ రాజులు మఱి యితరులును మొహాంధులై మమకారము పెట్టుకొన్నారు. ఈ నేల నాదెట్లగును. నా కొడుకునకిది యెట్లగును? నావంశపుది యెట్లు అగును. అనుచింతచే గుమిలి కుమిలి యంతమొందిరి. వారికి మునుముందటి వారు వారికంటె తరువాతి వారు. ఇంకను రాగల వారును వారి వారిని ననుసరించు వారు నందరును పోక మానరు. తనను గెల్చుకొనం జేయు ప్రయత్నమును దానికై దండయాత్ర లందు వ్యగ్రులైన రాజులను గని వసుంధర శరద్ద్రుతువు నందలి పుష్ప వికాసము నెపమున విరగబడి నవ్వుచున్నదా యన్నట్లున్నది. మైత్రేయ! ఈ విషయము నందు పృథివీగీత శ్లోకములివె వినుము. వీనిని ధర్మద్వజ యగు జనకునకు అసితుడను ముని వినిపించెను.
బుద్దిమంతు లయిన నీ రాజుల యొక్క యీ మోహమెంత చిత్రము! వట్టినురుగ మాత్రమైన వారు (అశాశ్వతులు) అయ్యు అథి విశ్వాసము పెట్టుకొన్నారు. తొలుత దమ్ముదాము జయించి కొని మంత్రులను నౌకరులను పౌరులను అట్లే శత్రువులను జయింప నెంతురు. ఈ రీతిగ గ్రమముగ సాగర పర్యంతమైన నేల జయింతుమని యాసక్తచిత్తులై మిక్కిలి దరినున్న మృత్యు వుంగానరు. సముద్ర మావరణము గాగల క్షితి మండలము స్వాధీన మైనను నిది ఆత్మజయము ముందేపాటిది? ఆత్మను గెలిచినపుడు గలుగు ఫలము ముక్తి. మున్ను పుట్టినవారు భూమిని విడిచి వెళ్ళిరి. తండ్రి వెంట గొనిపోలేదు. అట్టి నన్ను జయింతుమని పరమ మూఢులై రాజులు కోరుదురు. నా కొఱకై తండ్రి కొడుకులకు అన్నదమ్ములకును అత్యంత మోహము వల్ల మమకారము గలవారికి విరోధము వచ్చును. పెద్దరగడ ఈ భూమి నాది నాది యిదంతయు నా కుటుంబమునకు గూడ శాశ్వతము అనుకోని ఎవ్వడెవ్వడు రాజు చచ్చి మఱి యోకచో పుట్టినాడో వానివానికీ కుబుద్ది పొడముచునే యుండెను. మమకారము పెట్టుకొన్న మనసు గల వానినిది విడిచి మృత్యు ముఖగ్రస్తు డగుచున్న వానింగని వాని వెంబడినే పోవనున్న వానికి హృదయము లోనున్న గూర్చిన యీ మమకార మేమి? ఈ భూమి నాది. వెంటనే దీనిని వదలి పెట్టుము. అనిదూత ముఖమున తమ శత్రువులకు కబురు పంపు నరాదిపుల యెడ నాకెక్కడ లేని నవ్వు వచ్చును. వచ్చియు నా మూఢుల యెడ మఱి జాలియుం గల్గు చున్నది!
ఇవి ధరణీ గీతము లయిన శ్లోకములు. మైత్రేయ! వీని నెవరు విందురో వారికి సూర్యుడు తపించు తఱి మంచు విరిసినట్లు మమకారము విలయించును.
ఇది మనువు వంశము. చక్కగా దెల్పితిని. స్థితి కార్య ప్రవృత్తుడైన విష్ణువు యొక్క అంశాంశమూర్తు లయిన రాజులింద వతరించి నారు. దీనిని మొదటి నుండి క్రమముగా భక్తితో నెవ్వడు వినునో వాని యశేష పాపము నశించును. మనస్సు శుద్దమగును. సాటిలేని ధనధాన్య సమృద్ధిని నాతడవ్వాహతేంద్రియుడై పొందును. చంద్ర సూర్య వంశముళ నెల్ల విని ఇక్ష్వాకు జహ్ను మాంధాతృసగరా విక్షిత రఘు యయాతి నహుషాదులను నాశము పొందిన వారిని మహాబలులను మాహావీరులను ననంత ధన సంపన్నులను బలీయమైన కాలముచే కధామాత్రా వశిష్టులుగా చేయ బడిన రాజులను వినిన వాడు పుత్రదార గృహక్షేత్రాది ద్రవ్య సముదాయ మందు నరుడు ప్రాజ్ఞుడై మమకార ముంజేయడు. చేతులు మీదికెత్తి యనేకవర్ష గణములు తపస్సు చేసిన పురుష ప్రవీరులు మహాయజ్ఞముల నాచరించిన బలశాలురు మహావీరులు గూడ కాలముచే కథామాత్రా వశేషులు (కీర్తిశేషులు) గావింప బడినారు. అడ్డులేని వాడై యరి చక్రమెల్ల గెల్చి సర్వ లోకములను స్వేచ్చా సంచారము సేసిన పృథు చక్రవర్తి కాలవాత హతుడై యగ్ని యందు వేసిన బూరుగు దూదివలె నష్టమై పోయినాడు. సర్వ ద్వీపములను ఆక్రమించి యనుభవించి యరి చక్రముం గూర్చిన కార్తవీర్యుడు ఉన్నాడా? లేడా అను సంకల్ప వికల్పములకు హేతు వయినాడు. కథామాత్ర శేషియై పోయినాడు. (భూభంగ కనుబొమల ముడి) ప్రకాశింప జేయబడిన దిజ్ముఖములు గల రావణ రాఘవాదుల యైశ్వర్యము, యముని యొక్క ప్రసారముచే బూడిద కూడ మిగులని దాయెనేల? ఛీ! యశ్వైర్య మంతుడును భ్రూభంగపాత మాత్రమున క్షణమున భస్మా వశిష్టమై పోలేదా? మాంధాతృ చక్రవర్తి పుడమిపై కీర్తి శరీరుడైనాడని వినియే సాధువు మంద బుద్దియై దేహము నందు కూడ మమత్వముం జేయును? భగీరథాదులు సగరుడు కకుత్స్థుడు రావణుడు రామ లక్ష్మణులు యుదిష్ఠిరాదులు నుండిరి. నిజమిది. యబద్దము గాదు. వారందరూ నేమయినారో యెఱుంగము. ఎవరిప్పు డున్నారు ఎవరుండ బోవమన్నారు. వారందరు మహావీర్యులు వారుం నే సెప్పిన మఱి యితరులు బ్రాహ్మణోత్తమా! పూర్వులట్లనే యందఱు రుగుదురు. అని చెప్పడగు యుందురు. ఈ యంశ మెఱిగి పండితుడు (జ్ఞాని) యైన మానవుడు క్షేత్రపుత్ర కలత్రాదుల నిందింతురు గాక! తమ శరీరధారులు నట్లుందురు గాక! అనగా వారియందు మమకారము అసలే పనికి రాదని భావము. వారి యెడ మనసులో మమకారము సేయ గూడదు. శరీరము నాడును మమకారము చేయరాదు.
Summary of chapter 24 of the Vishnu Mahā Purāṇa is as follows:
The Āndhra dynasty (30 kings, 456 years) is prophesied after the Kāṇva kings. Then follow Ābhīra, Gardabha, and other dynasties; Yavana, Turuṣka, Muṇḍa, and Mena invaders are described. The eighteen signs of the Kali Yuga are enumerated in Sanskrit ślokas — covering the collapse of dharma, the inversion of social order, the degeneration of rulers and sages, physical and moral degradation. The Kalki avatāra prophecy declares that Bhagavān will be born in Śambhala as the son of Viṣṇuyaśas. The chapter and the Chaturdhāmsa conclude with the Dharaṇī Gīta — the Earth's philosophical song addressed to Janaka on the impermanence of all kings and kingdoms.