విష్ణు మహా పురాణము

Table of Contents

7 - కేశిధ్వజ ఖాండిక్యకృత బ్రహ్మ విచారణ ఖాండిక్య పుత్ర రాజ్యాభిషేకము

 

 

రాజ్య లాభము కంటె క్షత్రియుల కతిప్రియ మింకొకటి లేదు. నీవకంటక మైన నా రాజ్యము నీ వెందువలన గోర లేదు

 

 

నేను రాజ్యమర్థింప కుండుటకు కారణ మెను దెల్పెదం దెలిసి కొనుము. రాజ్యమెల్ల గావలెనని యవిద్వాంసు లయిన రాజులు లోభవశు లగుదురు. ప్రజాపాలనము ధర్మ యుద్దముచే తన రాజ్యమునకు శత్రువు లయిన వారిం జంపుటయు క్షత్రియులకు ధర్మము ఆపని యందశక్తుడనై నేను నీచే రాజ్య మపహరింప బడినానన్న దానిలో నా దోషము లేనే లేదు. అవిద్య క్రమము దోషజన్యమే. అందు ధర్మ మనుసరింప బడదు. క్షత్ర బంధువులు ధర్మ నిమిత్తముగనే రాజ్యము నడుగుకొనరు. ఇది సత్పురుష సమ్మత మైన రీతి. అవిద్యాంతర్గతము కావున నీ రాజ్యము నేనడిగి కొనలేదు. మమకారముచే మతిచెడిన యజ్ఞానము అహం మమభిమాన మహాపానముచే నయినమదముచే నొడలు తెలియని వారు రాజ్యము నెడ దురాశ గొందురు. కాని నావంటి వారది కోరరు.

 

 

అన విని కేశిధ్వజుడు బాగున్నదని మెచ్చికొని ప్రీతితో ఖాండిక్య జనకునితో వినుమని యిట్లు పలికెను

 

 

నేను అవిద్యచే మృత్యువుం దరింప గోరి రాజ్యము వివిధ యాగములను భోగములను ననుభవించుట మూలమున పుణ్య క్షయమును జేయుచున్నాను. నీ మనస్సు నీ భాగ్యమున వివేకైశ్వర్య భావముం బొందినది. కుల నందనుడ వీవవిద్యా స్వరూపమును వినుము. ఆత్మగాని దాని యందాత్మ బుద్ది తనది గాని దాని యందు తనదను తలంపు ననునిది యవిద్యా తరువునం బుట్టిన బీజము రెండుగా నున్నది. పాంచభౌతిక దేహమందు దేహి మొహతమంబునం జుట్టుకొని యహం = నేను, ఇదం మమ = ఇది నాది యని తలంపును గుమతియై చేయును. శరీరమందు ఆకాశాది పంచ భూతముల కంటె వేరుగా నున్న యాత్మయందాత్మ మయ భావన నెవ్వడు సేయును? (ఎవ్వడును సేయుట లేదని భావము) గృహ క్షేత్ర కలత్రాదికము కళేబరోప భోగ్యము నెవ్వడు నేను నాది యనును? దేహము గాని యాత్మ విషయములలో ప్రాజ్ఞుడిది నాదనుకొనును. ఈ విధముగా తన దేహముచే బుట్టింప బడిన పుత్రా పౌత్రాదుల యందు జ్ఞాని యెవ్వడు స్వామ్యమును చేయును? అట్లే ఆత్మకాని కళేబర మందును స్వామ్యము నెవ్వడును చేయడు. మానవుడు దేహోప భోగము కొఱకే సర్వకర్మమును జేయును. ఆ దేహము పురుషుని కంటె నెపుడు వేరగునో దానికి చేయు కర్మమప్పుడు బంధ హేతువగును. మట్టితో గట్టిన ఇల్లు మట్టి నీళ్లచే (బురదచే) పూయ బడునో మట్టి గిలాబా చేయు పార్థివమైన యీ దేహము (భూమిభాగా మేచ్చుగా గల శరీరము) మట్టి నీళ్లచే (బురదచే) పూయ బడినట్లు గిలాబా చేయ బడినట్లు పృథివీ భూత జలభూత జన్యమైన అన్నాదులచే బూయ బడును. పెంపబడును. పంచ భూతాత్మక భోగములచే బంచ భూతాత్మక శరీర మాప్యాయనము సేయ బడుచున్నదేని దానిచే పురుషునకు భోగ మిక్కడెక్కడిది? అనేక జన్మసహస్ర పరిమితి గల సంసార పదవిం జరించుచు మోహమను శ్రమకు గురియై యీ దేహి వాసన లనెడి రేణువుల (ధూళి) క్రమ్ముకొని యుండును. వీని యీ రేణువుల జ్ఞాన వారిచే నెప్పుడు కడుగ బడునప్పుడు సంసార పాంథుని మోహశ్రమము శాంతి నొందును. మోహశ్రమము శమింపగనే యంతః కరణ స్వస్థమై పురుషుడు అనన్యాతి శయమైన బాధా రాహిత్యమును బొంది పరమ నిర్వాణమును (మోక్షమును) బొందును. ఆత్మయను నిది నిర్వాణ మయము జ్ఞానమయము అమలము. దుఃఖాజ్ఞాన మయమయిన యాయా ధర్మములు ప్రకృతివి గాని ఆత్మవి గావు. నీటి కగ్ని సంసర్గము లేదు. అయిన స్థాలీ సంగము వలన గిన్నేతోడి సంసర్గము వలననది దానికి గల్గి శబ్దము = చప్పుడు, ఉద్రేకము = పొంగు మొదలయిన ధర్మములను ఆ నీరు చేయును. అట్లే ఆత్మ ప్రకృతి సంగము వలన అహం మమాభిమానాదులచే దూషితమగు చుండును. అగుచు వానికంటె వేరయ్యు నవ్యయమయ్యు నయ్యాత్మ యాయా ప్రాకృత ధర్మములను బొందును. అవిద్యా బీజమిది నీకు వివరించి చెప్పితిని. దుఃఖములకు క్షయ కరమైనది యోగము కంటె మఱి యొకటి లేదు.

 

 

యోగవేత్తలలో నుత్తమ! ఈ నిమి సంతతిలో యోగ శాస్త్రార్థము చక్కగా నెరిగిన మహానుభావుడవు నీవు యోగమును గరించి చెప్పుమన

 

 

బ్రహ్మమందు లయమందిన ముని యెచ్చట నున్నను నందుండి జారిపోడు. మానవులకు బంధ మోక్షములకు మనస్సే కారణము. అది విషయము లందుత్తుకొన్న బంధనమునకు గారణ మగును. నిర్విషయ మైనచో ముక్తికి హేతువగును. విజ్ఞాన స్వరూపుడైన ముని విషయముల నుండి మనస్సును సమాహరించి (వెనుకకు లాగి) ముక్తి కొఱకు బ్రహ్మమేయైన పరమేశ్వరుని ధ్యానింప వలెను. అట్టి బ్రహ్మధ్యాన నిష్టుని యీ మనస్సు ఆయస్కాంతము తన శక్తిచే వికారము లందదగిన లోహము నట్లు ఆత్మ భావమును బొందించును. ఆత్మ ప్రయత్నము తోడి యపేక్షగల విశిష్టమైన యేమనోగతి గలదో ఆ గతిని బ్రహ్మమందు లగించుటయే యోగమని చెప్ప బడును. (అనగా సాధకుడు గట్టి ప్రయత్నము చేసి సంకల్ప వికల్పక మయిన మనస్సు ఇతర విషయముల వెంటబోకుండ సంహరించి ఆత్మ యందు (బ్రహ్మ మందు) దృఢముగా నిలువరించుటయే యోగ శబ్దమున కర్థమన్న మాట). ఇట్లు మిక్కిలి వైశిష్ట్యముతో (అనుసంధానము నందలి నేరుపుతో) గూడిన ధర్మము లక్షణముగా గల యోగమెవ్వని కనువు పడునో యట్టి యోగి ముముక్షువు (మోక్షమును కోరువాడు) అనబడును. మొట్టమొదట యోగాభ్యాసమునకు బూనుకొన్న వాడు) ‘యుంజానుడు’ అనబడును. సమాధి చక్కగా గుదిరి పరబ్రహ్మోప లబ్ది నందినవాడు అంతరాయ దోషము చేత యోగ నిఘ్నము లని శాస్త్రమందు జెప్పబడిన యభ్యంతరముల దోశంయుచే నీ సాధకుని మనస్సు దూషిత మగునేని (యోగభ్రష్టు డగునేని యన్నమాట).

తరువాత జన్మము లందా యోగ విధిని మానకుండ పట్టుకొని యభ్యసించు నేని వానికి ముక్తి కలిగి తీరును. తొలి జన్మయందే సమాధి చక్కగా గుదిరేనేని యతడా జన్మ మందే ముక్తిపొందును. అప్పుడు యోగాగ్ని చేత నాతని పూర్వ జన్మకర్మము వర్తమానము గూడ యప్పుడే దగ్ధమై పోవును.

 

 

యోగి బ్రహ్మచర్యము అహింస సత్యము అస్తేయము (దొంగతనము లేకుండుట) అపరిగ్రహము (దానము పట్టకుండుట) అను ధర్మములను జక్కగా సేవించుచు తన మనస్సును యోగ్యతను (యోగార్హతను) పొందించుచు స్వాద్యాయము శౌచము సంతోషము తపస్సు అనువాని నాచరించుచు నియతాత్ముడై మనస్సును పరబ్రహ్మ మందు ప్రవణ మయిన దానింగా (లగ్నమయిన దానినిగా లేక ఆవంకకు బ్రసరించునదిగా) నొనరింప వలెను. ఈ చెప్పిన నియమము లైదు. వీనితో బాటు యమము లైదు. (ధ్యాన ధారణాదులు) యోగ శాస్త్రమందు జెప్ప బడినవి. కామ్యము లయినపుడు విశిష్ట లయిన ఫలముల నిచ్చును. అవే నిష్కామములయిన వారికి ముక్తి నిచ్చును. యతి (మనస్సును నియమించుకొన్న యోగి యన్నమాట) భాద్రాసనములు మొదలగు యోగాసనముల లక్షణములతో గూడి యోగి యమ నియమములతో యోగమును సంధాన పరచు కొనవలెను. ప్రాణమను పేరుగల వాయువును అభ్యాసము వలన వశము సేసికొనుట యనునది “ప్రాణాయామము” అన బడును. అది సబీజము నిర్బీజముగా రెండు విధములని యెరుంగనగును. ప్రాణ వాయువు (హృదయ మందున్న గాలి) అపాన వాయువు (గుదమందుండు నది) అను నీ రెండు గాలులు నోకదానితో నొకటి (తిరస్కరించు నప్పుడు) యెదురయి నపుడు వానిని రెండింటిని చక్కని రీతిలో సంయమించి (నిరోధించి) ఆలంబించుట మూడవ యోగ భూమిక. అది స్థూల రూపము. అట్టి యాలంబనమును విడువక యోగి యభ్యసింప వలెను. అందు శబ్దాది విషయానురక్తము లయిన శ్రవణేంద్రియములను యోగవేత్త నిగ్రహించి చిత్తాను కారులం గావింప వలెను. చిత్తము వెంట నుండు వానిం జేయవలెను. అదే ప్రత్యాహార మనబడును. దానిచే నతి చంచలము లైన యింద్రియములు వశ్యము లగుటయను పరమ యోగ భూమిక సమకూరును. అవి వశములు గానిచో యోగి యోగ సాధకుడు గానేరడు. ప్రాణాయమముచే వాయువు ప్రత్యాహారముచే నింద్రియము వశము చేయబడిన తరువాత

యోగి మనస్సును శుభాశ్రయ మందు సగుణమైన భగవాన్ మూర్తి యందు లేక నిర్గుణ పరబ్రహ్మ మందో నిలకడ చెందిన దానిం గావింప వలెను. అన విని

 

 

మహానుభావా! ఈ చిత్తమునకు శుభాశ్రయ మేది? దేని నాధారము సేసికొని యీ మనస్సు దోష మలముల పుట్టుకకు హేతువైనయా మనస్సు నశింప జేయును? ఆ వివరము తెలుపు మన

 

 

రాజా! చేతస్సునకు (మనస్సునకు) ఆశ్రయము నిజముగా మూర్తము. అమూర్థము రెండు విధము లయిన వస్తువు. అమూర్థము (నిర్గుణము) పరము. మూర్తము (సగుణము) అపరము. భావనయు మూడు విధములు. ఒకటి కర్మ భావన రెండు బ్రహ్మ భావన మూడు కర్మ బ్రహ్మో భయాత్మిక. సనంద నాదులు (బ్రహ్మ మానస పుత్రు) బ్రహ్మ భావనా సంపన్నులు. దేవాది స్థావర జంగమ భూతములు కర్మ భావనా పరులు. హిరణ్య గర్భాదు లందు బ్రహ్మకర్మాత్మిక రూపము భయ భావన యుండును. జ్ఞానాదికారు లయిన వారి యందు భావభావన యుండును. విశేష జ్ఞాన కర్మము లన్నియు క్షీణము కానప్పుడు ఇది విశ్వము, దీనికి పరమైన దింకొకటి యున్నది అను భేదముచే భిన్నమయిన దృష్టి కలవారికి ఈ ద్యైత భావ ముండును. భేదమస్త మించి యేది సత్తామాత్రము వాచామ గోచరము ఆత్మ సంవేద్యము నైన బ్రహ్మ జ్ఞానమను పేరిజ్ఞానమది విష్ణువు యొక్క పరరూపమది యా రూపము అనుత్తమము (దానికంటె మరి యుత్తమము లేదన్న మాట) విశ్వము యొక్క యీ పరమాత్మ యొక్క యీ పరమాత్మ యొక్క రూప వైరూప్య లక్షణములు రెండును గలది యది. అది యోగ నిష్టునికి జింతింప (ద్యానింప) శక్యము గాదు. అందువలన హరి యొక్క స్థూల రూపము విశ్వ రూపమున గోచరమగు దానినే చింతింప వలెను. (ధ్యానము సేయ వలెను)

 

 

హిరణ్య గర్భుడు భగవంతుడు వాసుదేవుడు ప్రజాపతి మరుత్తులు వసువులు రుద్రులు భాస్కరులు (ద్వాదశాదిత్యులు) తారకలు గ్రహములు గంధర్వ యక్ష దైత్యుదులు సర్వ దేవా యోనులు మనుష్యులు పశువులు శైలములు సముద్రములు నదులు చెట్లు అశేష భూతములు వానికి హేతువు లయిన ప్రధానము మొదలయిన విశేషములు చేతనము అచేతనము నైనది ఏకద్విపాత్పంచ బహుపాదము లయిన ప్రాణులు అపాదకము (పాదములు లేనిది) నైన మూర్తమయిన యీ ప్రపంచ మెల్ల హరి యొక్క రూపము. త్రివిధ భావనా రూపము. ఈ చరాచరాత్మక విశ్వమది ఎల్ల పరబ్రహ్మ స్వరూపుడైన విష్ణువు యొక్క శక్తితో గూడినది. విష్ణు శక్తి పరయను పేర నొకటి క్షేత్రజ్ఞ యను పేరా అపరయను పేర రెండవది అవిద్య కర్మయను పేర మూడవ శక్తి యున్నది. ఈ అవిద్యా కర్మ రూపమైన మూడవ శక్తి చేతనే సర్వగమయిన క్షేత్రజ్ఞ శక్తి వేష్టితమై యున్నది. ఆవృతయైయున్న దన్నమాట. అదే సంసార తాపము లన్నిటిన విరామము లయిన వాని ననుభవించును. ఆ మూడవ శక్తిచే గప్పుపడిన కతననే క్షేత్రజ్ఞ శక్తి సర్వ భూతము లందు తరతమ భేదముచే గానబడు చుండును. ప్రాణములు లేని వాటి యందది మిక్కిలి అల్పము. స్థావరము లందంత కంటె కంచె మెక్కువ. సరీ సృపాదుల యందు, పాములు తేళ్ళు మొదలగు వాని యందది అంతకంటె నెక్కువ. పక్షులందంత కంటె, మృగము లందంత కంటె పశువు లందంత కంటె మనుజు లందంత కంటె ఆ పరమ పురుషుని ఆత్మయొక్క శక్తి ప్రభావితమై యున్నది. మానవుల కంటెను పైని నాగ గంధర్వ యక్షాదులు దేవతలు వారి కంటె శక్రుడు (ఇంద్రుడు) అంతకంటె ప్రజాపతి ఆపైని హిరణ్య గర్భుడు నెక్కువగు ఆత్మ శక్త్యుప లక్షితుడై యున్నాడు. ఆకాశముచే నంతయు గూడి యున్నట్లు ఈ చెప్పిన అశేష రూపములు నా ఆత్మ శక్తి యోగముచే నాతని రూపము లేయై యున్నవి. ఇది విష్ణువు యొక్క మూర్త రూపము, విశ్వరూపము.

 

 

ఇక విష్ణువు యొక్క రెండవ రూపము యోగి ధ్యేయము. అమూర్తము బ్రహ్మ యొక్క రూపము పండితులు దాని ‘సత్’ ఉన్న వస్తువని పల్కుదురు. ఈ సమస్త శక్తులు నెందు బ్రతిష్టితము లయి యున్నవో అది విశ్వరూప వైరూప్యమైన హరి యొక్క మరియొక్క మహా రూపమది. అది తన లీలచే దేవతిర్యఙ్మనుష్యాది చేష్టలు గల సమస్త శక్తి రూపములను జేయు చుండును. అది జగత్తున కుపకారక మాశక్తి కర్మ నిమిత్తమున బుట్టినది గాదు. ఆ యప్రమేయమైన బ్రహ్మము యొక్క యవ్యాహతమైన సర్వ వ్యాపిని యైన చేష్టయది. విశ్వరూపు డయిన పర బ్రహ్మ యొక్క యా శక్తి రూపము సర్వ పాప హరమది యోగానుసంధాన పరుడైన వానిచే ఆత్మ విశుద్ది కొఱకు ద్యానింప దగినది. అగ్ని జ్వాలలెగయ వాయువుతో గూడి కక్షమును గడ్డిని లేదా యడవిని దహించు నట్లా విష్ణువు యోగుల చిత్తము నందుండి సర్వ కిల్బిషములను దహించును. కావున సమస్త శక్తుల కాదరువైన యా విష్ణువు నందు మనస్సు యొక్క ధారణను నిలుకడను జేయవలెను. అదే శుద్ధ ధారణ యనబడును.

 

 

ఆ ధారణ యందు ప్రసన్న ముఖుడు పద్మ పత్రాయ తేక్షణుడు సుకపోలుడు సువిశాల లలాట ఫలకోజ్జ్వలుడు సమకర్ణముల తోడ నంప బడిన చక్కని కుండలా లంకారములు గలవాడు కంబుగ్రీవుడు సువుశాల శ్రీవత్సాంకిత వక్షుడు కడుపుపై మూడు ముడుతలతో లోతైన బొడ్డుతో గూడిన కడుపుతో ప్రలంబ మాణ భుజాష్టకముతో ఎనిమిది దీర్ఘ బాహువులతో లేదా నాల్గు భుజములతో గూడిన సమముగా నున్న తొడలు పిక్కలి గల్గి చాల చక్కగ నున్న పాదాంబుజ యుగముతో పీత నిర్మలామ్బర ధారిని హరిణి సాక్షాత్ర్బహ్మమేయైన వానిని ధ్యానింప వలెను. నడచుచున్న నిలిచి యున్న మది స్వేచ్చగానే పని చేయు చున్నాను మనసు నుండి యా ధ్యాన లక్ష్యము (గురి) అయిన పరమాత్మ వస్తువు (మూర్తము) తొలగ కున్నచో నపుడా ధారణ సిద్దించి నట్లెరుగా వలయును.

 

 

అటుపైని కొన్నాళ్ళకు శంఖ చక్రాదులు లేని అక్షసూత్రముతో నున్న భగవద్రూపమును (పరిమితముగా) ద్యానింప వలెను. ఆ ధారణ యెప్పుడు పైదానివలె నిలుకడ చెందునో కిరీట కేయూరాది భూషణ రహితముగ నా రూపము ద్యానింప వలెను. ఆ మీద నొక్కొక్క యవయవ మందు ధ్యానము నిలుప వలెను. దానిచే యవయవియందు బ్రణిధానము నొందవలెను. అదే రూపము నందు దృఢపడి అన్య వస్తువునెడ స్పృహ గొనక యుండు నా ద్యానము మొట్టమొదటి యోగామ్గము లారింటి చేత నేర్పడును. అదే ధ్యానము యొక్క రూపాంతరము కల్పనా రహిత మయిన కేవల రూపగ్రహ్న మనునదేది గలదో యది మనస్సుచే ధ్యాన మందేర్పరుప బడునదదే సమాధి యనబడును. అందు ప్రాప్యమయిన పరబ్రహ్మ మందు ప్రాపకమయిన విజ్ఞానము ప్రాపణీయము (పొందింప వలసినదగు) అశేష భావనలు క్షీణించిన కేవల సంవిద్యస్తువు ఆత్మ వస్తువు క్షేత్రజ్ఞుడు కరణ జ్ఞానము (సాధన కుపయోగించు జ్ఞానము) దాని యొక్క కరణము (సాధనము) ధ్యాన నిష్ఠాద్య మనుకొన్న ముక్తి కార్యమున నున నవియెల్ల కృత కృత్యములై మరలి పోవును. ఆ భూమికలో తద్భావము బొంది, అనగా ధ్యేయ వస్తువు యొక్క వస్తుత్వముం దాను బొంది యీ సాధకుడు పరమాత్మతో నభిన్ను డగును. వానికి భేద మజ్ఞాన కృతమగును. విభేదా జనక మయిన జ్ఞానము (తెలివి) పూర్తిగా నశింపగనే ఆత్మకు (తనకు) బ్రహ్మమునకు లేనిపోని భేద మెవడు సేయును? ఖాండిక్య! అడిగితివి కావున సంక్షేపముగను విస్తరముగ నిట్లు నీకు యోగము నేను తెల్పితిని. నీకింకేమి సేయు మందువు? అన

 

 

యోగ సద్భావము తెలుపుటతో నాకు సర్వము సేసినదే యైనది. నీ యుపదేశముచే చిత్తమల మెల్ల పోయినది. నాదియని యేనేమంటిని ఇది తప్పేకాని వేరొకటి కాదని విజ్ఞేయ వేదులు (తెలియ వలసిన బ్రహ్మ వస్తువు నెరింగిన వారు) చెప్ప శక్యమయినది. నేను నాది యను వీవ్యవహారమ విద్య యిది. ఈ రెండింటి యొక్క పరమార్థము పలుక వలనైనది గాదు. వాక్కుల కది గోచరము గాదు. కావున దామిక దయచేయుడు. నాకు జేయ వలసిన దెల్ల తాము గావించితిరి. ముక్తి ప్రదమయిన అవ్యయ మయిన యోగము మీరు సెలవిచ్చితిరి.

 

 

అని యా ఖాండిక్యునిచే కుమారుని రాజుం గావించి యోగ సిద్ధికై గోవిందు నందు డెందము నిలిపి వనముం బ్రవేశించెను. అటనేకాంత మతియై యమాది గుణములతో విష్ణువను పెరి నిర్మల బ్రహ్మందాఱేడు లయ మందెను. కేశిధ్వజుడు విముక్తి కొఱకు స్వకర్మ క్షపనమునెడ నున్ముఖుడై (కర్మ క్షయమున కుద్యమించిన వాడై) విషయముల ననుభవించెను. అనభి సంహితముగా (కర్మఫలాభి సంధి లేకుండ) కర్మముల నొనరించెను.

ఆకల్యాణము లైన ఉపభోగములచే పాపము క్షీణమయి అమలుడై తాపత్రయ క్షయము ఫలము గాగల అత్యన్తిక సిద్ధిని (మోక్షమును) పొందెను.