విష్ణు మహా పురాణము

Table of Contents

8 - సూర్యాది జ్యోతిర్మండల సంస్థానము

 

 

ఈ బ్రహ్మాండ సంస్థితిం గూర్చి వివరించితిని. ఇక సూర్యాది జ్యోతిస్సుల యొక్క కొలతలను వాని సంస్థానము (ఉనికి) వినుము. సూర్యుని రథము తొమ్మిది వేల యోజనములు. ఈషాదండము కాడికి యిరుసునకు ననుబంధ పడియుండు పోలుగఱ్ఱ దీనికి రెండింతలు. అనగా పదునెనిమిది వేల యోజనములు. ఈ రథము యొక్క యక్షము (బండి కన్ను కుంచము) ఒక కోటి ఏబది యేడు లక్షల యోజనములు. దీని యందు చక్రము ప్రతిష్టితము. ఈ చక్రము త్రినాభికము. అనగా కేవలము వర్తులాకారము గాక కోడిగ్రుడ్డు ఆకారముగా నుండునన్న మాట. అదిగాక ప్రాతర్మధ్యాహ్న సాయాహ్నములు మూడు ఈ కాల రూప చక్రమునకు నాభులని వ్యాఖ్యాతలన్నారు. ఇంకొకరు నాల్గేసి మాసము లోకటిగా మొత్తము సంవత్సరమును మూడు కాలములుగా గణించి యవి యీ చక్రము కాకుతారు. దీనియందు అరలు అయిదు. బండి చక్రముల ఆకునకు నాకునకు నడుమగల యంతము అర. అవి యీ సంవత్సరాత్మక కాలచాక్రములో వత్సర, పరివత్సర, ఇద్వాత్సర, అనువత్సర యుగములను నైదు భాగాములని యొక వ్యాఖ్యాత హేమంత శిశిరము లోకే ఋతువుగా గణించి వసంతాది ఋతువు లయిదు దీని యందరలై యున్నవని మరియొకరు. ఇందు నేములు యారు. నేమియనగా బండి చక్రము చుట్టునుం గల యీనుప పట్టా. ఆ పట్టాను తాకుచు ఆకులుండును. ఆ తాకిన బిందువులు ఆరు రుతువులుగా కాలచక్రము చుట్టూ నున్నవని సంకేతము. గుఱ్ఱము లేడును ఏడు ఛందస్సులు. అవి గాయత్రి బృహతి ఉష్ణిక్కు జగతి త్రిష్టుభము అనుష్టుప్పు పంతియను పేరుగలవి. అక్షము (ఇరుసు) యొక్క ఒకవైపు మేరువు మీద రెండవకొన మానస గిరి మీదను నానియుండగా నీ చక్రము అక్షము మీదను ఆ అక్షము థ్రువ మండలము నందును నను బంధింప బడి యున్నది. చక్రముతో నిరుసును ఇరుసుతో ధ్రువుడును దిరుగు చుండును. జంబూద్వీపము నడుమ మేరువు దానిమీద పదునైదు లక్షల యోజనములలో ధ్రువమండల మున్నది. మేరువు మీద పదునారు వేల యోజనములలో మహాక్షము యొక్క మొదలును, ఏబదివేల యోజనములలో మానసోత్తర పర్వతము మీద ఆ మహాక్షయ యొక్క తుదిభాగము గలవు.

 

 

మానసోత్తర పర్వతమునకు దూర్పున ఇంద్ర రాజధాని వసౌకసారము. దక్షిణమున యమపురి సంయమని యనునది, పడమట వరుణపురి సుఖపురి యను పేరు గలది, ఉత్తరమున సోముని యొక్క పురము విభావరి యను నదియుం గలవు. దక్షిణ దిశనున్న రవి విసరిన బాణమట్లు ఉత్తర దిశకు జ్యోతిశ్చక్ర మంతయు దన వెంటంగొని నడచును. ఆయనము (గమనము) సేయును. అట్లారు మాసము లయనము (గమనము) సేసి యుత్తరమునకు జేరును. ఆటనుండి ఆరు మాసము లయనించి క్షిణమునకు జేరును. సర్వద్వీపము లందును అహోరాత్ర వ్యవస్థకు కారణమైన సూర్య భగవానుడీ రెండు దారులందు సంచారము సేయు చుండును. సూర్యుడు దక్షిణ దిశ నుండి యుత్తర దిశకు బోవు కాలము ఉత్తరాయణము. ఉత్తరాయణము ఆరు మాసములు. (తదభిమాని దేవత) అగ్ని జ్యోతి (అర్చిరభిమానినీ ఆతివాహిక దేవత) అహస్సు (అహరభిమానినీ దేవత) శుక్ల పక్షము (తదభిమానినీ దేవత) వీనికి దేవయాన మార్గమని పేరు. ఈ మార్గము నందు పోవు యోగులు అనగా జ్ఞానులు బ్రహ్మపద మందుదురు కావున నీ మార్గము యోగుల క్లేశములను హరించు గొప్ప మార్గము.

 

 

సూర్య నెవ్వరెచట జూచెదరో యది పగలు. ఆయన చాటు పడిన పుడదియే రాత్రి. ఎల్లప్పుడు ప్రకాశించు రవికి నిజముగా ఉదయాస్తమయములు లేవు. ఆయన కనబడుట కనుపింప కుండుటయే యాయన ఉదాయాస్తమయములు.

 

 

భాస్కరుని రథ వైశాల్యము (భాస్కరుని కాంతి ప్రసరించు మేర అన్నమాట) తొమ్మిది వేల యోజనములు. దాని యీషాదండము (కాడికిని యిరుసునకు మధ్య నుండునది) పదునెనిమి వేల యోజనముల పొడవు ఆ రథము యొక్క అక్షము ఒకకోటి యేబదివేల యోజనములు దానిపై చక్రముంచ బడినది. ఆ చక్రము మూడు నాభులు అయిదు అరలు ఆరు నేములు కలది. దీని యందు సంవత్సర మయమైన కాలచక్రము ప్రతిష్టింప బడినది. మూడు నాభులనగా బూర్వాహ్ణము మధ్యాహ్నము, సాయాహ్నము అనునవి. అయిదు అరలనగా 1. సంవత్సరము 2. పరివత్సరము 3. ఇద్వాత్సరము 4. అనువత్సరము 5. యుగము ననున వైదు. నేము లాఱనగా నారు రుతువులు. మేరు పర్వతమునకు మానస పర్వతమునకు నడుమ నున్న దూరమే యక్షము యొక్క కొలత. అక్షము యొక్క ఒక కొన మేరువు మీదను, రెండవ కొన మానసగిరి మీదను ఆని యుండగా నీ చక్రము తిరుచు చున్నదియని గ్రహింప నగును. చక్ర మక్షము మీదను (ఇరుసు మీద) ఇరుసు. ధ్రువమండల మందును గట్ట బడియున్నవి. చక్రముతో నిరుసును, ఇరుసుతో ద్రువుడును దిరుగు చుందురు. జంబూ ద్వీపము నడుమ మేరువు. దానిమీద బదునైదు లక్షల యోజనములలో ధ్రువుడు, మేరువు మీద బదునారు వేల యోజనములలో మహాక్షము యొక్క మొదలు, దాని కొస చక్రముతో గూడ మానస పర్వతము మీద నేబదివేల యోజనములలో నున్న యాకాశము నున్నవి. మానసోత్తర పర్వతమునకు దూర్పుగా నింద్ర పురమున్నది. దక్షిణమున యమ పురము, పడమట వరుణ పురము, ఉత్తరమున సోమపురి యున్నవి. ఇంద్రుని పురము పేరు వస్వౌకసారము, యమపురము ‘సంయమని’, వరుణుని పురము ‘సుఖ’, చంద్రుని పురము ‘విభావరి’ సూర్యుడు విసరిన బాణము వలె దక్షిణ దిశయందు దిరుగును. సూర్యుడే యహోరాత్రములకు గారణము. అతడంతట దన కాంతిని బ్రసరింప జేయును. దేవతల పర్వతమగు మేరువు నందు, బ్రహ్మలోక మందు నతని కాంతులు ప్రసరింపవు. బ్రహ్మ లోకమునకు బ్రసరించిన కాంతు లందలి కాంతులచే ద్రోసి వేయబడి దివిటీ ముందరి దీపముల వలే నుండును. అందుచేతనే యుత్తర దిక్కు నందెల్లప్పుడు దివా రాత్రుము లుండుట తటస్థించును. అనగా మేరువు మీద నున్న బ్రహ్మ లోకము తన ప్రకాశాముచే నేల్లవేళల పట్టపగలై యుండు ననియు, నీ సూర్య కాంతియట ప్రసరింపని కారణముచే, నెల్లప్పుడు రాత్రిగానే యుండునని తాత్పర్యము. సూర్యు డస్తమింప గనే రాత్రి యాతని కాంతి యగ్నిం బ్రవేశించును. అగ్నికాంతి సూర్యోదయము కాగానే పగలు సూర్యునందు బ్రవేశించును. సూర్యాగ్నుల తేజస్సులు రెండును నొకదాని యందోకటి, ప్రవేశించి రాత్రింబవళ్ళూ ప్యాయనము సేయుచున్నవి. మేరువునకు దక్షిణము వైపు సూర్యు డుదయింపగా తమో రూపమైన రాత్రి నీటియందు బ్రవేశించును. కావుననే పగలు నీరించుక యెఱ్ఱగా నుండును, రాత్రి నీరు తెల్లగా చంద్రుని వలె నుండును. ఇట్లు మేరువానస పర్వతముల నడుమ నున్న పుష్కర మందలి యొక ముహూర్తములో భూ మండలము యొక్క ముప్పది యావ భాగమును రవి యతిక్రమించును. కుమ్మరి సారియందు వలె జ్యోతిశ్చక్రమున నిట్లు దక్షిణాయనమున సంచరించి, యుత్తరాయనమున ప్రవేశించి రాత్రింబవళ్ళ ప్రమాణమును జిన్నదిగా బెద్దదిగా జేయు చుండును. మకర కుంభ మీనా రాశుల మూడిటం గడచి, విషువములకు సూర్యుడు వచ్చిన అపుడు పగలు రాత్రియు సమానముగా నుండును. ఆవల రాత్రి తగ్గును పగలు హెచ్చు చుండును. మిథునము దాటి కర్కాటకమునకు రాగానే దక్షిణాయన మారంభ మగును. అపుడు పగలు తక్కువ రాత్రి హెచ్చు నగును. పగలు పదమూడున్నర నక్షత్రము లను, రాత్రి పదమూడున్నర నక్షత్రము లను నతడు నడచును. పగలారు రాశులందు రాత్రి యాఱు రాశులందు నతడు సంచరించును. అతని సంచారముం బట్టి రాసుల ప్రామానములు హ్రస్వ దీర్ఘములగు చుండును. ఉపయనగా రాత్రి. వ్యుష్టియనగా బగలు. వాని నడిమి కాలమునకు ‘సంధ్య’ యని పేరు. అది పరమ దారుణమైన కాలము రౌద్రము. అచ్చట మందేహులను రాక్షసులు సూర్యుని భక్షింప కోరుదురు. అక్షయములైన శరీరములును, దిన దినము చావును గలుగునని బ్రహ్మ వారికి శాప మిచ్చెను. అందుచే వారు సూర్యునితో దారుణ యుద్దము చేయు చుందురు. బ్రాహ్మణులు సంధ్యా సమయమున నిచ్చు అర్ఘ్యములు మంత్రం పూతములై వజ్ర సమానములై వారిని ఖండించును. అగ్ని హోత్రము నందా సమయమున జేయు హోమమున యొక్క ప్రథ మాహుతిచే సూర్యుడు లెస్సగా బ్రకాశించును.

 

 

ఓంకారమే భగవంతుడైన విష్ణువు. అది వాక్పతి. ఋగ్యజుస్సా మాత్మకము. (త్రిదామ) అది యుచ్చరింపగనే రక్కసులు నశింతురు. సూర్యుడు విష్ణుని యంశము. అంతర్జ్యోతియు, అవికారము నగు నోంకారము చని, యవ్విష్ణుని ప్రేరణ చేయును. ఓంకారమున బ్రేరేపింప బడి మిక్కిలి వెలుంగు గల యా జ్యోతిస్సు సకల రాక్షసుల నుమందేహులను వారిని నశింప జేయును. అందుచేతనే సంద్యోపాసనము (సంధ్యా వందనము) మానరాదు. అట్లు మానిన విప్రుడు సూర్య హాని చేసిన వాడును, ఆవల వాలఖిల్యాదుల చేతను భ్రాహ్మణుల చేతను నుతింప బడి సూర్యుడు లోకములను రక్షింప నేగును. ముప్పది ముహూర్తములచే నొక్క రాత్రి యుంబవలు నేర్పడును. ఐదవ భాగము మూడు ముహూర్తముల కాలము ప్రాతః కాలమాన బడును. ఆవల మూడు ముహూర్తముల కాలము సంగవమన బడును. అవలిది మధ్యాహ్నము. అవలిది అపరాహ్నము. అంతకు మీదిది సాయాహ్నము. ఇట్లు ముప్పది గడియలు పదుహేను ముహూర్తములలో గల పగటి కా మైదు విధములుగా విభజింప బడింది. పదునైదవ ముహూర్తము విషువన్ముహూర్త మనబడు చుండును. దక్షిణోత్తరాయణము లందు రాత్రిం బవళ్ళు హెచ్చుచు దగ్గుచు చివరకు ముప్పది ముహూర్తముల కాలముగా గణింప బడుచుండును. శరద్వసంత ఋతువుల నడుమ విషువత్తు వచ్చును. అనగా తులా మేషములను సూర్యుడు పొందినపుడు విషువత్తులు వచ్చును. కర్కట మందు సూర్యుడు రాగా దక్షిణాయనము. మకర మందుండునచో నుత్తరాయణము నగును. రాత్రింబవళ్ళు ముప్పది ముహూర్తము లని యిపుడు చెప్పిన దానిలో బదునేను ముహూర్తములకు బక్షమని పేరు. కృత్తికా ప్రథమ భాగమున సూర్యుడున్నప్పుడు విశాఖా చతుర్థ పాదమున చంద్రుడుండును. విశాఖా చతుర్థ పాదమున జంద్రు డున్నప్పుడు కృత్తికా శిరస్సున సూర్యు డుండును. అట్లున్నపుడే విషువత్తు అనునది యేర్పడును. అపుడు బ్రాహ్మణులను పితృ దేవతలను నర్చింప దగును. దానాదులొనర్ప వలయును.

 

 

లోకలోకమను పర్వతమున సుథన్వుడు, శంఖపుడు అను కర్దాముని కొడుకు లిర్వురు. హిరణ్యరోముడు కేతుమంతుడు అను నిర్వురును ద్వంద్వాతీతులు నిరభిమానులు నై నాల్గు దెసలు నల్గురును పాలకులై యుందురు. అగస్త్యుని కుత్తరముగా, అజవీధికి దక్షిణముగా ధూమాది మార్గమను పేరా పితృ యానమను మార్గమున్నది. అది వైశ్వానర మార్గమున కవ్వల గలదు. అట అగ్ని హోత్రములు సేసిన పుణ్యు లుందురు. భూతముల సృష్టికి గారణమైన బ్రహ్మ వేదమును బఠించుచు ఋత్విక్కుల ద్వారమున కర్మ మాచరించు వార లుందురు. అది వారి మార్గము. దక్షిణమున యుగయుగమున జలించు బ్రహ్మమును వేదమును వారుద్దరింతురు. ఆ యుద్దరణము వంశ ప్రవర్తనము చేత తపస్సు చేత వర్ణాశ్రమాది వ్యవస్థల చేత శాస్త్ర ప్రవర్తనము చేత వారు చేయుచుందురు. వారు భూత ప్రళయము జరుగు దాక సూర్యాది దక్షిణ మార్గమున వసించి చంద్ర నక్షత్ర మండలము లున్నంత వరకు, తండ్రి కుమారుని యందు కుమారుడు మరల తండ్రి యందు నాయాకులము లందు అధికారికమైన కర్మము వలన బుట్టు చుందురు. నాగ వీది కుత్తరముగా సప్తర్షి మండలమునకు దక్షిణమున సూర్యుని యుత్తర మార్గము అర్చిరాది మార్గమును పేరా దేవయానము నున్నది. అచటి వారు జితంద్రియులై, పరిశుద్ధులై సిద్దులయి బ్రహ్మచారులై సంతానము నెడ జుగుప్స గలవారై యుందురు. సంతాన విముఖులై యుండుట చేత మృత్యువును జయించి యుందురు. అమృతు లగుదురని యర్ధము. ఎనుబది వేలమంది యూర్ధ్వ రేతస్కులైన మునులు యుత్త మార్గము నాశ్రయించి, ప్రళయము దాక సంచరింతురు. లోభము విడిచి, మిధునము విడిచి, ఇచ్చ, ద్వేషము లేక భూతముల నారాదించుట మాని కామము విడిచి శబ్దాదులగు విషయములు దుష్టములని తెలియుట వలనను, శుద్దులై యమృతులయ్యెదరు. ఇతన మృతత్వమనఁగా జిరకాలము, అనఁగా బ్రహ్మ మొదలు పగటికాల మంతయు పునరావృత్తి లేక యుందురు. భీతి ప్రళయము జరుగ నంతకాల ముండుతయే యిట నమృతత్వము అని పేర్కొన బడినది. త్రిలోకముల యొక్క స్థితి కిది సమయము. అపునర్నాకమని దీనికే పేరు. బ్రహ్మ హత్యచే నగు పాపము ఆశ్వమేధముచేఁ గల్గు పుణ్యము, భూత ప్రళయము దాక అనుభవింప వలసినవి. భూమి నుండి ధ్రువ మండలము దాక గల్గు మేలును సర్వమును భూత ప్రళయమున నశించును. సప్త ధ్రువముల కుత్తరముగా బైన ధ్రువుఁడున్నాడు. ఇదే విష్ణుపదము. భూమి నుండి మూడవ దివ్య స్థానము ఆకాశమునఁ బ్రకాశము గల్గి యుండునది. పాపముల వాసి మనసు గెల్చిన యతుల కది నివాసము. అదే వైరాజుని హృదయ నాడీ స్థానము. విష్ణు నివాస మదియే. ఇది స్వర్గము కంటె గొప్పది. (మీదిది సత్య లోకము కంటె క్రిందిది. పుణ్య పాపములు రెండును క్షీణమైన వారిట నుందురు. అనఁగా మొక్షార్హు లుండు చోటని యర్ధము. ఆ మోక్షము కూడ క్రమముక్తిని సూచించునదే. ఇట నున్నవారు, దేహము పొందుటకుఁ గల హేతు వులన్నియు క్షీణమయి, క్రమముగా బ్రహ్మ లోకమున కేగి బ్రహ్మతోఁబాటు మోక్షము పొందుదురు. ఏ లోకమున, విష్ణునితో సమానైశ్వర్యము వడసి, ఇంద్రియాదుల గెల్చినందు వలనఁ గలిగిన యోగ సమాధిచే, వేలుంగు వారు చరింతురో యది యా విష్ణువు యొక్క పరమ పదము. ఆకాశమున సర్వ ప్రకాశమై ప్రాపంచిక మైన జ్ఞానము కంటె భిన్నమైన వివేక జ్ఞానముచే నింతింత యని నిర్ణయింప రానిదిగాఁ జూడబడు నాస్తానమే విష్ణువు యొక్క పరమ పదము. ఏ స్థానమున నిలువు గాంచి వెలుంగు వాఁడై స్వయముగా ధ్రువుఁదున్నాడో ఏ ధ్రువుని యందెల్ల జ్యోతిస్సు, జ్యోతిస్సుల యందు మేఘములు, మేఘముల యందెడతెగని వర్షము, వర్షము వల్ల పోషణము, దేవాదులకు తృప్తి కలుగు చున్నదో, అజ్యాహుతులచే (నేయి హోమములు చేయుటచే) దేవతలు పోషింపఁబడి, సృష్టికిఁ గారణులై, భూతముల రక్షణ మొనర్చు చున్నారో, అట్టి దానికెల్ల నాధారమై, ముల్లోకముల వృద్దిని గూర్చునట్టి యా మూఁడవ స్థానము విష్ణు పదము. ఆ విష్ణు పదము నుండి గంగా నది, సర్వ పాపముల హరించు నదియై, దేవతా స్త్రీల శరీర గంధములచేఁ (నెఱ్ఱనిదై) బరమళించునదై. (ప్రభవించినది లెస్సగా నేర్పడినది) త్రివిక్రముని పాదముచేఁ బగిలిన బ్రహ్మాండము యొక్క పగులులో నుండి యది జనించినది. విష్ణు పాదముచే. బ్రహ్మాండము పగిలి యంబరము నుండి, విష్ణుమాయ, విష్ణు పాద మను వజ్రము వంటి యూరు దండముచేఁ గొట్టబడిన బ్రహ్మాండము తూటుపడి యందుండి భూమి కేగెను. అనఁగా నడి వరకుఁ బుట్టి యున్నను దృష్టికి గోచరము కాకుండ యున్న యా నది యది మొదలు దేవాదులకుఁ దృప్తి కలిగించుచుఁ బ్రకట మయినది. బ్రహ్మయొక్క కమండలు జలముచేఁ విష్ణు పాదము కడుగఁ బడెననియు, నది చాలకపోగా ధర్మము బ్రహ్మజ్ఞచే నీరుగా మారెననియు, నదియుం జాలకున్న బ్రహ్మాండ కటాహము తూటు పడగా నందుండి వెలుపలి ధారగా నా కన్నము నుండి వెడలి విష్ణు పాదము స్పృశించుచు భూమి కరిగెననియు, నదియె గంగ యయ్యెనని పురాణము లందున్నది. విష్ణుని ఎడమ పాదము యొక్క బొటన వ్రేలి గోటి నుండి వెడలిన యా గంగను ధ్రువుఁడు భక్తితో నెత్తిపై భరించు చున్నాడు. ఆవల సప్తర్షులు ప్రాణాయామ పరులై, యఘమర్షణ స్నానము చేయుచు నా నీట జడల దేలించు చుందురు. ఆ జల ప్రహములచేఁ జంద్ర మండలము దడుపఁబడి రాత్రి వేళ మిక్కిలి కాంతిని వహించును. చంద్రమండలము నుండి మేరుగిరిపై బడి, లోకములు పావనము లొనర్ప నాల్గు దెసలకుఁ బ్రవహించు చున్నది. ఆయా దిక్కుల కేగుటంబట్టి, సీత, అలకనంద, చక్షువు, భద్రా అను పేరుల గొని యున్నది. అలకనందయను శాఖను నూరు వత్సరముల కంటె నెక్కువగా శిరమ్మున ధరించెను. అతని జటాకలాపము నుండి దిగి సాగర కుమారుల యస్థి చూరములం దడిపి, వారి కుత్తమ గతు లనుగ్రహించెను. అందు స్నాన మొనర్చిన నప్పుడే పాపము పోవును. అపూర్వమైన పుణ్యము లభించును. కుమారులు తండ్రులకు వదలిన యీ యుదకములు నూరేండ్ల వరకు వారికిఁ దృప్తి నిచ్చును. గంగా, గంగా అని రెండు మార్లు తలంచినఁ జాలు మూడు జన్మల పాపము నశించును.