విష్ణు మహా పురాణము
7 - యమలోక వర్ణనము
ఓ గురూ! నేను మిమ్ములను ప్రశ్నించిన విషయ మంతయును నాకు ఉన్నది ఉన్నట్లు చెప్పితిరి. ఇంకను ఒక విషయము వినగోరు చున్నాను. అది నాకు మీరు చెప్ప వలయును.
ఓ మహామునీ! సప్త ద్వీపములును పాతాళ లోకమును ఈ బ్రహ్మాండమునకు లోపలి వైపున అంతటను ఉన్న సప్త లోకములును అను ఇది అంతయును స్థూలములును నింత కంటె నింకను స్థూల తరములును సూక్ష్మములును మరింత సూక్ష్మములును వాని కంటెను మరియు సూక్ష్మతరములును అగు ప్రాణులతో నావరింపబడి యున్నది. ఓ మునిసత్తమా! కర్మ బంధముచే నిబందింప బడిన ప్రాణులు లేని చోటు ఈ బ్రహ్మాండాంతర్భాగమున అంగుళములో ఎనిమిదవ భాగము కూడ లేదు. భగవాన్! ఈ ప్రాణులన్నియు తమ ఆయువు ముగియగానే యమునకు వశమగు చున్నవి అని శాస్త్ర ప్రమాణముల వలనను పెద్దల వచనముల వలనను తెలియు చున్నది. తరువాత యముని చేత విధించ బడిన యాతనలను అనుభవించు చున్నారు. ఆ యమ యాతనల నుండి తిరిగి వచ్చిన ప్రాణులు దేవతలు మొదలగాగల వివిధ యోనుల యందును జన్మించుచు మరణించుచు చక్ర క్రమముగ వర్ధిల్లు చున్నారు. ఇదియే శాస్త్రముల నిర్ణయము. అందువలన ఈ సంశయమును నివర్తింపజేయు అంశమును వినగోరు చున్నాను. నరులు యమునకు వశవర్తులు కాకుండుటకు అమలమగు కర్మము ఏది ఆచరించ వలెనో నాకు తెలుపుము.
ఓ మైత్రేయ మునీ! మహాత్ముడగు నకులుడు ఈ ప్రశ్నమునే అడుగగా అతని పితామహుడగు భీష్ముడు చెప్పిన సమాధానమును చెప్పెదను వినుము.
నాయనా! నకులా! పూర్వము కళింగ దేశీయుడగు నా మిత్రుడగు బ్రాహ్మణుడొకడు నా యొద్దకు వచ్చెను. నేనతనిని ప్రశ్నించగా పూర్వ జన్మ స్మృతి కలవాడును మునియు నగు నతడు ఈ ముందటి విషయమును నాకు చెప్పెను. ఇది అంతయు పూర్వమా బుద్ధిమంతుడు చెప్పినట్లే జరిగి యుండెను. ఇక మీదటను ఇట్లే జరుగును. నేను శ్రద్ధా పూర్వకముగా ఆ కాళింగుని అనేక పర్యాయములు మరి మరి అడుగగా అతడు నాకు ఏమని చెప్పెనో అది ఆ విధముగనే తప్ప మరియొక విధముగా యెక్కడను నాకు కనబడ లేదు. ఓ నకులా! నీ విప్పుడు నన్నేమి అడిగితియో అదియే నేను ఆ కాళింగుని ప్రశ్నించితిని. దానికి అతడు సమాధానమును చెప్పెను. ఆ విప్రుడు పూర్వ జన్మ స్మృతి కలవాడు కనుక తానూ పూర్వ జన్మమున మునిగా నున్నప్పుడు తానెరిగినదియు రహస్యముగా నగు యమునికి అతని కింకరునకు జరిగిన సంవాదమును నాకు చెప్పెను. ఆ ముని చెప్పిన విషయమునే జ్ఞాపకము చేసికొని నేను నీకు చెప్పెదను వినుము.
హస్తమున పాశమును ధరించి ప్రాణి వధమునకై బయలుదేరుచున్న తన కింకరుని చూచి యముడు అతని చెవిలో నిటు చెప్పునట! ఓయీ! కింకరా! శ్రీమహావిష్ణువుని ప్రపత్తి శరణాగతి చేయు భక్తులను మాత్రము విడిచి వేయుము. నాకు అన్య మానవుల మీదనే కాని విష్ణు భక్తులపై నదికారము లేదు. దేవతలచే నర్చనలను అందుకొను బ్రహ్మ నన్ను లోకము లందలి ప్రాణుల హితాహితముల విచారించి వారిని విషయమున యమునిగా (వారిని అదుపులో నుంచు వానిగా) నియోగించెను. కాని నేనును లోకములకు గురుడగు హరి ఆదేశమున నడచు కొనవలసిన వాడనే కాని స్వతంత్రుడను కాదు. నన్నును సంయమించుటలో విష్ణువునకు సామర్థ్యము కలదు. సువర్ణ మొకటియై యుండియు కడియము కిరీటము చెవికమ్మ మొదలగు భేదముల నొందు చున్నట్లే హరి తాను ఒక్కడే అయి యుండియు దేవతలు పశుపక్ష్యాదులు మనుజులు మొదలగు భేదముల నొందిన వాడుగా కల్పనా మాత్రమున చెప్ప బడు చున్నాడు. గాలికి పైకి లేచిన భూపరమాణువు లన్నియు గాలి వీచుట ముగుయగానే భూమిలో ఏకత్వమును పొందునట్లే ఈ దేవతలు పశువులు మనుజులు మొదలగు ప్రాణులును సృష్టి మొదలగు కార్యముల నెరవేర్చు నపుడు త్రిగుణములచే కలుషితుడును వాస్తవమున ఆకలుషుడగు శాశ్వతుడగు ఆ విష్ణువుతో అంతమున నేకత్వమును పొందును. కనుక ఏ మర్త్యుడు దేవ సమూహార్చిత పాదారవిందుని శ్రీహరిని సత్యముగా నమస్కరించునో సమస్త పాప బంధములును తొలగిన అట్టి మర్త్యుని ఆజ్యాహుతిచే ప్రజ్వలించు నగ్నినట్లు తప్పించుకొని పొమ్ము.
పాశమును హస్తమున ధరించిన ఆ యమ కింకరుడు యముడు చెప్పిన ఈ వాక్యమును విని యమ ధర్మరాజుతో నిటు పలికెను. సమస్త సృష్టి కర్తయు సర్వేశ్వరుడును అగు ఈ హరి యొక్క భక్తుడు యే లక్షణములు కలిగి యుండునో నాకు చెప్పుము.
ఎవడు తన వర్ణమునకు విహితమైన ధర్మమును వదల కుండునో, శత్రువుల యందును, మిత్రుల యందును సమబుద్ధి కలిగి యుండునో దేనిని కాని అపహరించక హింసించక యుండునో అత్యంత నిర్మల మనస్సు కల అట్టి వానిని విష్ణు భక్తునిగా గుర్తింపుము. ఎవని అంతః కరణము కలికాల దోషముల చేత మలినము కాదో ఎల్లప్పుడును తన మనస్సున శ్రీహరినే నిలుపుకొని యుండునో అతనిని విష్ణువున కత్యంత భక్తునిగా గుర్తింపుము.
స్పటిక పర్వతపు శిలవలె నిర్మలుడగు విష్ణువెక్కడ? మానవుల మనస్సున మత్సరము మొదలగు అరిషడ్వర్గ దోషములు ఎక్కడ? చంద్రుని కిరణముల రాశిపై అగ్నిజ్వాలల వేడిమి ప్రసరింప జాలదు కదా! నిర్మలమగు బుద్ధి కలిగి మత్సరము లేక మనస్సున అధికమగు శమము కలవాడయి పవిత్రమగు నడవడిక కలిగి సమస్త ప్రాణుల విషయమున మిత్రతా భావము కలిగి ప్రాణులకు ప్రీతిని హితమును కలిగించు మాటలాడుచు అహంకారము కపటము లేక యుండువాని హృదయమున నెల్లప్పుడును వాసుదేవుడు నివసించును. శాశ్వతుడగు వాసుదేవుడు తన హృదయమున నెల్లప్పుడును వాసుదేవుడు నివసించును. శాశ్వతుడగు వాసుదేవుడు తన హృదయమున నివసించు చున్నంత వరకు అట్టి పురుషుడు లోకము నందలి ప్రాణులకు సౌమ్య రూపుడుగా కనబడును. ఏపి చెట్టు తన అందము చేతనే తనలో ప్రవహించు భూరసము ఎంత రమ్య మైనదో తెలుపును. భగవానుడును అనాదియును ఖడ్గము శంఖము గద ధరించు వాడును వికార రహితమగు కూట స్వరూపుడును నగు హరి హృదయము నందున్నచో అట్టివాని పాపము కూడ హరి చేతనే భేదింప బడుచున్నది. సూర్యుడున్న చోట చీకటి యెట్లుండును.
ఓ భటుడా! యమము, నియమము అను యోగ శాస్త్ర సంబంధ నియమములచే కల్మషముల తొలగించు కొనిన వారును, అను దినమును అచ్యుతిని యందు ఆసక్తమగు మానసము కలవారును, మదము, అభిమానము, మత్సరము లేని వారును అగు మానవులకు దూరముగ పొమ్ము. రహస్యముగా పరధనము, బంగారము కనబడినను గడ్డి పోచనుగా తలచుచు తన చిత్తము నందు విష్ణు భగవానుడు తప్ప ఇతరము లేనివాడగు పురుష శ్రేష్ఠుని విష్ణు భక్తునిగా గుర్తింపుము. పరధనము హరించుచు ప్రాణుల హింసించుచు అసత్యములను కఠిన వచనములను పలుకుచు పాప వశమున దురహంకారము కలిగిన కలుషమతి యొక్క హృదయమున శ్రీహరి ఉండడు. సాధు స్వభావము లేక, కలుష బుద్ధి కలిగి పరుల సంపద కోర్వక సత్పురుషుల నిందించుచు దేవతారాధనము చేయక తనకున్న దానిని దానము చేయక యుండు నధముని మనస్సున జనార్దనుడుండడు. పరమ మిత్రుని యందు బాంధవుని యందు, భార్య విషయమున కొడుకులు కూతుళ్ళు తల్లిదండ్రులు, భృత్యులు అనువారి విషయము నందు కూడా కపటముతో ప్రవర్తించుచు ధనమునందాశ మాత్రము కలిగి ప్రపత్తి లేక ఎల్లప్పుడును పెద్దలు కాని వారితో దుశ్శీలము కలవారితో సాంగత్యము చేయుచు మత్తుగొని అనుదినమును పాపబంధము నందాసక్తుడగు చుండు పురుష పశువు వాసుదేవ భక్తుడు కాడని తెలియుము.
అనంతుడగు శ్రీవిష్ణువు హృదయము నందు కలవారికి ఈ సమస్త దృశ్య ప్రపంచమును నేనును (యముడు) వాసుదేవుడును పరమ పురుషుడును అగు ఆ పరమేశ్వరుడును ఒకటియే అను స్థిరబుద్ధి నిశ్చయము కలిగి యుండును. నీవు వారిని విడిచి దూరముగా పొమ్ము. ఓ కమలముల వంటి నేత్రములు కలవాడా! వాసుదేవా! విష్ణో! ధరణీధరా! అచ్యుతా! శంఖచక్రప్రాణీ! నీవు నాకు రక్షకుడవగుము అని పలుకుచుండ పుణ్యుల నుండి ఓ భటుడా! దూరముగా పొమ్ము. అవ్యయ స్వరూపుడగు విష్ణువు ఎవరి మనస్సు నందుండునో ఆ పురుష శ్రేష్ఠుని కంటి చూపు మేరలో నీవు కాని, నేను కాని సంచరింప జాలము. శ్రీవిష్ణుని చక్ర శక్తి చేత నా వీర్య శక్తి ప్రతిహతమే యగును. అట్టి పుణ్యాత్ముడు ఇతరములగు ఉత్తమ లోకములకు అర్హుడు.
ఈ విధముగా సూర్య పుత్రుడును దేవుడును యమ ధర్మరాజు తన కింకరుని శాసించుచు పలికెను. ఓ కురు శ్రేష్ఠుడవగు భీష్మా! ఆ యముడు యిది నాకు చెప్పెను. నేను చక్కగా నీకు చెప్పితిని అని కాళింగుడు చెప్పెను.
ఓ నకులా! పూర్వము కళింగ దేశము నుండి వచ్చిన మహాత్ముడు నా మిత్రుడును అగు విప్రుడీ విషయము ప్రీతితో నాకు చెప్పెను. నాయనా! ఈ సంసార సాగరమున రక్షించు వారు శ్రీవిష్ణువు తప్ప యితరులు లేరను విషయమును నేనును యుక్తియక్తముగా చక్కగా నీకు చెప్పితిని. ఎవని మనస్సు ఎల్లప్పుడూ కేశవునే ఆశ్రయించి యుండునో అట్టివానిని యమ కింకరులు యముని దండము, పాశము, యముడు, యమ యాతనలు నేవియు నేమియు చేయ జాలవు.
ఓ మైత్రేయ మునీ! నీ ప్రశ్నమునకు అనుగుణముగా యముడు చెప్పిన విషయమునే లెస్సగా నీకు చెప్పితిని. నీకు మరి ఏమి చెప్పవలయునో కోరుము.
