విష్ణు మహా పురాణము

Table of Contents

7 - కాలియ మర్దనము

 

 

ఒకతఱి బలరాము తోడు లేకుండ కృష్ణుడు బృందావన మేగెను. అడవి పూల మాలలు చక్కగ గై సేసి యక్కడ గోపకులతో విహరించెను. కెరటము లువ్వెత్తుగ లేవ నొడ్డుల నంటిన పెను నురుగుల నల్లన నవ్వుచున్న దా యన్నట్లున్న కాలిందిం దరిసెను. అందున మిగుల వెఱపుగొల్పు విషాగ్నుల నలము కొన్న నీటిలో కాలియుడను నాగుడున్న మహా భయంకరమైన మడుగుం గాంచెను. అతి రౌద్రము మృత్యుదేవత నోరట్లున్న యా మడుగుం జూచి భగవంతుడు మధుసూదను డెదలో నిట్లనుకొనెను. దీని యందు మహాదుష్టుడు విషయుధుడు కాలియు డున్నాడు. నాచే నోటువడి యీ దుష్టు డీమడుగు విడిచి సముద్రమున కేగ వలయును. సాగర మందు సంగమించు యమునా వానిచే దోషగ్రస్త మైనది. దప్పికగొని యావుల మందలు మానవులు దీని ననుభవింప లేకున్నారు. అందువలన నేనీ పాపఱేని నదుపునం బెట్ట వలయు వ్రజావాసులు జడుపు విడిచి యీ మడువు నందు స్వేచ్చగ సంచరింప వలయును. ఇందులకే యీ లోకమునం దేనవతార మెత్తితిని. మిడిసి పడు చెడగఱుల నవశ్య మదుపులో బెట్టి తీర వలయుం గావున నల్లదె యీ దరినున్న కదంబ తఱువెక్కి యీ గాలిమేపరి మడువులో దూకెద గాక!

 

 

అని యిట్లు తలచి గట్టిగ తన వస్త్రము బిగించి కట్టుకొని శ్రీహరి చట్టననమ్మడువులో దుమికెను. పై బడిన యా బాలునిచే నా పెనుమడువు మిగుల కలగుండువడి మిక్కిలి మిక్కిలి దూరమందున్న తరువులం గూడ ముంచెత్తెను. అవి యా దుష్ట సర్ప విష జ్వాలలం గ్రాగిన నీటిగాలిం దడిసి దరినున్న చెట్లు నలుదెసలకిం మంటలు గ్రామము మండి పోయినవి. అప్పుడు కృష్ణుడా నాగుని మడువునం జబ్బలు సరచెను. దాననైన చప్పుడు విని యా సర్పరాజు మీదికి వచ్చెను. అంతట నేఱుపాఱిన గ్రుడ్లు విషజ్వాలా కులమైన ముఖములతో మహావిష సర్పములు మఱి పరివారముతో వానిం జుట్టెను. వందల కొలది యా నాగుని భార్యలు మనోహర హారములతో మేనులు వణక చెదరిన కుంతలముల కాంతులదర నా నాగుని వెంట వచ్చిరి. అవ్వల కృష్ణుడు పాముల ఫణా బంధనముల జుట్ట బడియుండెను. అవియు నాతని విష జ్వాలా కులములైన ముఖములం గఱచెను. పాము పడగల నిఱుకున బడిన యాతనింగని శోక వివశులై గోపకుల ఘోషమునకు వచ్చి యిట్లు ఘోషించిరి.

 

 

ఇదుగో కృష్ణుడు కాళియుని మడువున మూర్ఛిల్లినాడు. నాగరాజు వీని భక్షించును. రండు రండు చూడుడు. అన విని గోపకుల పొడుగు పడినట్లా మాటవిని గోపికలును తొందర పడి యశోద మొదలగు నందఱు నమ్మడువున కేగిరి. అయ్యో అయ్యో ఎక్కడ కృష్ణుడేడి! అని మిక్కిలి విహ్వలించి యశోదతో నా గోపిక జనము సంభ్రమించి వేవేగ నడుగులు దడబడ వచ్చి యట గ్రమ్ముకొనెను. నందాదులును బలరాముడును కృష్ణుం జూడ యమున కేతెంచి సర్పరాజు వశంబున పాము పడగలం జుట్టబడి యే యత్నము సేయకున్న యాతనిం జూచిరి. యశోదయు నందుడు నిశ్చేష్టులయి బిడ్డని వంక బిక్క చూపులం జూచుచుండిరి. గోపికలు శోకించుచు దిగులు గుడిచి భయముచే గద్గద భాషణముల నిట్లు పలవింప జొచ్చిరి.

 

 

యశోదతో గూడ యందఱ మీ కాళియుని మడువులో దిగెదము. మేమిక వ్రేపల్లెకుం జనుట సరిగాదు. సూర్యుడు లేని పగలు చంద్రుడు లేని రాత్రి వృషభ రాజు లేని యావులు కృష్ణుడు లేని వ్రేపల్లెయు నేమందము? ఈ కృష్ణుడు లేని గోకులము నందియు నీరు లేని మడువట్టిది. నల్లగాలువ రేకులటుల నిగనిగలాడు శ్యామలమూర్తి హరిలేని యా తల్లి యశోద గృహమున నానందము గల్గుట వింతైన విషయము. వికసించిన తామర పూరేకు వలె విశదమగు కాంతిగులుకు కన్నులు గల హరిం జూడక దీనలై యా గోష్టమునం డెటులుండ గలము? మిగుల తియ్యని పలుకులచే మా మనోరథ మెల్ల దొంగిలిన పుండరీక లోచనకుడు లేని నందగోపకులమునకు పోనేపోము. పాము పడగలం జుట్టు కొనియుచు మనలంగని చిఱునవు దొలక మన కృష్ణుని మోము యో గోపికలార తిలకింపుడు.

 

 

అని ఇట్లు పలవించు వల్ల వాంగన పలుకు విని మహాబలుడు బలరాముడు జడియుచు తన వంక చూపులు నిలిపి చూచు గోపకులను మిక్కిలి దిగులుగొని బిడ్డని మోమునం జూపు వెట్టియున్న నందుని మూర్చాకులయైన యశోదనుం జూచి కృష్ణుని మహిమ యొక్క కృష్ణుని మహిమ యొక్క గుర్తుం బట్టి, దేవదేవ! ప్రభూ! ఈ మానుష వర్తనమేల యింతగా నటింతు వేల? నీవు నిన్ననంతునిగా నెఱుంగవా? నీవే యీ జగచ్ఛక్రమున నాకులకు వలె నడిమి యధారమైన నాభివి (కేంద్రమయిన బండి కుంచము) కర్తవు హర్తవు భర్తవును నగు

వేదత్రయ మూర్తివి నీవు. నీ వింద్రాది దేవతలకు సర్వ యోగులకును భావింపనలను గాని యచింత్య స్వరూపుడవు. జగతి కొఱకు (భూదేవి ప్రార్థనమన్నించి) జగన్నాథా యామె బరువు దింపనెంచి మర్త్యలోకమున కీవు దిగి వచ్చితివి. నీ యంశమున నీ కన్నను నేను, ఓ భగవంతుడ! మనుష్యలీలల నటించు నీతో నెల్లదేవతలు నీ లీలలు ననకరించుచు నీతోగూడ యున్నారు. శాశ్వతుడ వగు నీవు మునుముందమర సుందరుల గోకులమం దవతరింప జేసి యా పైని వారితో నీ క్రీడా వినోదము కీవవతరించితివి, కృష్ణా! ఇట నవతరించిన మన యిద్దరకు జుట్టాలు గోపకులు గోపికలుం గదా! వారు బాధపడుచుండ నీ బంధుగులం గని యుపేక్షింతు వెందులకు? మాయామానుష భావము చూపితివి. బాల చాపల్యమునుం జూప బడినది. చాలునిక నీ దుష్టాత్ముని దశానాయుధుని (దంతములే యాయుధముగా గలవానిని) నాగుని దమింపుము.

 

 

అని యిట్లు జ్ఞప్తి సేయబడి కృష్ణుడు చిఱునవ్వునం బెదవులు విప్పార బాహువులు చాచి చఱచి తన శరీరమును నాగబంధము నుండి విడివడం జేసెను. రెండు చేతులం బాము యొక్క నడిమి తలను వంచి వంగిన తలపై కెక్కి యమిత విక్రమమున నర్తనము సేయ నారంభించెను. కృష్ణు పాదముల తాకిడిచే నీ నాగుని తోకనున్న ప్రాణములు తలకు వచ్చినవి. దాన నా కాళియుడు తల ఎత్తినట్లెత్తి యప్పుడు వాంచెను. ఆ పడగలపై కృష్ణుడు పరిభ్రమించిన కొలది బుసలు కొట్టుచు మూర్ఛ పడిపోయెను. పెనుబడి తెల నడచినట్ల దిగిపడి మిగుల రక్తము గ్రక్కెను. తలయు మెడయు చితికిపోయి భగ్నమై మొగముల రక్తము దొఱక దమదొరంగని వాని భార్యలు కరుణామూర్తిని మధుసూదను శరణంది యిట్లనిరి.

 

 

దేవదేవేశుడవు సర్వజ్ఞుడవు పురుషోత్తముడవు అచింత్యమగు పరంజ్యోతి యంశ స్వరూపుడవు పరమేశ్వరుడవు అని మాకు నీ వెఱుగ బడినావు. అనన్య భవుడగు ప్రభువును నిన్ను వేల్పులును స్తుతింప జాలరు. అట్టి నీ స్వరూపము నాడుది యెట్లు స్తుతి చేయగలదు? ఏనికఖిల పృథివ్యప్తేజో వాయు రాకాశములు ననంతకోటి బ్రహ్మాండములు నల్పాంశకములో అట్టి వానిని మేమేట్లు స్తుతింప గలము? యోగులేవ్వని కలరూపు నిచ్చలుం దెలియ లేరట్టి యల్పము కంటె నల్పము స్థూలము కంటె స్థూలమైన యా వస్తువునకు వినత లయ్యెదము. ఎవ్వని పుట్టువునకు ధాత, యంతమున కంతకుడు స్థితికి స్తితికర్తయు వేఱొకడు లేడట్టి వానికిదే నిత్య నమస్కారము. నీకించుకేని కినుక లేదు. ఈ కాళియుని దమనమునకు గారణము ధర్మపాలనమే. కావున దయసేసి మా విన్నప మాలింపుము. సాధువు లబలలం గనికరింతురు. జంతువులు మూఢములు దీనములునుం గావున నీ దీనుని క్షమించు వారి కధినేతవు గావున స్వామీ! క్షమింపుము. నీవు సమస్త జగదాధారుడవు. ఈ పామో అల్పబలుడు. నీ యడుగుల నలుగుడు వడి యిదె ఈ క్షణమ జీవితము వాయును. అల్ప వీర్య మీ నాగమెక్కడు? అఖిల భువన శరణ్యుడ వీవెక్కడ. ఓ అవ్యయ! నీకు ప్రీతి ద్వేషమును సమస్థాయిలో గోచరించునని. అందుచే ఓ జగత్ప్రభూ! చావకున్న వీనిపై దయ చూపుము. ఈ నాగన్న ప్రాణముల విడుచు చున్నాడు. భర్తృభిక్ష వెట్టుము. భువనేశ్వర! జగన్నాథ! మహాపురుషుల కెల్ల ముందటి వాడ! ప్రాణములు గోల్పోవు చున్నాడు. మాకు భర్తృ భిక్షవెట్టుము. వేదాంతవేద్య! వేదప్రభూ! దుష్ట దైత్యదమన! ప్రాణములం బాయుచున్నాడు. భర్తృభిక్ష వెట్టుము. అని నాగ పత్నులు పలవించుచుం బలుక,

 

 

 నొడలు బడలువడి పన్నగము దేవదేవ! ప్రసన్నుడ వగుమని మెల్లమెల్లన పలికెను.

 

 

నీ యైశ్వర్యము మష్టవిధము. అష్టైశ్వర్య సంపన్నుడవు. అది నీకు స్వాభావికము. సర్వాతిశాయి వైభవము. అట్టి వాని నేనేమి స్తుతించెదను? నీవు పరుడవు. పరమమునకు మొదలు. నీ వలననే యది పరము. పరమమున కంటె పరముడవు. నిన్నే నేమి పొగడెదను. ఈ ఎల్ల జగమెవ్వని యొక్క భాగములో భాగమో? ఆ యవయవము కూడ నిరవయవునికి కల్పనా మాత్రమో యట్టి నిన్నే నేమి స్తుతించ గలను? సత్తు అసత్తును దానయై యున్న ఎవ్వని కలరూపు బ్రహ్మాదు లెఱుంగరట్టి నిన్నే నేమి కొనియాడుదును? బ్రహ్మాదు లెవ్వని నందనవనము నందలి ఏ గంధ పుష్పాదులచే నర్చింతు రట్టి స్వామి నేనేమి యర్చింతును?

ఎవ్వని యవతార మూర్తులను దేవేంద్రుడు నిచ్చల నర్చించును ఎవ్వడెవ్వని పరమ రూపమెఱుంగ డట్టివాడు నాచే నెట్లర్చింప నగును? యోగులు సర్వేంద్రియములను విషయముల నుండి మరలించి ధ్యానముచే నెవ్వని నర్చింతు రతడు నాచే నర్చితుడగునట్లు? యోగులెవ్వని రూపమును ధ్యానముచే కల్పించు కొని భావమయ మయిన (అహింసా ప్రథమం పుష్పం) పుష్పములతో పూజింతురో వానిని నేనెట్లు పూజింతును! అట్టి నేను దేవదేవ! ప్రభూ! అర్చనాదులందు గాని స్తుతియందు గాని స్తుతియందు గాని సామర్థ్యము లేని వాడను గావున కృపా మాత్రమయిన మనోవృత్తి గలవాడవై నన్ననుగ్రహింపుము. ఈ పాపజాతి పరమక్రూర జాతి. ఇందు బుట్టినవాడను. కేశవా! ఇక్కడ యా స్వభావము (నైజము) ఉన్నది. నా చేసిన తప్పిదము లేదు. జగత్తు నీచే సృజింప బడుచున్నది. ఉపసంహరింప బడుచున్నది. సృష్టించు నీచేత జాతులు జాతుల కనుసారము లైన రూపములు స్వభావములు సృష్టింప బడును. నీచే నేనే జాతి స్వభావ రూపములచే సృష్టింప బడితినో యదే స్వభావముచే నీ సాధుత్వమున యాదేశాను గుణచేష్ట చేష్టింప బడినది. మరొక తీరున నేను ప్రవర్తింతు నేని యప్పుడు నాపయి దండపాతము నీ వచనానుసారము న్యాయము గదా! అయినను బాలుడ (అజ్ఞానిని) నా యెడ దండము వైచితి విది యితరుల చేతనైనది గాదు. నీ వలన నయినది గావున నిది యితరుల చేతనైంది గాదు. నీ వలన నయినది గావున నిది మెచ్చదగినది. (ఇది నా యదృష్టము) వీర్యము హతమయ్యె. విషము హతమయ్యె. నన్నణగ ద్రొక్కితివి. ఒక్క ప్రాణము దయసేయుము. నేనేమి సేయుడునో నన్నాన వెట్టుము. అని యిట్లు వినతుడై వినుతించి కాళియుడు విన్నవింప

 

 

ఓ సర్పమా! నీవిక్కడ నీ యమునా జలమున నెన్నడు నుండ గూడదు. సపుత్ర కళత్రముగా సముద్రము నీటి కేగుము. నీ తలపై నా పాదములం జూచి యా సాగరమందు పన్నగారి గరుడుండు నీపయి దెబ్బతీయడు అని పలికి యా సర్ప రాజమును భగవానుడు హరి వదలి పెట్టెను. అతడును కృష్ణునికి ప్రణామములు చేసి తన మడువు విడిచి సర్వ భూతములు సూచుచుండ సపత్నీ పుత్ర బంధు భృత్య పరివారముగ సముద్రమునకుం జనెను. సర్పమట్లేగ గోపకులు మృతుండు బ్రతికి వచ్చి నట్లుగా కృష్ణునిం గని కౌగిలించుకొని శిరమ్ము మూర్కొని హృదయ పూర్వకముగ నాదరించి యానంద బాష్పముల స్వామి నభిషేకించిరి. మఱియుం గలయెల్లరూ డెందముల నచ్చేరువంది పరమ మంగళోదకములం జెలంగు యమునా నదిం గని యుప్పొంగి స్వామిని నుతించిరి. గోపికలు గోపకులును కలన్వనంబుల సంగీతమ్ముల స్వామీ లీలలు కథలు చేయ్దములు గానములు సేయ వారితో కృష్ణస్వామి వ్రేపల్లెకు విచ్చేసెను.