విష్ణు మహా పురాణము

Table of Contents

6 - కేశి ధ్వజ ఖండిక్యో పాఖ్యానము బ్రహ్మ ప్రాప్తి ప్రశంసా

 

 

స్వాధ్యాయముచే యోగముచే విష్ణువు కన బడును. పురుషోత్తమ ప్రాప్తికి గారణ బ్రహ్మమని (వేదమని) వేదాదులందు బటింపబడి యున్నది. స్వాధ్యాయముచే యోగమును, యోగముచే స్వాధ్యాయమును అభ్యసింప వలెను. స్వాధ్యాయ యోగములు రెండింటి సంపత్తిచే పరమాత్మ వెల్లడి యగును. బ్రహ్మ దర్శనమునకు స్వాధ్యాయమొక కన్ను. యోగము రెండవ కన్ను. మాంస చక్షువుచే బ్రహ్మ వస్తువు దర్శింప శక్యము గాదు.

 

 

ఆ యోగమును నేనెరుంగ గోరేదం దెలుపుము. అది తెలిసిన యెడల సర్వాధారమైన పరమేశ్వరుం దర్శింతునన

 

 

కేశీధ్వజుడు ఖాండిక్యునకు జనకునకును మున్నెట్లు యోగముం జెప్పెనది నీకు జెప్పెదనన

 

 

ఖాండిక్యు డెవ్వరు! కేశిధ్వజుడను ధన్యుడెవ్వరు? వారిద్దరికీ యోగసంబంధ నిమిత్తమైన వాదమేమి జరిగినదన పరాశరుండిట్లు తెలుప దొడంగెను.

 

 

ధర్మధ్వజుడను జనకుడుండెను. అతని పుత్రులు మితధ్వజుడు, కృతధ్వజుడునను పేరుగల వారు అధ్యాత్మ నిష్టులైన రాజులుండిరి. కృతధ్వజుని కొడుకు కేశిధ్వజుడు. మితధ్వజుని కుమారుడు ఖాండిక్యుడు కర్మ మార్గాను సారియై పృథివి యందు రాజయ్యెను. కేశిధ్వజుడు మిక్కిలిగ ఆత్మ విద్యా విశారదుడయ్యెను. వారిద్దరు నొండొరులం గెలువ వలయునను కొనిరి. కేశిధ్వజుడు ఖాండిక్యుని రాజ్యము నుండి దించి వేసెను. అతడు మంత్రి పురోహితులతో నల్ప సాధనములు గలవాడై రాజ్య నిరాకృతుడై దుర్గమమైన యరణ్యమున సంచరించెను. జ్ఞాన నిష్టుడై యాతడు బ్రహ్మ విద్యయందుండి ఆ విద్యచే మృత్యువుం దరింప వలెనని యనేక యజ్ఞములు సేసెను. మైత్రేయా! ఒకప్పుడు యాగము నందు వర్తించుచున్న తరి నొక పెద్దపులి నిర్జనారణ్య మందు ఘర్మధేనువుం జంపెను. అంతట నా రాజు విని ప్రాయశ్చిత్త మిప్పుడిక్కడ ఏమన ఋత్విజులు మాకది తెలియదు. కశేరువు నడుగుమన నతడును భార్గవు నడుగు మనియె. అతడు నేనది యెరుగను. శునకునడుగు మతడిది యెరుంగునన నతడాతని నడుగ నా శునకుడు కశేరువు గాదు నేనుగాదు. ఇప్పుడు భూమి మీద నీ విషయ మెరింగిన వాడు. నీ శత్రువు నీచే జయింప బడిన వాడునగు ఖండిక్యుడొక్కడే యెరుంగుననియె. ఖండిక్యుడా శత్రుని దరికిది యడుగ నేగేదను. అతడు నన్ను జంపునా ఈ యజ్ఞము ప్రాప్తమే యగును. (యజ్ఞము సమగ్ర ఫల సిద్ధి గనును) లేదా యతడు నేనడిగిన ప్రాయశ్చిత్తము సమగ్రముగ దేల్పునా దానం గూడ నాయాగమ వికలమగును. చెడకుండును.

 

 

అని రథమెక్కి కృష్ణాజిన దారియైన యా రాజు మహాజ్ఞాని ఖాండిక్యుడున్న తావున కరిగెను. పైపైకి వచ్చి పడుచున్న యాతనిం గని ఖాండిక్యుడు కోపముచే కనులెరుపెక్కి విల్లెక్కిడి యిట్లనియె.

 

కృష్ణాజినంత్వం కవచమాబధ్యాస్మాన్ హనిష్యసి।

 

నీవు కృష్ణాజినము మీద కట్టుకొని మమ్ము హతమోనర్ప నున్నావు. నేను గృష్ణాజిన ధరుడనై యుండ నన్ను నీవు కొట్టలేవు. ఇది నిపుడెరుంగుదువు. మూర్ఖుడా జంతువుల పృష్టము లందు కృష్ణాజిన ముండదా? అట్టి జంతువులపై నీవును, నేనును నుగ్రమయిన బాణములను విసరలేదా? అలాటి నేను నిన్ను హతము గావించెద నా దగ్గరుండి నీవు బ్రతికి పోలేవు. ఓ దుర్బుద్దీ నీవు నా రాజ్యము హరించిన శత్రువవు, ఆతతాయివి. అన కేశిధ్వజుండనియె.

 

 

ఖాండిక్యా! సందేహ మొకటి యడుగ నీదరికి వచ్చితిని. నిన్ను జంపుటకు గాదు. ఇది విమర్శించి కోపమయిన విడువుము. బాణమైన విడువు మనెను.

 

 

ఖాండిక్యు డంతట నేకాంతమున పురోహితునితో గూడ మంత్రు లందరితో నాలోచన చేసెను. అతనిం గని మంత్రులు ఇతడు శత్రువు ఇపుడు స్వాధీనుడైనాడు. ఇతడు నీకు జంప దగిన వాడు. అతడీల్గిన భూమియెల్ల నీవశమగును. అనా ఖాండిక్యుడు వారందరి గని యిది యింతే సందియము లేదు. ఇతడీల్గిన భూమి ఎల్ల నా వశమగును. వానికి పరలోక జయము నాకు సర్వ భూజయము. చంపనిచో నాకు పుణ్య లోక విజయము. వానికి వసుంధర. పరలోక జయము కంటే వసుంధర ఘనమని నేనను కొనను. పరలోక జయ మనంతము (శాశ్వతము) మహిజయమల్ప కాలము. (అశాశ్వతము) కావున వీని నేజంపను. అడిగినదది చెప్పెదను అనెను. అంతట ఖాండిక్య జనకుడు శత్రువు దరికేతెంచి నీయడుగ వలసినదంత యడుగుము. నేను సమాధానము చెప్పెదననియె.

 

 

అంతట కేశిధ్వజుడు ఘర్మదేను వధ మొదలుకొని జరిగినదెల్ల తెల్పి దానం గల ప్రాయశ్చిత్త మేమని యడిగెను. అతడది యథా న్యాయముగ విధి విహితముగ కేశిధ్వజుని కెరింగించెను. ఆతడది తెలిసికొని యమ్మహాత్ముని యాజ్ఞగొని యాగ భూమికి వచ్చి సర్వక్రియలు క్రమముగ నిర్వర్తించెను. యాగము చక్కగ నడపి అవభృథస్నాతుడై కృతకృత్యుడై యా పార్థివుండు ఇట్లాలోచించెను.

 

 

సర్వ ద్విజులను బూజించితిని. సదస్యులను సమ్మానించితిని. అర్థిజనమున కభీష్టార్థ సమృద్ధి చేకూర్చితిని. ఇహ మందు (ఈ లోక మందు) ఏది యర్హమైన క్రియాయో యదెల్ల నేననుష్టించితిని. అయినను నా మనస్సు ఏదో క్రియాలోపము సేసినట్లున్నది. అని యాతడాలోచించుచునే ఆ భూపతి ఖాండిక్యునికి గురుదక్షిణ ఈయ లేదని జ్ఞాపకము సేసి కొనెను. వెంటనే యరదమెక్కి యాతడు ఖాండిక్యుడున్న దుర్గమ గహనమున కేగెను.

 

 

ఖాండిక్యుడు మరల తనవైపు వచ్చుచున్న యాతనిం గని యాయుధముం జేకొన నెంచి నిలువ బడెను. అతనిం గని కేశిధ్వజుడు ఖాండిక్య! ఓ మహానుభావ! నీకే యపరాధము సేయ రాలేదు. కోపింపకుము. గురు ఋణము దీర్ప దక్షిణ ఈయగా వచ్చినాడనని తెలియును. నీ యుపదేశముచే యాగము చక్కగా జరిపితిని. అందుచే నేను గురుదక్షిణ ఈ వచ్చితిని. కోరుమనియే. మరల యా రాజు మంత్రులతో మంతనము సేసి ఇతడు గురు నిష్క్రయము కోరుచున్నాడు. నేనేమి యడుగ వలయునన వారు సర్వ రాజ్య మడుగుము. సైనికులను శ్రమ పెట్టకుండ శత్రు రాజులు రాజ్యము నడుగుట ఎందేని కలదనిరి. వారింగని ఖాండిక్యుడు నవ్వి మహాజ్ఞాని గావున మహీపాలన మల్పకాల బోగము. నావంటి వారది యెట్లు కోరుదురు? తాము ముందర నర్థసాధన ఆలోచనపరులు. ఇక్కడ పరమార్థ మిక్కడ యేది యెట్లు? అనుదాన మీరు విచక్షులు గారు. అని పలికి యా రేడు కేశిధ్వజుని దరికి వచ్చి నీవవశ్యము గురుదక్షిణ నిత్తువా? మంచిదని యాతనిచే ననిపించుకొని ఖాందిక్యు డతనితో నీవధ్యాత్మ పరామర్థ మందు విచక్షణుడవు (వివేకివి). నాకీవు గురు నిష్క్రయము (దక్షిణ) ఇత్తువేని క్లేశ ప్రశమనమునకు (సర్వ దుఃఖ శాంతికి) ఏ పని చేయవలెనో యది యానతిమ్మనియే.