విష్ణు మహా పురాణము

Table of Contents

17 - సదాచారోల్లంఘనాది స్వరూపమ్

 

మైత్రేయా! ఔర్యుడు మహాత్ముడగు సగరునకు సదాచారమును గూర్చి అడుగగా నిట్లు చెప్పెను. నా చేత గూడ నీకు చెప్ప బడెను. సదాచారము లేకుండ నేవ్వడును మంచిని పొందలేదు.

 

 

షండుడు, అపవిద్ధుడు మున్నగు వారు ఉదక్యాదులును నాకు తెలిసిన వారే. నగ్నుడనగా నెట్టివాడు? వాని స్వరూపమును విన గోరెద. నీకు తెలియనిది లేదు.

 

 

ఋగ్యజుస్సామ వేదములకు త్రయీయని పేరు. త్రయీ యనునది వర్ణ రూపమైన యావరణమే గాక సర్వ దుఃఖ నివారకమైన సంవరణము కూడ. అట్టి దానిని అజ్ఞానముచే విడిచిన బ్రాహ్మడు మహాపాతకి యగు నగ్నుడు. సందేహము లేదు. నివారకమైన సంవరణము కూడా. మా పితామహుడు ధర్మజ్ఞుడునగు వసిష్ఠుడు మహానుభావుడగు భీష్మునకు చెప్పు చుండగా నీవు నన్నడిగిన నగ్న సంబంధ విషయమును నేను విన్న దానిని చెప్పు చున్నాను. వినుము - పూర్వము దేవాసురులకు నూరు దివ్య సంవత్సరములు యుద్దము జరుగగా నందుహ్రాదుడు మున్నగు రాక్షసులచే దేవతలు జయింప బడి క్షీర సముద్రము యొక్క యుత్తర తీరము చేరి తపస్సు చేయుచు శ్రీవిష్ణువు నారాదించుటకై పఠించిన స్తోత్రమిది.

 

 

లోకారాధన కొఱకై విష్ణువునకు సంబంధించిన మేము చెప్పబోవు వాక్కుచే సర్వేశ్వరుడగు విష్ణువు ప్రసన్నుడగును గాక! సమస్త భూతములు నే మహాత్ముని నుండి బయలు దేరినవో యెవ్వని యందు లయమగు చున్నావో యట్టివాని నెవడు స్తుతింప గలడు? అయినను శత్రుకృత పరాభవముచే నశించిన శౌర్యము గల వారమై యభయమును గోరుచు మేము నిన్ను స్తుతించెదము. నీ యథార్థ స్థితి వాక్కుల కందదు. నీవు భూమ్యాది పంచ భూతములు సమస్తాంతః కరణము అనగా మనో, బుద్ధి, అహంకార, చిత్తములు, ప్రకృతి, పురుషుడు అను నీ మూర్తామూర్త రూపము స్థాన కాల భేదము కలదియు నగు జగత్తు నీ యొక్క శరీరము. అందు నీ నాభి కమల మందు పుట్టిన విశ్వోపకారకమగు బ్రహ్మకు నమస్కారము. ఇంద్ర, సూర్య, రుద్ర, వసు, మరు, దశ్విసోమాది భేదముతో గూడిన దేవతలమగు మేము నీ యొక్క రూపము. అట్టి దేవరూపుడ వగు నీకు నమస్కారము. దంభమే ప్రధానముగ గలదియు వివేక శూన్యము, సహనము, నిగ్రహము లేనిదియు నగు నేనీ రూపము గలదో ఆ దైత్య రూపుడవగు నీకు నమస్కారము. స్తబ్దమైన వివేకము గల యే యక్ష ఊపము నందు నాడులు అధిక జ్ఞానవాహినులు కాక యుండునో శబ్దాది లోభము కల్గి యుండునో అట్టి యక్ష రూపుడవగు నీకు నమస్కారము. క్రౌర్యము మాయ ప్రధానముగ నుండి తమోమయమైన ఏ నీ ఘోర రూపము గలదో అట్టి నీ నిశాచర రూపమునకు నమస్కారము.

 

 

స్వర్గ వాసులగు సుకృతవంతుల సద్ధర్మ ఫలము నంద జేయు నీ యొక్క యమ ధర్మరాజ రూపమునకు నమస్కారము. ఆనంద ప్రచురము జలగ్న్యాదులతో సంగమము లేనిదియు (సిద్ధులు జలగ్న్యాదు లందున్నను వాని సంపర్క ముండదు) గమనాదులందు గతితో కూడుకొని యుండునదియు నగు నే నీయొక్క సిద్ధరూపము గలదో దానికి నమస్కారము. హరీ! నహనము లేనిది క్రూరమైనది ఉపభోగ సమర్థము రెండు నాలుకలు గల నీ నాగ రూపమునకు నమస్కారము. జ్ఞానముతో గూడినదియు శాంతమైనదియు రాగాది దోష శూన్యము, పాపరహితము, వ్యాప్త రూపమునగు నీ యొక్క ఋషి రూపమునకు నమస్కారము. పుండరీకాక్షా! కల్పాంతము నందెవ్వరి చేతను నివారింపబడనిదై సమస్త భూతములగు భక్షించు నీ యొక్క కాల రూపమునకు నమస్కారము. జనార్ధనుడా! రజోగుణ ప్రవృత్తిచే కర్మల నాచరించు నరాత్మకమగు నీ రూపమునకు నమస్కారము. సర్వాత్మకా! తమోగుణ ప్రధానమై యిరువది ఎనిమిది వధల (ఇంద్రియ వధలు 11, తుష్టి వధలు 9, సిద్ధి వధలు 8 = 28) తో కూడినదియు మార్గము నతిక్రమించి నడచునదియునగు నీ యొక్క పశు రూపమునకు నమస్కారము. యజ్ఞమునకు అంగ భూతము జగత్తు యొక్క సిద్ధికి సాధనము వృక్షములు, పొదలు, తీగలు, కొమ్మలు, గడ్డి, పర్వతములు అను భేదములలో నారు భేదములు గల ముఖ్య రూపమగు నీకు నమస్కారము. (వృక్షాదులు యజ్ఞాంగములు) సమస్త ప్రపంచమునకు మూలమై పశు, పక్షి, మనుష్య, దేవాదులు, ఆకాశము, శబ్దాది రూపము, సర్వాత్మకమగు నీ యొక్క విశ్వ రూపమునకు నమస్కారము. అంతర్యామీ! ప్రకృతి (ప్రధానము), బుద్ధి (మహత్తు) మున్నగు సమస్త జడ వర్గము కంటే భిన్నమై యసదృశమగు కారణము (అవ్యక్తము)నకు గూడ కారణ (పురుష) రూపమగు నీ యొక్క ఆది రూపమునకు నమస్కారము. శుక్లాది వర్ణములు గాని, దీర్ఘాది ప్రమాణములు గాని, ఘనాది భేదములు గాని లేనిదియు విశేషణములగు నందనిదియు, శుద్దము కంటే శుద్ధము అనగా ప్రకృతి కంటె బుద్ధుడు శుద్ధమయిన వాడు ఆ బుద్ధుని కంటె ముక్తుడు శుద్దమైన వాడును మహర్షులకు మాత్రము దృశ్యమగు నీ శుద్ధ రూపమునకు నమస్కారము. మా శరీరము లందును నితర దేహము లందును సమస్త వస్తువు లందును జన్మనాశాదులు లేనిదై యున్నదియు తన కంటే నితరము లేనిదియునగు నీ బ్రహ్మ స్వరూపమునకు నమస్కరించు చున్నాము.

 

 

సచేతనమగు నీ జగత్తంతయు సనాతనుడు (శాశ్వతుడు) చైతన్య ఘనుడునగు నే వాసుదేవుని రూపమో! నాశరహితుడు సమస్త కారణభూతుడు, పరిశుద్ధుడు, ప్రభువునగు నా వాసుదేవునకు నమస్కరింతును.

 

 

ఈ స్తవము ముగించగనే యా దేవతలు గరుడారూడుడై శంఖ చక్ర గదలను హస్తము లందు ధరించిన పరమేశ్వరుడగు శ్రీహరిని చూచిరి. సర్వ దేవతలు నమస్కార పూర్వకముగ నిట్లనిరి. ప్రభో! నీ శరణు జొచ్చిన మమ్ము అనుగ్రహించి రాక్షసుల బారినుండి రక్షింపుము. పరమేశ్వరా! బ్రహ్మ యొక్క యానతి నుల్లంఘించి హ్రాదుడు మున్నగు రాక్షసులచే ముల్లోకము లందలి మా హవిర్భాగములు హరింప బడినవి. మేమందరము సర్వాత్ముడవగు నీకు అంశభూతులమే కాని అజ్ఞానముచే జగత్తును వేరుగా చూచు చున్నాము. తమతమ వర్ణ ధర్మము లందాసక్తి గలవారును వేద మార్గము ననుసరించు చున్నవారును తపో బలముతో గూడిన శత్రువులునగు రాక్షసులు మాచే చంపబడువారు కారు. సర్వాత్మకుడవగునో భగవంతుడా! వీరిని చంపు నుపాయము ననుగ్రహింపుము.

 

 

అని దేవతలు చెప్పగనే భగవంతుడు తన శరీరము నుండి మాయామోహుని పుట్టించి దేవతల కిచ్చి యిట్లు పలికెను.

 

 

వీడు మాయామోహుడు. దైత్యుల నందరను మోహ పెట్టును. దాని వలన వేద మార్గమును వదలుటచే వారు వధింప బడుదురు. దేవతలారా! పరిపాలకుడనగు నాకు బ్రహ్మ యొక్క అధికారమునకు విఘ్నకర్తలగు దేవదానవు లెంత మందియైనను వధ్యులగుదురు. దేవతలారా! వెళ్ళుడు. భయపడ వలదు. మీకు ముందుకెళ్ళుచు మయామోహుడు మీకుపకారము చేయ గలడు.

 

 

భగవంతుడిట్లు పలుకగా దేవతలు నమస్కరించి వెళ్ళిరి. మయామోహుడు కూడ వారితో రాక్షసులున్న తావునకు వెళ్ళెను.