విష్ణు మహా పురాణము

Table of Contents

19 - పూరు వంశము - హస్తినాపుర నిర్మాణము

 

 

పూరుడు జనమేజయుడు ప్రవిన్వంతుడు ప్రవీరుడు మనస్యుడు అభయదుడు సుద్యుడు బహుగతుడు సంయాతి అంయాతి రౌద్రాశ్వుడు వరుసగా తండ్రి కొడుకులు. రౌద్రాశ్వుని కొడుకులు పదిమంది. ఋత్వేపు కక్షేపు స్థండిలేపు కృతేపు జలేపు జలేపు ధర్మేపు స్థలేపు సన్నతేపు వనేపు ననువారు. ఋతేపువు కొడుకు అన్తినారుడు. అతనికి సుమతి అప్రతిరథుడు ధ్రువుడు ననువారు పుత్రులు. అప్రతిరథునికి కణ్వుడు వానికి మేధాతిథి కల్గిరి. ఇతనికి కణ్వాయనులని ద్విజులు గల్గిరి.

 

 

అప్రతిరథునికి రెండవ కొడుకు ఐలీనుడు. అతనికి దుష్యంతుడు మొదలగు నలుగురు కుమారులు. దుష్యంతునకు భరతుడు చక్రవర్తి గల్గెను. ఈతని కీ పేరు గల్గుటకు దేవతలు గానము చేసిన శ్లోకముల తాత్పర్యమిది. తల్లి చర్మపు తిత్తి. దాని వలన పుట్టిన పుత్రుడు తండ్రికి సంబంధించిన వాడే. తిత్తిలో నుంచిన ద్రవ్యము తిత్టిది గాదు. ఆ ద్రవ్యము ఉంచిన వానిదే. ఎవని వలన పుత్రుడు పుట్టెనో, ఆతడే యాతడు ఆతావై పుత్ర నామాసి అని శృతి. ఓ దుష్యంతుడా! పుత్రుని భరింపుము. శకుంతల నవమానింపకుము. రేతో ఆధానము చేసిన వాడా! ఓ రాజా! పుత్రుడు యమలోకము నుండి స్వర్గమును చేర్చును. నీ గర్భమునకు (శిశువునకు) దాతవు. శకుంతల నిజము చెప్పినది. భరతుని ముగ్గురు భార్యలందు తొమ్మండ్రుగురు పుత్రులు గల్గిరి. ఈ పిల్లలు నాకు అనురూపులు గారని యాతడన్నందులకు వారిని పరిత్యజించునన్న భయముచే వారినా తల్లులే చంపిరి. అందువలన నితని పుత్రజన్మ మట్లు వ్యర్తమై పోగా పుత్రార్థియై మరుత్సోమ యాగము చేయగా గర్భగతుడు, దీర్ఘతమసుని ప్రక్కన బృహస్పతి యన్నయగు నుతధ్యుని భార్యయగు మమత యొక్క గర్భమున విడిచిన బృహస్పతి యొక్క వీర్యమున మమత యందు పుట్టి భరద్వాజుడు మరుద్దేవతలచే నీయబడెను. అతని నామ నిర్వచనము సేయు శ్లోక తాత్పర్యమిది. ఓ మూడురాలా! ద్వాజం (ఇద్దరి వలన జన్మించిన) ఈ భరద్వాజుని నీవు భరింపుము. ఓ బృహస్పతి నీవు భరింపుము. అని పరస్పరము వీని తల్లిదండ్రులిట్లు పలికి వెళ్ళిపోయిరి. అందునితడు భరద్వాజుడైనాడు. ఆ భరద్వాజుడు భరతుని పుత్రా జన్మ (వితథమై) వ్యర్థమై పోగా మరుత్తులచే నివ్వబడి నందున వితథుడను పేరొందెను.

 

 

వితథుని కొడుకు మన్యువు. అతనికి బృహత్ క్షత్ర మహావీర్య నగర గర్గులను వారు పుత్రులు. నగరునికి సంకృతి అతనికి గురుప్రీతి, రంతిదేవులు గల్గిరి. గర్గునికి శిని కలిగే. అతని నుంచి గార్గ్యులు శైన్యులు ననువారు క్షత్రమిశ్రులై నద్వి జాతులు కల్గెను. మహావీర్యునికి దురుక్షయుడు గల్గెను. అతనికి త్రయ్యారుణి పుష్కరిణుడు కపియను ముగ్గురు సుతులు గల్గిరి. ఆ ముగ్గురును దర్వాత విప్రత్వము నొందిరి. బృహత్ క్షత్రునికి సుహోత్రుడు అతనికి హస్తియు గల్గిరి. ఇతడే హస్తినపురమును నిర్మించెను. హస్తి యొక్క తనయులు అజమీడ, ద్విజమీడ, పురుమీడులు ముగ్గురు. అజమీడునికి కణ్వుడు అతనికి మేదాతిథియుం గల్గిరి. ఆ వంశము వారు కణ్వాయను లనబడిరి. అజమీడుని మరియొక కొడుకు బృహదిషువు. అతనికి బ్రహద్ధనువు, అతనికి బృహత్కర్మ, వానికి జయద్రథుడు, వానికి విశ్వజిత్తు, వానికి సేనజిత్తు గల్గిరి. సేనజిత్తు కొడుకులు రుచిరాశ్వ, కాశ్వద్రుడహను, వత్సహన్వాదులు కొడుకులు. రుచిరాశ్వ పుత్రుడు పృథుసేనుడు వానికి పారుడు వానికి నీలుడు అతనికి నూరుగురు పుత్రులు గలిగిరి. వారిలో ముఖ్యులు కాంపిల్యాధిపతి సమరుడు. అతనికి పార, సుపార, సదశ్వులు ముగ్గురు కొడుకులు. సుపారునికి పృథువు, అతనికి సుకృతి, అతనికి విభ్రాజుడు, అతనికి అణుహుడు గల్గిరి. అణుహుడు శకుని కూతురు కీర్తిని పెండ్లాడెను. అనుహుణుకి బ్రహ్మదత్తుడు, అతనికి విష్వక్సేనుడు, అతనికి ఉదక్సేనుడు, అతనికి భల్లాభుడుం గల్గిరి. ద్విజమీడుని కుమారుడు యవీనరుడు. వానికి కృతుడుం గల్గిరి. ఇతనిచే హిరణ్యనాభుడు యోగ శాస్త్రము నధ్యయనము సేయించెను. ఇతడు ప్రాచ్యసామగుల యొక్క సంహితల నిరువది నాల్గింటిని చేసినాడు. కృతుని కుమారుడు ఉగ్రాయుధుడు, ఇతడు నీపక్షయము బ్రచురముగా జేసెను. (నీపులను శత్రురాజులను హతమార్చెనన్న మాట) ఉగ్రాయుధుడు, క్షేమ్యుడు, సుధీరుడు, రిపుంజయుడు, బహురథుడు ననువారు తండ్రి కొడుకులు పౌర వంశము వారు.

 

 

అలమీఢుణి భార్య నళిని నీలుడు గల్గెను. అటుపై శాంతి సుశాన్తి పురంజయుడు ఋక్షుడు హర్వశ్వుడు తండ్రి కొడుకులు. హర్యశ్వునికి ముద్గలుడు సృంజయుడు బృహదిషువు యవీనరుడు కాంపిల్యులను పేర నైదుగురు కల్గిరి. ఈ నాపుత్ర పంచకము నేలుదురని తండ్రి పేర్కోనుట వలన పాంచాలురనంబడిరి. ముద్గాలుని వలన మౌద్గాల్యులను క్షత్రవంశ సంబంధము నందిన ద్విజులు గల్గిరి. ముద్గలునికి హర్వశ్వుడు వానికి దివోదాసుడు అహల్యయు నను మిథునము జనించెను. శరద్వతునకు అహల్యయందు శతానందు డుదయించెను. శాతానందునికి సత్యధృతి యను ధనుర్వేద పారంగతు డుదయించెను. సత్యధృతికి నూర్వశిం జూచినంత రేతః స్ఖలనమై రెల్లు స్తంభమందు బడెను. అదియు రెండు భాగము లయ్యె. దాన నొక కుమారుడు కుమారికయుం జనించిరి. వెతకేగిన శంతనుడు వారిం జూచి దయతో స్వీకరించెను. అందు వలన బాలుడు కృపాచార్యుడు బాలిక కృపి యయ్యెను. ఆ కృపి ద్రోణాచార్యులకు పత్నియయ్యె. వారి కశ్వత్థామ జనించెను. దివోదాసుని పుత్రుడు మిత్రాయువు. అతనికి కుమారుడు చ్యవనుడను రాజు. అతనికి సుదాసుడు అతనికి సౌదాసుడు అతనికి సహదేవుడు అతనికి సోమకుడు అతనికి జంతువు అనువాడు నూర్గురు కొడుకులలో జ్యేష్టుడు. వారిలో చివరివాడు పృషతుడు. అతనికి ద్రుపదుడు. అతనికి ధృష్టద్యుమ్నుడు అతనికి ధృష్టకేతువుం గల్గిరి.

 

 

అజమీఢునికి మరియొక కుమారుడు ఋక్షుడు. అతనికి సంవరణుడు వానికి కురువు కల్గిరి. ఈ కురువే కురుక్షేత్రమును ధర్మక్షేత్రమును గావించిన యాతడు. కురువు కొడుకులు సుధన్వుడు జహ్నువు పరీక్షిత్తు మొదలయిన వారు. సుధ్వనుని పుత్రుడు సుహోత్రుడు వానికి చ్యవనుడు అతనికి కృతకుడు అతనికి ఉపరి చరవసువు గల్గిరి. బృహద్రథ ప్రత్యగ్రకుశాంబ కుచేలమాత్స్య ప్రముఖులు వసువు కొడుకు లేడ్వురు. బృహద్రథునికి కుశాగ్రుడు ఆతనికి వృషభుడు అతనికి పుష్పవంతుడు అతనికి సత్యహితుడు అతనికి సుధన్వుడు అతనికి జంతువుం గల్గిరి. బృహద్రథుని యింకొక కొడుకు జరాసంధుడు రెండు శకలములుగా(తొండెములుగా) బుట్టి జరయను రాక్షసిచే సంధానింప బడినందున వానికి జరాసంధుడను పేరు వచ్చెను. అతనికి సహదేవుడు అతనికి సోమపుడు అతనికి శ్రుతిశ్రవుడు గల్గిరి. ఈనే చెప్పిన వారందరూ మగధ భూపాలురు.