విష్ణు మహా పురాణము
13 - జాతకర్మాదికము
కుమారుడు పుట్టగనే తండ్రి సచేల స్నానం (కట్టు బట్టతో) స్నానము చేయ వలెను. జాతకర్మను, వృద్ధి (నాందీ) శ్రాద్ధమును చేయ వలయును. మిథునములను దేవతలను, పితరులను తదేక చిత్తుడై యన్య చిత్తము లేకుండ ద్విజుడు క్రమమున పూజించి భుజింప చేయ వలయును. రాజా! తూర్పు లేక ఉత్తర దిగభి ముఖుడై రేగు పళ్ళతో గూడిన పెరుగు, అక్షతలతో పిండములను దేవతీర్థము (అంగుళ్యగ్రము)తో గాని, ప్రజాపత్యతీర్థము (కనిష్టికా మూలము) తో గాని నీయ వలయును. ఆ నాందీ (వృద్ధి) శ్రాద్ధముతో నాందీ మొదలగు పితృ గణము తృప్తి చెందును. కావున సమస్తాభ్యుదయ (వృద్ధి) కర్మలందును నాందీ శ్రాద్ధమవశ్య కర్తవ్యము. కన్యాపుత్ర వివాహము లందును గృహ ప్రవేశము లందును, నామకరణము నందును, బాలుర చూడాకర్మ (పుట్టు వెంట్రుకల తీయించుట) మున్నగు వాని యందును, సీమంత కర్మ మందును, పుత్రాది ముఖావలోకన కర్మ మందును, గృహస్తు సావధానముగా నాందీ మొదలగు పితృ గణమును పూజింప వలెను. వృద్ధి కర్మలందు చేయ దగిన పితృగణ పూజా విధానమును సంగ్రహముగ చెప్పితిని.
ఓ రాజా! ప్రేత కర్మాచరణ విధానమును చెప్పెద వినుము. మృతుని శరీరమును శుభములగు స్నాన సాధనములతో స్నానము చేయించి మాలలతో నలంకరించి గ్రామమునకు వెలుపల దహనము చేసి సచేల (కట్టు బట్టతో) స్నానము చేసి, బంధువులు దక్షిణ దిశాముఖులై యెచటనో అచ్చట నున్న యీ గోత్ర నామములు గలవానికి చెందు గాక! అని జలాంజలుల నీయ వలెను. గోవులతో గూడ గాని, నక్షత్ర దర్శన సమయమున గాని గ్రామమును ప్రవేశించి, భూమి యందు త్రుణాది శయ్యపై పరుండుచు శవ సంబంధమైన అశౌచకృత్య మాచరింప వలయును. రాజా! ప్రేత కొఱకు ప్రతి దినము భూమిపై పిండ ప్రదానము చేయ వలయును. మాంస రహితమైన యన్నమును పగటి పూట యందు మాత్రము భుజింప వలెను. అశౌచ దినములలో తమ ఇచ్చ ననుసరించి బ్రాహ్మణ భోజనము చేయింప వలెను. బంధు జన భోజనముచే ప్రేత తృప్తి చెందును. మొదటి రోజున మూడవ రోజున నేడవ రోజున తొమ్మిదవ రోజున వస్త్ర త్యాగ బహిస్స్నానములను చేసి తిలోదకము నీయ వలెను. నాల్గవ దినమందు నస్థి సంచయనము చేయనగును. అటు పిమ్మట నపిండుల (సమస్త పురుష పర్యంతము సాపిండ్య ముండును. సాపిండ్యం సప్తపూరుషం) అంగ స్పర్శ చేయవచ్చును. సమాన సలిల (సమానోదక భావస్తు జన్మనామ్నో రావేదనే) సంధ్యోపాసనాది సర్వ కర్మల నాచరింప వచ్చును. చందన పుష్పాదుల భోగము పనికి రాదు. సంచయనానంతరము సపిండుల కూడ శయ్యాసనాది భోగము పనికి వచ్చును. స్త్రీ సంగము పనికి రాదు. బాలుడు, దేశాంతరగతుడు (అనగా మహానది గాని, పర్వతము గాని, వ్యవదానముగ నున్నను, భాష మారినను దేశాంతరగతుడు) పతితుడు, యతి, మృతుడు కాగా అట్లే కావలయునని నీరు, అగ్ని, ఉరి మొదలగు వానిచే మృతుడైనను వెంటనే శౌచము ప్రమాదమున జలాగ్నులచే చనిపోయిన యెడల అశౌచ ముండును. ఎవని బంధువు మరణించునో వాని యింట భుజించరాదు. దాన ప్రతి గ్రహములు, పంచ యజ్ఞములు, వేదాధ్యయనము వానికి లేదు. ఈ ఆశౌచము బ్రాహ్మణునకు క్షత్రయునకు పన్నెండు రోజులు, వైశ్యునకు పదునైదు రోజులు, శూద్రునకు మాసము ఉండును. చివరి రోజున విషమ సంఖ్యాకులైన బ్రాహ్మణులకు భోజనము పెట్టి, ఉచ్చిష్ట సాన్నిధ్యమున దర్భల మీద ప్రేతకు పిండ ప్రదానము చేయ వలయును. బ్రాహ్మణ బోజనానన్తరము చాతుర్వర్ణ్యులు క్రమముగ నీరు, ఆయుధము, కొరడా, దండములను తాకిన యెడల శుద్దులగుదురు. పిమ్మట బ్రాహ్మణాదులకు విహితములగు ధర్మముల నాచరించ వలయును. నరుడు నిజ ధర్మములచే నార్జించిన ధనముతో జీవింప వలెను. పిమ్మట రెండవ మాసము నుండి మృత తిథినాడు ఏకోద్ధిష్టముగ ఆవాహనాదికము, దైవ నియోగము లేకుండా చేయవలెను. అందు ఏకార్ఘ్యము ఏక పవిత్రము ఎంత మంది బ్రాహ్మణులు భుజించినను ప్రేత కొఱకు నొక పిండము నీయవలెను. యజమానునకు బ్రాహ్మణుల ప్రశ్న ప్రతి వచనములు. చివరకు ఈతనికి అక్షయ్యమని చెప్పవలెను. ఇట్లు సంవత్సర పర్యంతము నేకోద్ధిష్టమయమగు ధర్మమే.
సపిణ్డీకరణము కూడా నేకోద్ధిష్ట విధానమున నాచరింప వలెను. సంవత్సరాంతము నందు గాని ఆరవ మాసము నందు గాని ద్వాదశాహస్సు నందు గాని చేయ వలెను. తిలగంధ జలములతో గూడిన నాలుగు పాత్రము లుంచవలెను. అందు ప్రేతకొకటి పితృ దేవతలకు మూడు. ప్రేత పాత్రను పితామహ, ప్రపితామహ పాత్రలలో కలుపు వలెను. దానిచే ప్రేత పితృత్వము నందగా నాతడు మొదలుగా గల ముగ్గురు పితృ దేవతలను సమస్త శ్రాద్ధ ధర్మములతో పూజింప వలెను. పుత్రుడు పౌత్రుడు ప్రపౌత్రుడు (ముని మనుమడు) సోదరుడు వాని సంతతి సపిండ సంతతి వీరిలో నెవరైన ఈ కర్మ చేయ నర్హుడు. వారెవ్వరూ లేని యెడల సమానోదక సంతతి (పిందముతో సంబంధము గలవారు సపిండులు జలముతో సంబంధము గలవారు సమానోదకులు) మాతృపక్ష సపిండ సంబంధులు మాతృపక్ష జల సంబంధులు ఆ రెండు కులముల వారు లేనప్పుడు స్త్రీలు చేయనగును. పితృ మాతృ సపిండ సంబంధుల చేతగాని, పితృమాతృ సమానోదక సంబంధుల చేగాని ప్రేతకు సహాధ్యాయులు సహాయులు సహా యాత్రికులు గాని ప్రేత కర్మలు చేయ నగును. బంధు రహితుడైన ప్రేత యొక్క ధనముతో భూపతి కర్మ చేయింప వలెను.
పూర్వ క్రియలు, మధ్యమ క్రియలు, ఉత్తర క్రియలు అని ఈ క్రియలు మూడు విధములు. వాని బేధమును చెప్పెద వినుము. దహన ప్రభృతి ఆశౌచాంతము వరకు పూర్వ క్రియలు. నెల నెలకు ఏకొద్ధిష్ట విధితో చేయు కర్మలు, మధ్యమ కర్మలు, పేత పితృత్వము నందిన తరువాత సపిండీకరణము తరువాత చేయబడు క్రియలు ఉత్తర క్రియలు. అందు పితృ, మాతృ సపిండులచే గాని, సమానోదకులచే గాని, సంఘాతాంతర్గతులచే అనగా సహాధ్యాయ సహాయ సహయాత్రికులచే గాని, ప్రేతధనము తీసికొనిన రాజుచే గాని పూర్వ మధ్యమ క్రియలు చేయనగును. ఉత్తర క్రియలు పుత్రాదుల చేతనే చేయనగును. దౌహిత్రులచే గాని, వారి పుత్రులచే గాని ఈ ఉత్తర క్రియలు చేయనగును. మృత దినము నందు స్త్రీలకు కూడ నుత్తర క్రియలు చేయ వలెను. ప్రతి సంవత్సరము నేకోద్ధిష్ట విదానముతో చేయవలసిన యుత్తర క్రియల నే విధమున చేయ వలయునో చెప్పెద వినుము.
