విష్ణు మహా పురాణము

Table of Contents

14 - ప్రచేతసుని వంశ విస్తరము

 

 

పృథువు కుమారులు అంతర్దివాది యను వారిద్దరు. శిఖండిని అంతర్ధానుని (అంతర్ధి) వలన హవిర్ధానుని కనెను. హవిర్దానునికి ఆగ్నేయి(అగ్ని కుమార్తె) యగు దిషణ యందు ఆరుగురు కుమారులు గల్గిరి. వారు ప్రాచీనబర్హి శుక్రుడు గయుడు కృష్ణుడు వృజుడు అజినుడు ననువారు. ప్రాచీనబర్హి భగవంతు డగు ప్రజాపతి మహారాజునై ప్రజాభివృద్ధి సేసెను. భూమిపై నాతడు తూర్పు కొనలుగా కుశలను బరచెను. అనగా ననేక యజ్ఞములు సేసె నన్నమాట. అందుచే ప్రాచీనబర్హి యను ప్రఖ్యాతి నందెను. అతడు మహా తపస్సు చేసి తుదకు సముద్రుని కూతురగు సవర్ణను బరిణయ మాడెను. ఆమె పదిమంది పుత్రులం గనెను.వారికి ప్రచేతసులను పేరు ప్రసిద్దము. అందఱు ధనుర్వేద పారగులు. అందఱు నొకే ధర్మము ననుష్టించిరి. సముద్ర జలము లందుండి పదివేలేండ్లు తీవ్ర తపస్సు సేసిరి.

 

 

వారు సముద్ర జలము లందపస్సు చేయుట ఎందులకని? యడుగగా

 

 

ప్రజాపతి యగు ప్రాచీనబర్హి సబహుమానముగ కొడుకులను ప్రజాభివృద్ధి సేయుదని యాదేశించెను.

 

 

నేను దేవదేవుడగు బ్రహ్మచే సంతా నాభివృద్ది నొనరింప నాజ్ఞాపింప బడి సరి యంటిని. కావున ప్రజాపతి యాజ్ఞను మనము పాలింప వలెను.

 

 

వారునువల్లేయని తండ్రీ! సంతాన వృద్దికేమి డేయ వలయునో వివరింపు మనిరి. ఆయన విష్ణువు వరదుడు కావున నాయన నారాధించిన నభీష్టము సిద్దించును. ఇంకొక దానగాడు కావున గోవిందు నారాధింపు డనియె. ధర్మార్ధ కామ మోక్షములను పురుషార్ధములు గావలయునను వారికి భగవంతుడు పురుషోత్తము డారాధనీయుడు. ఆయన నర్చించియే మొదట ప్రజాపతి ప్రజాభివృద్ధిని సాధించెను.

 

 

అన విని వారు నారాయణ ధ్యాన నిష్టులై సముద్ర మందు నిలిచి తపస్సు చేసి హరిని స్తుతించిరి. సర్వ వాక్కులకు నెక్కడ ప్రతిష్ఠ పర్యవసానమో యట్టి ఆదిమూర్తిని జగత్ప్రభుని మొక్కెదము. మొట్ట మొదట జ్యోతిస్సు, అణువుకంటె అణువు మహత్తు కంటె మహాత్తునై యేది చరాచర జగత్తునకు కారణ మైనదో, అహస్సు (పగలు) రాత్రియు సంధ్యయు లేని మొదటి రూపమేదియో అట్టి కాలస్వరూపికి నమస్కారము. దేవతలచే, పితృ దేవతలచే ననుదినము సుధా రూపమున భుజింప బడునట్టి సర్వ భూతుడైన యా పరమాత్మకు నమస్కారము. ఎవ్వడు తీవ్రరూపియై తన ప్రభలచే నభంబును వెలిగించుచు దమస్సు జెండాడునో ఘర్మమునకు గీష్మము- ఉక్క) చలికి జలములకు కారణమైన సూర్య స్వరూపికి నమస్కారము. ఈ జగత్తు నెల్లనెవ్వడు కాఠిన్య మొంది భరించు నట్టి శబ్దాది గుణాశ్రయుడై వ్యాపించు భూమి స్వరూపికి నమస్కారము. జగత్కారణము దేహులకు బీజమునైన ఉదకము స్వరూపమైన ఈశ్వరుని యా హరిని బుద్ది నిల్పి నమస్కరింతుము. ఎవ్వడు సర్వ దేవతల హవ్యములను పితృ దేవతల కవ్యముల నారగించునో యట్టి పావకమూర్తి (అగ్ని)కి నమస్కారము. దేహమందైదు రూపముల నుండి చేష్టను (కర చరాణాదుల పనిని) జేయునో అట్టి వాయు స్వరూపికి నమస్కారము. అశేష భూతములకు నవకాశము నొసంగు ననంత మూర్తి యగు శుద్దమైన ఆకాశామూర్తికి నమస్కారము. సర్వేంద్రియ స్థానమైన శబ్దాది రూపమైన కృష్ణునికి వేధకు నమస్కారము. ఇంద్రియ రూపియై యక్షరము క్షరమున గూడ తానే విషయముల (శబ్దాడులను) గ్రహించి యాత్మకందించు నంతఃకరణ స్వరూపికా విశ్వాత్మకునకు నమస్కారము.

 

 

ఎయనంతుని యందనంత విశ్వమున్నదో యేనినుండి బయలు వెడలినదో యెయది లయ స్థానమో యట్టి ప్రకృతి ధర్మికి నమస్కారము. శుద్దుడై (గుణలేపము లేని వాడయ్యు) భ్రాంతిచేత గుణము కలవాదట్లు గనబడు చుండునో యట్టి యాత్మ రూపూని దేవుని పురుషోత్తముని మ్రోక్కుచున్నాను. అవికారుడు అజుడు శుద్దుడు నిర్గుణుడు నిరంజనుడు నగు నా దేవుని గూర్చి వినతు లయ్యెదము. ఆ పరబ్రహ్మ విష్ణువుని పరాత్పరుని మ్రొక్కెదము. పొడవు పొట్టి స్థూలము అణువు ఎఱుపు నలుపు నిగనిగ చాయయు లేక అల్పము గాక కాననంటక అశరీరమై అనాకాశమై అసృర్శమై యగంధమై అరసమై ఆచక్షువై అశ్రోత్రమై యచలమై అవచానమై యనిద్రమై యజరామరమై అనామగోత్రమై యసుఖమై యతేజస్కుడై యహేతుకమై యభయమై భ్రాంతి రహితమై యనిద్రయై అరజస్కమై ఆశబ్దమై అప్లవమై (మునుగునది తెలునదియు గానిది) అసంవ్రుతమై (నిరావరణము) పూర్వపరములు లేనివై విష్ణు పరమ పదమై పరమై ఈశిత్వ గుణవంతమై సర్వభూతమై (సర్వమై) అసంశ్రయమైన యా విష్ణు తత్త్వమును జిహ్వకు దృష్టికి గోచరముగాని దానిని మ్రొక్కెదము.

 

 

ఇట్లు ప్రచేతసులు విష్ణువు నందు సమాధిగొని పదివేలేండ్లు మహాబ్ది యందు తప మాచరించిరి. అంతట ప్రసన్నుడై భగవంతుడా నీటిలో విప్పారిన నల్లగలువ రేకుల నిగనిగ నలుపు తళుకు నెమ్మేనితో ఖగరాజు నెక్కి సాక్షాత్కరింప నా హరింగని వారు భక్తి భారమున తలలు వంచి ప్రణతులైరి. అవ్వల భగవంతుడు మీ యభీప్సిత వరమడుగ మని ప్రసాద సుముఖుడై యవ్వర దుడుపస్థితు డైనంత (ఎదుట కేతేర) వారవ్వరదుని మ్రొక్కి తండ్రి ప్రజాభివృద్ది సేయుదని యాదేశామును తపః కారణమును విన్నవించిరి. ఆ దేవుడును నవ్వర మనుగ్రహించి యంతర్ధాన మందెను. వారును నీట నుండి వెడలిరి.