విష్ణు మహా పురాణము
5 - ఆత్యంతిక లయమనెడి మోక్షము
ఆధ్యాత్మికము ఆదిభౌతికము నని తాపము మూడు రకములు. ఈ మూడింటి స్వరూప ముందెలిసి జ్ఞాన వైరాగ్యములను బొందినవాడు ఆత్యంతిక లయమును (ముక్తిని) బొందును. ఆధ్యాత్మిక తాపము రెండు విధములు. శరీరము మానసము నని. శరీర తాపము పలు రకములు విను. శిరో రోగము, ప్రతిశ్యాయము, పడిశము, జ్వరము, శూల భగందరము (గుహ్య మందలి పుండు), గుల్మ (పైత్యముచే), కడుపులో బుట్టు పుండు, ఆర్ష (మూలశంఖ), శ్వయథువు (వాపు), శ్వాస (ఒగరుపు), ఛర్ది (వాంతి) మొదలగు పెక్కు విధములు. కంటి రోగాలు, అతిసారము, కుష్ఠము, అన్గామయము (ఒడలు నొప్పులు మొదలయినవి), మానసా తాపము, కామాదుల వలన బుట్టు బాధ శోక అసూయ అవమాన ఈర్ష్య మాత్సర్యాది మయము మృగ పక్షి మనుష్య పిశాచోరగ రాక్షస సరీ సృపాదులగు భూతములచే గల్గు బాధ ఆధి భౌతికము. శీత వాత తపోష్ణవర్షాంబు వైద్యుతాదులచే గల్గు తాపము ఆది దైవికము. గర్భ జన్మరాజ్ఞాన మృత్యు నారక జన్యమయిన దుఃఖము వేలకొలది రకములుగ నుండును. జీవుడు మిక్కిలి సున్నిత మయిన శరీరము గల్గి మల పూరిత మయిన కడుపలో మావిచే గ్రమ్ముకొని పృష్ఠము మెడ ఎముకలు కుంచించు కొని పోవ మిక్కిలి పులుపు కారము తీక్షణ మయిన వేడియు గల తల్లి దిన్న యాహారాము లత్యంత తాపకారము లయిన వానిచే బెరుగు వేదనతో నవయవములు చాచుకొనుట ముడుచు కొనుట మొదలగు నవి చేసికొన లేక మూత్ర పురీష మయమగు పెను రొంపిలో పండుకొని అన్ని విధముల పీడ నందుచు నూపిరాడక చైతన్యము గలిగి యనేక పూర్వ జన్మములను స్మరించుచు తాను జేసిన ప్రారబ్ధమునకు గట్టుపడి గర్భమందు దుఃఖము గుడుచు చుండును.
పుట్టునపుడు మూత్రపురీష రక్త శుక్లములు మొగముం గ్రమ్ముకొన ప్రాజాపత్య వాయువుచే పీడితములైన అథి సంధిబంధములు కలవాడై ప్రబలము లయిన ప్రసూతి వాయువులచే నధోముఖుడుగా జేయబడి అతికష్టము మీద తల్లి జఠరము నుండి వెలువడి నేలపై బడును. పడునపుడు మహామూర్ఛ నంది ఆతురుడై బాహ్య వాయువుచే దాకబడి విజ్ఞానము గోల్పోవును. పుట్టిన తర్వాత గూడ ముళ్ళు గ్రుచ్చుకొన్నట్లు రంపములచే గోయబడినట్లు మలమయ మయిన పుండు నుండి క్రిమి (పురుగు) వలె క్రిందిపడి దురదగొని గోకికొనలేక యటు నిటు తిరుగలేక (దొరలుటకు చేతకాక) పరేచ్ఛచే స్నానపానాదిక మయిన యాహారము నందును. మురికి మలమూత్రముల కంపు గొట్టు పడక (పొత్తిళ్ళ) బరుండి చీమలు నల్లులు దోమలు కుట్ట వానిం దోలుకోన లేక అనేక జన్మ దుఃఖములను జన్మాంతరములను బాల్యాది దశలందు గ్రమ్ము ఆది భౌతికాది దుఃఖము లను అజ్ఞానంధకారమున గుమిలి మనసు మూఢమై తెలియ నేరక నరుడు ఎటనుండి ఎవ్వడను నేను ఎక్కడికి పోవుచున్నాను నా స్వరూప మేమి యేమి బంధములో నేను బద్దుడను ఇందు కారణమేది యకారణ మేది ఏమి చేయవలె ఏమి చేయరాదు ఏమనవలె ఏమన గూడదు యధర్మమేది దేనియందు ఎట్లు నేను బ్రర్తింతును నేను చేయగూడని పనియేమి యేది గుణము కలది యేది దోషము గలది అని పశుప్రాయులై మూఢూలై యజానముచే శిశ్నోదర పరాయణులై యజ్ఞాన మహా దుఃఖములో గుమిలి పోవుదురు.
అజ్ఞానము తమోగుణ జన్యము. ఒక పని (కర్మ) చేయుట మానుటయు నా యజ్ఞానము చేతనే జరుగును. కర్మ లోపముచే నరకము గల్గు నందురు పండితులు. అందుచే నజ్ఞానుల కిహమందు బరమందును మహా దుఃఖము తప్పదు. ముదిమిచే నొడలు బడలు వడి తల నెరిసి కన్నులు గ్రుడ్డివడి కనుపాపలు దించు కొనిపోయి ముక్కు సోణముల నుండి వెండ్రుకలు వెలువడి మెను వడక యెముక లన్నియు బయలుపడి వెన్నెముకలు వంగిపోయి జఠరాగ్ని పోయినందున అల్పాహారము అల్ప చేష్టయునై అతికష్టము మీద కదలుచు లేచుచు పరుండుచూ చెవులు కళ్ళు శక్తి గోల్పోవ చొంగగారి మొగమెల్ల గ్రమ్మ సర్వేంద్రియములు జడను పడి పనిచేయక మరణమునకు ఉన్ముఖుడై యాక్షణమున తాను గన్న, విన్న విషయములు జ్ఞాపకము రాక లేకలేక యోకమాట పలికిన దాన బెట్టు శ్రమగుడుచుచు శ్వాసకోశ రోగములచే బుట్టిన వేపరీతాయాసముచే నిద్రలేక ఇంకొకడు లేవదీయ పరుండబెట్ట ముసలియై నౌకరులు తన బిడ్డలు భార్యలు చేయు నవమానములకు గురియై శౌచ క్రియ లన్నియు పోయి విహారాహారముల మీద మాత్రము కోరిక పోక తోడివారు గూడ నవ్వ బంధువు లందరు నిర్విణ్నులయిపోగా వయస్సులో తన చేష్టితముల నేదో మరియొక జన్మయందనుభవించినట్లు స్మరించుచు పరితాప పడు నిట్టూర్పు పుచ్చును. ఇట్లనేక దుఃఖము లను ముదిమి యందనుభవించి యాపై మరణమందా జీవి కుడచు దుఃఖములను గూడ వినుము.
మరణ కాలమున కాళ్ళు చేతులు మెడ శిథిల మగును. అంతలోనే శ్రమ, అంతలోనే తెలివి, కంపము, పరవశత్వము, అల్పజ్ఞానము కలుగు చుండును. తన భార్య గృహము ధనము సేవకులు మున్నగునవి మున్నగునవి తన యనంతారమే మగును అను చింత కలుగు చుండును. ఱంపములతో గోయుచున్నట్లు మర్మస్థానము లందు బాధ, ఆస్థి సంధులలో యముని బాణములు గ్రుచ్చు కొనినట్లు బాధ, కనుగ్రుడ్లు తిరిగి పోవుచున్నట్లుండుట, కాళ్ళు చేతులు తనను కొనుట, కంఠము పెదవులు మొదలగునవి ఎండి పోయినట్లుండుట, శ్వాస ఆడకపోవుట, ఆకలి దప్పుల బాధ, యమభటులు పెట్టు బాధలు మున్నగు వానితో నతి క్లేశమున యాతనా దేహము ప్రవేశించును.
ఇక నరకములో యమభటులు పాశములతో గట్టుట, దండములతో గొట్టుట భయంకర యమ దర్శనము భయంకర మార్గములు, ఱంపములతో గోయుట మూసలలో వేసి క్రాచుట, గొడ్డళ్ళతో పగుల గొట్టుట భూమిలో పాతి పెట్టుట మున్నగు నరక యాతనలు దుస్సహములు, ఇవన్నియు నీ జీవుడు చేసిన పాపముల ఫలితములే. వీనినెల్ల లెక్కింప జాలము. స్వర్గమునకు వెళ్ళిన వారికి గూడ వారి పుణ్యము పూర్తికాగానే క్రిందికి పడి పోవుదుమను దుఃఖము వెంటాడుచునే యుండును. కావున నచటను సుఖము లేదు. మరల గర్భమును చేరుట, పుట్టుట, తిరిగి బాల్యముననో, యౌవనము ననో, వార్ధక్యము ననో మరణించుట యను జనన మరణ ప్రవాహము సాగును. ఈ సంసారము నందేది సుఖ కారణమో అదియే దుఃఖమునకు కారణమగును. కావును ధార పుత్ర ధనాదు లందు సంగము పెంచు కొనక యీ తాపత్రయముల లోని దోషములను గుర్తించి ముక్తి కొఱకై యత్నించుట యొక్కటియే యీ బాధను తొలగించుటకు నౌషదము. వివేకు లందులకే యత్నింప వలెను.
కర్మాచరణము జ్ఞానము నీరెండును ముక్తికి సాధనములే. ఆగమములలో జెప్పిన శబ్ద బ్రహ్మోపాసనము, వివేకము వలన కలిగెడి బ్రహ్మ తత్త్వ జ్ఞానము అని జ్ఞానము కూడ రెండు విధములు. శబ్ద బ్రహ్మ తత్త్వమున కృతార్థుడైనచో పర బ్రహ్మత్వము ప్రాప్తించును. పరాఽపర విద్యల రెండును నెరుంగ వలసి యున్నవని అధర్వణీయ మగు ముండకోపనిషత్తు చెప్పు చున్నది. వానిలో ఋగ్వేదాది వేదప్రోక్తమగు కర్మానుష్ఠాణము అపరావిద్య. అక్షర తత్త్వమగు పరబ్రహ్మము నందించునది పరావిద్య. పరబ్రహ్మ తత్త్వము, అవ్యక్తము, అజరము, అచింత్యము, అవ్యయము, అనిర్దేశ్యము, అరూపము, అపాణిపాదము, సర్వగతము, సత్యము, భూతయోని, వ్యాప్యము, వ్యాప్తమునై యున్నది. ఈ తత్త్వమును శూరులు మాత్రమే యెల్లప్పుడు దర్శింప గలరు. ఆతత్త్వమే విష్ణు భగవానుడు.
భూతముల యుత్పత్తి వినాశములను, వాని రాకపోకలను, విద్యాఽవిద్యలను నెరింగిన మహానుభావుడే భగవత్పదవాచ్యుడు. హేయములగు దుర్గుణములు కాని, దోషములు గాని ఏమియు లేక జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులను నారు శక్తులు గలవాడే భగవానుడు. ఆ పరతత్త్వమునకు వాసుదేవుడని పేరు. పూర్వము మహర్షులు చేసిన ప్రశ్నకు సమాధానముగా ప్రజాపతియే యీ వాసుదేవ పదమునకు నర్థము నిట్లు వ్యాఖ్యానించి తెలిపెను. అందుచేతనే జగములను నిర్మించువాడు, వాని స్థితిని వ్యవస్థ చేయువాడు కూడ ప్రభువగు వాసుదేవుడే.
అతడు సర్వ భూతులకును ప్రకృతి, మూలతత్త్వము. సమస్త గుణ దోషములకు నతీతుడు. సర్వావరణములకు నతీతుడు. అఖిలాత్ముడు. ఈ భువనాంతరాళ మంతయు ఆయనచేతనే ఆవరింపబడి యున్నది. అతడు సమస్త కళ్యాణ గుణాత్మకుడు. స్వశక్తి లేశమాత్రము చేతనే సమస్త భూతసృష్టిని చేయగలడు. తన యిచ్చచేత తన కిష్టములగు గొప్ప రూపముల ధరించి, సమస్త లోకములకు హితమును సాధించును. తేజో బలైశ్వర్య వీర్యశక్తి జ్ఞానముల రాశి, పరమైన వానికంటె పరుడు. ఆ పరావరుని యందు నెట్టి క్లేశములు లేవు. అతడీశ్వరుడు. వ్యష్టి సమష్టిరూపుడు, వ్య్కతరూపుడు, అవ్యక్తరూపుడు, సర్వేశ్వరుడు, సర్వద్రష్ట, సర్వశక్తియు నగు పరమేశ్వరుడు సమస్త దోష రహితమును, శుద్దమును, పరమును, నిర్మలమును, నేకరూపమును నగు నామహా తత్త్వమును నేది తెలుప గలదో, చూప గలదో, అవగతము చేయగలదో అది జ్ఞానము. తదితర మజ్ఞానము.
