విష్ణు మహా పురాణము
7 - సృష్టిక్రమ వర్ణనము
అటుపై నతడు ద్యానింప మనస్సు నుండి సంతతి గల్గెను. ఆ కలిగిన మానసిక సృష్టి జీవులు పుట్టుక లోనే కార్యములు (పదార్థములు) కరణములు(సాధనములు) అను వానితో గూడికొని పుట్టిరి. అనగా చక్షురా దీంద్రియములు ఆ యింద్రియములకు విషయము లైన శబ్దాదులు వానికి కారణము లైన ఆకాశాది పంచ భూతములును ఒకేసారి జనించె నన్నమాట. ఆ బ్రహ్మ యొక్క యంగము లందుండి క్షేత్రజ్ఞులు అనగా జీవులు పుట్టిరి. సత్త్వాది గుణములు మూడింటి వలన నేర్పడిన యా జీవుల నింతమున్నే చెప్పి యున్నాను. అవి స్థావరములు జంగములును. ఆయన యొక్క మానస సంతానము వృద్ధి నందని కతను సంతానముం గననందున వారి వంటి వారిని మఱి కొందఱిని మనస్సు నుండియే జనింప జేసెను. వారు నవబ్రాహ్మలు. భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు ననువారు వారు. పురాణ ప్రసిద్ధులు. ఖ్యాతి, విభూతి, సంభూతి, క్షమప్రీతి, సన్నతి, ఊర్జ, అనసూయ, ప్రసూతి యను కన్యల గని వరుసగా మీరు భృగ్వాదులకు భార్యలు గండని వారి కొసంగెను. వీరికి మున్ను బుట్టిన సనందనాదులు మానస పుత్రులు లోకము లందు సక్తులు గాక సంతానము నందు నిరపేక్ష లయిరి. అందఱు జ్ఞానులు విరక్తులు విమత్సరులునై లోక సృష్టికి విముఖులయి యున్నంత బ్రహ్మకు ముల్లోకములను దహింప గల క్రోధము పుట్టెను. ఆయన క్రోధ జ్వాలల వలన ముల్లోక ముద్దీపిత మయ్యెను. కోపముచే ముడివడిన కనుబొమ్మలతో గూడిన యాయన లలాటము నుండి (నుదుటి నుండి) మధ్యాహ్న సూర్యునట్లు ప్రకాశించు రుద్రుడు పుట్టెను. ఆ మూర్తి సగము స్త్రీ, సగము పురుషుడునై ప్రచండుడై యున్న నాతనిని గని బ్రహ్మ నిన్ను నీవు విభజించు కొనుమని చెప్పి (నీవే అనేక రూపముల రూపొందుము. సృష్టి పెంపుము అని) యంతర్ధాన మయ్యెను.
ఆ రుద్రుడు స్త్రీని పురుషునిగా తను రూపందించు కొనెను. ఆ పురుష రూపమును మఱల పదునోకండుగా విడదీసెను. స్త్రీత్వమును గూడ సౌమ్యము (శాంతము) అసౌమ్యము రౌద్రముగా నలుపుగా తెలుపుగా ఛేదింప చేసెను. ఆ మీద బ్రహ్మ తనకు మొదటగా బుట్టిన స్వాయంభువ ప్రభువును దానేయైన వానిని ప్రజాపతి స్థానము నందుంచెను. ఆయన తపస్సుచే కల్మషము వాసిన శత రూపయను నంగనను భార్యగా స్వీకరించెను. అతని వలన శత రూపయను నామె ప్రియవ్రతో త్తానపాదు లను పుత్రులను బ్రసూతి ఆకూతి యను నిద్దరు కూతుండ్రను గనెను. ఆ కన్యలు రూపోదార్యాది గుణ సంపన్నులు. స్వాయంభువ మనువు ప్రసూతిని దక్షునకు ఆకూతిని రుచియను నాతని కిచ్చెను. ఆ రుచి ప్రజాపతి యాకూతిం గ్రహించెను. ఆ దంపతులకు యజ్ఞుడు దక్షిణ అను మిధునము (స్త్రీ పుంస యుగ్మము) జనించె, యజ్ఞునికి దక్షిణ యందు బండ్రెండుగురు కొడుకులు పుట్టిరి.
సాయంభువ మన్వంతర మందు వారు యాములు అను దేవతలుగా బ్రసిద్ధి కెక్కిరి. దక్షుడు ప్రసూతి యందిరువది నల్గురు కూతుండ్ర గనెను. వారి పేర్లు విను. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ది, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి ఈ పదుముగ్గురను దాక్షాయణులను(దక్షకుమారిక లను) ధర్ముడు స్వీకరించెను. వారి తరువాతి వారు పదు
నోకండుగురు ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహా, స్వధా అను వారు. వారిని వరుసగా భృగువు, భవుడు, మరీచి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, వహ్ని, పితృ దేవతలు భార్యలనుగా గ్రహించిరి. శ్రద్ధ కాముని చలా(లక్ష్మి) దర్పుని ధృతి నియముని తుష్టి సంతోషుని పుష్టి లోభుని మేధ శ్రుతుని క్రియ దండుని నయుని వినయుని బుద్ది భోధుని లజ్జా వినయుని వపువు వ్యవసాయుని శాంతి క్షేముని గనిరి.
ధర్ముని కొడుకులు సుఖము సిద్ధి యశుడు కీర్తి అనువారు. కాముని వలన రతి హర్షుడను కొడుకుం గాంచె. అతడు ధర్ముని పౌత్రుడు (కొడుకు కొడుకు) ఆ ధర్ముని భార్య హింస. వారి కొడుకు అనృతుడు. కూతురు మాయావేదన. వేదన రౌరవుని వలన దుఃఖముం గనెను. మాయ భూతముల నెల్ల హరించు మృత్యువుం గనెను. మృత్యువు వలన వ్యాధి జర (ముదిమి) శోక తృష్ణ క్రోధులు జనించిరి. దుఃఖముతో గూడ వీరందరు నధర్మ లక్షణులు. వీరికి భార్య పుత్రుడునను వారు లేరు. అందఱును ఊర్ధ్వ రేతసులు, అనగా సంతానముం గనుటకు బూనుకోనని వారన్న మాట. వీరు విష్ణువు యొక్క రౌద్ర రూపములు. వీరు నిత్యమును జగత్ప్రళయ మునకు హేతువులగు చుందురు. దక్షుడు మరీచి అత్రి భృగువు మొదలయిన ప్రజాపతులు సన్మార్గ రతులు శూరులు వారందరు స్థితి కారకులు.
నిత్య స్థితి, నిత్య సర్గము, నిత్యాభావము, నిత్య ప్రళయము నను వాని స్వరూపము నానతిమ్మన
హరి సృష్టి స్థితి లయముల నాయా రూపముల దాల్చి అవ్యాహతముగా జరుపును. ప్రళయము నాల్గు విధములు. బ్రహ్మ ప్రళయము నైమిత్తికముబ్రహ్మ కల్పాంత మన్నమాట) అపుడు విష్ణువు నిద్రించును. ప్రకృతి యందు (మాయమయి) జగత్తు లయించుట ప్రళయము. యోగి పరమాత్మ యందు లయించుట ఆత్యన్తిక ప్రళయము. పగలు రాత్రి జీవులు పొందు నిద్ర నిత్య ప్రళయము. ప్రకృతి యందు జీవుల పుట్టుక ప్రాకృత సృష్టి. దైనందిన సృష్టి యనగా భూతములు దిన దినమును బుట్టుట, నిద్ర నుంచి లేచుట. జాగరణ స్థితి యన్నమాట. దానినే పురాణ వేత్తలు నిత్య సర్గమందురు. ఇట్లు భగవంతుడు సర్వ శరీరము లందును సంస్టితిని (ఉనికిని) పొంది యుత్పత్తి స్థితి లయముల నొనరించు చుండును. సృష్టి స్థితి వినాశానముల యొక్క శక్తులు విష్ణు కృతములు సర్వదేహము లందును రాత్రిం దినములు సమస్థాయిలో జరుగు చుండును. ఈ శక్తి త్రయము. సత్త్వ రజ స్తమో గుణమయము. ఇది యొక తరి అతిక్రమించి నడుచును. ఒక్కపుడు నడువనే నడవదు. ఒకపుడు పునరావృత్తమును గాదు.
