విష్ణు మహా పురాణము
3 - ప్రళయ నిరూపణమ్
సర్వ భూతముల యొక్కయు ప్రళయము మూడు విధములు. 1. నైమిత్తికము, 2. ప్రాకృతము, 3. ఆత్యంతికము. బ్రహ్మకల్పము చివరనగునది బ్రహ్మ ప్రళయము నైమిత్తికము. ద్విపరార్థక ప్రళయము ప్రాకృతము. ఆత్యంతికము మోక్షము.
పరార్ధసంఖ్యాం భగవన్ మమాచక్ష్వయయయాతుసః।
ద్విగుణీకృతయజ్ఞేయః ప్రాకృతః ప్రతిసంచరః॥
పరార్థమను దాని సంఖ్యా వత్సరములు తెలుపుము. దానికి రెట్టింపు కాలమే ప్రాకృత ప్రళయము.
ఒక స్థానము నుండి ఇంకొక స్థానము పదిరెట్లు. అట్లు లెక్కించు కొనుచు పోగా పదునెనిమిదవ స్థానము పరార్థ మనబడును. అప్పుడు ప్రాకృత లయమగును. అపుడు వ్యక్తమైన ప్రపంచమెల్ల అవ్యక్తము నందు లయించును. మాత్రామాత్ర ప్రమాణము నిమేషము. 15 నిమేషములు 1 కాష్ఠ, ముప్పది కాష్ఠలు కల. 15 కలలు నాడిక. 2 నాడికలు 1 ముహూర్తము. 30 ముహూర్తములు 1 పగలు 1 రాత్రి దినము. 30 దినములు 1 మాసము. 12 మాసములు 1 సంవత్సరము. 1 మానవ సంవత్సరము దేవతలు 1 దినము. 360 మానవ సంవత్సరములు దేవతలకొక సంవత్సరము. 1200 దేవా సంవత్సరములు ఒక్క చతుర్యుగము. వేయి మహా యుగములు బ్రహ్మకొక పగలు. అదే కల్పము. అందు మనువులు పదునాల్గురు. ఆ చతుర్దశ మన్వంతరముల చివరనగు లయము నైమిత్తక ప్రళయము అదే బ్రహ్మ ప్రళయము. ఆ లయము యొక్క స్వరూపము మహా భయంకరము. వినుము. ఆ మీద ప్రాకృత ప్రలయమును దెలిపెదను.
వేయి చతుర్యుగ సహస్రము, బ్రహ్మ కల్పము నందు, భూమండలము క్షీణ ప్రాయమగును. నూరేండ్లు భయంకర మయిన అనావృష్టి యేర్పడును. అల్పమైన పార్థివ ప్రాణులన్నియు నశించును. అప్పుడా భగవంతుడు విష్ణువు రుద్ర రూపము దాల్చి తన యందలి సకల ప్రజలను క్షయింప జేయజూచును. సూర్య కిరణము లేడింటను తానుండి సర్వ జలములను ద్రావివైచును. భూమి యందు ప్రాణు లందును గల జలము నట్లు త్రావి సర్వమును శోషింప జేయును. సముద్రాదు లందున్న పాతాళ మందున్న నీరంతయు ఇంకి పోవును. ఆ విష్ణువు యొక్క చేష్ట చేతనే ఉదకము నాహారించు కొన్న యా యేడు కిరనములే యేడుగురు సూర్యులగును. వారు క్రిందునకు మీదికిని గూడ వెలుంగుచు పాతాళముతో గూడ ముల్లోకములను దహింతురు అందువలన ముల్లోకములు నదులతో సముద్రములతో పర్వతములతో శోషించి పోవును. ఇవి తాబేటి వెనుడిప్ప వలె ఘనీభావ మందును. అప్పుడే ప్రళయ కాలాగ్ని రుద్రుడు సర్వహరుండై శేష సర్పము యొక్క నిశ్శ్వాసము నుండి పుట్టి క్రింది పాతాళములం గాల్చును. భూమికి వచ్చి యిదెల్లనుం దహించును. ఆ పైని భువర్లోకమును అంతరిక్షమును సువర్లోకము, ఆదిత్య మండల స్థానమును, జ్వాలామాలలచే యక్కడనే గ్రామముకొని యుండును. ముల్లోకమును నయ్యెడ స్థావర జంగమాత్మక మెల్ల జ్వాలలు గ్రమ్ముకొని కాలుచున్న అంబరీశ మట్లుండును.
త్రిలోక వాసులు నుడికి పోయి మహార్లోకమునకు బోవుదురు. మరొక దశలో రుద్రమూర్తియై విష్ణు విట్లు సర్వ జగమ్ముం దహించి తన ముఖ నిశ్శ్వాసములచే ఘోరము లయిన సంవర్తకములను మేఘములను సృజించును. పెద్ద యేనుగు లట్టివి ఉఱుములు, మెరుపులతో గూడినవియు నగు ప్రళయ కాల మేఘములు కొన్ని నల్ల గలువ రంగు కలవి కొన్ని తెల్ల కలువ లట్టివి కొన్ని ధూమ్ర వర్ణములు కొన్ని పచ్చనివి కొన్ని గాడిద రంగువి లక్క రంగువి వైఢూర్య వర్ణములు ఇంద్ర నీలము లట్టివి.
శంఖముల మొల్లపూవుల వంటివి ఆర్ద్ర పురుగుల వంటివి నెమల్ల వంటివి మణిశిల వంటివి కాటుక వంటివి అరిదళము వంటివి పాలపిట్ట ఱెక్కల వంటివి పెద్ద నగరముల పెద్ద పర్వతముల వంటివి, కూటాగారముల వంటివి స్థలము లట్టివి. యైహాహాకారములచే నాకసమును నింపి అతిభయంకర మయిన యగ్నిని వర్షించుచు త్రిజగత్తు లందలి గాలాగ్ని నెల్ల నార్పి వేయును. నిర్విరామముగ వర్షించుచు నుదకములచే లోక త్రయమును ముంచెత్తును. స్థూల ధారలచే భూమి నెల్లకాక భువర్లోకముం గూడ ముంచెత్తును. లోకమంధకార బంధురమయి చరాచర భూత కోటి నశింప నూరు సంవత్సరము లట్లేయవి వర్షించును. కల్పాంతమున నిత్యుడు మహాత్ముడగు వాసుదేవ పరమాత్ముని యొక్క మహిమచే నిట్లు జరుగును.
