విష్ణు మహా పురాణము
3 - జంబూద్వీప వర్ణనము
సముద్రమున కుత్తరమున, హిమాలయమునకు దక్షిణమున భారత వర్షము గలదు. అందలి సంతతి భారతి యనబడును. ఇది తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమి యని దీనికి పేరు. కోరిన వారికి స్వర్గము మోక్షము గూడ నిందె యున్నవి. ఇందు మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, ఋక్షము, వింధ్యము, పారియాత్రము నను సప్తకుల పర్వతము లున్నవి. జీవులు భారత వర్షము నుండియే స్వర్గ మోక్షముల పొందుదురు. అవాంతర కర్మఫలము స్వర్గము పర్యవసాన మందాత్యంతిక ఫలమైన మోక్షము గూడ యిట నుండియే మానవుడు పొందును. ఈ భూమండల మందే కర్మానుష్టానము విధింప బడినది. అందుచేతనే దీనికి కర్మభూమి యనుపేరు సార్ధకము. భారత వర్షమున తొమ్మిది ద్వీప భాగము లున్నవి. ఇంద్ర ద్వీపము, కశేరువు (కశేరుమంత మని కూడా యందురు), తామ్రపర్ణము, గభస్తిమంతము, నాగ ద్వీపము, సౌమ్యము, గాంధర్వము, వారుణము. ఇందు తొమ్మిదవది సముద్ర సంవృతము. ఇది దక్షిణ దిశనుండి యుత్తర దిక్కుకు వేయి యోజనములు. తూర్పున కిరాతులు, పడమట యవనులు, నడుమ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నుందురు. యజన యాజనములు యుద్దము వాణిజ్యము కృష్యాదులు వృత్తులు క్రమముగా వీరికి విహితములు. హిమవత్పర్వత ప్రత్యంత పర్వతము నుండి శతద్రు (సట్లజ్) చంద్రభాగ వేదము స్మృతి మొదలయిన నదులు ప్రవహించు చున్నవి. నర్మద సురస మొదలగునవి వింధ్య గిరి నుండి వెలువడు చున్నవి. తాపి, పయోష్ణి, నిర్వింధ్య, కావేరి మొదలైనవి ఋక్ష పర్వత ప్రాంతమందు కనించినవి. గోదావరి, భీమరధి, కృష్ణవేణి మొదలగునవి సహ్యగిరి పాద మందు బుట్టినవి. కృతమాలా, తామ్రవర్ణీ, ప్రముఖములు మలయాద్రి సంభవములు. త్రిసాంధ్య, ఋషికుల్యా మొదలయినవి మహేంద్రగిరి జన్యములు. ఋషికుల్య కుమారి మొదలయినవి శుక్తిమత్పర్వత పాదమందు బుట్టినవి. వీని యుప నదులు వేలకొలదిగ గలవు.
వానియందు కురు పాంచాల దేశ ప్రజ నివసించు చున్నది. తూర్పున కామరూప దేశవాసులు కళింగులు మగధులు నున్నారు. దాక్షిణాత్యులు దక్షిణము నందుండు వారు. పశ్చిమమున సౌరాష్ట్రులు శూద్రులు ఆభీరులు అర్బుదులు మారుకులు మాళవులు పారియాత్ర నివాసులు మద్రులు రాములు అంబుష్టులు పారసీకాదులు. వీరందరూ నీయీ నదుల జలములం ద్రావుదురు. ఈ దేశములు కలిసి మెలసి ఆనంద భరితులు పుష్టివంతులునైన జనులతో నిండి యుండును. కృత త్రేతా ద్వాపర కలియుగ విభాగ మిక్కడనే కలదు. అన్యత్ర లేదు. ఇందు యతులు తపస్సు చేయుదురు. యజ్వలు హోమములు (యాగములు) సేయుదురు. పర లోకము గోరి యిచట దానము లాచరింప బడును. జంబూద్వీప మందు యజ్ఞ పురుషు డుపాసింప బడును. విష్ణువు యజ్ఞ రూపుడుగ యజ్ఞేశ్వరుడుగ నిచట నుపాసింప బడును. ఇతర ద్వీపము లందు మరియొక పేరున గొల్వబడును. ఈ జంబూ ద్వీపమున భారత వర్షము శ్రేష్ఠము. ఇది కర్మభూమి. తక్కినవి భోగభూములు. బహు జన్మ ఫలభోగముగ నిందెంతో కాలమునకు మనుష్య జన్మము జీవుడు పొందును.
దేవతలు ఈ భారత భూమిని గూర్చి యిట్లు గానము సేయు చుందురు. స్వర్గాపవర్గము లొసంగు భారత భూమి యందు మనుష్యులయి పురుషులయి పుట్టి కర్మభూమి యందు జన్మము వడసి ఫలాభిసంది లేక సర్వకర్మ ఫలములను పరమేశ్వరర్పాన మని పరమాత్మ యగు విష్ణువు నందర్పించి పాప దూరులై యా పరబ్రహ్మ యందు లీనమగు వారు ధన్యులు. పరమేశ్వరార్పనముగ నాచరించిన స్వర్గ ప్రదమగు కర్మలీనమై పోయిన తర్వాత దేహ బంధమును మరెక్కడా పొందుదుమో యెరుగము. పరిశుద్దేంద్రియ వంతులై భారత వర్షమున పుట్టిన వారు ధన్యులు. తొమ్మిది వర్షములు గల్గి లక్ష యోజనములు విరివిఁగల యీ జంబూ ద్వీపమును గూర్చి సంక్షేపముగా దేల్పితిని. ఈ ద్వీపము నావరించి లక్ష యోజనముల విస్తారము గల క్షార ఉప్పు సముద్రము వలయాకారముగా నున్నది.
