విష్ణు మహా పురాణము
4 - ఋగ్వేద శాఖా భేద నిరూపణము
సృష్టి ప్రారంభమున చతుర్ముఖ బ్రహ్మచే నవిభక్తముగా పఠితమైన వేదము నాల్గు భాగములు (ఋగ్యజుస్సామాధర్వణము) తోను అనంత శాఖలతోను నిండియున్నది. ఆ వేదముచే బోధింప బడిన యజ్ఞములు పది విధములుగ నున్నవి. 1. అగ్నిహోత్రం, 2. దర్శపూర్ణమాసలు, 3. చాతుర్మాస్యలు, 4. పశుబంధము, 5. బ్రహ్మ అని అయిదు, వైతానిక యజ్ఞములు, 1. దేవయగ్నము, 2. పితృ యజ్ఞము, 3. భూతయగ్నము, 4. మనుష్యయజ్ఞము, 5. బ్రహ్మయజ్ఞము అని అయిదు యజ్ఞములు గృహము నందు జరుపు కొనునవి. మొత్తము పది. ఈ యజ్ఞములు సమస్త కోరికలను పూరించ గలవు. ఇరువది యెనిమిది మన్వంతరమున నా కుమారుడు వేదవ్యాసునిచే నాలుగు పాదములతో గూడిన నొక వేదము ఋగాది చతుర్విధముగ నెట్లు విభజింప బడెనో అట్లే నాచేతను గూడ విభజింప బడినవి. ఈ విధముగా సమస్త చతుర్యుగము లందు నారాయణుడిగ తెలిసికొనుము. తదితురుడెవ్వడు మహాభారత కర్త కాగలడు? బ్రహ్మచే వేదవ్యాసుడు వేద విభాగీకరణమునకు ప్రేరితుడై నలుగురు వేద పారంగతులైన శిష్యులును స్వీకరించెను. అందు పైలుని ఋగ్వేద పాఠకునిగను, వైశంపాయనుడిని యజుర్వేద పాఠకునిగను, జైమినిని సామవేద పాఠకునిగను, సుమంతుని నథర్వణవేద పాఠకునిగను చేసెను. మహా బుద్దిశాలి యగు రోమహర్షణుడను శిష్యుని ఇతిహాస పురాణ ప్రవక్త యగు సూతునిగా గ్రహించెను.
ఒకే విధమగు యజుర్వేదమును విభజింపగా చతుర్భేద మాయెను. అందు చాతుర్హోత్ర ముండెను. అనగా నాలుగు ఋత్విక్కులను చతుర్హోత లందురు. ఆ నలుగురు చేయు కర్మకు చాతుర్హోత్రమని పేరు. దానిచే యజ్ఞమును కల్పించెను. యజస్సులచే అధర్యుడు చేయు కర్మకు అధ్వర్యమని పేరు. ఋక్కులతో హోత చేయు కర్మకు హౌత్రమని పేరు. ఉద్గాత సామలతో చేయు కృత్యమునకు ఔద్గాత్రమని పేరు. అధర్వ మంత్రములతో బ్రహ్మ చేయు కృత్యమునకు అధ్వర్వణమని పేరు. అందలి ఋక్కులతో ఋగ్వేదమును, యజస్సులతో యజుర్వేదమును, సామలతో సామ వేదమును, అధర్వ ఋక్కులతో రాజులను సర్వ కర్మలను చేయించి బ్రహ్మత్వమును శాస్త్ర మర్యాదను అనుసరించి కల్పించెను. ఈ విధముగా నొక వేదము వృక్షము పృథక్కృతమై నాలుగు విధములై వేదారాణ్య మాయెను. పైలుడు ఋగ్వేద వృక్షమును ముందుగా విభజించెను. రెండుగా విభజించిన యా ఋగ్వేద సంహితలను ఇంద్ర ప్రమితికి బాష్కలునకు నిచ్చెను. బాష్కలుడు చతుర్విధముగ విభజించి సంహితను తన శిష్యులకు బోధ్యాదుల కిచ్చెను. బోధ్యాఽగ్నిమాడకులు యాజ్ఞవల్క్య పరాశరులు బాష్కల శాఖ యొక్క ప్రతి (అవాంతర) శాఖలను గ్రహించిరి. ఇంద్ర ప్రమితి యొక సంహితను తన పుత్రుడగు మాండుకేయునకు జెప్పెను! వాని శిష్య ప్రశిష్యులకు పుత్ర శిష్య క్రమమున నది చేరెను.
వేద మిత్రుడగు (బ్రహ్మచారి) శాకల్యుడు ఆ యింద్ర ప్రమిత సంహిత నధ్యయనము చేసి పంచ సంహితలుగా విభజించి తన శిష్యులగు ముద్గలాదులకు నొసంగెను. వారి నామదేయములు - ముద్గాలుడు, గోముఖుడు, వాత్స్యుడు, శాలీయుడు, శరీరుడు. శరీరుడు మహా బుద్ధిమంతుడు. మరియొకడు శాకపూర్ణ శావల్యుడు. ఆ యింద్ర ప్రమితి సంహితను మూడు సంహితలుగ జేసి క్రౌంచ వైతాళిక బలాక నిరుత్తులకు నిచ్చెను. ఇట్లు ప్రతి శాఖల నుండి యనుశాఖ లేర్పడెను. బాష్కలుడు మరియొక మూడు శాఖలను చేసి శిష్యులగు వాలాయని గార్గ్యుడు తథాజపుడు అనువారాల కిచ్చెను. వీరందరి చేత ప్రవర్తితములైన సంహితలకు బహ్వృచ ఋగ్వేద సంహిత అని పేరు.
