విష్ణు మహా పురాణము

Table of Contents

21 - ప్రహ్లాద వంశ విస్తారము

 

 

ప్రహ్లాదుని పుత్రులు శిబి, బాల్కులుడు, విరోచనుడు అను మువ్వురు. విరోచనుని కుమారుడు బలి. బలికి నూర్గురు పుత్రులు. బాణుడు పెద్దవాడు. హిరణ్యాక్షుని కుమారు లందఱు మహా బలశాలులు. ఝర్ఝరుడు, శకుని, భూత సంతాపకుడు, మహానాభుడు, కాలనాభుడు అనువారు. దను పుత్రులు ద్విమూర్ధుడు, శంబరుఁడు, అయోముఖుడు, శంకుశిరుడు, కపిలుడు, శంకరుడు, ఏకచక్రుఁడు, మహాబలుడగు తారకుడు, రాహువు, వృషపర్వుడు, పులోముడు, వీరుడగు విప్రచిత్తి. స్వర్భాను (రాహువు) పుత్రిక ప్రభ, వృషపర్వుని కన్య శర్మిష్ఠ. ఉపదాని, హయ, శీర్ష కూడా వాని కన్యలే. వైశ్వనరుని కన్యలు పులోమ, కాలక అను నిద్దరు. ఈ యిద్దరు మారీచుని భార్యలు. వారి వలన పుత్ర సహస్రము కలిగెను. దనుపుత్రులు అరువది మంది. పౌలోములు, కాలకేయులు మరీచ తనయులు ఇంకను సింహిక (హిరణ్యకశిపుని సోదరి) విప్రచిత్తికి కలిగిన వారు మహావీరులు నిర్దాయులు కఠినులు త్యంషుడు శల్యుడు నాభుడు మహా బలశాలులు. వాతాపి నముచి ఇల్వలుడు ఖసృముడు అన్ధకుడు అరకుడు కానభుడు స్వర్భానువు మహావీర్యుడు వక్త్రయోది మహాసురుడు వీరు దను వంశోద్దారకులగు దానవులు. వీరి పుత్ర పౌత్రులు వందలు వేలు గలరు.

 

 

గొప్ప తపస్సుచే భావితాంతః కరుణుడగు ప్రహ్లాదునకు నివాత కవచులు పుట్టిరి. తామ్రాకు మహా బలశాలురగు నారుగురు సుతులు గలిగిరి. శుకి, శ్యేని, భాసి, సుగ్రీవి, శుచి ,గృద్ద్రక అని వారి నామ ధేయములు. శుకి శుకము (చిలుక) లను, గ్రుడ్ల గూబలను, కాకులను గనెను. శ్యేని డేగలను, భాసి భాసములను, గృద్ధ్రి గ్రద్దలను, శుచి నీటి పక్షులను, సుగ్రీవి ఆశ్వములను, ఒంటెలను, గాడిదలను కనెను. తామ్రా వంశము కీర్తింప బడినది. వినత యొక్క పుత్రులిద్దరు. గరుడుడు, అరుణుడు. సువర్ణుడు (గరుడుడు) పక్షులలో శ్రేష్ఠుడు. కఠినుడు, సర్పముల భక్షించును. సురస యందు మిక్కిలి ఓజస్సు గలవియు అనేక శిరములు గలవియు ఆకసమున సంచరించుచు మహా ప్రభావ సంపన్నులునగు సర్పములు గరుడ వశమైరి. వానిలో ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖశ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, ఆశ్వతరుడు ప్రధానులు.

 

ఏలా పుత్రుడు కర్కోటకుడు, ధనంజయుడు ఇంక మరి కొన్నియు విష ప్రాబల్యము కలవి. ఈ సముదాయము క్రోధ వశురాలు వలన కలిగినది. వీనికి కోరలు గలవు. ఇవి స్థలజములు, జలజములు, పక్షములు గలవి. క్రూరములు మాంసాశనములు. కోపము వలన పిశాచములను పుట్టించెను. ఖస (స్వస) యక్షలను రాక్షసులను పుట్టించెను. ముని అప్సరసలను అరిష్ట మహా బలోపెతులగు గంధర్వులను సృజించెను. ఇవి అన్నియు కశ్యప ప్రజాపతి దాయాదులగు స్థావర జంగములని చెప్ప బడినవి. వారి పుత్రులు పౌత్రులు వందల కొలది వేలకొలది గలరు. ఇది స్వారోచిష మన్వంతర సృష్టి.

 

 

 

 

ఆమె గర్భవతి యాయెను. నియమవతియై యామె గర్భ సంరక్షణము చేయు చుండెను. ఆ గర్భము తన వదార్ధమై ఏర్పడెనని తెలిసికొని ఇంద్రుడు వినయాన్వితుడై యామె సన్నిధి కేతెంచి సమయము కొఱకు నిరీక్షించు చుండెను. వర్షశతము పూర్తి కాక పూర్వమొక అవకాశము చిక్కెను. దితి పాద ప్రక్షాళన శౌచమును జేసి కొనక పరుండెను. ఆమె గర్భమును నేడు ఖండములు చేసెను. వజ్రముచే పీడించు చుండగా ఘోరముగా నేడ్చెను. ఏడ్వ వలదని ఇంద్రుడు మాతమాకు అనుచుండెను. ఆ గర్భము ఏడు ఖండము లాయెను. ఇంద్రుడు కోపించి నాగర్భ ఖండముల నొక్కొక్క దానిని ఏడు బాగములుగా చేదించెను. ఆ ముక్కలు మహావేగ వంతులైన మరున్నామక దేవతలైరి. భగవంతుడు చెప్పిన విధముగ ఆ నలుబది తొమ్మండుగురు. మరుద్దేవులు వజ్రపానికి సహాయ భూతులైరి.