విష్ణు మహా పురాణము

Table of Contents

14 - యదువంశ విస్తరము

 

 

అనమిత్రుడు శిని సత్యకుడు సాత్యకి (యుయుదానుడు) సంజయుడు కుణి యుగంధరుడు ననువారు వరుసగా తండ్రి కొడుకులు. వీరు శైనేయులన బరగిరి. అనమిత్రుని వంశములోనే వృష్టి అతనికి శ్వఫల్కుడు గల్గిరి. శ్వఫల్కుని ప్రభావము చెప్పితిని. శ్వఫల్కుని తమ్ముడు చిత్రకుడు. శ్వఫల్కునికి గాందిని యందు అక్రూరుడు పుట్టెను. అట్లే ఉపమద్గువు గల్గెను. ఉపమద్గువునకు మృద అమృద విశ్వ అరిమేజయ గిరిక్షత్ర ఉపక్షత్ర శత్రుఘ్ను అరిమర్దన ధర్మదృగ్ దృష్టధర్మగంధమో జవాహ ప్రతివాహులను కొడుకులు, సుతార యనెడి కన్యయుం గల్గిరి. దేవాంతుడు ఉపదేవునను వారు అక్రూరుని తనయులు. పృథులు విపృథువు మొదలయిన వారు పెక్కుమంది చిత్రకునికి గల్గిరి. కుకుర భజమాన శుచికంబళ బర్హిషులు నల్గు రంధకుని కొడుకులు. కకురునకు దృష్టుడు వానికి కపోతరోముడు వానికి విలోముడు వానికి తుంబురుని మిత్రుడగు అనువు వానికి ఆనక దుందుభి వానికి అభిజిత్తు వానికి పునర్వసువు వానికి ఆహుకుడను పుత్రుడు ఆహుకియను పుత్రిక కల్గిరి. ఆహుకునికి దేవుడు ఉగ్రసేనుడు నను ఇర్వురు కొడుకులు జనించిరి. దేవవంతుడు ఉపదేవుడు సహదేవుడు దేవరక్షితయను కన్యయు నల్వురు దేవకుని సంతానము. వారికి వృకదేవ ఉపదేవ దేవరక్షిత శ్రీదేవ శాంతిదేవ సహదేవ దేవకీ యనువారేర్వురు భగినులు. వారినందరినీ వసుదేవుడు పెండ్లాడెను.

 

 

ఉగ్రసేనునకు కంస న్యగ్రోధ సునామ ఆనక శంకు సుభూమి రాష్టపాల యుద్ధతుష్టి సుతుష్టిమంతులను కొడుకులు గల్గిరి. ఉగ్రసేనుని కూతుండ్రు కంస, కంసవతి, సుతను, రాష్ట్రపాలికలను వారు, భజమానునికి విదూరథుడు పుట్టెను. విదూరథుడు శూరుడు, శమి, ప్రతిక్షత్రుడు, స్వయంభోజుడు, హృదికుడు, ననువారు వరుసగా తండ్రి కొడుకులు. హృదికునికి కృతవర్మ, శతధన్వుడు, దేవార్హుడు, దేవగర్భుడు మొదలయిన కుమారులు గల్గిరి. దేవగర్భుని కొడుకు శూరుడు, మారిష యాతని ధర్మపత్ని. ఆమె యందతనికి వాసుదేవాదులు పదిమంది పుత్రులు గల్గిరి. వసుదేవుడు పుట్టగానే యతని యింట భగవదంశావతారమును దివ్య దృష్టిం జూచి దేవతలు స్వర్గమున ఆనక దుందుభులు మ్రోయించిరి. అందుచే నితడానక దుందుభియను పేరొందెను. అతనికి దేవభాగ దేవశ్రవ అష్టక కకుచ్చక్ర వత్సధారక సృంజయ శ్యామ శమిక గండూషు లనువారు తొమ్మండ్రు తమ్ములుండిరి. పృథ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాదిదేవి యనువారు వసుదేవాదులకై గుదురు భగిను లుండిరి. శూరునికి కుంతియను నతడు సఖుడుండెను. శూరుడు సంతతి లేని యా కుంతీయను వానికి తన కూతురు పృథయను నామెను యథావిధిగ దత్తము సేసెను. ఆమెను పాండురాజు పెండ్లాడెను. ఆమెయందు ధర్మ, అనిల, ఇంద్ర దేవతల వలన వరసగా యుధిష్ఠర, భీమ, అర్జునులు ఉదయించిరి. కుంతీ కన్యగా నున్నపుడు (వివాహము కానప్పుడు) సూర్య భగవానుని వలన కానీనుడు కర్ణుడను వాడు పుట్టెను. (కన్యకు బుట్టిన వాడు కానీనుడు) ఆ పాండు రాజునకు మాద్రియను భార్య యందు నాసత్యుడు, దసృడునాను నశ్వినీ దేవతల వలన నకులుడు, సహదేవుడు గల్గిరి.

 

 

శ్రుతదేవను వృద్ధధర్ముడను కారూశుడు (కరూశ దేశాధిపతి) పెండ్లాడెను. ఆమె యందు దంతవక్త్రుడను మహాసురుడు పుట్టెను. శ్రుతకీర్తిని కేకయరాజు పెండ్లాడెను. ఆమెయందు సంతర్దనాదులు (కైకయులు) ఐదుగురు పుత్రులు జనించిరి. రాజాధి దేవియందు ఆవంత్యులు (అవంతీ దేశాధిపతికి పుట్టిన వారు) విందుడు, అనువిందుడు ననువారు ఇద్దరు పుట్టిరి. శ్రుతశ్రవసను చేదిరాజు దమఘోషుడు పెండ్లాడెను. ఆమె యందు శిశుపాలుడు పుట్టెను. అతడే పూర్వము కూడా గొప్ప విక్రమవంతుడగు హిరణ్యకశిపుడను రాక్షస రాజుగా బుట్టినాడు. నరసింహావతారమున భగవంతుడు వానిని సంహరించెను. వెండియు నాతడు అక్షయవీర్య శౌర్య సంపత్పరాక్రమ గుణుడయి త్రిలోకేశ్వర ప్రభావము నాక్రమించిన దశాననుడై జనించెను. బహుకాల మనుభవించిన భగవత్సాన్నిధ్యముచే పొందబడిన శరీరపాతము వలన బుట్టిన పుణ్యఫలము వలన సకల లోక గురువగు రఘువంశోద్భవుడు శ్రీరామచంద్ర స్వరూపుడగు భగవంతుని వలన మరణ మొందెను. మరల చేదిరాజగు దమఘోషునికి పుత్రుడై శిశుపాలుడను పేరందెను. శిశుపాలత్వ మందును భూభారావతారణమున కవతరించిన పుండరీకాక్షుడగు శ్రీకృష్ణ భగవానునిపై మిగుల ద్వేషాను బంధము నొనరించెను. ఆ భగవంతుని చేతనే నిధన మొందింప బడెను. ఆ భగవంతుని యందు మనసు నిల్పి సాయుజ్య ముక్తి నందేను. భగవంతుడు ప్రసన్నుడయ్యెనా యభిలషించిన దిచ్చును. అప్రసన్నుడయ్యేనా అప్పుడు సంహారము చేసి యనుపమ దివ్య స్థానము నిచ్చును.